Showing posts with label అనుగ్రహభాషణములు. Show all posts
Showing posts with label అనుగ్రహభాషణములు. Show all posts

Friday, 8 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష




పరమాచార్యుల అమృతవాణి : అప్పయ్యదీక్షితుల భక్తి పరీక్ష
(జగద్గురుబోధలనుండి)

అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.

సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.

అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూ శివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.

మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని,
నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే.


'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటే అన్న తీర్మానమే నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.

దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభమైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.

అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం
ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,
ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ కాలమాత్మ
ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.


శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.

దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు. అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.

యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,
తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,

ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.

అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టంవస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు. ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.

Thursday, 7 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు



పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు
(జగద్గురు బోధలనుండి)

దైవభక్తి ఆవశ్యక మని చెప్పడ మెందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసికోవడానికే. అట్టి ఆత్మసాక్షాత్కారానికై మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుష్యులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లయినా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి సాధనం.

ఇపుడు మనుష్యులకు అక్కఱ లేని అనే ప్రశ్న వస్తుంది. 'ఛాయా తోయం వసన మశనం' అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోడానికి ఒక గుడ్డ. ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోడానికి ఈ నాలుగున్నూ పరికరాలు. ఇవి అన్నీ భూమినుండి ఉత్పన్నమవుతై. నీ రిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోడానికి మన్ను సున్నం దారువు లోహం ఇత్యాదులు భూమిలోనుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు. ఇవన్నీ భూమినుండి వచ్చేవే. కడపట మనము కలిసేదికూడా ఆ భూమిలోనే.

సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మానరక్షణకోసం మనం బట్టలుకట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలువలు కట్టుకొనకపోతేయేం? అట్లా కట్టుకుంటేనేగాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయంగాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగలవానిని కట్టుకోవడంచేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా?

ఒక కుటుంబం, వెలగల వలువలకై చెసే ఖర్చుతో దాదా పయిదు కుటుంబాలకు కావలసిన సాధారణాలయిన బట్టలు దొరుకుతై. ఆడంబరంకోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయివుంటే అవి మనకు పాపాన్నే పోగుచేసి పెడతై. వీని కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెపుతూ మనం మాంసం ముట్టం. కాని మాంసాహారానికయితే ఏ ఒక జీవానికో హింస. పట్టుబట్టకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనము కట్టుకొనే బట్టలు సాధ్యమయినంతవరకు హింసచేయకుండా ఉండే ఉపాయాలవల్ల ఉత్పత్తి అయేవిగా చూచుకోవాలి. మనము కట్టె బట్టలు సాధారణు లందరూ కట్టుకొనేటటువంటివిగానూ గట్టివిగానూ ఉండాలి.

ప్రజలందరూ సుఖంగా బతకటానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కాని లేమికిమాత్రం దినదినాభివృద్ధి. ప్రజల ఆర్థికజీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు: దానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఇదివరకు రెండుసార్లు కాఫీ తాగేవారిప్పుడు నాలుగు సారులు కాఫీ తాగడం. గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం. రెండు బట్టలతో కాలం గడిపేవారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకోడం. ఆర్థికజీవ నాభివృద్ధికి ఇవి గుర్తు లని అనుకోవడం సరికాదు. మనకు కావలసినవస్తువు లన్నిటినీ ఇలా పెంచుకుంటూనేపోతే దేశంలో ఎపుడూ లేబరమే తాండవిస్తూవుంటుంది. మానప్రాణాలు కాపాడుకోవడాని కేవి తప్పనిసరో అట్టివి అందరకూ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమయిన చట్టాలుండాలి. ఆలాటి స్థితి కలగాలి, అది సవ్యమయినది. అని అనుకుంటే పరమదరిద్రులు తమ జీవితం ఎల్లా గడుపుకొంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహంలేని దోషం ఉండేటంతవరకూ ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యంకోరేవారు తమతమ అవసరాలు మించి ఒకింతయినా పరిగ్రహం చేయరాదు. కలిగినవారు లేనివారికి సాయంచేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈసంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరినిచూచి లేనివారుగూడా వారివలె తిరగడానికి ప్రయత్నిస్తారు, అట్లా వారిని అనుకరించి అప్పులపాలవుతారు. పట్టుపుట్టాలవారు. చెడిన తరగతిలోనివారే. ఇక వజ్రాల నగలవారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దుబారా. కన్యాం 'కనకసంపన్నాం' అని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారంకోసం డబ్బువెచ్చపెట్టి నగగా పెట్టుకొన్నా ఏనాటికయినా అది ఉపయోగపడుతుంది. కాని వజ్రాలకు ఇట్టి ప్రయోజనంలేదు. సరికదా ఉపద్రవం కావలసినంత. ఏబది, నూఱేండ్లక్రితం మనపూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే చెవులకు తాటికమ్మలే. తాగేది రాగిగంజో బియ్యపుగంజో. బ్రతుకుతెరువులో ధనికులకూ దరిద్రులకూ పెద్ద భేదమేమీ ఉండేదికాదు.

'ఇకమీద కాఫీతాగను, పట్టుబట్టలు కట్టను' అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలేధనంతో అయిదు కుటుంబాలు సుఖంగా బ్రతుకుతై. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించినకొద్దీ శాంతీ ఉండదు. సౌఖ్యమా ఉండదు. ఇట్టి దుబారావల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖంతప్పదు. కాఫీనీ పట్టుబట్టలనూ వదలిపెడితే అన్ని కుటుంబాలూ బాగుపడతై. ఇదేకాదు, పట్టుబట్టలకోసం చేసేపాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేక పోతుంది. అష్టాంగయోగంలో మొదటిదే అపరిగ్రహం, అహించ అనేవి. ఏ ప్రాణికిన్నీ మనవల్ల హింసకలుగరాదు. డబ్బు ఉందికదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చేయరాదు. అట్లాచేసే వ్యయంతో లేమితో కొట్టుకోనే వారి అవసరాలు తీర్చవచ్చు, అలాచేస్తేనే, చేయడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మసాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగయోగానికి మొదటిసోపానం అది దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికే దీనిని చెప్పడం.

పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?


పరమాచార్యుల అమృతవాణి : భక్తి అంటే ?
(జగద్గురు బోధలనుండి)

భక్తి అంటే భక్తుని హృదయం వేరే ఇంకో ప్రయోజనం కోరక సదా పరమాత్మ స్వరూప సాయుజ్యం కోసమే నిరీక్షించడం. దాని కేదయినా కారణం ఉంటే భక్తికాదు. ఈశ్వరునిమీద అవ్యాజమయిన అనురాగం తనంతట తానుపుట్టుకొనిరావాలి. సకారణంగా వచ్చేది ప్రేమకాదు. అదేభక్తి. సర్వమూ పరమాత్మ స్వరూపమే. పరమాత్మతో యోగం లేనంతవరకూ శాంతికీ ఆనందానికీకరవే.

సదాశివబ్రహ్మేంద్రులు మానసిక పూజచేస్తూ- ’ఈశ్వరా! నిన్ను పూజించడానికి కూచున్నాను. కాని నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీ కెట్లా పూజ చేయడం? అది వీలయిన పనా? నీఆరాధన చేయ డమెట్లా? నీవు ఒక దిక్కున ఒకచోటనే ఉంటే కదా నీవు ఇక్కడనే ఉన్నా వని నమస్కారం చేయడం? నీవు వెనుకా ముంగలా ప్రక్కలా పైనా కిందా ఎల్లయెడలా సర్వాంతర్యామివై ఉన్నావు. నేను నీపాదాలను ఎక్కడ ఉన్నవని చూచినమస్కరించను? పోనీ! ఎక్కడనో నీ పాదాలున్నవని నమస్కరిస్తే ఆ పాదాల వెనుక నీవులేవు అని కదా అర్థం. అలా అయితే నీపూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసికొన్నవాడనే కదా! నీ చరణములను కడుగుటకు పంచపాత్రనుండి ఒక ఉద్ధరిణలో నీళ్ళు కింద పోస్తామా. నీవు ముల్లోకాలనూ మూడడుగులతో కొలచిన త్రివిక్రముడవి కదా! నీ పాదాలను అణుమాత్రమయినా ఈనీళ్ళు తడపగలవా? పాదాలను పూర్తిగా కడగక వదలుట అపచారం కాదా ప్రభూ?

'భూః పాదౌ యస్య నాభిః’. దిగంబరుడవయిన నిన్ను ఈ చిన్న వస్త్రముతో అలంకరింపగలనా? నే నేమి పూజ చేయను తండ్రీ! నే నేమని ప్రార్థంపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు. నీవు సర్వజ్ఞుడవు. ప్రార్థన అంటూ చేసి నీసర్వజ్ఞత కొక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీవద్దలేని ఏదో ఒక వస్తువును నే నడుగలేదు. కొత్త వస్తువును ఏదే నొకదానిని నే నడిగితే నీవు దాతవు నేను ప్రతిగ్రహీతను అయిపోతాం. నీవు అఖండానందస్వరూపడ వని శ్రుతులు చెపుతున్నవి. నేనో ఇలా కోరికలతో కొరతలతో ఉన్నాను. ఈ స్థితిని మాన్పి నా స్వరూపం నా కియ్‌. నన్నే నా కియ్‌.’ అని చెప్పారు.

'నన్నే నా కియ్‌.’ అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నా కియ్‌’ అని

యాచే నాఽభిసవం తే చంద్రకలోత్తంస! కించి దపి వస్తు,
మహ్యం దేహి చ భగవన్‌ మదీయ మేవ స్వరూప మానందమ్‌.


ఇట్లా మన స్వరూపాన్నే మనం వదలి ఉన్నపుడు క్షణం కూడా సహించరాని తాపం తలగాలి, ’పరమాత్మ స్వరూపంతో మనమే క్షణం ఐక్యం అవుతాం ?’ అనే చింతతాపమూ ఇవి కలగాలి. మనం మనంగా ఉండాలంటే పరమాత్మతో కలిసి ఉండడమే. అదే ఆనందస్వరూపం. పరమయిన పరమాత్మ స్వరూపం. తక్కినవన్నీ దేహాత్మ స్వరూపాలు భ్రాంతిజనితాలు. ఆ సత్యవస్తువుతో ఐక్యమై ఉండడమే పరమయిన ఆ ఆత్మస్వరూపం. అలలవలె, నురుగువలె వేరొకటి వచ్చి కలిస్తే సహించరాని, తాళుకోలేని ప్రేమ మనకు పుట్టుకోరావాలి. ’ఆ సత్యవస్తు దర్శనం ఎన్నడు? దానితో యోగం ఎన్నడు? అనే చింత సదా ఏర్పడాలి. అదే భక్తి.

Saturday, 2 September 2017

పరమాచార్యుల అమృతవాణి : ఉపన్యాసముల సంకలనము

 
పరమాచార్యులు, పరమపూజ్యనీయులు సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపమైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి కొన్ని ఉపన్యాసముల సంకలనము, తెలుగులో. 1937లో అచ్చొత్తించిన పుస్తకము


https://archive.org/download/in.ernet.dli.2015.386935/2015.386935.Sri-Chandrashekarendra.pdf


భక్తులందరితో పంచుకోగలరు.

