గురుభ్యోనమః
సౌందర్యలహరిని గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఆదిశంకరుల రచన అయిన ఈ స్తోత్రరత్నమును కొంతమంది శాక్తసంప్రదాయ గ్రంధమన్నారు. కొంతమంది వైష్ణవసంప్రదాయ గ్రంధమన్నారు. కొందరు పరిపూర్ణ భక్తిరస గ్రంథమన్నారు. ఇది తంత్రశాస్త్రగ్రంధమని అనని వారు అరుదు.
ఈ స్తోత్రమునకు అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ కాలంలోనూ అనేకమంది ప్రవచకులు సౌందర్యలహరిపై ప్రసంగించారు.
అయితే సామాన్యజనులకు అత్యంత ప్రయోజనకారిగా ఎన్నో క్లిష్టమైన విషయాలను అతి సులువుగా పామర భాషలో వివరిస్తూ కంచి పరమాచార్యులు సౌందర్యలహరిపై చేసిన వ్యాఖ్యానం మకుటాయమానమైనది. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం వలేనే, పరమాచార్యులవారి సౌందర్యలహరి వ్యాఖ్య తరువాతి కాలంలో వచ్చిన అనేక ప్రవచనాలకు మూలము అని నిస్సంకోచంగా చెప్పవచ్చును.
దక్షిణామూర్తి ఆదిశంకరులుగా వచ్చి సౌందర్యలహరి నిబద్ధంచేస్తే, కామాక్షీదేవి పరమాచార్యులుగా వచ్చి ఆ సౌందర్యలహరికి వ్యాఖ్యను ప్రసాదించింది.
పరమాచార్యులవారు సౌందర్యలహరి శ్లోకాలను ఎంతో విస్తారంగా వ్యాఖ్యానించారు. అయితే సాధారణ జనులకు అవసరం ఉండదనుకున్న శ్లోకాలను, విషయాలనూ వదలివేశారు. ఒకచో శ్లోకాలలో కొన్ని పాదాలనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం అంతా తమిళభాషలో "దివైన్ కురత్తళ్", ఆంగ్లంలో "వాయిస్ ఆఫ్ గాడ్" పుస్తకాలలో లభ్యమవుతోంది. తెలుగులో, సుమారు ఒక దశాబ్దం క్రితం ఋషిపీఠం పత్రికవారు పరమాచార్యుల వ్యాఖ్యానాన్ని సంగ్రహంగా ప్రచురించారు. ఈ తెలుగుసేత ఇప్పుడు లభ్యంకావట్లేదు.
ఈరోజు మొదలు పరమాచార్యుల వ్యాఖ్యకు తెలుగు అనువాదం, కొంతమేరకు సంగ్రహంగా, ఈ బ్లాగ్లో / ఫేస్బుక్ పేజీలో ఉంచటానికి ప్రయత్నిస్తున్నాము.
అనేకమంది తెలుగువారైన అమ్మవారి భక్తులకు ఈ వ్యాఖ్యానం అందుటకు, మమ్ము పనిముట్లుగా వాడుకోమని అమ్మవారికి మా ప్రార్థన.
జయ జయ శంకర హర హర శంకర.