Sunday 17 September 2017

శివుడు మిమ్ము రక్షించుగాక



కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం
మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్
పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలం
క్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః


రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా, ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా, కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున చొరగా, వాసుకి కోపముతో చూచుచుండగా,  శివుడు (కోపముతో) కాలితో అదుముటచేత రావణుడు పాతాళమునకు పోవుచుండగా, (రావణునిపై) కోపించినవాడయ్యునూ పార్వతిచేత భయమువలన గట్టిగా ఆలింగనము చేసికోబడ్డవాడై ఆనందించిన శివుడు మిమ్ము రక్షించుగాక.

గౌరి మీకు మంగళముకలిగించుగాక.



ధూమవ్యాకులదృష్టి రిన్దుకిరణైరాహ్లాదితాక్షీ పునః
పశ్యన్తీ వరముత్సుకా నతముఖీ భూయోప్రియా బ్రహ్మణః
సేర్ష్యా పాదనఖేన్దుదర్పణగతే గఙ్గాం దధానే శివే
స్పర్శాదుత్పులకా కరగ్రహవిధౌ గౌరీ శివా యాస్తు వః


పార్వతీ పరమేశ్వరుల వివాహమందు వివాహాగ్నియొక్క పొగ వలన అమ్మవారి కళ్ళు వ్యాకులత చెందగా శివుని శిరసునందున్న బాలచంద్రుడు తన కిరణములతో అమ్మవారి కళ్ళకు ఆహ్లాదము కలిగించెనట. అమ్మవారు మరల శివుని చూచుటకు ప్రయత్నింపగా ఆ ప్రయత్నమును బ్రహ్మ గమనించెనని ఎరిగి సిగ్గుమొగ్గయై తలవంచుకొని కూర్చొనెనట. చంద్రునివలె ప్రకాశించునదీ అద్దమువలెనున్నదీ అగు తన కాలిగోటియందు ప్రతిఫలించిన శివుని చూచుతూ, గంగనూ చూచి కించిత్తు ఈర్ష్యనందెనట. ఇంతలో పాణీగ్రహణమునందలి శివుని స్పర్శచేత పులకింతనొందెనట. అట్టి గౌరీదేవి మీకు మంగళము కలిగించుగాక.

Friday 8 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష




పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష
(జగద్గురుబోధలనుండి)

అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.

సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.

అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూ శివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.

మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని,
నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే.


'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటే అన్న తీర్మానమే నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.

దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభమైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.

అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం
ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,
ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ కాలమాత్మ
ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.


శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.

దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు. అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.

యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,
తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,

ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.

అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టంవస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు. ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.

Thursday 7 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు



పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు
(జగద్గురు బోధలనుండి)

దైవభక్తి ఆవశ్యక మని చెప్పడ మెందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసికోవడానికే. అట్టి ఆత్మసాక్షాత్కారానికై మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుష్యులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లయినా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి సాధనం.

ఇపుడు మనుష్యులకు అక్కఱ లేని అనే ప్రశ్న వస్తుంది. 'ఛాయా తోయం వసన మశనం' అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోడానికి ఒక గుడ్డ. ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోడానికి ఈ నాలుగున్నూ పరికరాలు. ఇవి అన్నీ భూమినుండి ఉత్పన్నమవుతై. నీ రిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోడానికి మన్ను సున్నం దారువు లోహం ఇత్యాదులు భూమిలోనుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు. ఇవన్నీ భూమినుండి వచ్చేవే. కడపట మనము కలిసేదికూడా ఆ భూమిలోనే.

సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మానరక్షణకోసం మనం బట్టలుకట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలువలు కట్టుకొనకపోతేయేం? అట్లా కట్టుకుంటేనేగాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయంగాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగలవానిని కట్టుకోవడంచేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా?

ఒక కుటుంబం, వెలగల వలువలకై చెసే ఖర్చుతో దాదా పయిదు కుటుంబాలకు కావలసిన సాధారణాలయిన బట్టలు దొరుకుతై. ఆడంబరంకోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయివుంటే అవి మనకు పాపాన్నే పోగుచేసి పెడతై. వీని కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెపుతూ మనం మాంసం ముట్టం. కాని మాంసాహారానికయితే ఏ ఒక జీవానికో హింస. పట్టుబట్టకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనము కట్టుకొనే బట్టలు సాధ్యమయినంతవరకు హింసచేయకుండా ఉండే ఉపాయాలవల్ల ఉత్పత్తి అయేవిగా చూచుకోవాలి. మనము కట్టె బట్టలు సాధారణు లందరూ కట్టుకొనేటటువంటివిగానూ గట్టివిగానూ ఉండాలి.