Tuesday, 29 August 2017

పరమాచార్యుల అమృతవాణి : అమ్మవారి అనుగ్రహంతో కామమును జయించటం


పరమాచార్యుల అమృతవాణి : అమ్మవారి అనుగ్రహంతో కామమును జయించటం
(సౌందర్యలహరి(5) వ్యాఖ్యా సంగ్రహం)

హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి.

బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.

మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.

మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.

నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు.

శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.

Saturday, 26 August 2017

పరమాచార్యుల అమృతవాణి : భక్తితో జన్మరాహిత్యం


పరమాచార్యుల అమృతవాణి :  భక్తితో జన్మరాహిత్యం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

''శివానందలహరి'' అని శంకరులు రచించిన గ్రంథం ఒకటి ఉన్నది, అందులో ''అంకోలం నిజబీజ సంతతిః'' అనే శ్లోకం ఒకటి ఉంది. దాని తాత్పర్యం ఇది - ఊడుగచెట్టు గింజలు రాత్రి రాలిపోతాయి. ఉదయమే అవి తిరిగి చెట్టును అంటుకొనిపోతాయి.

మానవుడు పగలల్లా సంసారం, వ్యాపారం చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు, అట్లా కాకుండా రాత్రి సమయంలోనైనా, ఈశ్వరధ్యానము చేయాలి. అనగా ఊడుగుగింజ చెట్టుకు అంటుకొనునట్లు మనస్సు ఈశ్వరలగ్నం కావాలి. అందుకు సమయం కూడా అనుకూల పడాలి, అనడానికి ఈ ఉదాహరణ ఉపకరిస్తుంది.

ఆ శ్లోకంలో ఇంకొక ఉదాహరణ ''అయస్కాంతోపలం సూచికా'' అంటే - సూది సూదంటురాయిని అంటుకుంటుంది, అలాగే మనమనస్సు శివుని యందు అంటుకోవాలి.

పతివ్రత భర్తను అనుగమించినట్లు జన్మాంతరాల్లో కూడ అనుబంధం అలాగే వుంటుంది. ''సాధ్వీనైజ విభుం'' అన్నమాటకు తాత్పర్యము అది. అలాటి విడివడని అనుబంధం భక్తి ఈశ్వరునితో ఏర్పడాలి, 

''లతా క్షితిరుహం'' అని ఇంకొక ఉదాహరణ. చెట్టుతో లత పెనవేసుకొని ఉంటుంది. తీగను విడదీస్తే అది చచ్చిపోతుంది. చెట్టునుమాత్రం తీగ అల్లుకొన్న గుర్తులు అలాగే ఉంటాయి. చెట్టుతో ఎడబాటునకు తీగ వాడిపోయినట్లు భగవంతునితో దూరమైనపుడు మనం కూడా బాధపడాలి. తీగతో అనుబంధం పోయినందుకు చెట్టుకూడా దుఃఖపడుతోందా అన్నట్లు ఆ తీగ అల్లుకొన్న గుర్తులు స్పష్టపరుస్తున్నాయి, అలాగే భక్తునితో ఎడబాటునకు భగవంతుడు కూడా బాధపడుతూ ఉంటాడు.

''సింధు స్సరి ద్వల్లభం'' నది సముద్రుని గురించి పోయి లీనమౌతుంది.లీనమయినతరువాత ''నది'' అనే పేరే ఉండదు. ఇది ఐదవభక్తి, భక్తుడు భగవంతునితో సర్వాత్మనా లీనమయిపోవడం జన్మరాహిత్యం. సాయుజ్యం అంటే ఇదే. ఇట్లా ఐదు రకాల భక్తి భూమికలను శంకరులవారు ఈ శ్లోకంలో వివరించారు.

''కర్తవ్యో మమకారః'' అంటే నాది అనే మమకారం అవసరమే. మమకార మనేది ఎంతవరకు ఉంటే అంతవరకు కష్టాలే, అయినా ఈశ్వరునియందు ఈలాటిమమకారం ఉంచుకొంటే దుఃఖంలేదు. లోకంలో ''నాది'' అనేది త్యాగం చేయాలి. మనకు త్యాగం అలవాటులో లేదు. కాన మమకారాన్ని త్యాగం చేయకుండా అలవాటులో లేదు. అంటారా అపుడు ఈ మమకారాన్ని పరిమితంగా పుత్ర, మిత్ర, కళత్రాదులయందు ఏవో కొన్ని చోట్లనే ఉంచి, అవి మాత్రమే నాది. నాది అనుకొనక, అది విశ్వవ్యాప్తంచేసి, ప్రపంచమంతా నాదే అనుకోవాలి. అట్టి అవధిలేని మమకారంవల్ల సంతోషం వస్తుంది. అందరు ఈశ్వరుని బిడ్డలే, అంతా ఒక్కటే అని మమకారం పెట్టుకొంటే సరిపోతుంది.

అంగడికి వెడతాము. యజమాని ఒక్కడే వుంటాడు. రకరకాల గుడ్డలను గుమాస్తాలు చూపిస్తారు. విసుగు లేకుండా వర్ణిస్తారు. చివరకు ఒక్క గుడ్డ తీసుకొంటాము. బిల్లు ఇస్తారు. బిల్లు ఇచ్చినతర్వాత, ''అయ్యా వెళ్ళండి, ఇంకా కొనేవారు వస్తున్నారు. చోటు ఇవ్వండి.'' అని అంటారు. ఆ మాదిరి మానవుడు కూడా పనిఅయేదాకా, అంటే వేదవిహిత ధర్మం ఆచరించడం కోసం, సుఖలాభంకోసం, పుత్రమిత్రాదులయందు మమకారం ఉండవచ్చు. ఆపని అయాక ఆ మమకారాన్ని ఆ ఆదరాన్ని వదులుకోవాలి. మన తల్లీ, మన ఇల్లూ, మనకుక్క అని అనుకుంటే, కుక్క చచ్చినా దుఃఖపడతావు. కాన అంతా ఈశ్వరరూపము అనుకొని తాను సాక్షిగా ఉంటే క్రమముగా మనస్సు భగవంతునియందు లగ్నమై పోతుంది. బట్టలకొట్టు యజమానికి కొట్టునకు వచ్చిన జనుల మీద, ఎంతవరకు ఆదరము ఉందో, అంతవరకే సంసారం మీద మనం ఆదరం పెట్టుకొవాలి. క్రమంగా ఈశ్వరుడు, నేను ఒక్కటే అన్న ఐదవరకం భక్తి మనకు సిద్ధిస్తుంది.

పరమాచార్యుల అమృతవాణి : కామాక్షి చరణ ప్రభావము




పరమాచార్యుల అమృతవాణి :  కామాక్షి చరణ ప్రభావము
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన భారతదేశము పరమ పవిత్రమైన దేశము, ఇది కర్మభూమి ఇతర దేశములన్నీ భోగ భూములు. శాస్త్రముల ప్రకారము ఇది అన్వర్థము, అనుభవములో కూడా ఒక్క భారతదేశములో మాత్రమే ఈనాటికి కూడా వైదిక కర్మానుష్టానము జరుగుచున్నది. ఇక్కడ ఏడు ముక్తి ప్రదములైన క్షేత్రము లున్నట్లు సంప్రదాయముగా చెప్పుకుంటున్నారు.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా,
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః


కాంచీ అంటే మధ్యభాగము, లేక ఓఢ్యాణము, అని అర్థము, స్త్రీలు ఓఢ్యాణమును (వడ్డాణమును) శరీర మధ్యభాగములోనే ధరిస్తారుగదా! కాంచీదేనికి మధ్య భాగము? ఒకప్పుడు మన వైదికమతము సింహళము, ఇండోనేషియా మొదలైన అనేక దేశములలో వ్యాపించి ఉండేది. విశాలమైన వైదిక మతావలంబులు నివసించే భూభాగానికి ఆనాడు కాంచీనగరము మధ్యభాగమున ఉండేది. కాంచీ వంటి నగరము మరొకటి లేదు. ఆ ఊరిలో 108 శివాలయములున్నవి. ఇవిగాక విశిష్ణ్వాలయములు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఉన్నవి. ప్రతివీధిలోను ఒక దేవాలయ మున్నది. గుడిలేని వీధిలేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయములో ఉత్సవము జరుగుతూనే ఉంటుంది. అట్టి కాంచీపుర మధ్య భాగములో కామాక్షీ దేవి ఆలయమున్నది.

ఏ గుడిలో ఏ ఉత్సవము జరిగినా వరద రాజస్వామి రథోత్సవము, ఏకామ్రనాథ స్వామి రథో త్సవము జరిగినా, ఆ ఉత్సవము వచ్చి కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణము చేసి వెళ్లవలసినదే. ఒకప్పుడు స్వదేవాలయ ప్రదక్షిణము మానివేసి కూడా కామాక్షీ దేవి ప్రదక్షిణము చేస్తారు. రథోత్సవములో, తంత్రశాస్త్రవేత్తల పరిభాషలలో కాంచీనగరము అమ్మవారి ఉద్యానపీఠస్థానము. సామాన్యముగా అన్ని గుడులలోను అమ్మవారికి నాలుగు చేతులు, ఆ చేతులలో 1. వరదముద్ర, 2.అభయముద్ర, 3. పాశము, 4. అంకుశము ఉంటవి. పాశము అనే ఆయుధము మనలో ఆశాపాశములను తొలగించి, మనసుకున్న చంచలత్వము పోగొట్టుతుంది. అంకుశము - మన అహంకారమును నశింపచేస్తుంది. అభయముద్ర కష్టములలోనున్న వారికి భీతిలేకుండా చేయగా, వరదముద్ర కోరిన వరముల నిస్తుంది. కొన్ని గ్రామములలో అమ్మవారికి రెండు చేతులే ఉండి, వరదాభయముద్ర లుండును. కామాక్షీ దేవి కూడా చతుర్భుజయే, 1. కుడివైపు క్రిందిచేతులో పంచ (పుష్ప) బాణములు, 2. కుడివైపుపై చేతిలో పాశము. 3. ఎడమవైపు క్రిందిచేతిలో ధనుస్సు, 4. ఎడమ వైపు పైచేతిలో అంకుశము ఉన్నవి. వరదాభయ ముద్రలు లేవు. కామాక్షి అమ్మవారికి వరదాభయముద్రలు లేకుండుట చూచి శంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అమ్మా! నీకన్నా ఇతరులైన దేవతలు అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరధాభయము ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, వరముల నిచ్చుటకు నీపాదములే సమర్థములైనవి.

''వాంఛా'' ''సమధికం'' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని భావము, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము, అమ్మవారి చతుర్భుజములలోని ఆయుధములను లలితా సహస్రనామములో వివరించి చెప్పారు. అమ్మవారి మూర్తిలో ఒక్కొక్క భాగమును ధ్యానముచేస్తే, ఒక్కొక్క సిద్ధివస్తుంది. పంచబాణములను ధ్యానముచేస్తే ఆశాపాశము విడి పోతుంది. దేవతామూర్తుల విగ్రహములలో, వాహనములలో, ఆయుధములో, ముద్రలలో తంత్రశాస్త్ర సంకేతము లిమిడి ఉన్నవి. మిగిలిన క్షేత్రములు రామకృష్ణాదుల వలన పవిత్రము లైనవి. కాంచీనగరము అమ్మవారి చరణములవలన మోక్ష క్షేత్రమైనది.

పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం


పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై.

వినాయకునికి మనము టెంకాయలు కొటతాం. దీనికొక కథ ఉన్నది. విఘ్నేశ్వరుడు ఒకప్పుడు తండ్రిని పరమశివుని చూచి - 'నీ తలకాయ నాకు బలిగా ఇయ్‌' అని అడిగాడట. కార్యం అవిఘ్నంగా సాగిపోవడానికి ఈశ్వరుని తలతో తూగగల ఏదో గొప్ప వస్తువు నివ్వాలి. అందుచేతనే ముక్కంటి తలకు బదులుగా మూడుకన్నులు గల టెంకాయ కొట్టడం. అట్టి వస్తువొకటి సృష్టిలో ఉండడం గూడా ఒక ఆశ్చర్యం. 'అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా' అని వినాయకునికి కొబ్బరికాయలు కొట్టండి అనియే ఈశ్వరుడు వీనిని సృష్టించినట్లు కనబడుతుంది.

ఈ కొట్టడంలోనూ ఒక నియమం ఉన్నది. కొబ్బరికాయజుట్టు పూర్తిగా తీసివేసి కొట్టాలి. సన్యాసులు చనిపోయినపుడు కూడా ఇదే రీతిగా కొడతారు. ఆ కొట్టేటప్పుడు మూడుముక్కలు అయేటటులు కొట్టాలి. ఈ వాడుక తమిళదేశంలోనే ఎక్కువగా ఉన్నటుల కనబడుతుంది.

చాతుర్మాస్య అనేది నాలుగుపక్షాల కాలం. అనగా సన్న్యాసు లొక ఊళ్ళో రెన్నెలలు ఉండాలని విథి. ఈ యేర్పాటు వేయి సంవత్సరాలుగా ఆచారంలో ఉన్నది. నేనొక యేడు నాగపట్టణంలో చాతుర్మాస్య చేశాను. అను దినమూ దేవాలయానికి వెళ్ళడం వాడుక. సాయం సమయంలో ఒకటే జనసందడి. ఆలయానికి వెళ్లే దారిలో చిన్నకోవెల ఒకటి ఉన్నది. అది వినాయకునిది. దాని ముందెల్లప్పుడూ పిల్లల సందడే. కొబ్బరిచిప్పలు లెక్కలేనన్ని. ఒకరిమీద ఒకరు పడి గాయపడే రీతిగా పిల్లవాండ్ర సంఖ్య కూడా లెక్కకుమిక్కుటమే. కొందురు పెద్దలు ఆ పిల్లలను కసరికొట్టి 'తొలగిపొండి తొలగిపొండని' గద్దించారు. వారిలో ఒక కుఱ్ఱడు 'మమ్ములను ఏరుకోవద్దని గద్దించడానికి మీ కెవరు అధికారం ఇచ్చారు?' అని అడిగాడు. 'ఈ చిట్టి దైవానికి ఈ చిట్టిపిల్లలే సొంతం' అని అపుడు నా కనిపించింది.

ఈ దైవానికి మేను లావు, ఆకారం పర్వతం లాగా 'తొండము నేకదంతమును దోరపు బొజ్జయు' కాని ఇతడేమో బాలుడే. బిడ్డలకు పుష్టియే ఒక అందం. ఆహారపుష్టీ ఆకారపుష్టీ బిడ్డలకు ఆవశ్యకం. సన్న్యాసి ఒకడు ముక్కుబంటిగా తిని స్థూలకాయు డయితే అది అందమని అనిపించుకుంటుందా? వయసు ముదిరిన కొలదీ ఉపవాస ముండటం మంచి అలవాటులలోఒకటి. చిన్నబిడ్డలు ఉపవాస ముండటం కూడని పనులలో ఒకటి. బిడ్డలు బొద్దుగా ఉండవలెననియే ఈ శిశుదైవం చూపుతున్నట్లు తోస్తుంది.

ఇతని వాహనం ఎలుక. ఇత డెంత లావో అది అంత సన్నం. వాహనంవల్ల స్వామికి గౌరవం లేదు. స్వామివల్లనే వాహనానికి గౌరవం. కొలదిపాటి మేను కల ఎలుకకు గొప్పతనం కలగాలనే ఈయన దేహం పెంచుకొన్నాడేమో!

'అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్‌'
అనేక దంతం భక్తానా మేక దంత ముపాస్మ హే.


అనే శ్లోకం ఒకటి చాలా కాలంనుండి ఆనువాయతీగా వస్తున్నది. అగజ ఆనన పద్మ ఆర్కమ్‌-గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటివా డని అర్థం. సూర్యుని పోలిక వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది. గజాననం అహర్నిశం ఉపాస్మహే వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం.

రేయింబవళ్ళు ఉపాసన చేయడం మనదేశంలోనే సాధ్యం ప్రతివీథి కొసనూ (తమిళదేశంలో) వినాయకుని కోవెల ఉంటుంది. భక్తి లేనివారు పిడివాదం పెట్టుకొని 'నమస్కారం చేయము' అని తీరుమానం చేసికొన్న ఏ కొలదిమందియో తక్క మిగిలిన ప్రతివారూ ఆలయము ముందు నుండి వెళుతూ ఒక నమస్కారమయినా చేసి వెళతారు. కొందరు మొట్టికాయలు గూడా కాయించుకొని వెళతారు.

అనేకదం-తమ్‌-భక్తానామ్‌ అని విడదీయాలి. భక్తులను ఆయన అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.

ఒకొక ప్రాణికి ఒకొక విషయమునం దెక్కుడు ప్రీతి. చమరీమృగం తోకంటే పడిచస్తుంది. నెమలికి తన పించమే బంగారం. ఏనుగునకు దంతాలంటే ప్రాణం. దేహ మెట్లా ఉన్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు కక్కుతూ వుండేటటులుగా కాపాడుకుంటుంది. కాని గజాననుడు తన అందం చందం గౌరవం గరువం వీని అన్నిటికీ మూలాధారమైన దంతాన్ని ప్రాణప్రదమైన దాన్ని చరాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు. న్యాయం ధర్మం విద్య వీనికొరకు ఎంతటి త్యాగమయినా చేయవచ్చునని ఈయన ఈపనితో నిరూపించాడు. దైవానికి ఉపకరణం నిమిత్తమాత్ర మనిన్నీ విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం. ఇవి వ్యాపించడానికి ఉత్‌కృష్టమయిన ఎట్టి దేహావయవమునయినా త్యాగం చేయవచ్చుననిన్నీ నిరూపించడానికే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడనిన్నీ గోచరం అవుతుంది.

అవ్వైయ్యార్‌ సంగతి తమిళుల కందరికి పరిచితమే. ఆమె చెప్పిన వాక్యమొకటి యయినా తెలియని తమిళుడంటూ ఉండడు. ఆమె వ్రాసిన గ్రంథాలలో 'వినాయక అహవల్‌' అనే దొకటి. అది ఒక యోగశాస్త్రగ్రంథం. 'ధ్యాన మెట్లా చేయాలి? కుండలినీ శక్తిని సహస్రారానికి తీసికొని పోవడం ఎట్లా'? అనే అని సూక్ష్మాలయిన యోగ విషయా లెన్నో ఆ గ్రంథంలో ఆమె వివరించింది. 'అంతప్పాటి, అత్తిసూడి' అనే ఇతర గ్రంథాలను గూడా ఆమె రచించింది.

'అత్తిసూడి' అంటే పరమేశ్వరుడు. అత్తిపూవును చూడాలంకారముగా తాల్చినవాడని అర్థం. ఇది చంద్రకళవలే ఉంటుంది. శివునికి ఇంకొక పువ్వులమీద కూడా ప్రీతి ఎక్కువ. అది ఆరగ్వధం. ''ఆగ్వధే రాజవృక్ష శమ్యాక చతురంగులాః'' అని ఈపూవు పేరులు అమరం తెల్పింది. ఇవన్నీ రేలపూవు పేర్లు.

వినాయకుడు ప్రణవస్వరూపి. ఆ ప్రణవమును భ్రూమధ్యంలో ధ్యానించి అవ్వయ్యార్‌ అనుగ్రహించిన పుస్తకమే వినాయక అహవల్‌. అవ్వైయ్యార్‌ను గూర్చి ఒక కథ వున్నది.

సుందరమూర్తీ చేరరాజూ, వీరిరువురూ ఏనుగునూ గుఱ్ఱమునూ ఎక్కి కైలాసానికి వెడుతూ అవ్వై్‌య్యార్‌ను గూడా తొందరగా రమ్మనిన్నీ, వచ్చేయెడల తమతోపాటు తీసుకుపోతా మనిన్నీ అన్నారట. ఆమెయో వినాయకుని పూజామధ్యంలో ఉండి ''మీరు వెళ్ళండయ్యా! కైలాసం కంటే నాకు కరి వదనుడై ముఖ్యుడు, అని చెప్పిందట. అంతటితో వారు వెళ్ళిపోయారట. పూజానంతరం ''వారందరూ వెళ్ళిపోయారే నే నెలాగు వెళ్ళేదిరా భగవంతుడా'' అని ఆమె అనుకొన్నదట. ఆప్రార్థన ఆలకించిన వినాయకుడు ఒక్క చిటికలో వారు కైలాసం చేరేటంతలో తన తొండంతో ఆమెను కైలాసం చేర్చేడట.

ఇంకొక విషయం. ఎంత చూచినా తనివి తీరని వస్తువులు కొన్ని ఉన్నై. చంద్రుడూ, సముద్రుడూ, ఏనుగు ఈ తరగతిలోనివి. వానిని చూచిన కొద్దీ ఆనందమే. ఈ దేవతా శిశువు కూడా అదే విధం. చూచినకొద్దీ మరింత చూడ బుద్ధి పుడుతుంది. ఇది ఒక ఆనంద తత్త్వం, ఆరని ఆశాతత్త్వం.

''కేదారం వెళ్లాను గణపయ్యనుచూచాను, అటుమీద కన్యాకుమారి వెళ్లాను. అక్కడ కూడా బొజ్జగణపయ్య ప్రత్యక్షమే'' అని ఒక గణపతి భక్తుడు ఉత్సాంతో పొంగి పొరలుతూ అన్నాడు.

పశ్యేయ మేకస్య కవేః కృతిం చేత్‌
సారస్వతం కోశ మవైమి రిక్తమ్‌,
అంతః ప్రవి శ్యాయ మవేక్షితశ్చేత్‌
కోణే ప్రవిష్టా కవికోటి రేషా.

కావ్యాలు అనేకాలు. ఒక కావ్యం చదివినా అది భారతీదేవి ముక్తాభరణంవలె వుంటుంది. ఆమె బొక్కసమే డొల్ల అయిపోయిందా అని అనిపిస్తుంది. నిజంగా ఆమె బొక్కసంలోకి వెళ్ళిచూస్తే కోటికోటి కావ్యాభరణాలు వెదజల్లబడి వుంటై, వినాయకతత్త్వం కూడా ఈలాగే వుంటుంది. ఒక పంచపాత్రతో సముద్రజలం తెచ్చామని అనుకుందాం. ఏమిటిదీ అని ఎవరైనా అడిగితే సముద్రజలమని అంటాం. కాని సముద్రంలో నీళ్ళన్నీ మనం తెచ్చామా. స్వానుభవానికి గోచరించింది, మాత్రం ఏ లవలేశమో చెపుతాం.

వినాయకుడు విఘ్నవినాశకుడు. అన్ని కార్యాలకూ ఆయన పూజ మొట్టమొదట జరుగుతుంది. ఆయన అనుగ్రహబలం వుంటే అంతా అనుకూలమే వినాయకుని ప్రధానంగా ఆరాధించేవారిని గాణపతులు అని అంటారు. వినాయకుని ముందు వేయి గుంజిళ్ళకు శంకుస్థాపనం చేసింది మహావిష్ణువట ఒకప్పుడు ఆయన చక్రాయుధం యీమేనల్లుడు నోట్లో వేసుకున్నాడట పిల్లల చేతులోంచి ఏ వస్తువునూ తీసుకోటం కష్టం. గణపతి మాట సరేసరి. అతని ఏలాగైనా నవ్వించి దానిని లాగుకోవాలని మహావిష్ణువు నాలుగు చేతులతోనూ తన రెండు చెవులనూ పట్టుకొని గుంజీలు తీశాడట. ఈ విచిత్రప్రవర్తనకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. ఆనవ్వుతో చక్రంకిందపడ్డది. అప్పుడు మహావిష్ణువు నిడుదనిట్టూర్పు వదలి చక్రం అందుకుని బయటడ్డాట్ట.

లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం ఉండాలి. అందులకే త్యాగయ్య ''గిరిరాజాసుతా తనయా'' అని గానం చేశాడు. మనం గూడా ఆయన అనుగ్రహానికి పాత్రుల మయ్యేటట్లు నడచుకోవాలి.

Saturday, 29 April 2017

శంకరచరితామృతము : 8 : మండనమిశ్రులపై విజయం



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 8
మండనమిశ్రులపై విజయం

@ శంకరవాణి

వ్యాసులవారు ఆదేశించినట్లు శ్రీ శంకారాచార్యులవారు దిగ్విజయం గావించేరని వెనుక చెప్పేము. వారి దిగ్విజయాన్ని గూర్చి కొన్ని వివరాలు మనం గమనించాలి. దిగ్విజయానికై ఆచార్యులవారు మున్ముందు తూర్పుగా పయనించేరు. ఆచార్యులవారు దిగ్విజయానికై బయలుదేరి ప్రయాగకు వెళ్ళి అప్పటికే తుషాగ్నిప్రవేశం గావించి ఉన్న కుమారిలభట్టును కలిసికొన్నారని, కేవలకర్మమార్గాన్ని అనుసరించడంవల్ల ప్రయోజనం ఉండదని వారికి బోధించి వారిచే జ్ఞానమార్గం అంగీకరింపజేసెరని, కుమారిలభట్టు మండన మిశ్రులను జ్ఞానమార్గావలంబులుగా చేయడంవల్ల ఎక్కువ మేలు కలుగుతుందని ఆచార్యులకు చెప్పేరని వెనుక చెప్పుకొన్నాము.

కుమారిలభట్టు చెప్పిన మాటలు విని శంకరులు మండన మిశ్రులను వెదకుకొంటూ వారు నివసించే మాహిష్మతీ నగరానికి, చేరుకొన్నారు మండన మశ్రులవారి భర్య పేరు సరసవాణి. ఆ దంపతులు సరస్వతీ చతుర్ముఖుల అవతారములు. మండన మిశ్రులు, కుమారిలభట్టు, జైమిని - ఈ ముగ్గురు మన విషయంలో ఏకాభిప్రాయం కలవారు. ఈ ముగ్గురు మీమాంస మతానికి చెందినవారు. వేదంలోని కర్మకాండయే ముఖ్యమైనదని మీమాంస మత సిద్దాంతం.

కొంత స్థూలంగా మీమాంస మత సిద్దాంతం ఏమంటే? - భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన అనవసరం, ఉంటే ఉండనీయి. లేకుంటే లేకపోనీయి, అది ప్రయోజనంలేని ఆలోచన. వేదంలో చెప్పబడ్డ కర్మలను ఆచరించండం నీవు చేయవలసిన పని. ఆ కర్మలను ఆచరించు. అవి ఫలితాన్ని ప్రసాదిస్తాయి

ఇట్టి మత సిద్ధాంతాలలో విశ్వాసంకలవారై మండన మిశ్రులవారు మాహిష్మతీ నగరంలో నివసిస్తున్నారు. శ్రీ శంకరులు ఆ నగరానికి చేరుకొన్నారు. నిత్యమైన ఆనందమేదో తెలియక, కర్మనే నమ్ముకొని, అనవరతం కర్మాచరణంలోనే కొట్టుమిట్టాడుతూ, తత్ఫలితంగా అనిత్యమై అల్పమైన ఆనందాన్ని అనుభవిస్తూ, మరల మరల జన్మించుటయే జీవతపరమావధిగా భావించి యున్న మండన మిశ్రులను వారి అనుయాయులను ఏదో విధంగా తరింపజేయాలన్న అనుగ్రహబుద్ధితో శ్రీ శంకరులు అక్కడకు వచ్చేరు. చతుర్ముఖుని అంశతో జన్మించిన మండనులు, బౌద్ధులను వారి మతాన్ని నిరసించి ఖండించి క్రమంగా తాము మీమాంసకులై మతానికి ఆ కాలంలో వెన్నెముకగా ఉన్నారు.

మాహిష్మతిలో మండన మిశ్రుల గృహాన్ని వెదకుకొంటూ శ్రీ శంకరులు వస్తున్నారు. వారికి నది నుండి నీటి బిందెలతో వస్తూ ఉన్న పౌరపురంధ్రులు కాన వచ్చేరు. వారా వనితలను మండన మిశ్రుల యింటికి మార్గమేది? అని ప్రశ్నించేరు. అపుడు వారు

స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనా యత్ర గిరం గిరన్తి|
ద్వారస్థ నీడాంతర సం నిరుద్ధా జానీహి తన్మండన పండితౌకః||

ఏ గృహద్వారమందు పంజరబద్ధములైన చిలుకలు- 'వేదము స్వతః ప్రమాణమా? లేక పరతః ప్రమాణమా?' అని వల్లె వేస్తూ ఉంటాయో అదే మండనుల యిల్లు- అని సమాధానం యిచ్చేరు.

పంచదారనులేక దీపాన్ని చూచినపుడు 'ఇది పంచదార' 'ఇది దీపం' అన్న జ్ఞానం మొదట కలుగుతుంది. దానికి వెనువెంటనే 'అవును! ఇది నిజం' అని మరియొక జ్ఞానం కలుగుతుంది. ఇది అరటిచెట్టు' అని తెలియగానే 'అవును! ఇది నిజం!' అన్న రెండవ జ్ఞానంకూడా పుడుతోంది. అరటిచెట్టును చూడగానే కలిగిన యీ రెండవ జ్ఞానానికి అరటిచెట్టును చూచుటయే కారణమా లేక వేరొకదానివల్ల ఆ జ్ఞానం కలుగుతోందా? అంటే అరటిచెట్టు చూచుటయే యీ రెండవ జ్ఞానానికి కారణం అనేవారు స్వతః ప్రమాణం వాదులు, అలాకాదు, వేరొకదానివల్ల యీ రెండవ జ్ఞానమేర్పడుతోంది, అనేవారు పరతః ప్రమాణావాదులు. స్వతఃప్రమాణ - పరతః ప్రమాణాల స్థూల స్వరూపం ఇట్టిది.

మండనమిశ్రుల యింటి చిలుకలు 'స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం' అని వల్లె వేస్తూ ఉండేవట! ఆదిశంకరులు వారి యింటికి బయలుదేరేరు. ఆ రోజున మండనుల యింటిలో శ్రాద్ధము. మండనులు, మంచి ఐశ్వర్యం కలవారు. అనేక సోమయాగాలు వారు ఆచరించేరు. మండనులు మంచి ఐశ్వర్యం కలవరైనందున చక్కగా శ్రాద్ధం చేయడానికి ఉపక్రమించేరు. శంకరులు మండనుల యింటికి వచ్చేసరికి వారి గృహకవాటాలు మూయబడి ఉన్నాయి. అందుచే వారు యోగశక్తితో గృహంలో ప్రవేశించేరు. లోపల వ్యాసులవారు, జైమిని బ్రాహ్మణార్థమునకు వచ్చి ఉన్నారు. పరీక్ష్మిన్మహారాజు దగ్గరకు నిమ్మపండులో ప్రవేశించి తక్షకుడు వెళ్ళినట్లే ఎన్నోవిధాలుగా శ్రాద్ధక్రియా సక్రమ నిర్వహణానికి రక్షణలు ఏర్పాట్లు చేసుకొన్న మండనుల వద్దకు ఆచార్యులవారు చేరుకొన్నారు.

ఆచార్యులవారిని చూడగానే మండన మిశ్రులకు చాలా కోపం వచ్చింది. అపుడు శంకరులను మండనులకు వాగ్వాదం జరిగినట్లు కథలు జనశ్రుతిలోను గ్రంథాలలోనూ ఉన్నాయి.

మండనమిశ్రులవారు ఆచార్యులను చూచి ఎక్కడ నుండి ముండి? అని ప్రశ్నించేరట! ఆచార్యులవారు వేడుకగా 'కంఠము నుండి ముండివి' అని సమాధానం చెప్పేరట! ముండనం చేసుకొన్నవాడు ముండి. సన్యాసులు కంఠానికి దిగువ ముండనం చేసికొనకూడదు. ఇలా సాగుతూఉన్న వాదాన్ని ఆలకించి వ్యాసజైమినులు వారిని సమాధానపరచి మండన మిశ్రులతో - 'శ్రాద్ధమునకు సన్యాసిని పిలువాలని' శాస్త్రం చెపుతూ ఉన్నది. అందుచే విష్ణువునకు ఉద్ధేశించిన విస్తరలో ఆచార్యులవారిని కూర్చుండబెట్టి పూజించు అని చెప్పేరు.

మండన మిశ్రులకు ఏమీ పాలుపోలేదు. ఈ వ్యాసజైమినులు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు. బ్రాహ్మణార్థమునకు వచ్చినవారు చెప్పినట్లు చేయాలని శాస్త్రం. సన్యాసిని చూడడానికైనా అంగీకరించని తనను సన్యాసిని శ్రాద్ధసమయంలో పూజించవలసిందిగా వారు ఆదేశిస్తున్నారు. ఏం చేసేది? వారు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు, వారి మాట విని తీరాలి. వినకపోతే దోషం. అందుచే మండనులు శంకరులతో వాదం విరమించి భిక్షకు రావలసినదిగా అర్థించేరు. అపుడు శంకరులు నేను కోరేది వాదభిక్ష, సాధారణభిక్ష నాకు అక్కరలేదు, అన్నారట!

వాదం అంటే ఈ రోజులలో వివాదము లేక జగడం అనుకొనడం పరిపాటి అయింది. కాని అది సరికాదు. అది 'జల్పం' అనబడుతుంది. తెలియనిదానిని తెలిసికొనడానికి లేదా తత్త్వ గ్రహణానికి చేయబడే సమాలోచనకు వాదం అని పేరు. 'తనకు తెలిసినదే యథార్థమైనది, ఇతరులు చెప్పేది యధార్థం కాదు, అన్న నిశ్చయజ్ఞానంతో చేయబడేది 'జల్పం', ఈ రెండేకాక మూడవది మరియొకటి ఉన్నది అది 'వితండవాదం'. తనకు ఏ అభిప్రాయామూ లేకపోయినా ఎదుటివాడుచెప్పేది అంతా తప్పు అనడమే వితండవాదం.

ఆచార్యులవారు వాదభిక్ష కోరినంతనే మండనులు 'మొదట యీ భిక్ష స్వీకరించండి, తరువాత వాదభిక్షను గూర్చి గమనిద్దాం' అన్నారు.

శ్రాద్ధం సమాప్తం అయినంతనే ఇరువురూ వాదించుటకు ఆరంభించేరు. సరస్వతీదేవియొక్క అవతారమైన మండన మిశ్రులవారి భార్య సరసవాణిని ఇరువురి వాదాలను ఆలకించి తీర్పు చెప్పడానికి మధ్యస్థురాలుగా ఎన్నుకొన్నారు. ఆమె ఎవరిపక్షంలో మాటాడుతుంది! ఒక వంక సన్యాసి, ఒక వంక భర్త. వీరి వాదంలో తాను తీర్పు చెప్పడం ఎలాగు? ఇది ఆమెకు ధర్మసంకటంగా తోచింది. అందుచే ఆమె ఇరువురికి చెరియొక మాలను యిచ్చి ఎవరి మాల వాడిపోతే వారు పరాజితులైనట్లు అని నిర్దేశించింది.

వాదారంభానికి ముందు శంకరులు మండనులు ఒక నిబంధన ఏర్పరుచుకొన్నారు. వాదంలో శంకరులు జయిస్తే మండనులు సన్యాసం స్వీకరించాలి. మండనులే జయిస్తే శంకరులు ప్రాయాశ్చిత్తం చేసుకొని గృహప్రస్థాశ్రమం స్వీకరించాలి. వారి యీ నియమాన్ని సరసవాణి తెలిసికొన్నది. వాదం ఇరువదియొక్క రోజులు సాగింది. ఇరవై ఒకటవ రోజున మండనమిశ్రుల మెడలోని మాల వాడిపోయింది. వెంటనే సరసవాణి ఇద్దరిని భిక్షాగ్రహణానికి దయచేయండి అని ఆహ్వానించింది. నాటితో మండనులు సన్యాసులయ్యారు. సురేశ్వరాచార్యులు అన్నది ఆయన సన్యాసాశ్రమ నామధేయం. సురేశ్వరులవారు 'నైష్కర్మ్యసిద్ది' అనే గ్రంథాన్ని రచించేరు. అందులో వారు 'కర్మ ఫలాన్నే కాకుండా వేదం ఒక అత్యున్నతమైన ఆనందాన్ని సూచిస్తోంది' అని సిద్ధాంతీకరించారు.

అయితే మండనులను ఆచార్యులవారు ఏ విధంగా జయించేరు? అన్నది కూడా కొంత తెలిసికొందాం.

'శబ్డం కార్యాన్ని నిర్దేశించాలి' అనికదా మీమాంసకుల అభిప్రాయం. శంకురులు- 'అలాకాదు, శబ్దం కార్యప్రయోజనానికి సహాయకారిగా ఉండాలి' - అన్నారు. ఏమంటే కొన్ని చోట్ల కార్యము లేకపోవుటయే శబ్దానికి ప్రయోజనం అవుతుంది. 'సురాపానం చేయరాదు అన్నాము. ఈ శబ్దం వినగానే చేయవలసిన కార్యం ఏమీ ఉండడం లేదు కదా! అందుచే శబ్దానికి ఒక్క ప్రయోజనమే లక్షణం అని అంగీకరించడం తగినది కాని కార్యనిర్దేశర శబ్ద తాత్పర్యంగా ఉండాలి. అనుకొనడం తగదు'- అన్నారు.

'సురాపానం చేయరాదు' అన్నమాటకు ఏదో చేయుమని కాక ఏమీ చేయవద్దూ అన్నదే తాత్పర్యమై ఉన్నది. ఏమీ లేకపోవవడాన్ని అభావం అంటారు. నిషేధ వాక్యాలన్నీ కార్యాభావాన్ని బోధిస్తాయి. ఏదో ఒక కార్యము చేయకపోవుటయే ఒక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఏ కార్యమయినా చేయక పోవడం, ఏ కార్యము లేకుండా ఉండడం ఒక పెద్ద ప్రయోజనంగా ఉండాలి. ఏ కార్యము లేక పోవుటయే పరమ ప్రయోజనంగా కలవైనందున వేదాంతశబ్దాలు అన్నిటికి శిఖరాయమాణాలై ఉన్నాయి.

'సర్వం కర్మాఖిలం పార్ధ! జ్ఞానే పరి సమా ప్యతే' - అని గీతలో చెప్పబడిఉంది. అన్ని కర్మలూ పరమేశ్వరునియందు వినియోగం పొందాలి. కార్యము (చేయవలసినది లేకపోవుటయే) లేక పోవుటయే పరమప్రయోజనం అదియే బ్రహ్మానందం. దానిచే మరి జన్మ ఏర్పడదు. వేదానికి పరమతాత్పర్యం ఇదే! కర్మ కాండము సర్వాన్నీ జ్ఞానకాండలోనికి సమన్వయించు కోవాలి. అపుడే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అని శంకరులు మండన మిశ్రులవారికి బోధించేరు.

మండనులు ఆచార్యులవారికి శిష్యులైనంతనే సరస్వతి (అనగా సరసవాణి) ఇక నాకేమి పని ఉన్నదని బయలుదేరింది. అపుడు శంకరులు ఆమెను వారించి- 'నీవును ఇక్కడనే ఉండు, శారదా పీఠముగా నీవు ఉందువుగాక!' అని ఒక పీఠాన్ని స్థాపించి సరస్వతిని ఆ పీఠంలోనికి ఆహ్వానించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/8.html

Thursday, 27 April 2017

శంకరచరితామృతము : 7 : మనీషాపంచకం, అంతరార్థం


పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 7
మనీషాపంచకం, అంతరార్థం

@ శంకరవాణి

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

వ్యాసులవారు చెప్పినట్లు శంకరులు ముమ్మారు దిగ్విజయం చేసేరు. మూడు సార్లు భారతదేశంలో ప్రదక్షిణ క్రమంగా పర్యటించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/7.html
 

శంకరచరితామృతము : 6 : బ్రహ్మసూత్రభాష్య రచన



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 6
బ్రహ్మసూత్రభాష్యరచన

@ శంకరవాణి

తల్లిని వదలి ఆచార్యులవారు సక్రమంగా సన్యాసం స్వీకరించడానికై గురువును అన్వేషిస్తూ బయలుదేరేరు. ఈశ్వరావతారమైన ఆచార్యమూర్తికి వేరొక గురువు అవసరం కాకపోయినా లోకంలో సంప్రదాయాన్ని నిబంధించడానికై వారు అట్లు చేయవలసి వచ్చింది. స్వయంగా శంకరులే గురువును ఆశ్రయింపకపోతే లోకంలోని ఇతరులు గురువును ఆశ్రయించే సంప్రదాయం లోపించవచ్చును. అందుచే వారు గురువును వెదుకుతూ బయలుదేరేరు. వారు నర్మదాతీరంలో గురువును కలసికొన్నట్లు గ్రంథాలలోను కనిపిస్తొంది.

ఆచార్యులవారు శ్రీ గోవిందభగవత్పాదుల సన్నిధిలో సక్రమంగా సన్యాసం స్వీకరించేరు. శ్రీ గోవిందభగవత్పాదులవారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయవలసినదిగా శంకరులను ఆజ్ఞాపించేరు. పిమ్మట ఆచార్యులవారు అచటనుండి వారణాసికి బయలుదేరేరు. అక్కడనే వారు భాష్యరచనకు ఉపక్రమించేరు. వారు కాశిలో మణికర్ణికాఘట్టంలో ముక్తి మంటపంలో నివసిస్తూ శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు.

కాశి ఒక మహాక్షేత్రం. అక్కడ దేహత్యాగం చేసిన ప్రతి ప్రాణికి విశ్వేశ్వరుడు జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తాడు, ఇది ఆక్షేత్రంయొక్క విశేషం, కాశీక్షేత్రానికి వేరొక విశేషం కూడా ఉంది. మనదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్నిమతాల ప్రతినిధులూ కాశీలో ఉండేవారు. ఆ కాలంలో కాశి అంటే పండితులుండే పట్టణం. యాత్రకై ఎందరో పండితులు అచటకు వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉండేవారు. మన దేశంలో ఎన్ని జాతులు ఎన్ని మతములు, ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ అక్కడ కనిపిస్తాయి. అందుచే ఏ విషయమైనా కాశిలో ప్రచారంచేస్తే లోకంలో అంతటా ప్రచారం చేసినట్లు అవుతుంది. ఆచార్యులు కాశిలో భాష్యం రచించడానికి ఇదికూడా ఒక హేతువు. దినదినము దేశవిదేశములనుండి వచ్చిన వేదపండితులు కొంత కొంత ఆలకించుచుండగా ఆచార్యులవా రొనరించిన భాష్యరచన లోకంలో అనతికాలంలో ప్రశస్తి వహించింది. ఆచార్యులవారు తమరచనలో కొన్ని మతముల సిద్ధాంతాలను నిరాకరించేరు, ఔపనిషదమైన మతాన్ని స్థాపించేరు.

ఒకనాడు వ్యాసమహరి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యం ప్రశస్తమైన దని నలుగురూ తొలిసికోవాలంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్యరచనపై ప్రచండమైన వాదం లేవనెత్తేరు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదాలు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులు కూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొనసాగేరు. వృద్ధబ్రాహ్మణరూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించేరు, వెంటనే వారు -

'శంకర శ్శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్స్వయం|
తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'


శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించేరు.

అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికేరు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేడ్లు అనుగ్రహించుచున్నాను; భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను పలుదేశాలలో ప్రచారం చెయ్యాలి, కొందరు ఏవో ఆక్షేపణలు లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించేరు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయం గావించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/6.html

Wednesday, 26 April 2017

శంకరచరితామృతము : 5 బాల్యం - 2




పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 5
బాల్యం - 2


@ శంకరవాణి

ఒకనాడు వారి తల్లికి దేహం అస్వస్థంగా ఉంది. ఆమె కుమారునితో - 'నాయనా! నాకు నేడు నదికి వేళ్ళే ఓపిక లేదు- అన్నది. అపుడు వారు దూరంగా ఉన్న నది ఇంటికి చేరువగా రావాలని ప్రార్థించేరు. ఆయన ప్రార్థించినట్లు నది యింటికి దగ్గరగా వచ్చింది. దారిలో ఒక కృష్ణాలయం ఉంది. నదీవేగానికి ఆ ఆలయం కూలిపోయింది. కాలాంతరంలో ఆచార్యులవారు ఆజ్ఞాపించగా ఒక దేశపురాజు దానిని పునరుద్ధరించేడు.

ఆచార్యులవారు తమతల్లిని నదిలో స్నానం చేయించేరు. తరువాత తాము స్నానం చేయడానికై నదిలోకి దిగేరు. వారునీటిలో అడుగు పెట్టగానే ఒక మొసలి వారి పాదం పట్టుకొంది; అపుడు ఆయన తల్లితో - 'ఇదుగో! మొసలి పట్టుకొన్నది, ఇప్పుడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం మానసికంగా సంన్యాసం స్వీకరించానా నాకు వేరొక జన్మ వచ్చినట్లు అవుతుంది; నా ప్రారబ్ధము మారిపోతుంది, కాగా ప్రారబ్ధముచే వచ్చిన మరణంకూడా మారిపోవచ్చు; తల్లివి, నీవు ఆజ్ఞాపించకుండా నేను సంన్యాసం తీసికొనకూడదు, సంన్యాసం తీసికొంటే ఒకవేళ నేను బ్రతుకుతానేమో కాని, తీసికోకపోతే నాకు చావు తప్పదు; ఇది దుర్మరణం; నేను ఇలా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు; సంన్యాసము తీసికొంటే నాకు మోక్షము వస్తుంది; నీకు సద్గతి కలుగుతుంది; సంన్యసించినా నేను నీకు అంత్యక్రియలు చేస్తాను' అన్నారు.

ఆచార్యులవారు జలంలో ఉండియే సంన్యాసం స్వీకరించాలనుకొన్నారు. ఆయన అలా అనుకొనుటతోడెనే మొసలి ఆయన కాలిని విడిచిపెట్టింది. ఆ క్షణంలోనే ఆకాశంలో రథంమీద ఒక గంధర్వుడు ప్రత్యక్షం ఆయ్యేడు. అతడు ఆచార్యుల పాదాలమీదపడి నమస్కరించేడు. ఆచార్యుల వారికి ఆశ్చర్యం కలిగింది. తానొక గంధర్వుడనని అతడు చెప్పుకోన్నాడు.

ఆ గంధర్వుడు ఆచార్యులవారితోఅయ్యా! నేను ఒకప్పుడు బాగా మద్యం సేవించి గానలోలుడనై కదలకుండా పడిఉన్నాను. ఆసమయంలో దూర్వాసమహర్షి అలా వచ్చేరు. ఆయనకు మద్యము, సంగీతము రెండును కిట్టవు. ఆయనను చూచి నేను లేవలేదు; నా గానాన్ని విరమించలేదు. దానికి ఆ మహరి కోపించినీవు త్రాగి మొసలివలె పడి ఉన్నావు. అందుచే నీవు మొసలివై పడిఉండు! అని శపించేరు. అప్పుడు నేను వారిని ప్రార్ధించేను. 'ఈ శాపాన్ని అనుసరించి నీవు కొంతకాలం మొసలివై పడి ఉండక తప్పదు, ఈశ్వరుడు ఈ లోకంలో అవతరిస్తాడు, ఆయన కాలినిపట్టుకొన్నపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీవు కాలడిలో నివసించు, ఈశ్వరుడు అచ్చటనే అవతరిస్తారు, నిన్ను అనుగ్రహిస్తాడు' అని దుర్వాసమహర్షి నన్ను అనుగ్రహించారు అని తన విషయం తెలిపి ఆచార్యుల సెలవు పొంది ఆ గంధర్వుదు అంతర్హితుడయ్యేడు.

మొసలి నోటినుండి విడువడిన కుమారుని చూడగానే తల్లికి చాలా ఆనందం కలిగింది, ఆమెరా! నాయానా ! ఇక నీవు పెండ్లి చేసికొనవచ్చును, తగిన కన్యను చూస్తానుఅని ఆరంభించింది.

ఇది విని ఆచార్యులవారు- 'తల్లీ! నేటినుండి నేనొక యింటిక సంబంధించిన బిడ్డను కాను. అన్ని యిళ్లు నాకు సొంతమే. సంన్యాసము తీసుకొనడానికి నీవు నాకు అనుమతి ఇచ్చేవు; ఆ విషయం మరచితివేమో! నేనింక ఇచ్చటనుండి వెళ్లిపోవాలి' అని ఆమెకు నమస్కరించేరు.

'సర్వవంద్యేన యతినా ప్రసూ ర్వంద్యా హి పాదరం' అందరూ సంన్యాసికి నమస్కరిస్తే సంన్యాసి తల్లికి నమస్కరించాలి. పిమ్మట ఆచార్యులవారు ఇక తనకు తల్లి, తండ్రి, కుమారుడు ఎవరూ లేరని భావించేరు.

భిక్షప్రదా జనన్యః పితరొ గురవః కుమారకాః శిష్యాః|
ఏకాంతరమణ హేతుః శాంతి ర్దయితా విరక్తస్య||

- వైరాగ్య శతకము.

''సంన్యాసినైన నాకు భిక్షచేసేవారే తల్లులు. జ్ఞానోపదేష్టలైన గురువులే తండ్రులు; శిష్యులే కుమారులు. నేను ఈ విశ్వకుటుంబానికి చెందిన వాడను'' అని ఆచార్యులవారు తల్లితో చెపుతూ ఏమైనా నీవు నన్ను తలచగానే నేను నీ దగ్గరకు వస్తాను' అని ఆమెకు నచ్చజెప్పి సక్రమ సంన్యాసస్వీకారానికి యోగ్యగురువును అన్వేషిస్తూ బయలుదేరేరు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/5-2.html

శంకరచరితామృతము : 4 : బాల్యం - 1



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 4
బాల్యం - 1

@ శంకరవాణి

ఆచార్యులవారికి ఐదవయేట ఉపనయనం అయింది. ఉపనయనము 'కామ్యోపనయనము, నిత్యోపనయనము' అని రెండు రకాలు. ఏడవేట అనగా గర్భాష్టమమందు ఉపనయనం చేయాలి. బ్రహ్మతేజాన్ని అభ్యర్థించేవారు ఐదవయేటనే ఉపనయనం చేయాలి.

ఆచార్యులవారు మూడేండ్లువయసునాటికే దేశభాషలు నేర్చుకొన్నారు. ఐదేండ్లవయసు వచ్చేసరికి వారు సంస్కృత భాషను చక్కగా అభ్యసించేరు. ఉపనీతులైన తరువాత ఎనిమిదవ ఏడు వచ్చులోగా వేదశాస్త్రాలు అభ్యసించేరు. ఉపనీతులై వారు గురుకులవాసం చేసేరు. ఎనమిదవయేటికి ఇంటికి తిరిగి వచ్చేరు. అప్పటికి వారి తండ్రి దివంగతు లయ్యేరు. అపుడు ఆచార్యులవారు తాము కేవలం ఇంటిలో కూర్చుండుటకు కాక లోకాన్ని ఉద్ధరించుటకు వచ్చితిమని భావించేరు. ఈ లోకోద్ధరణకార్యాన్ని కొనసాగించడానికి సంన్యాసం స్వీకరించవలెనని వారు నిశ్చయించుకొన్నారు. అయితే వారి తల్లి తనకీయన ఒక్కడే కుమారుడు అయినందున వీరికి వివాహము చేయవలె నన్న ఆలోచనలో ఉన్నారు. అందుచే ఆచార్యులవారు తమ తల్లితో 'అమ్మా! నేను సంన్యాసము తీసికొంటాను, అని చెపితే ఆమెకు దుఃఖం కలుగుతుందని సంశయించసాగేరు.

ఆదిశంకరులు సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాన్నముతోడనే జీవించేవారు. ఆరోజులలో ఒక ద్వాదశినాడు వారు భిక్షాటనం చేస్తూ 'భవతి భిక్షాం దేహి!' అంటూ ఒక దరిద్రుని యింట అడుగు పెట్టేరు. ఆయన వారిని అనుగ్రహించాలన్న ఊహతోడనే అలా వారి యింటికి వెళ్ళేరు. ఆగృహస్థు పరమదరిద్రుడు. ఉంఛవృత్తితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆచార్యులవారు వెళ్ళిన వేళకు ఆబ్రాహ్మణుడు ఇంటిలో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. మహాతేజస్సంపన్నులైన ఆచార్యులవారిని చూడగానే ఈ తేజస్వికి భిక్షపెడితే మేలు కలుగుతుంది, అని ఆమె అనుకొన్నది. ఆచార్యులవారిని చూచీ చూడడంతోటే అందరకూ ఒక గౌరవభావం ఆయనపై ఏర్పడేది. ఆ బ్రాహ్మణుని భార్య భిక్షవేయడానికి ఇంటిలో ఏముంది? అని వెదుక సాగింది. ఇంటిలో ఏమీ లేదు. ద్వాదశిపారాణానికై ఆ బ్రాహ్మణుడు ఒక ఉసిరికాయను సంపాదించి ఉంచుకొన్నాడు. అది కూడా చెడిపోయింది. ఈ బ్రహ్మచారికి ఈ ఉసిరికాయ భిక్షగా ఎట్లు వేయను? అని ఆమె సంకోచిస్తోంది.

కాని ఆచార్యులవారు ఆమె భక్తిని గ్రహించి ఆ ఉసిరికను గ్రహించేరు. అపుడు వారి దారిద్య్రాన్ని పోగొట్టుమని లక్ష్మీదేవిని ఉద్దేశించి 'కనకధారాస్తవం' అనే ఒక స్తవాన్ని చదివేరు. వారికి ఐశ్వర్యం ప్రసాదింపుమంటూ లక్ష్మీదేవిని వేడుకొన్నారు.

అప్పుడొక ఆశరీరవాణి-'వీరు చేసిన పాపం చాలా ఉంది; చాలాకాలం వీరు దరిద్రులుగా బాధపడాలి, అలా కాకుంటే వీరి పాపం తొలగదు' అని వినిపించింది.

అంతట ఆచార్యులవారు - 'వీరీవిధంగా పరమప్రీతితో భిక్షం పెట్టినారుకదా! దీనివలన సంపాదితమైన పుణ్యం ఎంత అధికమైన పాపాన్ని అయినా పరిహరింపజాలి ఉంటుంది'- అన్నారు. వెంటనే ఆ దరిద్రబ్రాహ్మణుని యిల్లు సకల సంపదలకు ఆలవాలమై ఐశ్వర్యంతో నిండింది. ఇది ఆచార్యులవారు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా జరిగిన విషయం.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/4-1.html

Monday, 24 April 2017

పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి



పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

అద్వైతం సర్వాన్నీ సమ్మతిస్తుంది. ఆ అద్వైతస్థితిని పొందాలంటే వేదాలు చెప్పినట్లు కర్మానుష్ఠానాలు చెయ్యాలి. కర్మాచరణంలో మనం ఎంత శ్రద్ధా విశ్వాసాలు చూపిస్తామో అద్వైతస్థితి అంతగా సన్నిహితం అవుతుంది. కర్మానుస్ఠానానికి భేదస్థితి అవసరం. దానివల్లనే అభేదస్థితి చేకూరుతుంది.

'అదేమిటి? భేదాన్ని పాటిస్తూ కర్మాచరణం చేసిన వానికి భేదస్థితే లభిస్తుంది కాని అభేదస్థితి లేక అద్వైతం ఎలా లభిస్తాయి? అద్వైతం ప్రాపించాలంటే ఉన్న నియమాలు నిబంధనలు అన్నీ తొలగాలి- ఈ నియమాలన్నీ ఎందుకు? ఇవన్నీ అద్వైతస్థితికి అభేదస్థితికి బాధకాలు కావా?' అని కొందఱు తలుస్తూ ఉంటారు.

కాని మనం చాలా పెద్దబంధంలో చిక్కి ఉన్నాము. కామక్రోధాలకు వశులమై మనము సంపాదించిన పాపాలమూట చాలా పెద్దిది. దాని నెలా వదల్చుకోగలం? అన్నది ముందు ఆలోచించాలి. వర్ణాశ్రమధర్మాలు అనే వేరొక బంధంలో చిక్కుకొంటే కామక్రోధాల బంధం సడలుతుంది. పాపాచరణానికి తావుండదు. క్రమంగా మానవుడు నిస్త్రైగుణ్యస్థితికి చేరుకొంటాడు. ఆ స్థితికి చేరుకొన్న వానికి విధి నిషేధాలు లేవు.

'నిస్త్రైగుణ్య పథి విచరతాం కోవిధిః కోనిషేదః'

కాగా త్రిగుణాలకు (సత్వరజస్తమోగుణాలు) కట్టుబడి ఉన్నంతవరకు వర్ణాశ్రమధర్మాలకట్టు తప్పనిదే. ఆ కట్టులేక పోయిననాడు ఈ కట్టు ఉండదు. దానికొరకే యీ అనుష్ఠానాలన్నీ ఆచరించడం.

దేహంలోని బాధను తొలగించుకొనడానికి ఆముదం త్రాగుతూ ఉన్నాం. ఆముదం త్రాగడం బాధగాని సుఖం కాదు కదా! అంటే ఒక బాధను తొలగించుకొనటానికి వేరొక బాధను ఆహ్వానిస్తున్నాం. అలాగే త్రైగుణ్యమైన బంధాన్ని వదల్చుకొనడంకోసం వర్ణాశ్రమధర్మాల బంధంలో చిక్కుకోవాలి. ఈ బంధాన్ని మనం ఎంతగా బిగిస్తే ఆ బంధం అంతగా సడలుతుంది. పూర్తిగా సడలిన మీదట రెండుబంధాలు తొలగుతాయి.

ఇలా కర్మానుష్ఠానాలు చేస్తూ క్రమంగా అద్వైతాన్ని పొందాలని ఆచార్యువారు చెప్పేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/blog-post_24.html
 

Sunday, 23 April 2017

శంకరచరితామృతము : 2 : అవతారకారణము



శంకరచరితామృతము : 2 : అవతారకారణము
పరమాచార్యుల అమృతవాణి

@ శంకరవాణి


యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం||


'ధర్మం క్షీణించి అధర్మం విజృంభించిన సమయంలో నేను పుడమిపై అవతరిస్తాను' అన్నారు శ్రీకృష్ణభగవానులు. అనగా వెనుక వివస్వానునకు దెల్పిన యోగం యిప్పుడు లోకంలో నశించింది. దానిని పునరుద్ధరించడానికే నా యీ అవతారం. నేను నారాయణుడను, నీవు నరుడవు. వెనుకటి అనేకములైన పుట్టుకలు నేనెరుగుదునే కాని నీ వెరుగవు అని అంటారు ఆయన. ఇలా శ్రీకృష్ణులు ఎన్నోసార్లు అవతరించేరు. ప్రతి అవతారములోనూ జ్ఞానోపదేశంచేశారు. ఎప్పుడు జ్ఞానోపదేశం చేసినా ఈశ్వరునితో అభేదంగా ఉండి విశ్వరూపం ప్రదర్శిస్తూ (భిన్న భిన్న విధాలుగా) వచ్చేరు.

జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిదే లభింపదు.

ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్‌ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్‌|
ఈశ్వరాత్‌ జ్ఞాన మన్విచ్ఛేత్‌ జ్ఞానదాతా మహేశ్వర:||


జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.

నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.

శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.

కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.

'అతికళ్యాణరూపత్వా న్నిత్యకల్యాణ సంశ్రయాత్‌'

శివము, కల్యాణము, మంగళము, శుభము అన్నీ శివుడే, ఆ శివుడే పరమ మంగళస్వరూపులైన మన ఆచార్యులు.

ఆదిలో ఉండే అద్వైతాన్ని ఉపదేశించడానికై ఈశ్వరాంశ మన ఆచార్యులుగా అవతరించింది. కలిలో అధర్మం ఎలాగూ ఉంటుంది. కాని ఆ అధర్మం పెరుగకుండా నిరోధించాలి .

మన ఆచార్యులు ప్రధానంగా అద్వైతాన్ని బోధిస్తూ దానికి దిగువ భిన్నమత సంప్రదాయాలకు నిలువనీడ నిచ్చారు. ఇలా ఎందుకు చేసేరు? అంటేపరమమైన మోక్షానికి అంతా అధికారులుకారు. కొందఱు మోక్షానికి అధికారులైతే మరికొందరు వారితో సమానమైన పక్వతలేని వారై సాధనపథంలో వారి కంటే దిగువ నిలువవలసినవారుగా ఉంటారు. ఆ మతం వారి వారి పక్వత ననుసరించి ఆయా మతాలు ఉపయోగిస్తాయి. కాని అన్నిటికి గమ్యం అద్వైతం కావాలి. అది మరుగున పడిపోకూడదు. అందుకే వారు ఎన్నిమతాలున్నా అన్నిటికి శిఖరంగా అద్వైతాన్ని బోధించారు.

నీరు అన్నిచోటులందు ఉంటుంది. కాని అన్నిచోటులందు నిర్మలంగా ఉండదు. బావినీరున్నది. అది నిర్మలంగానే ఉంటుంది. దానిలో మలినాలు కలియడానికి అవకాశం లేదు. అలాగే అద్వైతమూ- మిగిలిన మతాలు ఉన్నాయి. మిగిలినవి చిక్కుమార్గాలైతే అద్వైతం రాజమార్గం. వానిద్వారా మోక్షసిద్ది ఎప్పటికో! కాని అద్వైతం శ్రీఘ్ర సిద్ధి నిస్తుంది. 'సూతసంహిత, వైద్యనాధదీక్షితయము' అనే గ్రంథాలలో - ఈ విషయమే చెప్పబడ్డది.

శ్రీశంకరభగవత్పాదులు అవైదికమతాలను కూకటి వ్రేళ్లతో పెల్లగించడానికై అవతరించారు, ఉపాసనా, కర్మజ్ఞానమార్గాలను దాటిన అద్వైతాన్ని స్థాపించడానికి అవతరించారు. ఆయన దిగ్విజయం చేసేరు. వాస్తవానికి దిగ్విజయం చేసినది ఆచార్యలొక్కరే. వారు ఈలోకంలో ఉన్నది కేవలం ముప్పదిరెండు సంవత్సరాలు. బాల్యం పదిసంవత్సరాలు. బాల్య పదిసంవత్సరాలు అనుకొంటే మిగిలినది ఇరువదిరెండు సంవత్సరాలు, ఈ కాలంలో వారు ఆసేతుశీతాచలం మూడుసార్లు పర్యటించేరు, దిగ్విజయం చేసేరు. దీనికి నిదర్శనాలేమిటి? అని ఎవరైనా శంకించవచ్చు. బదరీనారాయణానికి ఆచార్యులు వెళ్లినట్లు నిదర్శనాలున్నాయి. అలాగే దక్షిణాన 'కాలడి'లో వారు జన్మించినట్లు నిదర్శనాలున్నాయి. వారు దేశంలో పలుచోటుల సంచరించినట్లు ఎన్నో సాక్ష్యాలున్నాయి. అన్వేషించేవారికి అవి దుర్లభాలు కావు. ఇలా అల్పకాలంలో విస్తారమైన దేశంలో పర్యటించి ఎన్నో మహాకార్యాలు నిర్వర్తించినవారు సామాన్యులు కారు వారు ఎవరో అవతారపురుషులు అని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది.

రామకృష్ణాదులు తాము అవతారాలైనప్పటికి ఇహలోకంలో తమ స్థానాలకు విహితములైన ధర్మాలను అనుసరిస్తూ వానికి అనుగుణంగానే నడచుకొంటూ వచ్చేరు. అట్లే శంకర భగవత్పాదులు కూడ తాము సాక్షాత్‌ పరమేశ్వరులే అయినప్పటికి పూజాద్యనుష్ఠానాలు యథావిధిగా ఆచరిస్తూ భక్తులవలె నడచుకొన్నారు. అందుచే అవతారం మొదలు సిద్ధిపర్యంతమై వీరిచరిత్ర పూర్తిగా శివరహస్యంలో భక్తుల చరిత్రకల నవాంశలో పదునారవ అధ్యాయంలో వర్ణింపబడింది.

కేరళే శశలగ్రామే విప్రపత్న్యాం మదంశజః|
భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో దిజోత్తమః||

- శివరహస్యము.

అని అందు ఉన్నది. అందులో శంకరుల కాలం కలి ఆదిలో రెండువేల సంవత్సరాలకు పిమ్మట అని కానవస్తుంది. ఇక వారి చరిత్రను గూర్చి 'శంకరులు కైలాసానికి వెళ్ళి భోగ లింగము, యోగలింగము, వరలింగము, ముక్తిలింగము, మోహలింగము అనే ఐదు లింగాలను తెచ్చారని, వానిని ఆరాధించియే ఇతరమతాలను ఖండించి దిగ్విజయం చేయగలిగేరని, ఇది అంతా ఆ లింగారాధనవల్ల కలిగిన బలమని'- ఆ గ్రంథంలో వ్రాయబడ్డది. అది శివమహాత్మ్యాన్ని తెలిపే గ్రంథం కదా! అందుచే ఆచార్యుల దిగ్విజయానికి కారణం పంచలింగారాధనం అని చెప్పినది.

శంకరవిజయ గ్రంథాలకు వ్యాఖ్యలు వ్రాసినవారు తమ వ్యాఖ్యలలో శివరహస్యంలోని శ్లోకాలను ఉదహరించేరు. శివ రహస్యం వాస్తవానికి ద్వైతగ్రంథం. శ్రీ శంకరులు పునరుద్ధరించినదీ అద్వైతసిద్దాంతం. ద్వైతమతావలంబకులు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు. అది వారికి సహజం. అయినా శివరహస్యంలో ఆచార్యులచరిత్ర ఉంది. ఇది విశేషం. మూడు వేళలా బిల్వదళాలతో శివార్చనం చేయుమని పరమేశ్వరుడు శంకరులకు ఆజ్ఞాపించేరని అందులో ఉన్నది.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/2.html

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1 : శంకరుల గురుపరంపర



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1

శంకరుల గురుపరంపర : గౌడపాదులు, గోవింద భగవత్పాదులు

@ శంకరవాణి

పతంజలి ఆదిశేషుని అవతారం. వ్యాకరణ మహాభాష్యం వ్రాసింది వీరే. వేయి జిహ్వలు కల ఆ పతంజలి చెప్పిన వ్యాకరణ భాష్య ప్రశస్తి విని దానిని చదువుకొనడానికి వేయిమంది శిష్యులు వచ్చారు. పతంజలి చిదంబరంలో వేగాళ్ల మంటపంలో ఉన్నారు. వేయిమందికి ఒకేమారు సందేహనివారణం చేయవలెనంటే ఒక నాలుక ఏం చాలుతుంది? అందు కోసం వారు ఆదిశేషునిరూపం తాల్చారు. అయితే శేష దృష్టి విష దృష్టి, నిట్టూర్పులు విషం కక్కుతూ వుంటై. అవి సోకితే ఎవరయినా సరే చిటికలో చిటికెడు భస్మమైపోతారు. అందువల్ల ఆయన తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టారు. తెరలోపల తామూ తెర వెలుపల శిష్యులూ పాఠం చెపుతూ వుండగా నడుమ ఎవరు లేచి పోయినా సరే వారు బ్రహ్మరాక్షసులయిపోతారని పతంజలి ఒక కట్టడి చేశారు.

ఆజ్ఞ తీసుకొనకుండా బయటికి పోయినవాడు బొమ్మరాకాసి అయిపోతాడని కట్టడి చేసి పతంజలి ఆదిశేషుడై తెరలోపల కూర్చుండి పాఠం చెప్పడానికి పూనుకొన్నాడు. ఆ శిష్యులలో ఒకనికి మాత్రం సందేహం తోచింది - 'మనమేమో వేయిమందిమి, ఒక్కడు ఈ వేయి మందికీ ఎట్లా సమాధానం చెపుతాడు?' అని ఇట్లా అతడు సందేహించి ఆజ్ఞోల్లంఘనం చేసి తెర తొలగించి చూచాడు. అట్లా చూచాడో లేదో విషదృష్టి వారందరిమీదా ప్రసరించింది. అక్కడున్న శిష్యులందరూ పిడికెడుబూడిద అయిపోయారు. బూడిద అయిపోయిన వారు తొమ్మన్నూట తొంబది తొమ్మిది మంది. ఒకడు మాత్రం ఎక్కడికో వెళ్లాడు. అతగాడు కొంచెం బండబ్బాయి. అతనికి పాఠం తిన్నగా తెలియడం లేదు. కొంతసేపు అటూ ఇటూ తిరిగి వస్తే బుద్ధి స్థిరపడి పాఠం సరిగా అర్ధం అవుతుందేమో అని అనుకొని అతడు బయటికి వెళ్లాడు. ఇక్కడ భస్మమయి పోయిన శిష్యులను చూచిన ఆదిశేషుడు మళ్లా పతంజలియై వారి దుర్మరణానికి దుఃఖిస్తూవుండగా, వెలికి వెళ్ళిన శిష్యుడు - ''గురువుగారి ఆజ్ఞ మీరి బయటికి వెళ్ళితినే, గురువేమి కోపం తెచ్చుకుంటాడో'' అని బితుకు బితుకుమంటూ వచ్చాడు. పతంజలికి అతనిని చూడగానే సంతోషం కలిగింది. బండబ్బాయి అయితే అయినాడుకాని ఒకడయినా మిగిలాడుగదా అని ఊరటచెందాడు. ఇక అతనికి పాఠం చెప్పేటంత వ్యవధి తనకు లేదు. కాబట్టి అతనిని ఎట్లాగయినా అనుగ్రహించాలని - 'నాకు తెలిసినదంతా నీకు తెలియాలి. అయినా నా ఆజ్ఞ దాఁటి నీవు ఆవలికి వెళ్ళావు. కాబట్టి బ్రహ్మరాక్షసుడ వవటం నీకు తప్పదు. కాని దాని కొక నివృత్త్యుపాయం ఉన్నది. నే నిచ్చిన విద్యను పాత్రమెరిగి నీ వెపుడుపదేశిస్తావో అపుడు నీకీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని అన్నాడు. అనుగృహీతుడయిన ఈ శిష్యుడే గౌడపాదులు. ఆయన గౌడదేశం నుంచి వచ్చారు. ఆయన గురుశాపంచేత బ్రహ్మరాక్షసుడై కూచున్నాడు.

బొమ్మరాకాసి ప్రతిదినమూ ఒక బ్రాహ్మణ్ణి వేదాధ్యయనం చేసినవాణ్ణి గుటకాయ స్వాహా చేస్తూ ఉంటాడు. ఒక శాఖను అధ్యయనం చేసిన వాణ్ణి దూరంగా ఎత్తుకొని పోయి పలు తీరుల ప్రశ్నలు వేయడమూ, వాళ్ళు ప్రత్యుత్తరించలేక పోవడమూ గుటకాయ స్వాహా చేయడమూ ఇది బొమ్మ రాకాసులకు మామూలు. బొమ్మరాకాసి అయిపోయిన గౌడుడు నర్మదాతీరంలో ఒక రావిచెట్టు మీద కూచున్నాడు. ఆ చోటు పంచగౌడ దేశాలకూ పంచద్రావిడ దేశాలకు నట్టనడుమ ఉన్నది. దక్షిణమునుండి ఉత్తరానికిన్నీ ఉత్తరము నుండి దక్షిణానికిన్నీ పోయేవారికి అది దారి. ఉత్తరదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు చదవబోయే దాక్షిణాత్యులున్నూ దక్షిణదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు నేర్వపోయే ఔత్తరాహులున్నూ అనుదినమూ ఆ దారిగుండానే రాకపోకలు చేస్తూవుండేవారు. గౌడులు ఆ వచ్చిపోయేవారిని వ్యాకరణంలో ఒక ప్రశ్న అడిగేది, వారు దానికి బదులు చెప్పలేకపోయేది, ఆ పళంగా వారిని చంపి ఫలాహారం చేసేది. ఇది వాడుక ఐపోయింది. పచ్‌ (డు పచష్‌ పాకే) అనే ధాతువొకటి ఉన్నది. దానికి నిష్ఠాప్రత్యయమైన క్త చేరిస్తే 'పక్వమ్‌' అని అవుతుంది. కాని 'పక్తమ్‌' అని మాత్రం కాదు. దీనికి ప్రత్యేకించి - 'పచో వః' (8-2-52) అని ఒక సూత్రమున్నది. దాని వల్ల 'పక్త' అని కాక 'పక్వ' అని అవుతుంది. గౌడ బ్రహ్మరాక్షసుడువైయాకరణుడు ఎవడయినా కనబడితే 'పచ' ధాతువుకు నిష్ఠలో రూపం ఏమిటి? అని ప్రశ్నించేవాడు. 'పక్తం' అని సమాధానం వచ్చేది. ఎంచేత నంటే అప్పటికింకా మహాభాష్యం అవతరించలేదు. 'పచ' అనే ధాతువుకు నిష్ఠలో వేరు రూపం కలుగుతుందని తెలియని కాలం అది. 'పక్తమ్‌' అని చెప్పగానే - 'పక్తం కాదు; పక్వమ్‌, అని ఔతుంది, నీవు కూడా పక్వమనే అని అంటూ ఆబొమ్మరాకాసి వానిని గుటుక్కున నోట్లో వేసికోనేవాడు. ఇది గౌడుల దినచర్య.

ఇట్లా ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆ తోవన వచ్చాడు. చాలా చక్కగా ఉన్నాడు. బొమ్మరాకాసి అతనిని చూడంగానే ఉప్పొంగిపోయాడు. ఎంచేత? నాటికి మంచి ఆహారం దొరికిందీ ఇంకేం తన అస్త్రం తీశాడు. అతడు మహాభాష్యం శాంతిచేయడానికి కాశ్మీరం నుంచి చిందంబరం వెళుతున్నాడు. అతన్ని నిలేసి ఆ బొమ్మరకాసి 'పచ' ధాతువుకు క్త ప్రత్యయం చేరిస్తే ఏమిటిరూపం? అని అడిగాడు. అతడు 'పక్వమ్‌' అని చెప్పాడు. గౌడునకు అపరిమితమయిన ఆనందం కలిగింది. 'ఎన్నో నాళ్ళుగా సరియయినవాడొకడయినా రాలేదు, నేటికి అట్టి వాడవు నీవు వచ్చావు, నీవు సరియయిన శిష్యుడవు. నా గురువు గారు నాకు చెప్పిన విద్యలన్నీ నీకు చెపుతాను, నీ వెక్కడికి వెళుతున్నావు' అని అడగాడు. అతడు వ్యాకరణం చదువు కోడానికి చిదంబంరం పోతున్నాను' అని చెప్పినాడు. 'నాయనా' అలాగా? చిదంబరం విషయం ఎపుడో కొండెక్కింది. అచట నీవు అభ్యసింపగోరే విద్యలను నేనే నీకు చెప్పగలను, నీ విక్కడ ఉండేం' అని గౌడు లన్నారు.

బ్రహ్మరాక్షసుని గురువునుగా వరించి ఎవరు నెగ్గగలరు? దయ్యాలముందు బిడ్డలా? ఎనాళ్ళా బ్రహ్మరాక్షసుడు పాఠం చెబుతాడో అన్నాళ్ళూ చెట్టుదిగరాదుగదా, నిద్రాహారాలుండవు గదా, పాఠాలు రాక్షసివేగంతో ముగించాలిగదా! ఇవన్నీ ఇలా తెలిసినన్నీ శిష్యుడు విని అన్నింటికీ తల ఒగ్గాడు.

పాఠాలు వ్రాసికొందామంటే తాటాకులూ లేవు, గంట మంతకంటే లేదు. పైగా చెట్టు చివరమెట్టు మీద పాఠశాల. చెట్టు దిగకూడదు. అంచేత ఆ శిష్యుడు తన తొడ చీరుకొని అందుండి కారే నెత్తురులో ఒక పుడక కలముగా ముంచి రావాకులమీద ఆ బొమ్మరాకాసి చెప్పేదంతా వ్రాసికోవడం సాగించాడు. ