Sunday 31 July 2016

కామేశ్వరీ కామేశ్వరులు : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-8




కామేశ్వరీ కామేశ్వరులు
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-8

మంత్రశాస్త్ర ప్రావీణ్యులకూ, సిద్ధులకూ, భక్తిమార్గం ద్వారా పండినవాళ్ళకూ అమ్మవారు అయిదుగురు దేవతలపై కూర్చుని సాక్షాత్కరిస్తుంది. రాజరికం ఉట్టిపడుతుండగా రాజరాజేశ్వరిగా కనిపిస్తుంది. ఆమె ఆసనం ఏంటి ? బ్రహ్మ, విష్ణు,  రుద్ర మహేశ్వరులు ఆ ఆసనమునకు నాలుగు కాళ్ళు. ఈ నాలుగు కాళ్ళనూ కలిపే పీఠం సదాశివుడు.

పంచకృత్యములూ నిర్వర్తించే బ్రహ్మాదులు ఆసనంగా కలిగిన అమ్మవారు - ఆ సంపూర్ణ బ్రహ్మ-శక్తి - కామేశ్వరి గా పిలువబడుతుంది. ఆమె యొక్క ఈ రూపంలో ఆమె భర్త , పరబ్రహ్మము, కామేశ్వరునిగా పిలువబడతాడు.

జగత్తులోని అన్ని కార్యకలాపములకూ ఆమెదే బాధ్యత అయినప్పుడు, ఆమెకు కామేశ్వరుడనే పేరుతో ఒక భర్త ఎందుకు ఉండాలి ?

అన్నీ ఆమెయే అయినప్పటికీ, ఆమె అనేక రూపములలో ఒకటి అయిన శ్రీవిద్యగా ఉన్నప్పుడు, ఆమె ప్రధాన లక్షణం మాతృత్వం. పిల్లవాడు తల్లిని ప్రేమతో పట్టుకుని వ్రేలాడినట్లు, ఆమెను మనం భక్తితో ప్రేమించాలి. ఆమె మహాశక్తి అయినప్పట్టికీ ఈ రూపంలో ఆమె శక్తి కాక సౌందర్యమూ, లావణ్యమూ ప్రధానముగా వ్యక్తమవుతుంది. అందుకనే "శ్రీమాతా" అని ఆమెకు లలితా సహస్ర నామములలో మొదటిపేరు. ఆమె మనను సృష్టి చేస్తుంది, రక్షిస్తుంది, జన్మల మధ్యలో సంహరించి విశ్రాంతినిస్తుంది. మాయతెరతో లీలావినోదం చేస్తుంది. చివరికి, తల్లిగా, ముక్తిని ప్రసాదించి తనలో కలిపివేసుకుంటుంది.  ఆమె తల్లిగా ఉన్నప్పుడు, తండ్రిగా ఎవరైనా ఉండాలి కదా. తండ్రి లేకుండా తల్లి ... జగన్మాతను మనం వేరువిధంగా అనుకోగలమా ? ఆమెయే బాలాదేవి, ఆమెయే కన్యాకుమారి, కానీ అది వేరే సంగతి. అలాగే దుర్గ రూపంలో వచ్చి ఆసురీశక్తులను నశింపజేసినప్పుడూనూ. (ఇప్పుడు మనం చెప్పుకుంటున్న) అమ్మవారు తల్లి, శ్రీమాత. కాబట్టి ఆమెకోసం ఒక తండ్రి కావాలి. అందుకనే మనకు కామేశ్వరుడు (కామేశ్వరి కోసం) భర్త గా ఉన్నాడు. అందుకనే, ప్రపంచధర్మాన్ని అనుసరించి, అతనికి ఉన్నత స్థానం ఇవ్వబడింది.  లలితా త్రిశతి కామేశ్వరుడి భార్యగా అమ్మవారికి 15 నామములు చెబుతుంది.

ఆమె, రాజరాజేశ్వరి, లలిత, త్రిపురసుందరి మొదలైన పేర్లతో పిలువబడినప్పటికీ కామేశ్వరి అనే పేరుకు ఒక విశిష్టత ఉంది. శైవ సాంప్రదాయంలో శివుడు శక్తితో కలసిఉన్నట్లు ఎలా చెప్పబడతాడో, శాక్త సంప్రదాయములోనూ, శ్రీవిద్యా తంత్రములోనూ, ఆమె, శక్తి, తన భర్త అయిన శివునితో కలసి ఉన్నట్లు చెప్పబడుతుంది. అవిభాజ్యమూ, సంపూర్ణమూ అయిన బ్రహ్మ-శక్తి యొక్క భర్త ఎవరు కాగలరు ? బ్రహ్మ-శక్తి తప్ప వేరొకటి లేనప్పుడు ఎవరు భర్త కాగలరు ? ఈ ప్రశ్న విషయమై మీరు కొంత ఆలోచిస్తే, నిశ్చల నిర్గుణ బ్రహ్మము, తన శక్తిని అంతర్లీనంగా ఉంచి ఆ శక్తికన్నా వేరుగా అగుపించే శివుడే ఆమెకు భర్త కాగలడని తెలుస్తుంది. అంటే, పంచకృత్యములకూ బాధ్యురాలైన భార్య ద్వారా తన శక్తిని శివుడు ప్రకటిస్తున్నాడని అర్థం. తన శక్తిని నేరుగా ప్రదర్శించకపోయినా, నిష్క్రియాపరత్వం వహించినా, శివుడు,  తన శక్తి బహిర్గతం చేయాలని (కార్యనిర్వహణ చేయాలని) కాంక్షిస్తున్నాడనీ తెలుస్తుంది.

తైత్తరీయ ఉపనిషత్తు ఈ విధంగా చెబుతుంది " ఆ ఏకైక బ్రహ్మము అనేకములు అవవలెనని కోరుకున్నది". నిశ్చల బ్రహ్మము, క్రియాశీలి అయిన బ్రహ్మముగా మారినప్పుడు, అలా క్రియాశీలంగా అవాలనే కోరిక ఉండి ఉండాలి కదా ? "అకామయత" "కోరుకున్నది" అనే పదం ఉపనిషత్తులోనిదే. జ్ఞానశక్తి అంతర్లీనంగా ఉన్న బ్రహ్మము లేదా శివము , ఆ శక్తిని - "బ్రహ్మ-శివ-శక్తిని" - ప్రకటించి, జగద్వ్యాపారం నిర్వహించాలని కోరుకున్నది. దీనిని "ఇచ్చాశక్తి" అంటారు.  పంచకృత్యములను నిర్వహించే శక్తి "క్రియాశక్తి". సరే. మనం ప్రస్తుత విషయానికి వద్దాము. బ్రహ్మము తనంతట తను బహిర్ముఖమైనప్పుడు మొదట తనకు కోరిక పుడుతుంది. ఉపనిషత్తు దానిని "కామము" అంటుంది. ఈ పదానికి అసహ్యకరమైన అర్థమేమీ లేదు. "స్వచ్చమైన కాంక్ష" అని ఇక్కడ అర్థము. (శారీరకవాంఛలతో సంబంధములేని కోరిక). బ్రహ్మమునుండి, సంపూర్ణమైన బ్రహ్మ-శక్తినుండి తొలుత కామము ఉద్భవించింది,  బ్రహ్మమునుండి పుట్టి, దాని కన్నా భిన్నంగా ఉన్న తొలి వస్తువు అది. ఈ కామమే అతడి భార్య అయినది. తండ్రి, తల్లి ఏకమై ప్రజలకు జన్మనిచ్చినట్లు, ఈ జగత్తు నడిపే లీలావినోదం అంతా జడబ్రహ్మమైన శివుడు, ఇచ్చాశక్తులు ఏకమవడము యొక్క ఫలము, పంచకృత్యములు కూడా అంతే. కాబట్టి వీరిద్దరూ భార్యాభర్తలయ్యారు. అమ్మవారు ఆయన కామము యొక్క స్వరూపము కాబట్టి ఆమె కామేశ్వరి అయ్యింది.

అది (కామేశ్వరి) మెదటి పేరు. పరబ్రహ్మమునుండి తొలుత ఉద్భవించినది "కామము" కాబట్టి, తదనుసరించి వచ్చిన పేరు "కామేశ్వరి" అనునది బ్రహ్మ-శక్తి యొక్క ముఖ్యమైన నామము అయ్యిఉండాలి. కోరిక ఉన్నవాడు కామేశ్వరుడు. పరబ్రహ్మము కోరిక ప్రకటించడం తప్ప వేరొకటి చేయలేదు. ఈ కోరికను క్రియారూపంగా మార్చి పంచకృత్యములనే జగత్క్రీడ నిర్వహించడం, పూర్తిగా శక్తిదే. విక్టోరియా, ఎలిజబెత్తుల వలె కామేశ్వరికి సార్వభౌమాధికారం ఉంది. శక్తి అన్ని భువనాలనూ, జీవరాశినీ, దేవతలనూ పాలిస్తుంది. పాలించే ప్రభువు యొక్క భార్యను మనం "రాణి" అని వ్యవహరించలేము. రాణి తను పాలించగలిగి ఉండాలి. లలితా సహస్ర నామములలో తొలిపేరైన "శ్రీమాతా" (మనం ఆప్యాయంగా తల్లి అనుకుంటాం), తరువాతి రెండు నామములూ సామ్రాజ్ఞియై అన్ని భువనములపై ఆధిపత్యం ఉన్న ఆ దేవి జగత్సార్వభౌమత్వాన్ని సూచిస్తాయి. ఆ నామములు - "శ్రీమహారాజ్ఞీ" మరియూ "శ్రీమత్సింహాసనేశ్వరీ".

అమ్మవారు సింహాసనమునధిష్టించడము అనేది ఒక అంశము. కానీ రాజులూ, రాణులూ అందరూ సింహాసనముపై కూర్చుంటారు కదా. నేను మీకు ఇదివరలో చెప్పినట్లు, గమనించవలసిన అంశమేమంటే - అమ్మవారికి ’పంచబ్రహ్మాసనమనే’ విశేష సింహాసనము ఉన్నది. ఆమె దానిపై కామేశ్వరిగా కూర్చుంటుందనీ, ఒక్కత్తెయే కాక కామేశ్వరునితో సహా కూర్చుంటుందనీ కూడా మీకు చెప్పాను. ఆమె ఆ పంచబ్రహ్మాసనము మీద కామేశ్వరుని అంకము (తొడ) పై కూర్చుంటుంది. కాబట్టి అతడూ ఆమెకు ఆసనమే అవుతాడు.

పరబ్రహ్మమునుండి జగల్లీలావినోదం నడుపుటకు తొలుత కామము జనించింది. కాబట్టి ఆదిదంపతులకు కామేశ్వరీ కామేశ్వరులనే నామములు ఇవ్వబడ్డాయి.

అమ్మవారిని లలితాంబ అంటాము. ఆయనను లలితేశ్వరుడని వ్యవహరించము. లలిత అంటే సున్నితత్వం, సౌకుమార్యం, మృదుత్వం. స్త్రీత్వం వహించి ఆమె అలా ఉండవచ్చు. ఆయన కాదు. అలాగే ఆమె రాజరాజేశ్వరి అని పిలువబడినా ఆయనకు రాజరాజేశ్వరుడనే పేరు లేదు. తంజావూరులో రాజరాజేశ్వరం ఉన్నది, కానీ ఆ పేరు ఆ దేవాలయం నిర్మించిన రాజు పేరు (రాజరాజచోళుడు) నుండి వచ్చింది. ఆ దేవాలయమును దేవుని పేరుననుసరించి బృహదీశ్వరాలయమని పిలుస్తారు. ఆమె మహారాజ్ఞి, జగత్తును పాలించటానికి ఏకైక అధికారి కాబట్టి రాజరాజేశ్వరితో జతకట్టడానికి రాజరాజేశ్వరుడు లేడు. విక్టోరియా రాణి భర్త ఆల్బర్ట్ వలె, ఎలిజబెత్ -2 రాణి భర్త ఫిలిప్ వలె మహారాజ్ఞి భర్త ఉంటారు. ఈ పోలిక కూడా సరికాదు. విక్టోరియా రాణి, లేదా ప్రస్తుత రాణి ఎలిజబెత్ , పార్లమెంటుకు జవాబుదారీ. రాజరాజేశ్వరి సర్వస్వతంత్ర సార్వభౌమ శక్తి.

అమ్మవారు పాలకురాలు. మహారాజ్ఞి. అందుకే ఆమెను రాజరాజేశ్వరి అని పిలుస్తారు. ఆమె భర్తకు పాలనాధికారం లేదు. కాబట్టి ఆయనను రాజరాజేశ్వరుడనలేము. అమ్మవారికి త్రిపురసుందరి అనే నామము ఉన్నది. మీతో చెప్పినట్లు ఈ త్రిపురసుందరియే సౌందర్యలహరియందలి విషయము. త్రిపురసుందరితో జతకట్టడానికి త్రిపురసుందరుడు లేడు. త్రిపురసుందరి యొక్క సౌందర్యం సర్వశ్రేష్ఠము. ముల్లోకాలలోనూ ఆమె వంటి సౌందర్యం వేరెవరకూ లేదు. శివుని అందం ఆమెతో పోల్చదగినది కాదు. కాబట్టి ఆయనను త్రిపురసుందరుడు అని అనరు. ఆమె సౌందర్యం సర్వశ్రేష్ఠము అన్న తరువాత ఆ మాటయే ఆయనకూ ఎలా చెప్పగలము ? ఎంత అందగాడైనా సరే, ఆమె తరువాతయే. కాబట్టి ఆయన త్రిపురసుందరుడు కాదు.

ఒండొరులపై వాంఛ జనించటానికి, ఇద్దరు కావాలి. కాబట్టి మనకు అందమైన జంట కామేశ్వరీకామేశ్వరులు ఉన్నారు. ఆమె, పరబ్రహ్మము యెక్క సంపూర్ణ శక్తియై, పరబ్రహ్మము ప్రకటించిన కామమునకు సంబంధించినది కావున కామేశ్వరి అని పిలువబడుతూ, తన భర్త అయిన కామేశ్వరునితో కలసి పంచబ్రహ్మాసనముపై కూర్చుని, జగన్నాటకమనే తన లీలను నడుపుతోంది.

(సశేషం)

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.