Saturday 16 December 2017

గోదా అమ్మవారి ప్రార్థన



గోదా అమ్మవారి ప్రార్థన

నీలాతుంగస్తనగిరితటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరులపై నిద్రించు కృష్ణుని, ఉపనిషత్తుల సారమైన పరతంత్రత పాఠం చెప్పుటకు నిద్రలేపినట్టిదీ, తాను ధరించి వదలిన పూలచెండులతో కృష్ణుని బలవంతముగ బంధించి సంతోషించునట్టిదీ అగు ఆ గోదాదేవి కి మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.

అన్నవయల్ పుదువై ఆణ్డాళరఙ్గఱ్క
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
పాడి క్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడికొడుత్తాళై చ్చొల్.


హంసలు తిరుగుతున్న పంటపొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళు శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అను పేరు గల ఈ పాశురములను మధురమగు గానముతో పాడి సమర్పించినది. ఇది వాఙ్గ్మాలిక. అట్లే పూమాలికను తాను ధరించి అర్పించినది. ఓ మనసా! ఆ ఆండాళును స్మరించుము.

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై
పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ
వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాతమ్
నాంగడవా వణ్ణమే నల్‍గు.


పూమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారుతీగా! పూర్వము జరిగిన ఆ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ములనుద్ధరింపజాలిన ఓ దివ్య కంకణధారిణీ! "వేంకటాచలపతికి నన్ను ప్రియురాలుగా సమకూర్చుము" అని నీవు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడ అతిక్రమింపజాలనట్లు అనుగ్రహించుము.

(తమిళ అనువాదము శ్రీ భాష్యం అప్పలాచార్యుల గ్రంథంనుండి)

Thursday 14 December 2017

పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు





పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

దీపావళి ఇంకా రెండు రోజులుందనగా - శ్రీవారు అప్పటికి ఇంకా అజగరస్థితి మొదలు పెట్టలేదు (దీని గురించి ఈ వ్యాసంలో తరువాత చెప్పబడుతుంది) - శ్రీవారు భిక్ష స్వీకరించలేదు.  వారు తమ తుది ప్రస్థానం గురించి చాలా సంకేతాలిచ్చేవారు, మాకే ఏమీ అర్థం కాలేదు. 

ధర్మ పాటీ అక్కడకు వచ్చింది.

"ఏమిటి ఈ రోజు విశేషం?  ఏం చేస్తున్నావు ?"
"భాగవతం చదువుతున్నాను"
"భాగవతంలో భగవానుడేంచేస్తున్నాడు ?"
"బాలలీల! ఆడుకుంటున్నాడు"
"నీకు తెలుసా ? నేను కూడా ఒక లీల చూపబోతున్నాను", అన్నారు శ్రీవారు. మేము పట్టించుకోలేదు.  అది మెదలు, మొదటి ప్రశ్న.

శ్రీవారు భిక్ష స్వీకరించలేదు.  బాగా జ్వరంగా ఉంది. శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు (గురక) వినిపిస్తున్నాయి. బాగా చిక్కిపోయారు. పడుకునే ఉన్నారు. అలాంటి సమయాలలో కన్నన్ మామ మంచి సహాయకుడు. ఏనుగంత బలం ఉందతనికి.  అతని తెలివి మాకు లేదు.

"ఏమిటిది ? శ్రీవారు భిక్ష తీసుకోకపోతే మనం ఒప్పుకోవాలా ? శ్రీవారిని కూర్చోబెట్టండి. తడిగుడ్డతో తుడవండి. విభూతి తీసుకువచ్చి శ్రీవారికి అద్దండి. "

ఆ చెప్పిందంతా చేశాము.  శ్రీవారిని తడిగుడ్డతో తుడిచి, విభూతి నుదిటికి అద్దాము.

"ఒక గిన్నెలో అన్నం కలిపి తీసుకురమ్మని శ్రీకంఠన్ తో చెప్పండి. వెంగుడి డాక్టర్ని పిలవండి. శ్రీవారు చాలా బలహీనంగా ఉన్నారు. నాడి చూపాలి."

అలాంటి సమయాల్లో శ్రీవారి వద్దకు వెళ్ళటానికి శ్రీకంఠన్ భయపడతాడు. నాకే శ్రీవారివద్ద చనువు. నేను అన్నం తీసుకొచ్చాను.  వైద్యుడు వచ్చారు. శ్రీవారు వైద్యుని ఎదురుగా భిక్ష స్వీకరించారు. అదే మొదలు. శ్రీవారు మరొకరు - ఆ వైద్యుడు - చూస్తూండగా భిక్షచేయటం.

కాసేపటి తరువాత, తిరుకడవూర్ రామమూర్తి, అరకోణం బాలు, నేను శ్రీవారి సన్నిధిలో ఉన్నాము.

"నీ సంగతేంటి ? ఏంచేస్తావు ?"
"నాకేం తెలుసు ? శ్రీవారు ఉన్నప్పుడు నాకు భయం దేనికి ?", అని నవ్వాను. వారి ప్రశ్న ప్రాముఖ్యాన్ని  మాత్రం అర్థం చేసుకోలేదు.
"నీ సంగతేంటి ?" రామమూర్తివేపు చూస్తూ అన్నారు శ్రీవారు.
"విత్తు వేసినవాడే చెట్టుకి నీరు పోస్తాడు", అంటూ వేదాంతం వల్లించాడు రామమూర్తి.
"చెట్ల గురించి ఏమి మాట్లాడుతున్నాడు ?" అని నన్నడిగారు శ్రీవారు. నేను రామమూర్తి అన్న మాటలు మళ్ళీ చెప్పాను.

శ్రీవారి దండం అక్కడ ఉంది. శ్రీవారికీ దండానికీ మధ్య వెళ్ళరాదు. మేము ఆ మధ్యలోకి వెళ్ళకుండా శ్రీవారి వద్దకు వెళ్ళలేక  పోయాము.

" దండం ఇక్కడ ఉంది" అన్నాడు అరకోణం బాలు.
" ఇంక దండంతో పని లేదు" అన్నారు శ్రీవారు.

ఆరోజు తరువాత శ్రీవారు దండాన్ని ముట్టుకోలేదు.  అది, తమ ఉపసంహారం గురించి  మాకు నర్మగర్భంగా చెప్పడం.

"నేనొక కొండచిలువ లాగా కొంతకాలం పడుకోవాలనుకుంటున్నాను. నోరు తెరచి వెల్లకిలా కదలకుండా పడుకుని ఉంటూ నోట్లో ఏం పడితే అదే ఆహారంగా తీసుకోవాలి" అని శ్రీవారు కుంభకోణం రాజమణిశాస్త్రితో చాలాకాలం క్రితం చెప్పారు.
చెప్పినట్లే శ్రీవారు అలా మూడేళ్ళు చేశారు.

మూడో యేట, మళ్ళీ దీపావళి సమయం.

మాకు దీపావళినాట యమునికి దీపం వెలిగించి, ’యమాయ, ధర్మాయ’ అంటూ నామాలు చదవటం ఆనవాయితీ.  పెద్ద ఇనప దీపపు సమ్మెలో ధాన్యం పోసి, అందులో మరో మట్టి దీపపు ప్రమిద పెట్టి దానిలో బోలెడు నెయ్యి పోసి , పెద్ద వత్తిని యముడిని ఆవాహనచేస్తూ వెలిగిస్తాము. తెలుగువాళ్ళు ఆనాడు యమతర్పణాలు ఇస్తారు. మేము చెయ్యము.  ఆంత నెయ్యి వలన దీపం ఐదారు రోజులు వెలుగుతుంది.

ఆ సంవత్సరం దీపం బోలెడు చప్పుడు చేసి, ఒక గంటలోపల మట్టి ప్రమిద ముక్కలైపోయింది.  అదో దుశ్శకునమని మాకు తెలుసు.

మార్గశిరమాసంలో శ్రీవారు వెళ్ళిపోయారు.


Friday 8 December 2017

పరమాచార్యుల స్మృతులు : వీ ఐ పీ


పరమాచార్యుల స్మృతులు :  వీ ఐ పీ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

ఒకరోజు అయిదేళ్ళ చిన్నపిల్ల వాళ్ళ అమ్మానాన్నలతో దర్శనానికి వచ్చింది. చేతిలో చిన్న పుస్తకం పట్టుకుని తిన్నగా వెళ్ళి శ్రీవారి ఒళ్ళో కూర్చుంది.  అమ్మానాన్నలు ఆ పిల్లని వెనక్కి రమ్మని ఎంతో బ్రతిమాలారు. అమ్మాయి వినలేదు. శ్రీవారు లేశమాత్రమయినా విసుగు చెందలేదు, కోప్పడలేదు.

"ఇది ఆటోగ్రాఫ్ పుస్తకం", అంది ఆ అమ్మాయి, "ఇందులో నీ పేరు వ్రాయి!" అంటూ మళ్ళీ మళ్ళీ అడిగింది.

"చేతిలో పెన్ను పట్టుకుని చాలాకాలం అయ్యింది, నేను వ్రాయడం బొత్తిగా మర్చిపోయాను. నేను పేరు వ్రాయను" అన్నారు శ్రీవారు.

అమ్మాయి మొంకిపట్టు పట్టింది. శ్రీవారు మఠం కార్యనిర్వహణాధికారిని పిలిపించి, వారితో ఆ పుస్తకం మీద మఠం ముద్ర వేయమనీ, "నారాయణస్మృతి" అని చేతితో వ్రాయమనీ ఆదేశించారు. శ్రీవారి శ్రీముఖాలపై అలా ఉంటుంది.

ఆ అమ్మాయి దాంతో సంతృప్తి చెంది, తలిదండ్రులతో బయల్దేరింది.

వాళ్ళు మఠం దాటకముందే శ్రీవారు ఆ అమ్మాయిని వెనక్కి పిలిపించారు. కార్యనిర్వహణాధికారితో ఇలా అన్నారు.

"కార్యాలయంలో వీ ఐ పీలూ, మంత్రులూ, కలెక్టర్లూ ఇక్కడకు వచ్చినప్పుడు వారు సందేశం వ్రాసే పెద్దపుస్తకం ఉంది. ఈ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి ఆ పుస్తకంలో తన పేరు వ్రాయించు. ఈ అమ్మాయి కూడా వీ ఐ పీ నే. చిన్నపిల్లలు దైవాంశసంభూతులు".

ఆ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి సందర్శకుల పుస్తకంలో తన పేరు వ్రాయించారు.

Wednesday 6 December 2017

పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు



పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

కాశీయాత్ర పూర్తిచేసి మఠానికి తిరిగి వచ్చిన శ్రీవారిని కుప్పు సహాయంకోసమై అర్థించాడు.

"నా వద్ద ఏముంది ? ధనమూ లేదు, మరేమీ లేదు. నేనేంచెయ్యగలను ?"

కుప్పు ప్రార్థన ఆపలేదు. శ్రీవారు తప్ప మరి దిక్కులేరన్నాడు. కుప్పు మంచి ప్రతిభాశాలి. చాలా భాషలునేర్చినవాడు. డిగ్రీ పట్టా ఉందతనికి. ఒక్క రాత్రిలో శుద్ధ సంస్కృతంలో మహామాఘం ప్రాధాన్యతగురించి పద్యకావ్యం వ్రాశాడు. తమిళ, ఆంగ్లభాషలూ బాగా వచ్చు. చివరికి శ్రీవారి సిఫారసుమీద ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికిందతనికి. ఒక సంవత్సరం గడిచిందేమో.

శ్రీవారు తంజావూరులో విడిదిచేస్తుండగా ఒకనాడు ఒక వ్యక్తి, పూజకోసం వేయించిన మంటపానికి దాదాపు బయట, కూర్చుని కనిపించాడు.  చొక్కా వేసుకుని ఉన్నాడు, ధూమపానం చేస్తూండగా కూడా ఎవరో చూశారు. శ్రీవారు ఆవ్యక్తిని తీసుకురమ్మన్నారు. ఆ మనిషి వచ్చేవాడిలాగా అనిపించలేదు, కానీ శ్రీవారి మాట జవదాటకూడదుగా. శ్రీవారి సహాయకులలో ఒకరు అతనిదగ్గరకువెళ్ళి శ్రీవారిని కలువవలసినదిగా కోరారు. అతడు వెంటనే వచ్చాడు.

"సరి అయిన దుస్తులు ధరించకపోవటం చేత రాలేదు", అన్నడతను సంజాయిషీ చెప్పుకుంటూ. శ్రీవారు అతనితో కాసేపు మాటలాడి, కుప్పు గురించి అడిగారు. అతడు జవాబివ్వటానికి సందేహించాడు. కొంతసేపు అడిగిన తరువాత కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. "అదేంటంటే.... కుప్పు సెలవులో ఉన్నాడు". చివరికి, తడవ తడవలుగా, మాకు ఈ వ్యక్తిద్వారా తెలిసిందేమిటంటే - కుప్పుకి బ్యాంకులో కాషియర్‍గా పని ఇచ్చారనీ, డబ్బు దొంగతనం చేయడం వల్ల తాత్కాలికంగా తొలగించారనీను.

ఆ రోజు పూజ ముగిసిన తరువాత శ్రీవారు కుప్పువాళ్ళ గ్రామానికి వెడుతున్నానని ప్రకటించారు.
"అదోచిన్న కుగ్రామం, మనందరినీ వాళ్ళు భరించలేకపోవచ్చు. పైగా ఇప్పటికిప్పుడు పీఠాన్ని తరలించలేము"  అంటూ అసమ్మతి తెలిపారు మఠ కార్యనిర్వహణాధికారి.
"పూజను తీసుకుని బయలుదేరుతున్నాను" అని ఆ గ్రామానికి బయలుదేరారు శ్రీవారు.

అవసరానికి అందరూ ఏకమవడం తంజావూరువాసుల ప్రత్యేకత. రాత్రికిరాత్రి వాళ్ళు సరంజామా కూర్చుకుని, మంటపాన్ని ఏర్పాటుచేశారు. పూజకూ ఇతర అవసరాలకూ సామగ్రి సిద్ధంచేశారు. ఆ కుగ్రామాన్ని తిరునాళ్ళలాగా మార్చేశారు.

శ్రీవారి సంగతంటారా, వారు తిన్నగా కుప్పువాళ్ళ ఎదురింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కుప్పు వాళ్ళింట్లోనే అటకెక్కి దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు. రెండురోజుల తరువాత మూడోరోజు మధ్యాహ్నం, కుప్పు ఏంజరుగుతోందో చూడటానికి జాగ్రత్తగా బయటకు వచ్చాడు. శ్రీవారు కుప్పును పసిగట్టి, తీసుకురమ్మన్నారు. కొంతమంది వీధి దాటి అవతలప్రక్కకు వెళ్ళి ఒకటో రెండో దెబ్బలువేసి కుప్పుని శ్రీవారివద్దకు తీసుకొచ్చారు.  కుప్పు వెంటనే సాష్టాంగం చేస్తూ శ్రీవారి పాదాలమీద పడ్డాడు. పాదాలు పట్టేసుకున్నాడు. 

శ్రీవారివలె శరణాగతిచేసినవారిని క్షమించి రక్షించేవారెవరూ లేరు.  తమ పాదాలవద్ద ఆశ్రయంకోరినవారిని రక్షించు ప్రతిజ్ఞలో శ్రీవారు సాక్షాత్తూ శ్రీరాముడే. శరణాగతవత్సలులు.

కుప్పు సుమారు అయిదువేలరూపాయలు కాజేశారనుకుంటా. ఆ రోజుల్లో మఠంలో భిక్షావందనమునకు పదమూడురూపాయలు ఇవ్వవలసి ఉండేది. అయిదువేలరూపాయలు ఎంతపెద్దసొమ్మో మీరు ఊహించుకోవచ్చు. ఇది నలభైల్లో సంగతి. శ్రీవారు కుప్పుని తిట్టలేదు, ఒక్కమాట అడగలేదు. మఠ కార్యనిర్వహణాధికారిని పిలిపించి బ్యాంకుకు ఆ డబ్బును కట్టివెయ్యమన్నారు.

శ్రీవారు తరువాత తిరుచిరాపల్లిలో నేషనల్‍కాలేజీ స్థలంలో విడిది చేశారు. ఆరోజుల్లో ప్రతీ ఏటా చివరి ’రెండో శనివారం’ నాడు ఉపాధ్యాయుల పరిషత్తు సమావేశం జరిగేది. అవి తెల్లదొరతనం రోజులు. శ్రీవారు కళాశాల అధ్యక్షుడితో మాట్లాడారు. " ఈ కుర్రాడికి డిగ్రీ పట్టా ఉంది, చాలా భాషలు వచ్చు. మీరు మీ పాఠశాలలో ఉద్యోగం ఇవ్వగలరా ?".

"శ్రీవారి ఆదేశం. శ్రీవారు కోరుకుంటే పది ఉద్యోగాలు ఇవ్వగలను".

అలా కుప్పు జీవితంలో మళ్ళీ స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ దర్శనంకోసం వచ్చేవాడు. ఒక్కసారికూడా శ్రీవారు కుప్పుతో ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. శ్రీవారు తమ భాషలోకానీ, ఇతరులతో తమ ప్రవర్తనలో కానీ ఎంతో ఉన్నతులు.

జీవితపు చివరిరోజుల్లో కుప్పుకు తన మలమూత్రవిసర్జనపై అదుపు ఉండేదికాదు. అలాంటి పరిస్థితిలో చనిపోయినవారికి మరుజన్మలేదంటారు. కుప్పు శ్రీవారినుండి ఒక్క చీవాటూ ఎరుగడు. 


Monday 4 December 2017

పరమాచార్యుల స్మృతులు : కరుణ, వాత్సల్యం



పరమాచార్యుల స్మృతులు :  కరుణ, వాత్సల్యం
(బాలూమామ స్వానుభవాలు : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

శ్రీవారు గుంటూరులో విడిదిచేస్తున్నప్పటిమాట.  ఒక రైతు బుట్టనిండా తన పొలంలో పండిన మిరపకాయలు తీసుకొచ్చి శ్రీవారికి సమర్పించాడు.

"ఈ భిక్షని మీరు స్వీకరించాలి" అన్నాడు.

ఆ రోజు భోజనంలో శ్రీవారికి మిరపకాయే.  ఆయన అనేక వంటకాలు వివరంగా చెప్పి చేయించారు. మిరప్పచ్చడి, మిరపకాయ-పెసలతో పప్పు,  మిరపకాయ కూర, మిరపకాయ పెరుగు పచ్చడి, మిరపకాయ-చింతపండు పచ్చడి, మిరపకాయ ముక్కల వేపుడు, దోరగా వేయించిన మిరపకాయలు, ఉడకబెట్టిన మిరపకాయలు. నన్ను నమ్మండి, మిరపకాయతో ముప్ఫైరకాలు.

ప్రతీ ఒక వంటకాన్నీ, ఏమీ మిగల్చకుండా అన్నింటినీ ప్రశాంతంగా తిన్నారు శ్రీవారు.  తిన్నందుకు ఏ తేడా చెయ్యలేదు.

--

మేము ఒకసారి తేనంబాకం నుండి వీధిలో నడచి వస్తూ ఒక ముస్లిం నడిపే టీ కొట్టు దాటాము.  శ్రీవారిని చూడగానే కొట్టు యజమాని కంగారుగా బయటకు పరిగెత్తుకువచ్చాడు. చేతిలో ఉన్న వేడిపాల గాజుగ్లాసు శ్రీవారివేపు జాపాడు.

"స్వామి ఇవి త్రాగాలి" అన్నాడు.

శ్రీవారు నన్ను ఆ గ్లాసు తీసుకోమన్నారు.  తీసుకున్నాను కానీ, ’ఎంతోమంది ఆ గ్లాసులో త్రాగి ఉంటారు, అలాంటి గ్లాసులో ఇచ్చిన పాలని ఏంచెయ్యాలో’  అనుకున్నాను. ఆ గ్లాసుని హాలులో ఒక మూల పెట్టాను.  సాయంత్రం అయ్యింది. శ్రీవారు వరండాలో కూర్చుని ఉన్నారు.

"ఆ గ్లాసుడు పాలు తీసుకురా. అదే ఈ రోజు నాకు భిక్ష.  పాలల్లోనో , పెరుగులోనో నానబెట్టిన అటుకులు కాదు. కావాలంటే అవి మీరు తినండి. నాకొద్దు.

నేను పెట్టినచోటునుండి ఆ గ్లాసు తీసుకొచ్చి శ్రీవారికి ఇచ్చాను.

"చూడు, చాలా ఆప్యాయంగా ఇచ్చాడు, త్రాగాల్సిందే" అని, తాగేశారు.

---

Sunday 3 December 2017

పరమాచార్యుల స్మృతులు : ఏడురోజులు మిగిలింది


పరమాచార్యుల స్మృతులు : ఏడురోజులు మిగిలింది
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

శ్రీవారు అప్పుడప్పుడూ అస్వస్థతకు లోనవుతూండేవారు. కానీ ఒక్కరోజుకూడా ఆ కారణంగా చంద్రమౌళీశ్వరపూజ మానలేదు. ఎన్నడూ పూజను త్వరగాముగించలేదు, ఏభాగమూ అలక్ష్యం చేయనూలేదు.

1945లో శ్రీవారికి గుండెపోటు వచ్చింది. నార్తార్కాటుకు చెందిన డాక్టరు, మైలాపూర్ టీ ఎన్ కృష్ణస్వామి శ్రీవారిని పరిశీలించి ఇలా అన్నారు -  "శ్రీవారి నాడి బలహీనంగా ఉంది, గుండె పరిస్థితి బాగోలేదు. నేను చెయ్యగలిగినదంతా చేస్తాను, కానీ హామీ ఇవ్వలేను ."

శ్రీవారు ఆయుర్వేదానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. వారు, మేలగరం ఘనపాఠిగారికి కబురుపెట్టారు. ఘనపాఠిగారు బహుశాస్త్రకోవిదులు. వేదములు, ఆయుర్వేదం, జ్యోతిషం మొదలైన వాటిలో అపారమైన పాండిత్యం ఉంది. వారు శ్రీవారి మణికట్టు పట్టుకుని నాడి పరిశీలించారు. 

ఇలాంటి వ్యక్తులకు వంశపారంపర్యంగా నాడీ పరిశీలనం వస్తుంది. చేతి లావు, బిగువు చూసి మనిషి పరిస్థితి చెప్పేస్తారు. ఇలా చెప్పటాన్ని ’దాదు’ అంటారు.  స్త్రీ గర్భం ధరించిన నెలలోపలే, వైద్యులు గర్భం నిర్థారించకముందే,  ఎడమచెయ్యి పట్టుకుని, ఖచ్చితంగా ’మీకు అబ్బాయ’నో, ’మనుమరాల’నో చెప్పేస్తారు. అలాగే జరిగితీరుతుంది. నాడి లెక్కబెట్టి ఈ మనిషి ఇన్ని రోజులు, వారాలు, సంవత్సరాలు బతుకుతాడని చెప్పేస్తారు.  ఆరోగ్య పరిస్థితి అవగాహనకోసం మగవారికి కుడిచెయ్యి, ఆడువారికి ఎడమచెయ్యి పట్టుకుంటారు.

ఘనపాఠిగారు శ్రీవారి నాడి పరిశీలించి - "ఏడురోజులు మిగిలింది" అన్నారు. తరువాత శ్రీవారి జాతకం తెప్పించుకుని, దానిని పరిశీలించారు, లెక్కకట్టారు - "జాతకం ఈ రోజుకు ఎనిమిదిరోజులంటోంది" అన్నారు.

ఇంకా ఇలా అన్నారు - " నేను శ్రీవారికి వైద్యం చెయ్యటానికి సిద్ధం. నేను చెప్పినవి తుచ తప్పకుండా చెయ్యాలి. వారి సమక్షంలో నాలుగు వేదాల పారాయణ జరగాలి. రాత్రులు రాక్షసులకూ, పగళ్ళు దేవతలకూ చెందుతాయి. అందుకని వేదపారాయణ రాత్రింబగళ్ళు జరగాలి. ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులు మాత్రమే ఆహారంగా పెట్టాలి. నేరేడు ఆకులు, నీళ్ళు - అంతే. వేరే పశుగ్రాసం ఇవ్వరాదు. శ్రీవారు ఆ ఆవు పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి".

శ్రీవారు కంగారుపడ్డారు. "నా ఆరోగ్యం బాగవడానికి ఒక ఆవుని బాధించి కేవలం నేరేడుఆకులే ఆహారంగా పెట్టాలా ? ఆవుకి అది సరిపోతుందా ? ఆవుకి జరకూడనిదేమైనా జరిగితే ? ఆ పాతకం మనపైకి ఎందుకు తెచ్చుకోవటం ?"

"నాకు ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగల శక్తి ఉంది" అన్నారు ఘనపాఠిగారు. "శ్రీవారు ఆ విషయమై ఆలోచించనక్కరలేదు. ఆ ఆవుని  సజీవంగా ఉంచటం నా బాధ్యత".

వైద్యం కొన్ని రోజులు నడిచింది. ఎన్ని రోజులో నాకు సరిగ్గా గుర్తులేదు.  శ్రీవారు ఎప్పటిలానే చంద్రమౌళీశ్వరపూజ చేసేవారు, ఆ పాలు తప్ప వేరేవేమీ తీసుకోలేదు. వేదపారాయణం జరిగేది. ఘనపాఠిగారు ఫలానా రోజున ఫలానా సమయం గడవాలని చెప్పారు. ఆ సమయం తరువాత ఆహారనియమం సడలింది. ఆరోజు చాలా అసాధారణమైనది. సరిగ్గా ఘనపాఠిగారు చెప్పినరోజున ఆ సమయానికి , వారు ముందే చెప్పినట్టు ఒక పెద్ద పిశాచం భూమ్యాకాశాల మధ్యలో కనిపించింది. కనీసం పదిమంది - పాఠశాల వెంకట్రామన్, సిమిచి వంచిఅయ్యర్, కుల్ల శీను, ఇంకా కొంతమంది - దాన్ని చూశారు. సేతురామన్ అప్పటికి చిన్నవాడు, వాడూ చూశాడు.  ఇది సత్యం, నేనిప్పుడు చెబుతున్నట్టే జరిగింది. ఘనపాఠివంటి వారు గొప్ప తపస్సంపన్నులు. ఎంతోమంది తపోనిష్టులు శ్రీవారివద్దకు వచ్చేవారు. శ్రీవారు ఎప్పుడూ పండితులమధ్యలో ఉండేవారు. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంటున్నాం. ఘనపాఠిగారి అబ్బాయి జెమినీ ఇప్పుడు ఉన్నారు.

"ఇంక భయపడాల్సిందేమీ లేదు. పిశాచం పారిపోయింది. శ్రీవారు నూరేళ్ళు జీవిస్తారు" అన్నారు ఘనపాఠిగారు.

భగవంతుడి కరుణవల్ల ఆ ఆవు ఏ ఇబ్బందీ లేకుండా ఉంది. నేరేడు ఆకులే తిని, నీరు మాత్రమే త్రాగినా ఆరోగ్యంగానే ఉంది.  శ్రీవారిని అమితంగా ప్రేమించే కొంతమంది భక్తులు ఇదంతా చూసి కదిలిపోయారు. వారు అన్నారూ -

" మానవజన్మ ఏపాటిది ? ఇలాంటి ఆవులా పుట్టినా ఈ జన్మలోనే మోక్షం లభించేది. ఈ ఆవు గతజన్మలలో ఎంత పుణ్యం మూటగట్టుకుందో ఎవరు చెప్పగలరు ?"



పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ



పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

శ్రీవారు తేనంబాకంలో విడిది చేస్తున్నప్పటి సంగతి. నేనూ అక్కడే వారి సేవలో ఉండేవాణ్ణి. మా అన్నయ్య నాతో మా నాన్నగారి ఆబ్దీకం ఏ రోజు వచ్చిందో చెప్పాడు. ఆబ్దీకం ముందురోజు నేను శ్రీవారివద్దకు వెళ్ళి సెలవు కోరాను.

"నువ్వెందుకు వెళ్ళాలి ? మీ అన్నయ్య ఆబ్దీకం నిర్వహిస్తాడు. నీకు నేనున్నానుగా!" . శ్రీవారు అప్పుడప్పుడూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతారు.

"నేను ఆ రోజే, రాత్రికల్లా, తిరిగి వచ్చేస్తాను".

శ్రీవారు ఒక నిమ్మకాయ తెమ్మని, దాన్ని చేతిలో పట్టుకుని అప్పుడప్పుడూ వాసనచూస్తున్నారు.

తరువాతరోజు ఉదయమే నేను ప్రయాణానికి సిద్ధమై, శ్రీవారికి సాష్టాంగం చేశాను. శ్రీవారి నాకు నిమ్మకాయ ఇచ్చారు. నేను బయలుదేరాను. ఐదున్నరకల్లా బయలుదేరవలసిన బస్సు ఎక్కి కూర్చున్నాను. నిముషాలుగడుస్తున్నాయి కానీ బస్సు కదిలే సూచనలేమీ కనిపించట్లేదు. వయసుపైబడిన మా అమ్మ, అన్నయ్య నాకోసం ఇంట్లో వేచిఉన్నారు, నేనేమో బస్సు కదలటం కోసం. కంగారు పెరిగిపోతోంది. ఇంక ఆగలేక, కండక్టరుని ఆలస్యానికి కారణమేంటని అడిగేశాను.

"నాకు  ఓ నిమ్మకాయ కావాలి. ఏ రోజైనా బస్సులో నిమ్మకాయ పెట్టిన తరవాతే, బస్సు కదుపుతాము. ఓ అబ్బాయిని నిమ్మకాయ కోసం దుకాణదారుడి వద్దకి పంపాను,  ఆయనవల్ల ఈ రోజు ఆలస్యం"

"ఇదుగో నిమ్మకాయ, ఇంక బయలుదేరుదాం", అన్నాను.

"శ్రీవారు ఇచ్చారా ఇది ?  స్వామియే ఇచ్చుంటారు", డ్రైవరు చాలా గౌరవంతో ఆ నిమ్మకాయ తీసుకుని, బస్సు నడపటానికి సిద్ధమయ్యాడు.

ఈ నిమ్మకాయతో శ్రీవారు నిన్నటినుంచీ ఏం పరిహాసం చేశారు !

Friday 1 December 2017

సాక్షాత్తూ పరమేశ్వరుడే



సాక్షాత్తూ పరమేశ్వరుడే
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

మేమప్పుడు మైలాపూరులో ఉండేవాళ్ళం. ప్రతీరోజూ ప్రొద్దున్నా, సాయంత్రం - రోజుకి రెండు సార్లు - నేను శివదర్శనానికి కపాలేశ్వరుని దేవాలయానికి వెళ్ళేవాడిని.

పరమాచార్యులకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేది. రామకృష్ణయ్యరు - హోమియోతెలిసినవారు, వైద్యుడు కాదు - తన హోమియో నిఘంటువు చూసి ఏవో బల్లిగుడ్లలాంటి తెల్లని చిన్న గోళీలు ఇచ్చేవారు. స్వామివారు అవి రెండు రోజులు తీసుకొన్న తరువాత కొంత ఉపశమనం ఉండేది.  అయ్యప్ప, శబరిమల ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి. నల్లధోవతులు కట్టుకుని జనాలు గుడికి వచ్చేవారు. మాకు నల్ల దుస్తులంటే ద్రవిడకజగం (రాజకీయపార్టీ) కి సంబంధించినవిగా మాత్రమే తెలుసు. దాంతో నేను కొంత ఆశ్చర్యపోయాను. కొంతమందిని అడిగితే ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు - "నీకు తెలియదా ? మేము శబరిమల వెడుతున్నాం. ఎంతో శక్తివంతమైన దేవుడు. పిల్లల్లేనివారికి సంతానం కలుగుతుంది. అనారోగ్యం నయమవుతుంది. నిశ్చయంగా ఒక సజీవ దేవత".

అప్పట్లో నేను చిన్నవాణ్ణి, బోలెడు భక్తి ఉంది. ఇది 35 ఏండ్ల క్రింది మాట. పరమాచార్యులకి ఛాతీనొప్పి నయమవటానికి నేను శబరిమల యాత్ర చేస్తానని మొక్కుకున్నాను.  నేను స్వాములవారి దగ్గరకు వెళ్ళి నేను శబరిమల వెడుతానని మ్రొక్కుకున్నాననీ, వారి దీవెనలూ అనుగ్రహము కావాలనీ అడిగాను.

"శబరిమల ఏంటి ? ఈ అకస్మాత్తు కోరిక ఏంటి ? నువ్వు నాతో ఉండగా యాత్రలెందుకు ? నన్నెందుకు అడుగుతున్నావు ?"

"నేను మ్రొక్కుకున్నాను, అది తీర్చుకోవాలి. శ్రీవారు దయచూపాలి"

శ్రీవారు ఒక గుడ్డతీసి నాపైకి విసిరారు. "ఇదివరలో శబరిమలకి తెల్లధోవతులతోనే వెళ్ళేవాళ్ళు.  బ్రాహ్మణులు మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. కాబట్టి శబరిమలకు వెళ్ళటానికి విశేష కట్టుబాట్లు అవసరం లేదు. నలుపు ధరించటం ఈమధ్య వచ్చిన ఆనవాయితీ.  సంవత్సరం పొడవునా మద్యమాంసాలు సేవించేవారు, వారి పశ్చాత్తాపానికి సూచనగా నలుపు ధరించటం మొదలయ్యింది. నీకు అవసరం లేదు. గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ తుండు నీ చుట్టూ కట్టుకో.  మరోమాట. నేను చెప్పినట్లే చెయ్యాలి. ఒక వంద నిమ్మకాయలు కొనుక్కుని, నీతో ఒక చేతిసంచీలో తీసుకువెళ్ళు. ఈ తాజా నిమ్మకాయలు తప్ప వేరే ఏమీ తినకూడదు. వీటి రసం తీయకూడదు. పచ్చిగానే తినాలి".

ఆ నిమ్మకాయలు మాత్రం తింటూ నలభై రోజులు ఉన్నాను.  శ్రీవారి కరుణవలన నాకు అది సరిపోయింది. నేను వెళ్ళటానికి సిద్ధమయి నాగరాజయ్యర్ కారులో శబరిమల బయలుదేరాము.

కొండ పైన గుడిలో 18 మెట్లకీ 18 కొబ్బరికాయలు కొట్టాను. భక్తులు అక్కడి పూజారి వద్దకు ప్రసాదానికై వెడుతున్నారు. నేను కూడా శ్రీవారికోసం ప్రసాదం ఆ పూజారిని అడిగాను. శ్రీవారికోసమే కదా వచ్చింది ?

"ఎక్కడనుంచి వస్తున్నావు ?"

"నేను పరమాచార్యుల సేవకుడిని"

"ఓ, పరమపూజ్యులు వారు"

" అవును, వారు పరమపూజ్యులు"

"వారి వల్లనే మేము బాగున్నాము. మాకు కోట్లరూపాయల ఆదాయం, అంతా సక్రమంగా జరుగుతోంది"

"నాకు కొంత ప్రసాదం కావాలి"

వెంటనే ఆ పూజారి ఒక పెద్ద నెయ్యి డబ్బా తీసుకుని, ఆ డబ్బాడు నెయ్యీ విగ్రహంపై పోశారు. సుమారు కేజీన్నర పట్టే సీసా తీసుకుని, దాని నిండా ఆ నేతిని పట్టారు.  తరువాత తమ రెండు చేతులనిండా విభూతి తీసుకుని విగ్రహానికి అభిషేకించారు. ఇలా రెండుసార్లు చేసి, ఆ విభూతిని సేకరించి నాకు ఇచ్చారు.  నేను ప్రసాదాన్ని జాగ్రత్త చేసుకున్నాను.  సాష్టాంగం చేసి అయిదువందల రూపాయలు సమర్పించాను. నాకోసం రెండు సీసాల అరవణ పాయసం కొనుక్కున్నాను.  యాత్ర అయిపోయింది కదా, నేను తినవచ్చు.  నా తిరుగు ప్రయాణం మెదలుపెట్టాను.

తిరుగు ప్రయాణం ఎర్నాకులం మీదుగా వచ్చాను. ఏ మార్గంలోనైనా వెనక్కిరావచ్చు. రెండు మార్గాలున్నాయి. వందిపెరియార్ మీదుగా ఒకటి, సలక్కాయం మీదుగా రెండోది. నేను సలక్కాయంమీదుగా ఎర్నాకులం వచ్చాను. నాతో దర్శనానికి వచ్చిన ఒక న్యాయవాది - నాకు బాగా తెలిసినవాడు, స్నేహితుడూ - నన్ను వారి ఇంటికి తీసుకునివెళ్ళాడు. భోజనం అయ్యాక బయలుదేరబోతోంటే అతను ఇలా అన్నాడు. " నువ్వు నిరాకరించకూడదు. మా అమ్మ, తొంభై ఏళ్ళది, ఈ ప్రక్కనే ఓ పల్లెటూళ్ళో ఉంటోంది. శ్రీవారి దగ్గరవారిని చూస్తే చాలా సంతోషిస్తుంది. మనం అక్కడకు వెళ్ళిన తరువాత నువ్వు బయలుదేరవచ్చు."

మేము కొల్లెనగోడు అనే ఆ పల్లెటూరికి బయలుదేరాము. ఆ తల్లి నన్ను చూచి చాలా సంతోషించింది. ఆవిడ పేరు అంగచ్చి, వాళ్ళు నంగవరం వారు. కాఫీ ఇవ్వబోయి, నేను వద్దంటే మజ్జిగ ఇచ్చింది. కాసేపైనతరువాత నేను బయలుదేరబోతోంటే ఆమె ఇలా అంది - " కృష్ణయ్యర్ మామ ను కలువకుండా ఎలా వెడతావు ? ఓ పిల్లాడా, ఇలావచ్చి ఈ అబ్బాయిని కృష్ణయ్యర్ మామ దగ్గరకు తీసికెళ్ళు "

నాకు కృష్ణయ్యరూ తెలియదు, రామయ్యరూ తెలియదు. సరే, మేము బయటకి వెళ్ళి వీధికి అవతలప్రక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళాము.  అక్కడ ఓ పడకకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న తొంభై అయిదు ఏండ్ల ఒక వృద్ధుడిని చూశాను.

"ఓయ్ రాజూ, ఎవరిది ?"

నన్ను పరిచయం చేశారు. "నేను పరమాచార్యుల సేవకుడిని" అన్నాను.

ఆయన అమాంతం కుర్చీలోంచి లేచి, సాష్టాంగం చేసి నా పాదాలు పట్టుకున్నారు. నేను నిర్ఘాంతపోయి వెనక్కిదూకాను.

"మీరిలా చెయ్యకూడదు. మీరా పెద్దవారు, నేనో, చిన్నవాణ్ణి,  ఇలా చేయడం దోషం"

"నేను సాష్టాంగం చేసింది నీకు కాదు, శ్రీవారికి. ఆ సర్వేశ్వరుడికి. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడని నీకు తెలియదా ?  ఆ భగవంతుడే అని తెలియదా ? తంజావూరువాళ్ళు సాధారణంగా తెలివైనవారు, నువ్వేమో తెలివితక్కువవాడిలా ఉన్నావే ?"

"మీరలా ఎలా అంటున్నారు ? అందరూ అంటున్నారనా ? అందరూ శ్రీవారిని పొగిడేవారే "

"విను. చాలా దశాబ్దాలక్రితం శ్రీవారు కేరళ వచ్చి మా ఊరిలో నలభై అయిదు రోజులు ఉన్నారు. ప్రతీ ఉదయం శ్రీవారు మూడింటికల్లా లేచి ఒక గంట జపం చేసేవారు.  తరువాత స్నానమూ, నిత్యకృత్యాలూ, చంద్రమౌళీశ్వరపూజా చేసేవారు. తరువాత ఒక అయిదునిముషాలలో వారు హడావిడిగా భోజనం అయిందనిపించేవారు.  వెంటనే భక్తులవద్దకు వచ్చి, ఏదైనా ఆధ్యాత్మికవిషయం పై ఉపన్యసించేవారు. రోజూ ఇలాగే నడిచేది - పూజ, ప్రసాదం, అంతులేకుండా భక్తులను కలవటం - మళ్ళా మధ్యాహ్నమూ ఇదే, సాయంత్రమూ ఇదే, రాత్రీ ఇదే. వారు ఏమీ తినేవారే కాదు, మూడు గంటలకు మించి నిద్రపోయేవారూ కాదు. ఒకరోజు నేను శ్రీవారిని ఇలా ప్రార్థించాను.

"శ్రీవారు నాకోసం ఒక పని చెయ్యాలి"

"ఏమిటది ?"

"శ్రీవారు సాక్షాత్తూ గురువాయురప్ప, ఎర్నాకులట్టుఅప్పన్, వేరు కాదు. ఈ అంతులేని శ్రమ, నిద్రలేకపోవటం శ్రీవారి శరీరంలో ఉష్ణం కలిగించింది. ఈ వేడి వలన కళ్ళు బాగా ఎర్రగా ఉంటున్నాయి.  శ్రీవారు, తమకు తైలస్నానం చేయించటం కోసం నాకు అనుమతినివ్వాలి. కేరళ ఔషధతైలాలకి ప్రసిద్ధి. శ్రీవారు కరుణించి నాకు ఈ అనుమతినివ్వాలి".

"సరే అయితే", అన్నారు శ్రీవారు, "శనివారం రా ".

నేను మూలికలూ, వేళ్లను ఉపయోగించి తైలం తయారుచేసి, శనివారం శ్రీవారి వద్దకు తీసుకుని వెళ్ళాను. శ్రీవారు నన్ను ఈ తైలం వారి తలపైనా, శరీరం పైనా మర్దించాను. అప్పుడు వారి శిరస్సుపై చక్రవర్తిరేఖ చూశాను. చేతులపై శంఖచక్రముద్రలున్నాయి.  పాదముల మడమలపై పద్మరేఖ చూశాను.  నువ్వు తంజావూరువాడినంటున్నావు. తంజావూరువాళ్ళు తెలివైనవారు, నీకు తెలివిలేనట్టుంది.   శ్రీవారిని సేవిస్తానంటున్నావు, ఆయన శరీరంపై ఈ రేఖలు చూడలేదా ?  వారుకూడా అందరిమల్లేనే మలమూత్రవిసర్జన చేస్తారు అని మోసపోకు. ఆయన నిన్ను వెర్రివాడిని చేస్తున్నారు. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడు తప్ప వేరుకాదు. "

ఆ వృద్ధుడు నాతో అలా అన్నారు. కాస్సేపయ్యినతరువాత నేను వెళ్ళటానికి లేచాను. నన్నొక్కనిముషం ఉండమని ఆయన లోపలికి వెళ్ళారు. లోపలినుండి పద్ధెనిమిది రుద్రాక్షలను పట్టుకొచ్చారు. అందులో ఏకముఖి నుండి పద్ధెనిమిది ముఖాలున్న రుద్రాక్షవరకూ ఉన్నాయి. అవన్నీ నా చేతిలో ఉంచి, ఆయన అన్నారు - " తీసుకోవయ్యా, ఇవి నావద్ద చాలాకాలంగా ఉంచాను. నువ్వు తీసుకోవాలి".

నేను రుద్రాక్షలు తీసుకున్నాకా, ఆయన నా చెయ్యిపట్టుకుని "నువ్వు నాకో మాట ఇవ్వాలి" అన్నారు.

"ఏమని మాట ఇవ్వాలి ?"

"చివరి శ్వాస వరకూ శ్రీవారిని సేవిస్తానని. ఇతరులు నిన్ను ఇబ్బంది పెడతారు. వదిలించుకోవటానికి చూస్తారు. ఓ దుర్మార్గుడు వచ్చి నిన్ను తరిమేయవచ్చు.  పట్టించుకోవద్దు. మఠం బయట ఒక స్టూలు వేసుకుని శ్రీవారిని కనిపెట్టుకుని ఉండు. వదలద్దు సుమా. నమ్మకస్థుడైన సేవకువై ఉండు, వదిలిపెట్టద్దు. "

నాకు ఆయన మజ్జిగ ఇచ్చారు.

"మరో మాట. శ్రీవారికి నా ప్రార్థనగా నడవవద్దన్నానని చెప్పు. వారు చాలా నడుస్తారు. ఆ పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదు.  ఇంకో విషయం. వారికి నా తరపున ఇరవై నాలుగు సాష్టాంగాలు చెయ్యి".

నేను మాట ఇచ్చి బయలుదేరాను.

టాక్సీలో ప్రయాణం చేశాను. శ్రీవారు ఒక అడవి మధ్యలో ఉన్న కట్టుకోడిపురం అనే ఊరిలో - బహుశ నాగలాపురం దగ్గరనుకుంటా - ఉన్నారు. ప్రయాణం చాలా కష్టమయ్యింది. రోడ్డు ఎత్తుపల్లాలతో ఉంది. చాలా కష్టంమీద శ్రీవారి వద్దకు చేరాను.  శ్రీవారు ఓ గోనెపట్టాపై విశ్రాంతి తీసుకుంటున్నారు. నేతినీ, విభూతినీ వారెదురుగుండా ఉంచి, సాష్టాంగం చేశాను.  వెంటనే  శ్రీవారు ఆ కేజీన్నర నెయ్యి సీసామూత తీసి ఒక్కగుటకలో నేతినంతా తినేశారు.  ఆకులో చుట్టబడిన విభూతి అంతా తన తలపై ఒంపేసుకున్నారు. నేనేమీ మాట్లాడకముందే శ్రీవారు నాతో ఇలా అన్నారు.

"అయితే నువ్వు శబరిమల వెళ్ళావా ? కృష్ణయ్యరు నీతో ఏం చెప్పాడు ?"

"శ్రీవారు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని చెప్పారు"

ఒక్క క్షణంలో శ్రీవారు లేచి నుంచుని దండం పట్టుకున్నారు. ఆరడుగుల పొడవని తోచింది. కళ్ళు చింతపిక్కల్లా ఎర్రగా ఉన్నాయి.  ఆయన నిజంగా శూలపాణి అయిన పరమేశ్వరుడే.

"అలా అన్నాడా ? అన్నాడా ?"

"అవును. శ్రీవారి పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పమని కూడా అన్నారు"

"రేఖలు చెరిగిపోవని చెప్పు. నేను పాదుకలు ధరిస్తానని చెప్పు. ఫోన్ చేసి చెప్పు".  తరువాత నేను కృష్ణయ్యరు గారికి ఫోన్ చేసి శ్రీవారి సందేశం తెలియపరచాను.

అప్పుడు నేను కృష్ణయ్యరుగారిచ్చిన రుద్రాక్షలు శ్రీవారికి ఎదురుగా ఉంచి సమర్పణ చేశాను.

"ఇవి నీకు ఇచ్చినవి"

"నేను ఆ కానుకకు అర్హత లేనివాణ్ణి. అజ్ఞానిని.  శ్రీవారు మాత్రమే ధరించయోగ్యమయినవి "

" ఇలా ఎలా ధరించను ?"

"నేను వీటిని ఒక మాలగా తయారు చేయిస్తాను" అని,  ఒక చక్కటి మాల తయారు చేశాను. శ్రీవారు దానిని ధరించారు కూడా. ప్రదోషం రోజుల్లో శ్రీవారు రుద్రాక్షలు ధరించేవారు. తరువాత ఆ మాలను బాలస్వామివారికి ఇచ్చారు. కానీ నేనెప్పుడూ బాలస్వామివారు వాటిని ధరించగా చూడలేదు, పూజలో కూడా. జయేంద్ర స్వామివారు ప్రదోషం రోజుల్లో తప్పనిసరిగా రుద్రాక్షలు ధరిస్తారు.

"నేను శ్రీవారిని ఒకటి అడగాలని కోరుకుంటున్నాను"

"ఏం కోరుకుంటున్నావో అడుగు"

"రామయ్యర్లూ, కృష్ణయ్యర్లూ శ్రీవారి శిరస్సుపై తైలం అలదారు, శరీరంపై రేఖలు చూశారు. శ్రీవారితో ఎప్పుడు ఉండి సేవించుకునే మేము మాత్రం ఎప్పుడూ ఏమీ చూడలేదు"

శ్రీవారు కాళ్ళుజాపి ముందుకు వంగారు.

"నా తలమీద, కాళ్ళమీద ఉన్న రేఖలు చూడు. దగ్గరగా రా,  కావాలంటే రేఖలని ముట్టుకో. నేనేమైన పోలీసునా ? టీటీ నా? నేనేం చేస్తాను ?  ’శంకరాచార్యులకు తలపై ఈ రేఖలు ఉన్నాయి’ అని వ్రాయబడిన బోర్డు మెడచుట్టూ తగిలించుకోనా ? "

నేను శ్రీవారి తలపైనా పాదములపైనా ఉన్న రేఖలని స్పర్శించాను.

కరుణామూర్తి అనేపదం ప్రపంచంలో శ్రీవారికి మాత్రమే వర్తిస్తుంది. శ్రీవారి దయ వేరొకరికి ఉండదు.

Monday 27 November 2017

అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము (1 - 5)



అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము
(1 - 5)

శ్రీ పార్వతీసుకుచకుఙ్కుమరాజమాన
వక్షస్థలాఞ్చితమమేయగుణప్రపఞ్చమ్ |
వన్దారుభక్తజనమఙ్గలదాయకం తం
వన్దే సదాశివమహం వరదమ్మహేశమ్ ||


శ్రీ పార్వతి వక్షస్థలమునందలి కుంకుమతో (పరస్పరాలింగనముద్వారా) శోభిల్లుతున్న వక్షస్థలము కలవాడూ, అనంతములైన గుణములు కలవాడూ , నమస్కరించు భక్తజనులకు శుభములను, వరములను ప్రసాదించువాడూ అగు మహైశ్వర్యములుగల సదాశివునకు నమస్కరించెదను.

నన్దన్నన్దనమిన్దిరాపతిమనోవన్ద్యం సుమన్దాకినీ
స్యన్దత్సున్దరశేఖరం ప్రభునుతమ్మన్దారపుష్పార్చితమ్ |
భాస్వన్తం సురయామినీచరనుతం భవ్యమ్మహో భావయే
హేరమ్బం హిమవత్సుతామతిమహానన్దావహం శ్రీవహమ్ ||


ఎల్లరనూ సంతోషింపచేయుకుమారుడూ  (లేదా ఎల్లరనూ సంతోషింపచేయు నందనవనమునే సంతోషింపచేయువాడూ), విష్ణువుచే మనస్సున నమస్కరింపబడువాడూ,  ఆకాశగంగను చిందించు సున్దరకేశపాశము గల వాడూ, మందారపుష్పములతో పూజింపబడువాడూ, రాజులచేత, దేవదానవులచేతనూ స్తుతింపబడువాడూ, గొప్ప తేజోమూర్తీ, పార్వతికి మహానన్దమును కలిగించువాడూ, జ్ఞానసూర్యుడై ప్రకాశించుచున్న వినాయకుడిని ధ్యానించుచున్నాను.

ఆలోక్య బాలకమచఞ్చలముచ్చలత్సు
కర్ణావిబోధితనిజాననలోకనం సః |
సామ్బస్స్వమౌలిసుభగాననపూత్కృతై స్త
మాలిఙ్గయన్నవతు మామలమాదరేణ ||


బాగుగా కదలుచున్న చెవులవలన తన ముఖము కనుబడకున్నా అచంచలుడైన వినాయకుని చూచి, ఆదరముతో తన శిరముపైనున్న గంగా తరంగములతో (అవియే చేతులుగా) ఆలింగనముచేసుకున్న శివుడు నన్ను రక్షించుగాక. ఇది చాలును.

కణ్ఠోత్పలం విమలకాయరుచిప్రవాహ
మర్థేన్దుకైరవమహం ప్రణమామి నిత్యమ్ |
హస్తామ్బుజం విమలభూతిపరాగరీతి
మీశహ్రదం చటులలోచనమీనజాలమ్ ||


దీక్షితులు శివుని ఒక మంచినీటి చెరువుతో పోల్చుచున్నారు. అతని కంఠం నల్ల కలువ. దేహకాంతి ప్రవాహము. శిరమునందలి అర్ధచంద్రుడు తెల్ల కలువ. చేతులు కమలములు(ఎర్రనివి). శరీరము నందలి తెల్లని విభూతి పూత పుప్పొడి. ఆయన కన్నులు చేపలు. కావున శివుడొక హ్రదమే అయి ఉన్నాడు. ఆయనకు ప్రతిదినమూ మ్రొక్కెదను.

రఙ్గత్తుఙ్గతరఙ్గసఙ్గతలసద్గఙ్గాఝరప్రస్ఫుర
ద్భస్మోద్ధూలితసర్వకాయమమలమ్మత్తేభకృత్యావృతమ్ |
ఆరూఢం వృషమద్భుతాకృతిమహం వీక్షే నితమ్బస్ఫుర
న్నీలాభ్రచ్ఛురితోరుశృఙ్గమహితం తం సన్తతమ్మానసే ||


భస్మోద్ధూళితమైన అయిన శివుని శరీరము ఉత్తుంగ తరంగముల గంగా ప్రవాహంచే ప్రకాశించుచున్నది.  అద్భుతాకారముగల వృషభమును అధిరోహించి, గజచర్మముచే చుట్టబడిన నితమ్బమూ, క్రిందిభాగమూ, నీలమేఘముచే ప్రకాశించు పర్వతమో అన్నట్లున్న ఆ శివుని ఎల్లప్పుడూ నా మనసున దర్శించుచున్నాను.




Sunday 17 September 2017

శివుడు మిమ్ము రక్షించుగాక



కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం
మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్
పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలం
క్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః


రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా, ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా, కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున చొరగా, వాసుకి కోపముతో చూచుచుండగా,  శివుడు (కోపముతో) కాలితో అదుముటచేత రావణుడు పాతాళమునకు పోవుచుండగా, (రావణునిపై) కోపించినవాడయ్యునూ పార్వతిచేత భయమువలన గట్టిగా ఆలింగనము చేసికోబడ్డవాడై ఆనందించిన శివుడు మిమ్ము రక్షించుగాక.

గౌరి మీకు మంగళముకలిగించుగాక.



ధూమవ్యాకులదృష్టి రిన్దుకిరణైరాహ్లాదితాక్షీ పునః
పశ్యన్తీ వరముత్సుకా నతముఖీ భూయోప్రియా బ్రహ్మణః
సేర్ష్యా పాదనఖేన్దుదర్పణగతే గఙ్గాం దధానే శివే
స్పర్శాదుత్పులకా కరగ్రహవిధౌ గౌరీ శివా యాస్తు వః


పార్వతీ పరమేశ్వరుల వివాహమందు వివాహాగ్నియొక్క పొగ వలన అమ్మవారి కళ్ళు వ్యాకులత చెందగా శివుని శిరసునందున్న బాలచంద్రుడు తన కిరణములతో అమ్మవారి కళ్ళకు ఆహ్లాదము కలిగించెనట. అమ్మవారు మరల శివుని చూచుటకు ప్రయత్నింపగా ఆ ప్రయత్నమును బ్రహ్మ గమనించెనని ఎరిగి సిగ్గుమొగ్గయై తలవంచుకొని కూర్చొనెనట. చంద్రునివలె ప్రకాశించునదీ అద్దమువలెనున్నదీ అగు తన కాలిగోటియందు ప్రతిఫలించిన శివుని చూచుతూ, గంగనూ చూచి కించిత్తు ఈర్ష్యనందెనట. ఇంతలో పాణీగ్రహణమునందలి శివుని స్పర్శచేత పులకింతనొందెనట. అట్టి గౌరీదేవి మీకు మంగళము కలిగించుగాక.

Friday 8 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష




పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష
(జగద్గురుబోధలనుండి)

అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.

సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.

అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూ శివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.

మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని,
నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే.


'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటే అన్న తీర్మానమే నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.

దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభమైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.

అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం
ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,
ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ కాలమాత్మ
ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.


శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.

దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు. అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.

యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,
తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,

ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.

అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టంవస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు. ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.

Thursday 7 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు



పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు
(జగద్గురు బోధలనుండి)

దైవభక్తి ఆవశ్యక మని చెప్పడ మెందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసికోవడానికే. అట్టి ఆత్మసాక్షాత్కారానికై మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుష్యులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లయినా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి సాధనం.

ఇపుడు మనుష్యులకు అక్కఱ లేని అనే ప్రశ్న వస్తుంది. 'ఛాయా తోయం వసన మశనం' అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోడానికి ఒక గుడ్డ. ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోడానికి ఈ నాలుగున్నూ పరికరాలు. ఇవి అన్నీ భూమినుండి ఉత్పన్నమవుతై. నీ రిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోడానికి మన్ను సున్నం దారువు లోహం ఇత్యాదులు భూమిలోనుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు. ఇవన్నీ భూమినుండి వచ్చేవే. కడపట మనము కలిసేదికూడా ఆ భూమిలోనే.

సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మానరక్షణకోసం మనం బట్టలుకట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలువలు కట్టుకొనకపోతేయేం? అట్లా కట్టుకుంటేనేగాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయంగాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగలవానిని కట్టుకోవడంచేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా?

ఒక కుటుంబం, వెలగల వలువలకై చెసే ఖర్చుతో దాదా పయిదు కుటుంబాలకు కావలసిన సాధారణాలయిన బట్టలు దొరుకుతై. ఆడంబరంకోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయివుంటే అవి మనకు పాపాన్నే పోగుచేసి పెడతై. వీని కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెపుతూ మనం మాంసం ముట్టం. కాని మాంసాహారానికయితే ఏ ఒక జీవానికో హింస. పట్టుబట్టకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనము కట్టుకొనే బట్టలు సాధ్యమయినంతవరకు హింసచేయకుండా ఉండే ఉపాయాలవల్ల ఉత్పత్తి అయేవిగా చూచుకోవాలి. మనము కట్టె బట్టలు సాధారణు లందరూ కట్టుకొనేటటువంటివిగానూ గట్టివిగానూ ఉండాలి.

ప్రజలందరూ సుఖంగా బతకటానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కాని లేమికిమాత్రం దినదినాభివృద్ధి. ప్రజల ఆర్థికజీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు: దానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఇదివరకు రెండుసార్లు కాఫీ తాగేవారిప్పుడు నాలుగు సారులు కాఫీ తాగడం. గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం. రెండు బట్టలతో కాలం గడిపేవారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకోడం. ఆర్థికజీవ నాభివృద్ధికి ఇవి గుర్తు లని అనుకోవడం సరికాదు. మనకు కావలసినవస్తువు లన్నిటినీ ఇలా పెంచుకుంటూనేపోతే దేశంలో ఎపుడూ లేబరమే తాండవిస్తూవుంటుంది. మానప్రాణాలు కాపాడుకోవడాని కేవి తప్పనిసరో అట్టివి అందరకూ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమయిన చట్టాలుండాలి. ఆలాటి స్థితి కలగాలి, అది సవ్యమయినది. అని అనుకుంటే పరమదరిద్రులు తమ జీవితం ఎల్లా గడుపుకొంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహంలేని దోషం ఉండేటంతవరకూ ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యంకోరేవారు తమతమ అవసరాలు మించి ఒకింతయినా పరిగ్రహం చేయరాదు. కలిగినవారు లేనివారికి సాయంచేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈసంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరినిచూచి లేనివారుగూడా వారివలె తిరగడానికి ప్రయత్నిస్తారు, అట్లా వారిని అనుకరించి అప్పులపాలవుతారు. పట్టుపుట్టాలవారు. చెడిన తరగతిలోనివారే. ఇక వజ్రాల నగలవారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దుబారా. కన్యాం 'కనకసంపన్నాం' అని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారంకోసం డబ్బువెచ్చపెట్టి నగగా పెట్టుకొన్నా ఏనాటికయినా అది ఉపయోగపడుతుంది. కాని వజ్రాలకు ఇట్టి ప్రయోజనంలేదు. సరికదా ఉపద్రవం కావలసినంత. ఏబది, నూఱేండ్లక్రితం మనపూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే చెవులకు తాటికమ్మలే. తాగేది రాగిగంజో బియ్యపుగంజో. బ్రతుకుతెరువులో ధనికులకూ దరిద్రులకూ పెద్ద భేదమేమీ ఉండేదికాదు.

'ఇకమీద కాఫీతాగను, పట్టుబట్టలు కట్టను' అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలేధనంతో అయిదు కుటుంబాలు సుఖంగా బ్రతుకుతై. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించినకొద్దీ శాంతీ ఉండదు. సౌఖ్యమా ఉండదు. ఇట్టి దుబారావల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖంతప్పదు. కాఫీనీ పట్టుబట్టలనూ వదలిపెడితే అన్ని కుటుంబాలూ బాగుపడతై. ఇదేకాదు, పట్టుబట్టలకోసం చేసేపాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేక పోతుంది. అష్టాంగయోగంలో మొదటిదే అపరిగ్రహం, అహించ అనేవి. ఏ ప్రాణికిన్నీ మనవల్ల హింసకలుగరాదు. డబ్బు ఉందికదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చేయరాదు. అట్లాచేసే వ్యయంతో లేమితో కొట్టుకోనే వారి అవసరాలు తీర్చవచ్చు, అలాచేస్తేనే, చేయడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మసాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగయోగానికి మొదటిసోపానం అది దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికే దీనిని చెప్పడం.

పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?


పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?
(జగద్గురు బోధలనుండి)

భక్తి అంటే భక్తుని హృదయం వేరే ఇంకో ప్రయోజనం కోరక సదా పరమాత్మ స్వరూప సాయుజ్యం కోసమే నిరీక్షించడం. దాని కేదయినా కారణం ఉంటే భక్తికాదు. ఈశ్వరునిమీద అవ్యాజమయిన అనురాగం తనంతట తానుపుట్టుకొనిరావాలి. సకారణంగా వచ్చేది ప్రేమకాదు. అదేభక్తి. సర్వమూ పరమాత్మ స్వరూపమే. పరమాత్మతో యోగం లేనంతవరకూ శాంతికీ ఆనందానికీకరవే.

సదాశివబ్రహ్మేంద్రులు మానసిక పూజచేస్తూ- ’ఈశ్వరా! నిన్ను పూజించడానికి కూచున్నాను. కాని నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీ కెట్లా పూజ చేయడం? అది వీలయిన పనా? నీఆరాధన చేయ డమెట్లా? నీవు ఒక దిక్కున ఒకచోటనే ఉంటే కదా నీవు ఇక్కడనే ఉన్నా వని నమస్కారం చేయడం? నీవు వెనుకా ముంగలా ప్రక్కలా పైనా కిందా ఎల్లయెడలా సర్వాంతర్యామివై ఉన్నావు. నేను నీపాదాలను ఎక్కడ ఉన్నవని చూచినమస్కరించను? పోనీ! ఎక్కడనో నీ పాదాలున్నవని నమస్కరిస్తే ఆ పాదాల వెనుక నీవులేవు అని కదా అర్థం. అలా అయితే నీపూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసికొన్నవాడనే కదా! నీ చరణములను కడుగుటకు పంచపాత్రనుండి ఒక ఉద్ధరిణలో నీళ్ళు కింద పోస్తామా. నీవు ముల్లోకాలనూ మూడడుగులతో కొలచిన త్రివిక్రముడవి కదా! నీ పాదాలను అణుమాత్రమయినా ఈనీళ్ళు తడపగలవా? పాదాలను పూర్తిగా కడగక వదలుట అపచారం కాదా ప్రభూ?

'భూః పాదౌ యస్య నాభిః’. దిగంబరుడవయిన నిన్ను ఈ చిన్న వస్త్రముతో అలంకరింపగలనా? నే నేమి పూజ చేయను తండ్రీ! నే నేమని ప్రార్థంపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు. నీవు సర్వజ్ఞుడవు. ప్రార్థన అంటూ చేసి నీసర్వజ్ఞత కొక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీవద్దలేని ఏదో ఒక వస్తువును నే నడుగలేదు. కొత్త వస్తువును ఏదే నొకదానిని నే నడిగితే నీవు దాతవు నేను ప్రతిగ్రహీతను అయిపోతాం. నీవు అఖండానందస్వరూపడ వని శ్రుతులు చెపుతున్నవి. నేనో ఇలా కోరికలతో కొరతలతో ఉన్నాను. ఈ స్థితిని మాన్పి నా స్వరూపం నా కియ్‌. నన్నే నా కియ్‌.’ అని చెప్పారు.

'నన్నే నా కియ్‌.’ అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నా కియ్‌’ అని

యాచే నాఽభిసవం తే చంద్రకలోత్తంస! కించి దపి వస్తు,
మహ్యం దేహి చ భగవన్‌ మదీయ మేవ స్వరూప మానందమ్‌.


ఇట్లా మన స్వరూపాన్నే మనం వదలి ఉన్నపుడు క్షణం కూడా సహించరాని తాపం తలగాలి, ’పరమాత్మ స్వరూపంతో మనమే క్షణం ఐక్యం అవుతాం ?’ అనే చింతతాపమూ ఇవి కలగాలి. మనం మనంగా ఉండాలంటే పరమాత్మతో కలిసి ఉండడమే. అదే ఆనందస్వరూపం. పరమయిన పరమాత్మ స్వరూపం. తక్కినవన్నీ దేహాత్మ స్వరూపాలు భ్రాంతిజనితాలు. ఆ సత్యవస్తువుతో ఐక్యమై ఉండడమే పరమయిన ఆ ఆత్మస్వరూపం. అలలవలె, నురుగువలె వేరొకటి వచ్చి కలిస్తే సహించరాని, తాళుకోలేని ప్రేమ మనకు పుట్టుకోరావాలి. ’ఆ సత్యవస్తు దర్శనం ఎన్నడు? దానితో యోగం ఎన్నడు? అనే చింత సదా ఏర్పడాలి. అదే భక్తి.

Wednesday 6 September 2017

శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్



|| శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ ||

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే |
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||

మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః |
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2||

ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను.చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3||

నాకు ద్వేషము- అనురాగము లేవు. నాకు లోభము - మోహము లేవు. మదము లేదు. మాత్సర్యము లేదు. ధర్మము లేదు. అర్థము లేదు. కామము లేదు. మోక్షము లేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4||

నాకు పుణ్యము లేదు పాపము లేదు. సుఖము లేదు. దుఃఖము లేదు. మంత్రము లేదు. తీర్థము లేదు. వేదములు లేవు. యజ్ఞములు లేవు. నేను భోజనము కాను. తినదగిన పదార్థము కాను. తినువాడను కాను. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5||

నేను మృత్యువును కాదు. సందేహము లేదు. నాకు జాతిభేదము లేదు. నాకు తండ్రిలేడు, తల్లిలేదు, జన్మలేదు, బంధువులేడు, మిత్రుడు లేడు. గురువులేడు, శిష్యుడులేడు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేన్ద్రియాణామ్ |
సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 6||

నేను నిర్వికల్పుడను. ఆకారము లేనివాడను. అంతటావ్యాపించి ఉన్నాను. అన్ని ఇంద్రియములతో నాకు సంబంధములేదు. మోక్షములేదు. బంధములేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నిర్వాణషట్కం సమ్పూర్ణమ్ ||

Sunday 3 September 2017

శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ


|| శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ ||

కిం జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే |
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే
కిం తత్రాహమతో భవాన్పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో ||


గురువు శిష్యుని ప్రశ్నించెను:
వత్సా!వస్తుప్రకాశకమగు జ్యోతి ఏదియని నీ అభిప్రాయము?
శిష్యుడు: పగలు సూర్యుడును, రాత్రి ప్రదీప చంద్రాదులును.
గురువు: అగుచో సూర్యప్రదీపాదులను గుర్తించు జ్యోతి ఏది?
శిష్యుడు: నేత్రము.
గురువు: కళ్ళుమూసుకొనినప్పుడు ఏది జ్యోతియగుచున్నది?
శిష్యుడు: బుద్ధి.
గురువు: ఈబుద్ధిని జూచునదేమి?
శిష్యుడు: నేను,(అనగా ఆత్మయే). కనుక తమరు మరియు నేను, ప్రభూ! ఆ పరంజ్యోతియే అని గుర్తించితిని.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ ఏకశ్లోకీ సమ్పూర్ణా ||

Saturday 2 September 2017

శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్


|| శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్ ||

లబ్ధా విద్యా రాజమాన్యా తతః కిం
ప్రాప్తా సమ్పత్ప్రాభవాఢ్యా తతః కిమ్ |
భుక్తా నారీ సున్దరాఙ్గీ తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 1||


రాజమాన్యతనుబొందించు విద్య లభించినది, ఫలమేమి? ప్రభుశక్తితో కూడిన సంపదను పొందినను ఫలమేమి? సుందరాంగియగురమణితో భోగమును అనుభవించినను ఫలమేమి?  ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. అట్టిచో ఇవి అన్నియును వ్యర్థములే!

కేయూరాద్యైర్భూషితో వా తతః కిం
కౌశేయాద్యైరావృతో వా తతః కిమ్ |
తృప్తో మృష్టాన్నాదినా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 2||


ఏవ్యక్తి ఆత్మసాక్షాత్కారమును పొందలేదో, అతడు కేయూరాది - అలంకారములవలన భూషితుడైనను, పట్టుపుట్టములను కట్టినను, మధురాన్నాదులవలన తృప్తినందినను ఫలమేమి?

దృష్టా నానా చారుదేశాస్తతః కిం
పుష్టాశ్చేష్టా బన్ధువర్గాస్తతః కిమ్ |
నష్టం దారిద్ర్యాదిదుఃఖం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 3||


మనోహరములగు పెక్కుదేశములను వీక్షించినాడు, ఇష్టులగు బంధువర్గమును పోషించినాడు, దారిద్ర్యమును నశింపచేసికొనినాడు. కాని, ఆత్మసాక్షాత్కారమునందలేదు , లాభమేమి?

స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం
దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతః కిమ్ |
జప్తా మన్త్రాః కోటిశో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 4||


ఎవనికి ఆత్మస్వరూపదర్శనము లభింపలేదో అతడు గంగాదితీర్థముల స్నానమొనర్చిన నేమి ఫలము? షోడశదానముల నొనర్చిన ఏమి ఫలము? కోటి మంత్రజపమొనర్చిన ఏమి ఫలము?

గోత్రం సమ్యగ్భూషితం వా తతః కిం
గాత్రం భస్మాచ్ఛాదితం వా తతః కిమ్ |
రుద్రాక్షాదిః సద్ధృతో వా తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 5||


గోత్రము(వంశము)అలంకృతమైనది. గాత్రము భస్మాచ్ఛాదితమైనది, రుద్రాక్షాదులు చక్కగ ధరింపబడినవి. కాని ఆత్మానుభవములేదు. వీని వలన కలుగు ఫలమేమి?

అన్నైర్విప్రాస్తర్పితా వా తతః కిం
యజ్ఞైర్దేవాస్తోషితా వా తతః కిమ్ |
కీర్త్యా వ్యాప్తాః సర్వలోకాస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 6||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు విప్రులను అన్నభోజనముతో సంతోషపెట్టగ కలుగు ఫలమేమి? యజ్ఞమున దేవతలను సంతోషపరచిన ఫలమేమి? కీర్తితో సర్వలోకములను వ్యాపింపచేసిన కలుగు ఫలమేమి?

కాయః క్లిష్టశ్చోపవాసైస్తతః కిం
లబ్ధాః పుత్రాః స్వీయపత్న్యాస్తతః కిమ్ |
ప్రాణాయామః సాధితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 7||


ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. ఉపవాసములొనర్చి, కాయక్లేశ మొనర్చిన లాభమేమి? స్వభార్యవలన పుత్రులను బడసిన లాభమేమి? ప్రాణాయామమును సాధించిన ఫలమేమి?

యుద్ధే శత్రుర్నిర్జితో వా తతః కిం
భూయో మిత్రైః పూరితో వా తతః కిమ్ |
యోగైః ప్రాప్తాః సిద్ధయో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 8||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు యుద్ధమున శత్రువులను నిర్జించినను, మిత్రులతో నిండియున్నను, యోగసిద్ధులను పొందినను లాభమేమి?

అబ్ధిః పద్భ్యాం లఙ్ఘితో వా తతః కిం
వాయుః కుమ్భే స్థాపితో వా తతః కిమ్ |
మేరుః పాణావుద్ధృతో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 9||


సముద్రమును అడుగులతో దాటినను, వాయువును కుంభకప్రాణాయామమున నిల్పినను, మేరువును చేతితోనెత్తినను, ఆత్మసాక్షాత్కారము నందకుండిన లాభమేమి?

క్ష్వేలః పీతో దుగ్ధవద్వా తతః కిం
వహ్నిర్జగ్ధో లాజవద్వా తతః కిమ్ |
ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 10||


విషమును పాలవలె త్రాగగలడు, నిప్పులను పేలాలవలె తినగలడు, పక్షివలె ఆకసమున తిరుగగలడు, కాని ఆత్మసాక్షాత్కారము నందలేదు, ఫలమేమి ?

బద్ధాః సమ్యక్పావకాద్యాస్తతః కిం
సాక్షాద్విద్ధా లోహవర్యాస్తతః కిమ్ |
లబ్ధో నిక్షేపోఽఞ్జనాద్యైస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 11||


అగ్న్యాదులను లోబరుచుకొనిననూ, సుదృఢలోహములను విరచిననూ, అంజనాదులవలన ధననిక్షేపములను పొందిననూ, ఆత్మసాక్షాత్కారమొనర్చుకొననియెడల లాభమేమి?

భూపేన్ద్రత్వం ప్రాప్తముర్వ్యాం తతః కిం
దేవేన్ద్రత్వం సమ్భృతం వా తతః కిమ్ |
ముణ్డీన్ద్రత్వం చోపలబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 12||


ఉర్వియందు రాజేంద్రత్వము లభించినది. లాభమేమి ?  స్వర్గమున దేవేంద్రత్వము లభించినది. లాభమేమి ? వనమున యతీంద్రత్వము లభించినది, లాభమేమి ? ఆత్మసాక్షాత్కారము లభింపకుండిన ?

మన్త్రైః సర్వః స్తమ్భితో వా తతః కిం
బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిమ్ |
కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 13||


మంత్రబలమున సమస్తమునూ స్తంభింపచేసిననూ, బాణముతో లక్ష్యమును భేదించిననూ, కాలజ్ఞానమును బడసిననూ, ఆత్మసాక్షాత్కారమొక్కటి లేకుండినచో మిగిలినవన్నియునూ వ్యర్థములు.

కామాతఙ్కః ఖణ్డితో వా తతః కిం
కోపావేశః కుణ్ఠితో వా తతః కిమ్ |
లోభాశ్లేషో వర్జితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 14||


కామావేశము ఖండింపబడినది. కోపావేశము కుంఠితమైనది. లోభపరిష్వంగము వర్జింపబడినది. అయిననూ ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. లాభమేమి ?

మోహధ్వాన్తః పేషితో వా తతః కిం
జాతో భూమౌ నిర్మదో వా తతః కిమ్ |
మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 15||


మోహాంధకారము నలుగగొట్టబడినది. పృథ్వియందు గర్వరహితుడేయైనాడు. మాత్సర్యపీడ ప్రశమితమైనది. అయిననూ ఆత్మదర్శనములభింపకుండిన వీనివలన లాభమేమి ?

ధాతుర్లోకః సాధితో వా తతః కిం
విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిమ్ |
శంభోర్లోకః శాసితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 16||


బ్రహ్మలోకము సాధించిననూ, విష్ణులోకమును వీక్షించిననూ, శివలోకమును శాసించిననూ,  ఆత్మలోకమును సాక్షాత్తుగ చూడకుండిన లాభమేమి ?

యస్యేదం హృదయే సమ్యగనాత్మశ్రీవిగర్హణమ్ |
సదోదేతి స ఏవాత్మసాక్షాత్కారస్య భాజనమ్ || 17||


ఎవనిహృదయమున సంపూర్ణముగ ఈ రీతిగ ఎల్లప్పుడునూ అనాత్మవస్తుసౌందర్యనింద ఉదయించుచుండునో, అతడే ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు.

అన్యే తు మాయికజగద్భ్రాన్తివ్యామోహమోహితాః |
న తేషాం జాయతే క్వాపి స్వాత్మసాక్షాత్కృతిర్భువి || 18||


మిగిలినవారు, జగత్భ్రాంతివ్యామోహమోహితులు. వారికి జగత్తున ఎన్నడునూ ఆత్మసాక్షాత్కారము లభింపదు.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అనాత్మశ్రీవిగర్హణం సమ్పూర్ణమ్ ||

శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్



|| శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్ ||

చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 1||


చంచలములు - ఎర్రనివి - దయతో నిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగా ధరించినది, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచమునంతటినీ సంరక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగపువ్వు వంటి ముక్కు చివరన ముత్యమును అలంకరించుకున్నది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2||


కస్తూరీ తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము - వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షములద్వార వర్షించు కృపారసములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ |
రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 3||


మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులుకలది, బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామరరేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడా శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 4||


నక్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్య అయినది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చక్రములలోనుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితాత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గన్ధర్వకన్యాదృతామ్ |
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 5||


విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రమునందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమన్తభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 6||


అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీలతలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనపుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 7||


ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారియందు ప్రసన్నమైన హృదయము కలది, ఒడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 8||


కర్పూరము - అగరు - కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్నివిధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలమునందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలంకృతామ్ |
గఙ్గాగౌత్మగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 9||


స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశమునందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - గౌతమమహర్షి - గర్గుడు మొదలైన వారిచే స్తుతింపబడు పాదములు కలది, గోవు - గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం సమ్పూర్ణమ్ ||

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/09/blog-post_59.html
 

పరమాచార్యుల అమృతవాణి : ఉపన్యాసముల సంకలనము

 
పరమాచార్యులు, పరమపూజ్యనీయులు సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి కొన్ని ఉపన్యాసముల సంకలనము, తెలుగులో. 1937లో అచ్చొత్తించిన పుస్తకము


https://archive.org/download/in.ernet.dli.2015.386935/2015.386935.Sri-Chandrashekarendra.pdf


భక్తులందరితో పంచుకోగలరు.

Friday 1 September 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శ్రీ మహాగణాధిపతయే నమః



పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు.

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥


తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.

ఈ భూమిలో అమ్మవారిని దక్షిణాన కన్యాకుమారినుండి, ఉత్తరాన కాశ్మీరంలో క్షీరభవానీ వరకూ వివిధరూపాలలో ఆరాధిస్తారు. కానీ శ్రీవిద్యాతంత్రంలో చెప్పబడిన లలితా త్రిపురసుందరి లక్షణములు, ఆయుధములు ఒక్క కాంచీపుర కామాక్షికి మాత్రమే ఉన్నాయి. భూమి అంతటినీ ఒక దేవత అనుకుంటే, ఆ భూదేవియొక్క నాభిస్థానము కాంచీపురము.

క్వణత్-కాంచీదామా - సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ.  అమ్మవారు నడుస్తూంటే కాలి అందెలేకాక వడ్డాణపు చిరుమువ్వలూ సవ్వడిచేస్తాయి. పరిక్షీణామధ్యే - అమ్మవారి నడుము చాలా సన్ననిది. పరిణతశరత్చన్ద్రవదనా - శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ.  శరత్కాలవాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. అమ్మవారి ముఖము, శరత్తులోని పున్నమిచంద్రుని వంటి కాంతి విరజిమ్ముతూ ఉంటుందని శంకరులు సూచిస్తున్నారు. అమ్మవారి వదనం అనుగ్రహం అనే వెన్నెల కురిపిస్తుంది.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - అమ్మవ్రారు తన చేతులలో విల్లు, అంబులు, పాశం, అంకుశములు ధరిస్తుంది. ఇవి శ్రీవిద్యాధిదేవత యొక్క ముఖ్య లక్షణాలు. ఈ దేవతను లలితా మహా త్రిపురసుందరి అని, కామేశ్వరి అను పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో విల్లు, అమ్ములు ఉంటాయి. విల్లమ్ములు మన్మథుని వలెనే చెరకువిల్లు, పుష్పబాణములు.

రాగము, ద్వేషము - వీటిగురించి లోతుగా ఆలోచిస్తే ప్రాపంచిక జీవనం అంతా కామక్రోధములనబడే ఈ రాగ ద్వేషములతో నిండి ఉందని తెలుసుకుంటాము. ఈ రెండూ అమ్మవారి మాయాలీలలో భాగాలు. ఆవిడ అనుగ్రహలీలలో అవి మాయమయిపోతాయి. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం వీటిని అదుపులో ఉంచగలం. రాగస్వరూపపాశాఢ్యా - కోరిక అను పాశము కలది. క్రోధాకారాంకుశోజ్జ్వలా - కోపము అను అంకుశముతో మెరియునది. ఈ రెండు పేర్లూ లలితా సహస్రంలో ఉన్నాయి.  అమ్మవారి పాశం కామము/కోరికకు సంకేతం. పాశములాగా కామము మనను కట్టేస్తుంది. అలాగే అంకుశం క్రోధమునకు సంకేతం. కోపము మనను చీల్చి రెచ్చగొడుతుంది. పాశాంకుశములు ఒక ఏనుగుని అదుపులో ఉంచినట్టు, కామక్రోధములను అదుపులో ఉంచుతాయి, అంటే ఈ కామక్రోధముల జన్మస్థానమైన మనస్సును అదుపులో ఉంచుతుంది.

మరోలా చెప్పాలంటే  అమ్మవారు మనపై వాత్సల్యంచూపి, ఆమె చేతిలో ఉన్న పాశంలో మనలను కట్టివేసి, మనను కట్టివేస్తున్న ఇతర పాశాలకు దూరంచేస్తుంది. మనకు బంధములు లేని బంధము ఇస్తుంది. అలాగే ఆమె తన కోపమును మన క్రోధముపై చూపి, తన అంకుశముతో మన క్రోధమును చీల్చి, అణచివేసి ప్రశాంతతనిస్తుంది.

మనం కోరికను అమ్మవారితో అనుబంధంగానూ, కోపమును మన కోపముపై కోపముగానూ మార్చుకుంటే అమ్మవారి పాశాంకుశాలు మనను బంధవిముక్తులను చేస్తాయి.

లలితా సహస్రంలో పాశాంకుశాల తరువాతి రెండు నామములు  అమ్మవారి చేతుల్లోని విల్లమ్ములపై ఉన్నాయి. మనోరూపేక్షుకోదండా - మనస్సురూపమైన చెరకువిల్లు ధరించునది, పంచతన్మాత్రసాయకా - అయిదు తన్మాత్రలకు సంకేతమైన బాణములు కలిగినదీ.

మన్మథుడిచేతిలో విల్లమ్ములు ఏంచేస్తాయో తెలిసినదే. అమ్మవారి చేతుల్లో అవి ఏంచేస్తాయి ? విల్లు మన మనస్సులను మోక్షమునందు కోరిక కలిగినవాటిలా చేస్తుంది. అయిదు బాణములూ కూడా అంతే. అవి మన ఇంద్రియాల శక్తులను అమ్మవారివైపు తిప్పి శుచిగా చేస్తాయి.  ఇవి మనలో అమ్మవారిని స్తుతించే పాటలను వినాలనీ, ఆమె పాదపద్మములను తాకాలనీ, ఆమె స్వరూపాన్ని చూడాలనీ, అమ్మవారి పాదప్రక్షాళన చేసిన జలం అనే అమృతపు రుచి చూడాలని, అమ్మవారి నిర్మాల్యపుష్పములను సేకరించి వాటి దివ్యసుగంధపరిమళములను ఆఘ్రూణించవలెననీ, ఇలాంటి కోరికలు కలిగేలా చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారి పుష్పబాణములు మన ఇంద్రియలౌల్యాలను నిర్మూలిస్తాయి. ఆమె చెరకువిల్లు మన మనస్సును లయంచేస్తుంది. అది జరిగినప్పుడు మనకు జ్ఞానము, మోక్షము లభిస్తాయి. మనకి ఇంకేంకావాలి ?

ఇలా పవిత్రమయిన అయిదు ఇంద్రియాలూ, మనస్సూ కలిపి ఆరు కరణములు. తుమ్మెద తన ఆరు చరణములతో పద్మముపై వ్రాలినట్లు మనము ఈ ఆరు కరణములనూ అమ్మవారి పాదపద్మములపై లయంచేయాలి.

అమ్మవారు జ్ఞాన సామ్రాజ్యపు మహారాజ్ఞి. తాను మోక్షప్రదాయిని అని సూచించడానికి ఆమె కామక్రోధాలు నాశనంచేసి జ్ఞానం కలిగించు ఆయుధాలైన పాశాంకుశాలు రెండు చేతులతో ధరించింది. తాను మనస్సును, ఇంద్రియాలను తొలగించివేస్తుందని సూచించుటకు ఆమె విల్లమ్ములు ధరించింది.

శంకరులు ఈ శ్లోకంలో మొదట అమ్మవారి రూపం - నాల్గుచేతులు, వడ్డాణము ధరించిన సన్నని నడుము, శరత్కాలపౌర్ణమినాటి జాబిల్లినిపోలిన మోము - వర్ణించారు. ఈ భౌతికరూపవర్ణన తరువాత శంకరులు అమ్మ తత్త్వపు సారాంశాన్ని చెప్పుతున్నారు - పురమథితురాహోపురుషికా -  త్రిపురాసురసంహారి యెక్క అహంకార స్వరూపము అనే అర్థం వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, శివుని యొక్క ’నేను’ అనే భావస్వరూపమే అమ్మవారు అని అర్థమవుతుంది. పరబ్రహ్మము యొక్క చిచ్ఛక్తి యే అమ్మవారు. జ్ఞానాంబ.

ఈ శ్లోకములో శంకరులు ఎంతో అందంగా వర్ణించిన అమ్మవారిని మన అంతర్నేత్రముతో చూడడము మన పని.

శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్




|| శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్ ||

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 1||


పోలిక లేనివాడను, నిత్యుడను, అంశలేనివాడను, అఖండమైనవాడను, జ్ఞానస్వరూపుడను, భేదములన్నీ లేనివాడను అగు నాయందు జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదమును ఏర్పరచు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

శ్రుతిశతనిగమాన్తశోధకానప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నానఘటితఘటనాపటీయసీ మాయా || 2||


వందలాది వేదవచనములతోనూ మరియు వేదాంతోపదేశములతోనూ పరిశుద్ధమైన వారిని కూడా అహహ! ధనాదులను చూపించి, వెంటనే కలుషితమొనర్చి, పశువులుగా మార్చు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాన్తం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 3||

సచ్చిదానందము, అఖండము మరియు అద్వితీయమగు ఆత్మను ఆకాశము, అగ్ని మొదలైన పంచభూతములచే నిర్మించబడిన సంసారసాగరంలో పడవేసి పూర్తిగా భ్రమింపచేయుచున్న మాయ అఘటితఘటనా సమర్థమైనది.

అపగతగుణవర్ణజాతిభేదే సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 4||


గుణముల, వర్ణముల మరియు జాతుల భేదము లేని సుఖ చైతన్యస్వరూపమైన ఆత్మలో బ్రాహ్మణుడు మొదలైన అహంకారమును, పుత్రులు - భార్య - ఇల్లు మొదలైన మోహమును పెంపొందించు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

విధిహరిహరవిభేదమప్యఖణ్డే బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావానఘటితఘటనాపటీయసీ మాయా || 5||


అఖండమైన పరమాత్మలో బ్రహ్మ - విష్ణు - మహేశ్వర భేదములను కల్పించి పండితులను కూడా హరి - హర విభేదము కలవారిగా చేసి భ్రమింపచేయు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మాయాపఞ్చకమ్ సమ్పూర్ణమ్ ||

Thursday 31 August 2017

శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్



|| శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్ ||

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చిన్తామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే || 1 ||


శ్రీవిద్యాస్వరూపిణివి, శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడుదానవు, శ్రీనాథుడు మొదలగు గురువుల(విష్ణు-బ్రహ్మ-మహేశ్వరులు)స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండుదానవు, లక్ష్మీ-సరస్వతీ-పార్వతులచే నమస్కరించబడు పాదపద్మములు కలదానవు, శివుని భార్యవు, మంగళస్వరూపిణివి, మధ్యాహ్నసమయమునందు మలయధ్వజ మహారాజుకు కుమార్తెగా అవతరించినదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌలివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే || 2 ||


శ్రీచక్రమునందుండు దానవు, స్థిరమైనదానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడుదానవు, దీనులకు వరములిచ్చెడిదానవు, భక్తులకు అభయమొసంగుదానవు, స్తనభారము కలదానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచే తెలియబడుదానవు, మెరుపు వంటి శరీరము కలదానవు, తల్లివి, అమృతముతో ఆర్ర్దమైన హృదయము కలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

కోటీరాఙ్గదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బహారాఞ్చితే |
శిఞ్జన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనామ్బికే || 3||


కిరీటము - కంకణములు - రత్నకుండలములు అలంకరించుకున్నదానవు, ధనుస్సు - బాణము పట్టుకున్నదానవు, చక్రవాక పక్షులవంటి రెండు స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్నదానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదములు కలదానవు, నా దారిద్ర్యమను సర్పమును సంహరించు గరుడపక్షివంటిదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశచాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే |
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునినుతే మాం పాహి మీనామ్బికే || 4 ||


బ్రహ్మ - విష్ణు -మహేశ్వరులచే స్తుతింపబడుదానవు, బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివులను పంచప్రేతల ఆసనమును అధిష్ఠించినదానవు, పాశము - అంకుశము - ధనుస్సు - బాణము ధరించినదానవు, తలపై బాలచంద్రుని అలంకరించుకున్నదానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన కన్నులు కలదానవు, కోట్లాది బాలసూర్యుల వలే ప్రకాశించుచున్నదానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు, మునులచే ప్రార్థింపబడుదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

గన్ధర్వామరయక్షపన్నగనుతే గఙ్గాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే || 5 ||


గంధర్వులు, దేవతలు, యక్షులు మరియూ సర్పములచేత స్తుతించబడుదానవు. శివునిచే ఆలింగనము చేసికొనబడినదానవు. నిన్ను స్తుతించువారను రక్షించుదానవు. గరుడునిపై కూర్చున్నదానవు. కమలమునందు పుట్టినదానవు. నల్లనిదానవు. స్థిరమైనదానవు. ఆకాశమును అతిక్రమించినదానవు. దుష్టులనే కొయ్యలను తగులపెట్టు అగ్నిజ్వాలవు. కోట్లాదుసూర్యులవలె వెలుగొందుదానవు. మంత్రములచే ఆరాధించబడు దేవతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

నాదే నారదతుమ్బురాద్యవినుతే నాదాన్తనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనామ్బికే || 6 ||


నాదస్వరూపిణివి, నారదతుంబురాదులచే స్తుతించబడుదానవు, నాదముచివరనుండు అనునాదస్వరూపిణివి, నిత్యమైనదానవు, నల్లని లతవంటి శరీరముగలదానవు, సాటిలేనిదానవు, ధాన్యపుగింజ యొక్క మొన వలే సూక్ష్మమైనదానవు, మనోహరమైనదానవు, కామకళాస్వరూపిణివి, కదంబ (కడిమి చెట్ల) వనమునందుండుదానవు.  కామేశ్వరుని ఒడిలో కూర్చున్నదానవు. నా జ్ఞానస్వరూపిణివి, నా కోర్కెలుతీర్చు కల్పలతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే |
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనామ్బికే || 7||


వీణానాదము వినుచూ మూసిన అరమోడ్పుకన్నులుకలదానవు. కొంచెముగా జారిన కొప్పుగలదానవు. తాంబూలముచే ఎఱ్ఱనైన చిగురుటాకులవంటి పెదవికలదానవు. తాటంకములూ, హారములూ ధరించినదానవు. నల్లనిదానవు. చంద్రకళను శిరోభూషణంగా ధరించినదానవు. నొసటన కస్తూరీతిలకం ధరించినదానవు. పరిపూర్ణురాలవు. పూర్ణచంద్రునివలె అందమయిన ముఖముకలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరఞ్జనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనామ్బికే || 8 ||


శబ్దబ్రహ్మస్వరూపిణివి. చరాచరజగత్స్వరూపిణివి. జ్యోతిర్మయివి, వాఙ్గ్మయివి. నిత్యానందరూపిణివి, నిరంజనస్వరూపిణివి. ’తత్’, ’త్వం’ అను శబ్దములకు అర్థమయినదానవు. జ్ఞానమూర్తివి, తత్త్వములకి అతీతమైనదానవు. శ్రేష్ఠమైనవాటికంటే శ్రేష్ఠమైనదానవు. మాయాస్వరూపిణివి, లక్ష్మీస్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివస్వరూపురాలవూ అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీస్తోత్రం సంపూర్ణమ్ ||

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

 
శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు.

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాః
వసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥

అమ్మా! హిమాద్రితనయా! పార్వతీ! విల్లా, పూలవిల్లు. ఆ వింటికి తుమ్మెదలబారు నారి. అయిదే బాణములు, అవికూడా పుష్పబాణములు. మలయమారుత పవనము రథము, వసంతుడు సహాయకుడు. అయినప్పటికీ మన్మథుడొక్కడే, అమ్మా! నీ క్రీగంటి చూపు వల్ల చెప్పలేనంత కృపను పొంది, ఈ జగత్తంతటనూ జయించుచున్నాడు.

ఏమాత్రమూ బలం లేని ఆయుధములతో, శరీరమే లేని మన్మథుడు ప్రపంచమంతా జయిస్తున్నాడు. అతడికి అలాంటి శక్తి ఎవరు ఇస్తున్నారు ? అది అమ్మవారి క్రీగంటిచూపు. ఇదే ఈ శ్లోకముయొక్క సారాంశము.
మన్మథుడు ఒకప్పుడు అతిలోకసౌందర్యవంతుడు. తన సొంతశక్తిపై నమ్మకంతో అహంకరించి, ఈశ్వరునిచేతిలో భస్మమైనాడు. అమ్మవారు దయతో మరలా జీవితాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని ఈయలేదు. కేవలం తనభార్య రతీదేవికి మాత్రం కనపడే వరం ఇచ్చింది. అలాగే ఇటువంటి బలహీనమైన ఆయుధాలనూ ఇచ్చింది. వీటితో మన్మథుడు విజయం సాధించినా, అతడు వినయుడై ఆ విజయం తన స్వప్రతిభకాదనీ, అమ్మవారి కరుణ అనీ తలచుతునే ఉంటాడు. ఈశ్వరునిచేత తన శరీరమేకాక, గర్వముకూడా నశింపబడింది.

కాముని అమ్మవారు విజేతగా చేయటంతో మన కథ ఆగకూడదు. మనమూ కాముని గెలవాలి. ఈశ్వరుడు మన్మథుని దగ్ధంచేసినప్పుడు అమ్మవారు ఆయనలో ఉండి బలాన్నిచ్చినదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకూ కాముని గెలవటానికి ఆమె అనుగ్రహం కావాలి.

సగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనుగ్రహవర్షం కురిపించటము, మాయ యొక్క కృత్యము. దానికి ఒక్కక్షణము అమ్మవారి క్రీగంటిచూపు చాలు.

Wednesday 30 August 2017

శంకరస్తోత్రాలు : మనీషాపంచకం




శంకరస్తోత్రాలు : మనీషాపంచకం
పరమాచార్యులవ్యాఖ్యానంతో

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతే
యా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥


జాగ్రదవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తి అవస్థలలో ఏ చైతన్యము స్పష్టంగా వెలుగొందునో, ఏది బ్రహ్మమొదలుకొని చీమ వరకు అన్ని శరీరములలో వ్యాపించి జగత్సాక్షిగానున్నదో అదే నేను. కనబడు పదార్థము కాను. అని దృఢమైన జ్ఞానము ఎవనికి కలదో అతడు చండాలుడో లేక బ్రాహ్మణుడో అయిననూ అతడే గురువని నా అభిప్రాయము.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్ ।
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 2॥


బ్రహ్మ నేనే. ఈ ప్రపంచమంతా చైతన్యముతో వ్యాపించియున్నది. ఇదంతా సత్త్వరజస్తమోగుణాత్మకమైన అజ్ఞానంద్వారా నాచే కల్పించబడినది. అని ఎవడి మతి సుఖతరమైన, నిత్యమైన మరియు నిర్మలమైన పరబ్రహ్మయందు దృఢంగా ఉండునో అతడు చండాలుడైననూ లేక బ్రాహ్మణుడైననూ నాకు గురువే అని నా అభిప్రాయము.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజశాన్తాత్మనా ।
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ 3॥


ఈ ప్రపంచమంతా నశించునదే అని గురు వాక్యముచే నిశ్చయించుకొని, నిత్యమైన బ్రహ్మగురించి నిరంతరం ఆలోచిస్తూ , ప్రశాంతచిత్తుడనై, చేసిన మరియు చేయబోవు పాపమును జ్ఞానరూపమైన అగ్నిలో దహించేనేను, నా శరీరమును ప్రారబ్ధమనుభవించుటకై సమర్పించితినని అనుకొనుచున్నాను.

యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యన్తః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాన్తి స్వతోఽచేతనాః ।
తాం భాస్యైః పిహితార్కమణ్డలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ 4॥


ఏదైతే మృగములచే నరులచే మరియు దేవతలచే "నేను" అని అంతఃకరణంలో స్పష్టంగా గ్రహించబడుచున్నదో, దేని కాంతిలో హృదయము, ఇంద్రియములు మరియు అంతఃకరణము అను అచేతనములు స్వయంగా భాసించుచున్నవో, సూర్యకాంతులచే ప్రకాశించు మేఘముల ద్వారా కప్పబడిన సూర్యమండలమువలే వెలుగొందు ఆ స్ఫూర్తిని ఎల్లప్పుడు భావించుచూ ప్రశాంత చిత్తుడైన యోగియే గురువని నా భావన.

యత్సౌఖ్యామ్బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః ।
యస్మిన్నిత్యసుఖామ్బుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేన్ద్రవన్దితపదో నూనం మనీషా మమ ॥ 5 ॥


ఏ సుఖసముద్రలేశమాత్రముననే ఇంద్రాదులు సంతోషించెదరో, ప్రశాంతమైన మనస్సులో ఎవనిని ఎల్లప్పుడు ధ్యానించుచూ మునులు ఆనందించెదరో, ఆ నిత్యసుఖసముద్రంలో మునిగిన బుద్ధి కలవాడు బ్రహ్మమే. బ్రహ్మవేత్తకాడు. దేవేంద్రుడు అతడి పాదములను నమస్కరించునని నా అభిప్రాయము.

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మనీషాపఞ్చకం సమ్పూర్ణమ్ ॥

పరమాచార్యులవ్యాఖ్యానం : http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/7.html

 మనీషాపంచకం, అంతరార్థం

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.