ప్రజలందరూ సుఖంగా బతకటానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కాని లేమికిమాత్రం దినదినాభివృద్ధి. ప్రజల ఆర్థికజీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు: దానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఇదివరకు రెండుసార్లు కాఫీ తాగేవారిప్పుడు నాలుగు సారులు కాఫీ తాగడం. గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం. రెండు బట్టలతో కాలం గడిపేవారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకోడం. ఆర్థికజీవ నాభివృద్ధికి ఇవి గుర్తు లని అనుకోవడం సరికాదు. మనకు కావలసినవస్తువు లన్నిటినీ ఇలా పెంచుకుంటూనేపోతే దేశంలో ఎపుడూ లేబరమే తాండవిస్తూవుంటుంది. మానప్రాణాలు కాపాడుకోవడాని కేవి తప్పనిసరో అట్టివి అందరకూ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమయిన చట్టాలుండాలి. ఆలాటి స్థితి కలగాలి, అది సవ్యమయినది. అని అనుకుంటే పరమదరిద్రులు తమ జీవితం ఎల్లా గడుపుకొంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహంలేని దోషం ఉండేటంతవరకూ ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యంకోరేవారు తమతమ అవసరాలు మించి ఒకింతయినా పరిగ్రహం చేయరాదు. కలిగినవారు లేనివారికి సాయంచేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈసంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరినిచూచి లేనివారుగూడా వారివలె తిరగడానికి ప్రయత్నిస్తారు, అట్లా వారిని అనుకరించి అప్పులపాలవుతారు. పట్టుపుట్టాలవారు. చెడిన తరగతిలోనివారే. ఇక వజ్రాల నగలవారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దుబారా. కన్యాం 'కనకసంపన్నాం' అని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారంకోసం డబ్బువెచ్చపెట్టి నగగా పెట్టుకొన్నా ఏనాటికయినా అది ఉపయోగపడుతుంది. కాని వజ్రాలకు ఇట్టి ప్రయోజనంలేదు. సరికదా ఉపద్రవం కావలసినంత. ఏబది, నూఱేండ్లక్రితం మనపూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే చెవులకు తాటికమ్మలే. తాగేది రాగిగంజో బియ్యపుగంజో. బ్రతుకుతెరువులో ధనికులకూ దరిద్రులకూ పెద్ద భేదమేమీ ఉండేదికాదు.

'ఇకమీద కాఫీతాగను, పట్టుబట్టలు కట్టను' అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలేధనంతో అయిదు కుటుంబాలు సుఖంగా బ్రతుకుతై. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించినకొద్దీ శాంతీ ఉండదు. సౌఖ్యమా ఉండదు. ఇట్టి దుబారావల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖంతప్పదు. కాఫీనీ పట్టుబట్టలనూ వదలిపెడితే అన్ని కుటుంబాలూ బాగుపడతై. ఇదేకాదు, పట్టుబట్టలకోసం చేసేపాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేక పోతుంది. అష్టాంగయోగంలో మొదటిదే అపరిగ్రహం, అహించ అనేవి. ఏ ప్రాణికిన్నీ మనవల్ల హింసకలుగరాదు. డబ్బు ఉందికదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చేయరాదు. అట్లాచేసే వ్యయంతో లేమితో కొట్టుకోనే వారి అవసరాలు తీర్చవచ్చు, అలాచేస్తేనే, చేయడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మసాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగయోగానికి మొదటిసోపానం అది దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికే దీనిని చెప్పడం.

పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?


పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?
(జగద్గురు బోధలనుండి)

భక్తి అంటే భక్తుని హృదయం వేరే ఇంకో ప్రయోజనం కోరక సదా పరమాత్మ స్వరూప సాయుజ్యం కోసమే నిరీక్షించడం. దాని కేదయినా కారణం ఉంటే భక్తికాదు. ఈశ్వరునిమీద అవ్యాజమయిన అనురాగం తనంతట తానుపుట్టుకొనిరావాలి. సకారణంగా వచ్చేది ప్రేమకాదు. అదేభక్తి. సర్వమూ పరమాత్మ స్వరూపమే. పరమాత్మతో యోగం లేనంతవరకూ శాంతికీ ఆనందానికీకరవే.

సదాశివబ్రహ్మేంద్రులు మానసిక పూజచేస్తూ- ’ఈశ్వరా! నిన్ను పూజించడానికి కూచున్నాను. కాని నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీ కెట్లా పూజ చేయడం? అది వీలయిన పనా? నీఆరాధన చేయ డమెట్లా? నీవు ఒక దిక్కున ఒకచోటనే ఉంటే కదా నీవు ఇక్కడనే ఉన్నా వని నమస్కారం చేయడం? నీవు వెనుకా ముంగలా ప్రక్కలా పైనా కిందా ఎల్లయెడలా సర్వాంతర్యామివై ఉన్నావు. నేను నీపాదాలను ఎక్కడ ఉన్నవని చూచినమస్కరించను? పోనీ! ఎక్కడనో నీ పాదాలున్నవని నమస్కరిస్తే ఆ పాదాల వెనుక నీవులేవు అని కదా అర్థం. అలా అయితే నీపూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసికొన్నవాడనే కదా! నీ చరణములను కడుగుటకు పంచపాత్రనుండి ఒక ఉద్ధరిణలో నీళ్ళు కింద పోస్తామా. నీవు ముల్లోకాలనూ మూడడుగులతో కొలచిన త్రివిక్రముడవి కదా! నీ పాదాలను అణుమాత్రమయినా ఈనీళ్ళు తడపగలవా? పాదాలను పూర్తిగా కడగక వదలుట అపచారం కాదా ప్రభూ?

'భూః పాదౌ యస్య నాభిః’. దిగంబరుడవయిన నిన్ను ఈ చిన్న వస్త్రముతో అలంకరింపగలనా? నే నేమి పూజ చేయను తండ్రీ! నే నేమని ప్రార్థంపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు. నీవు సర్వజ్ఞుడవు. ప్రార్థన అంటూ చేసి నీసర్వజ్ఞత కొక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీవద్దలేని ఏదో ఒక వస్తువును నే నడుగలేదు. కొత్త వస్తువును ఏదే నొకదానిని నే నడిగితే నీవు దాతవు నేను ప్రతిగ్రహీతను అయిపోతాం. నీవు అఖండానందస్వరూపడ వని శ్రుతులు చెపుతున్నవి. నేనో ఇలా కోరికలతో కొరతలతో ఉన్నాను. ఈ స్థితిని మాన్పి నా స్వరూపం నా కియ్‌. నన్నే నా కియ్‌.’ అని చెప్పారు.

'నన్నే నా కియ్‌.’ అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నా కియ్‌’ అని

యాచే నాఽభిసవం తే చంద్రకలోత్తంస! కించి దపి వస్తు,
మహ్యం దేహి చ భగవన్‌ మదీయ మేవ స్వరూప మానందమ్‌.


ఇట్లా మన స్వరూపాన్నే మనం వదలి ఉన్నపుడు క్షణం కూడా సహించరాని తాపం తలగాలి, ’పరమాత్మ స్వరూపంతో మనమే క్షణం ఐక్యం అవుతాం ?’ అనే చింతతాపమూ ఇవి కలగాలి. మనం మనంగా ఉండాలంటే పరమాత్మతో కలిసి ఉండడమే. అదే ఆనందస్వరూపం. పరమయిన పరమాత్మ స్వరూపం. తక్కినవన్నీ దేహాత్మ స్వరూపాలు భ్రాంతిజనితాలు. ఆ సత్యవస్తువుతో ఐక్యమై ఉండడమే పరమయిన ఆ ఆత్మస్వరూపం. అలలవలె, నురుగువలె వేరొకటి వచ్చి కలిస్తే సహించరాని, తాళుకోలేని ప్రేమ మనకు పుట్టుకోరావాలి. ’ఆ సత్యవస్తు దర్శనం ఎన్నడు? దానితో యోగం ఎన్నడు? అనే చింత సదా ఏర్పడాలి. అదే భక్తి.

Wednesday 6 September 2017

శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్



|| శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ ||

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే |
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||

మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః |
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2||

ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను.చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3||

నాకు ద్వేషము- అనురాగము లేవు. నాకు లోభము - మోహము లేవు. మదము లేదు. మాత్సర్యము లేదు. ధర్మము లేదు. అర్థము లేదు. కామము లేదు. మోక్షము లేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4||

నాకు పుణ్యము లేదు పాపము లేదు. సుఖము లేదు. దుఃఖము లేదు. మంత్రము లేదు. తీర్థము లేదు. వేదములు లేవు. యజ్ఞములు లేవు. నేను భోజనము కాను. తినదగిన పదార్థము కాను. తినువాడను కాను. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5||

నేను మృత్యువును కాదు. సందేహము లేదు. నాకు జాతిభేదము లేదు. నాకు తండ్రిలేడు, తల్లిలేదు, జన్మలేదు, బంధువులేడు, మిత్రుడు లేడు. గురువులేడు, శిష్యుడులేడు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేన్ద్రియాణామ్ |
సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 6||

నేను నిర్వికల్పుడను. ఆకారము లేనివాడను. అంతటావ్యాపించి ఉన్నాను. అన్ని ఇంద్రియములతో నాకు సంబంధములేదు. మోక్షములేదు. బంధములేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నిర్వాణషట్కం సమ్పూర్ణమ్ ||

Sunday 3 September 2017

శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ


|| శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ ||

కిం జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే |
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే
కిం తత్రాహమతో భవాన్పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో ||


గురువు శిష్యుని ప్రశ్నించెను:
వత్సా!వస్తుప్రకాశకమగు జ్యోతి ఏదియని నీ అభిప్రాయము?
శిష్యుడు: పగలు సూర్యుడును, రాత్రి ప్రదీప చంద్రాదులును.
గురువు: అగుచో సూర్యప్రదీపాదులను గుర్తించు జ్యోతి ఏది?
శిష్యుడు: నేత్రము.
గురువు: కళ్ళుమూసుకొనినప్పుడు ఏది జ్యోతియగుచున్నది?
శిష్యుడు: బుద్ధి.
గురువు: ఈబుద్ధిని జూచునదేమి?
శిష్యుడు: నేను,(అనగా ఆత్మయే). కనుక తమరు మరియు నేను, ప్రభూ! ఆ పరంజ్యోతియే అని గుర్తించితిని.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ ఏకశ్లోకీ సమ్పూర్ణా ||

Saturday 2 September 2017

శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్


|| శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్ ||

లబ్ధా విద్యా రాజమాన్యా తతః కిం
ప్రాప్తా సమ్పత్ప్రాభవాఢ్యా తతః కిమ్ |
భుక్తా నారీ సున్దరాఙ్గీ తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 1||


రాజమాన్యతనుబొందించు విద్య లభించినది, ఫలమేమి? ప్రభుశక్తితో కూడిన సంపదను పొందినను ఫలమేమి? సుందరాంగియగురమణితో భోగమును అనుభవించినను ఫలమేమి?  ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. అట్టిచో ఇవి అన్నియును వ్యర్థములే!

కేయూరాద్యైర్భూషితో వా తతః కిం
కౌశేయాద్యైరావృతో వా తతః కిమ్ |
తృప్తో మృష్టాన్నాదినా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 2||


ఏవ్యక్తి ఆత్మసాక్షాత్కారమును పొందలేదో, అతడు కేయూరాది - అలంకారములవలన భూషితుడైనను, పట్టుపుట్టములను కట్టినను, మధురాన్నాదులవలన తృప్తినందినను ఫలమేమి?

దృష్టా నానా చారుదేశాస్తతః కిం
పుష్టాశ్చేష్టా బన్ధువర్గాస్తతః కిమ్ |
నష్టం దారిద్ర్యాదిదుఃఖం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 3||


మనోహరములగు పెక్కుదేశములను వీక్షించినాడు, ఇష్టులగు బంధువర్గమును పోషించినాడు, దారిద్ర్యమును నశింపచేసికొనినాడు. కాని, ఆత్మసాక్షాత్కారమునందలేదు , లాభమేమి?

స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం
దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతః కిమ్ |
జప్తా మన్త్రాః కోటిశో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 4||


ఎవనికి ఆత్మస్వరూపదర్శనము లభింపలేదో అతడు గంగాదితీర్థముల స్నానమొనర్చిన నేమి ఫలము? షోడశదానముల నొనర్చిన ఏమి ఫలము? కోటి మంత్రజపమొనర్చిన ఏమి ఫలము?

గోత్రం సమ్యగ్భూషితం వా తతః కిం
గాత్రం భస్మాచ్ఛాదితం వా తతః కిమ్ |
రుద్రాక్షాదిః సద్ధృతో వా తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 5||


గోత్రము(వంశము)అలంకృతమైనది. గాత్రము భస్మాచ్ఛాదితమైనది, రుద్రాక్షాదులు చక్కగ ధరింపబడినవి. కాని ఆత్మానుభవములేదు. వీని వలన కలుగు ఫలమేమి?

అన్నైర్విప్రాస్తర్పితా వా తతః కిం
యజ్ఞైర్దేవాస్తోషితా వా తతః కిమ్ |
కీర్త్యా వ్యాప్తాః సర్వలోకాస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 6||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు విప్రులను అన్నభోజనముతో సంతోషపెట్టగ కలుగు ఫలమేమి? యజ్ఞమున దేవతలను సంతోషపరచిన ఫలమేమి? కీర్తితో సర్వలోకములను వ్యాపింపచేసిన కలుగు ఫలమేమి?

కాయః క్లిష్టశ్చోపవాసైస్తతః కిం
లబ్ధాః పుత్రాః స్వీయపత్న్యాస్తతః కిమ్ |
ప్రాణాయామః సాధితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 7||


ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. ఉపవాసములొనర్చి, కాయక్లేశ మొనర్చిన లాభమేమి? స్వభార్యవలన పుత్రులను బడసిన లాభమేమి? ప్రాణాయామమును సాధించిన ఫలమేమి?

యుద్ధే శత్రుర్నిర్జితో వా తతః కిం
భూయో మిత్రైః పూరితో వా తతః కిమ్ |
యోగైః ప్రాప్తాః సిద్ధయో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 8||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు యుద్ధమున శత్రువులను నిర్జించినను, మిత్రులతో నిండియున్నను, యోగసిద్ధులను పొందినను లాభమేమి?

అబ్ధిః పద్భ్యాం లఙ్ఘితో వా తతః కిం
వాయుః కుమ్భే స్థాపితో వా తతః కిమ్ |
మేరుః పాణావుద్ధృతో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 9||


సముద్రమును అడుగులతో దాటినను, వాయువును కుంభకప్రాణాయామమున నిల్పినను, మేరువును చేతితోనెత్తినను, ఆత్మసాక్షాత్కారము నందకుండిన లాభమేమి?

క్ష్వేలః పీతో దుగ్ధవద్వా తతః కిం
వహ్నిర్జగ్ధో లాజవద్వా తతః కిమ్ |
ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 10||


విషమును పాలవలె త్రాగగలడు, నిప్పులను పేలాలవలె తినగలడు, పక్షివలె ఆకసమున తిరుగగలడు, కాని ఆత్మసాక్షాత్కారము నందలేదు, ఫలమేమి ?

బద్ధాః సమ్యక్పావకాద్యాస్తతః కిం
సాక్షాద్విద్ధా లోహవర్యాస్తతః కిమ్ |
లబ్ధో నిక్షేపోఽఞ్జనాద్యైస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 11||


అగ్న్యాదులను లోబరుచుకొనిననూ, సుదృఢలోహములను విరచిననూ, అంజనాదులవలన ధననిక్షేపములను పొందిననూ, ఆత్మసాక్షాత్కారమొనర్చుకొననియెడల లాభమేమి?

భూపేన్ద్రత్వం ప్రాప్తముర్వ్యాం తతః కిం
దేవేన్ద్రత్వం సమ్భృతం వా తతః కిమ్ |
ముణ్డీన్ద్రత్వం చోపలబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 12||


ఉర్వియందు రాజేంద్రత్వము లభించినది. లాభమేమి ?  స్వర్గమున దేవేంద్రత్వము లభించినది. లాభమేమి ? వనమున యతీంద్రత్వము లభించినది, లాభమేమి ? ఆత్మసాక్షాత్కారము లభింపకుండిన ?

మన్త్రైః సర్వః స్తమ్భితో వా తతః కిం
బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిమ్ |
కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 13||


మంత్రబలమున సమస్తమునూ స్తంభింపచేసిననూ, బాణముతో లక్ష్యమును భేదించిననూ, కాలజ్ఞానమును బడసిననూ, ఆత్మసాక్షాత్కారమొక్కటి లేకుండినచో మిగిలినవన్నియునూ వ్యర్థములు.

కామాతఙ్కః ఖణ్డితో వా తతః కిం
కోపావేశః కుణ్ఠితో వా తతః కిమ్ |
లోభాశ్లేషో వర్జితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 14||


కామావేశము ఖండింపబడినది. కోపావేశము కుంఠితమైనది. లోభపరిష్వంగము వర్జింపబడినది. అయిననూ ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. లాభమేమి ?

మోహధ్వాన్తః పేషితో వా తతః కిం
జాతో భూమౌ నిర్మదో వా తతః కిమ్ |
మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 15||


మోహాంధకారము నలుగగొట్టబడినది. పృథ్వియందు గర్వరహితుడేయైనాడు. మాత్సర్యపీడ ప్రశమితమైనది. అయిననూ ఆత్మదర్శనములభింపకుండిన వీనివలన లాభమేమి ?

ధాతుర్లోకః సాధితో వా తతః కిం
విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిమ్ |
శంభోర్లోకః శాసితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 16||


బ్రహ్మలోకము సాధించిననూ, విష్ణులోకమును వీక్షించిననూ, శివలోకమును శాసించిననూ,  ఆత్మలోకమును సాక్షాత్తుగ చూడకుండిన లాభమేమి ?

యస్యేదం హృదయే సమ్యగనాత్మశ్రీవిగర్హణమ్ |
సదోదేతి స ఏవాత్మసాక్షాత్కారస్య భాజనమ్ || 17||


ఎవనిహృదయమున సంపూర్ణముగ ఈ రీతిగ ఎల్లప్పుడునూ అనాత్మవస్తుసౌందర్యనింద ఉదయించుచుండునో, అతడే ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు.

అన్యే తు మాయికజగద్భ్రాన్తివ్యామోహమోహితాః |
న తేషాం జాయతే క్వాపి స్వాత్మసాక్షాత్కృతిర్భువి || 18||


మిగిలినవారు, జగత్భ్రాంతివ్యామోహమోహితులు. వారికి జగత్తున ఎన్నడునూ ఆత్మసాక్షాత్కారము లభింపదు.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అనాత్మశ్రీవిగర్హణం సమ్పూర్ణమ్ ||

శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్



|| శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్ ||

చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 1||


చంచలములు - ఎర్రనివి - దయతో నిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగా ధరించినది, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచమునంతటినీ సంరక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగపువ్వు వంటి ముక్కు చివరన ముత్యమును అలంకరించుకున్నది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2||


కస్తూరీ తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము - వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షములద్వార వర్షించు కృపారసములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ |
రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 3||


మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులుకలది, బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామరరేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడా శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 4||


నక్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్య అయినది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చక్రములలోనుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితాత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గన్ధర్వకన్యాదృతామ్ |
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 5||


విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రమునందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమన్తభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 6||


అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీలతలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనపుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 7||


ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారియందు ప్రసన్నమైన హృదయము కలది, ఒడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 8||


కర్పూరము - అగరు - కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్నివిధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలమునందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలంకృతామ్ |
గఙ్గాగౌత్మగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 9||


స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశమునందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - గౌతమమహర్షి - గర్గుడు మొదలైన వారిచే స్తుతింపబడు పాదములు కలది, గోవు - గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం సమ్పూర్ణమ్ ||

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/09/blog-post_59.html
 

పరమాచార్యుల అమృతవాణి : ఉపన్యాసముల సంకలనము

 
పరమాచార్యులు, పరమపూజ్యనీయులు సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి కొన్ని ఉపన్యాసముల సంకలనము, తెలుగులో. 1937లో అచ్చొత్తించిన పుస్తకము


https://archive.org/download/in.ernet.dli.2015.386935/2015.386935.Sri-Chandrashekarendra.pdf


భక్తులందరితో పంచుకోగలరు.

Friday 1 September 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శ్రీ మహాగణాధిపతయే నమః



పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు.

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥


తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.

ఈ భూమిలో అమ్మవారిని దక్షిణాన కన్యాకుమారినుండి, ఉత్తరాన కాశ్మీరంలో క్షీరభవానీ వరకూ వివిధరూపాలలో ఆరాధిస్తారు. కానీ శ్రీవిద్యాతంత్రంలో చెప్పబడిన లలితా త్రిపురసుందరి లక్షణములు, ఆయుధములు ఒక్క కాంచీపుర కామాక్షికి మాత్రమే ఉన్నాయి. భూమి అంతటినీ ఒక దేవత అనుకుంటే, ఆ భూదేవియొక్క నాభిస్థానము కాంచీపురము.

క్వణత్-కాంచీదామా - సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ.  అమ్మవారు నడుస్తూంటే కాలి అందెలేకాక వడ్డాణపు చిరుమువ్వలూ సవ్వడిచేస్తాయి. పరిక్షీణామధ్యే - అమ్మవారి నడుము చాలా సన్ననిది. పరిణతశరత్చన్ద్రవదనా - శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ.  శరత్కాలవాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. అమ్మవారి ముఖము, శరత్తులోని పున్నమిచంద్రుని వంటి కాంతి విరజిమ్ముతూ ఉంటుందని శంకరులు సూచిస్తున్నారు. అమ్మవారి వదనం అనుగ్రహం అనే వెన్నెల కురిపిస్తుంది.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - అమ్మవ్రారు తన చేతులలో విల్లు, అంబులు, పాశం, అంకుశములు ధరిస్తుంది. ఇవి శ్రీవిద్యాధిదేవత యొక్క ముఖ్య లక్షణాలు. ఈ దేవతను లలితా మహా త్రిపురసుందరి అని, కామేశ్వరి అను పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో విల్లు, అమ్ములు ఉంటాయి. విల్లమ్ములు మన్మథుని వలెనే చెరకువిల్లు, పుష్పబాణములు.

రాగము, ద్వేషము - వీటిగురించి లోతుగా ఆలోచిస్తే ప్రాపంచిక జీవనం అంతా కామక్రోధములనబడే ఈ రాగ ద్వేషములతో నిండి ఉందని తెలుసుకుంటాము. ఈ రెండూ అమ్మవారి మాయాలీలలో భాగాలు. ఆవిడ అనుగ్రహలీలలో అవి మాయమయిపోతాయి. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం వీటిని అదుపులో ఉంచగలం. రాగస్వరూపపాశాఢ్యా - కోరిక అను పాశము కలది. క్రోధాకారాంకుశోజ్జ్వలా - కోపము అను అంకుశముతో మెరియునది. ఈ రెండు పేర్లూ లలితా సహస్రంలో ఉన్నాయి.  అమ్మవారి పాశం కామము/కోరికకు సంకేతం. పాశములాగా కామము మనను కట్టేస్తుంది. అలాగే అంకుశం క్రోధమునకు సంకేతం. కోపము మనను చీల్చి రెచ్చగొడుతుంది. పాశాంకుశములు ఒక ఏనుగుని అదుపులో ఉంచినట్టు, కామక్రోధములను అదుపులో ఉంచుతాయి, అంటే ఈ కామక్రోధముల జన్మస్థానమైన మనస్సును అదుపులో ఉంచుతుంది.

మరోలా చెప్పాలంటే  అమ్మవారు మనపై వాత్సల్యంచూపి, ఆమె చేతిలో ఉన్న పాశంలో మనలను కట్టివేసి, మనను కట్టివేస్తున్న ఇతర పాశాలకు దూరంచేస్తుంది. మనకు బంధములు లేని బంధము ఇస్తుంది. అలాగే ఆమె తన కోపమును మన క్రోధముపై చూపి, తన అంకుశముతో మన క్రోధమును చీల్చి, అణచివేసి ప్రశాంతతనిస్తుంది.

మనం కోరికను అమ్మవారితో అనుబంధంగానూ, కోపమును మన కోపముపై కోపముగానూ మార్చుకుంటే అమ్మవారి పాశాంకుశాలు మనను బంధవిముక్తులను చేస్తాయి.

లలితా సహస్రంలో పాశాంకుశాల తరువాతి రెండు నామములు  అమ్మవారి చేతుల్లోని విల్లమ్ములపై ఉన్నాయి. మనోరూపేక్షుకోదండా - మనస్సురూపమైన చెరకువిల్లు ధరించునది, పంచతన్మాత్రసాయకా - అయిదు తన్మాత్రలకు సంకేతమైన బాణములు కలిగినదీ.

మన్మథుడిచేతిలో విల్లమ్ములు ఏంచేస్తాయో తెలిసినదే. అమ్మవారి చేతుల్లో అవి ఏంచేస్తాయి ? విల్లు మన మనస్సులను మోక్షమునందు కోరిక కలిగినవాటిలా చేస్తుంది. అయిదు బాణములూ కూడా అంతే. అవి మన ఇంద్రియాల శక్తులను అమ్మవారివైపు తిప్పి శుచిగా చేస్తాయి.  ఇవి మనలో అమ్మవారిని స్తుతించే పాటలను వినాలనీ, ఆమె పాదపద్మములను తాకాలనీ, ఆమె స్వరూపాన్ని చూడాలనీ, అమ్మవారి పాదప్రక్షాళన చేసిన జలం అనే అమృతపు రుచి చూడాలని, అమ్మవారి నిర్మాల్యపుష్పములను సేకరించి వాటి దివ్యసుగంధపరిమళములను ఆఘ్రూణించవలెననీ, ఇలాంటి కోరికలు కలిగేలా చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారి పుష్పబాణములు మన ఇంద్రియలౌల్యాలను నిర్మూలిస్తాయి. ఆమె చెరకువిల్లు మన మనస్సును లయంచేస్తుంది. అది జరిగినప్పుడు మనకు జ్ఞానము, మోక్షము లభిస్తాయి. మనకి ఇంకేంకావాలి ?

ఇలా పవిత్రమయిన అయిదు ఇంద్రియాలూ, మనస్సూ కలిపి ఆరు కరణములు. తుమ్మెద తన ఆరు చరణములతో పద్మముపై వ్రాలినట్లు మనము ఈ ఆరు కరణములనూ అమ్మవారి పాదపద్మములపై లయంచేయాలి.

అమ్మవారు జ్ఞాన సామ్రాజ్యపు మహారాజ్ఞి. తాను మోక్షప్రదాయిని అని సూచించడానికి ఆమె కామక్రోధాలు నాశనంచేసి జ్ఞానం కలిగించు ఆయుధాలైన పాశాంకుశాలు రెండు చేతులతో ధరించింది. తాను మనస్సును, ఇంద్రియాలను తొలగించివేస్తుందని సూచించుటకు ఆమె విల్లమ్ములు ధరించింది.

శంకరులు ఈ శ్లోకంలో మొదట అమ్మవారి రూపం - నాల్గుచేతులు, వడ్డాణము ధరించిన సన్నని నడుము, శరత్కాలపౌర్ణమినాటి జాబిల్లినిపోలిన మోము - వర్ణించారు. ఈ భౌతికరూపవర్ణన తరువాత శంకరులు అమ్మ తత్త్వపు సారాంశాన్ని చెప్పుతున్నారు - పురమథితురాహోపురుషికా -  త్రిపురాసురసంహారి యెక్క అహంకార స్వరూపము అనే అర్థం వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, శివుని యొక్క ’నేను’ అనే భావస్వరూపమే అమ్మవారు అని అర్థమవుతుంది. పరబ్రహ్మము యొక్క చిచ్ఛక్తి యే అమ్మవారు. జ్ఞానాంబ.

ఈ శ్లోకములో శంకరులు ఎంతో అందంగా వర్ణించిన అమ్మవారిని మన అంతర్నేత్రముతో చూడడము మన పని.

శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్




|| శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్ ||

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 1||


పోలిక లేనివాడను, నిత్యుడను, అంశలేనివాడను, అఖండమైనవాడను, జ్ఞానస్వరూపుడను, భేదములన్నీ లేనివాడను అగు నాయందు జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదమును ఏర్పరచు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

శ్రుతిశతనిగమాన్తశోధకానప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నానఘటితఘటనాపటీయసీ మాయా || 2||


వందలాది వేదవచనములతోనూ మరియు వేదాంతోపదేశములతోనూ పరిశుద్ధమైన వారిని కూడా అహహ! ధనాదులను చూపించి, వెంటనే కలుషితమొనర్చి, పశువులుగా మార్చు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాన్తం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 3||

సచ్చిదానందము, అఖండము మరియు అద్వితీయమగు ఆత్మను ఆకాశము, అగ్ని మొదలైన పంచభూతములచే నిర్మించబడిన సంసారసాగరంలో పడవేసి పూర్తిగా భ్రమింపచేయుచున్న మాయ అఘటితఘటనా సమర్థమైనది.

అపగతగుణవర్ణజాతిభేదే సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 4||


గుణముల, వర్ణముల మరియు జాతుల భేదము లేని సుఖ చైతన్యస్వరూపమైన ఆత్మలో బ్రాహ్మణుడు మొదలైన అహంకారమును, పుత్రులు - భార్య - ఇల్లు మొదలైన మోహమును పెంపొందించు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

విధిహరిహరవిభేదమప్యఖణ్డే బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావానఘటితఘటనాపటీయసీ మాయా || 5||


అఖండమైన పరమాత్మలో బ్రహ్మ - విష్ణు - మహేశ్వర భేదములను కల్పించి పండితులను కూడా హరి - హర విభేదము కలవారిగా చేసి భ్రమింపచేయు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మాయాపఞ్చకమ్ సమ్పూర్ణమ్ ||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.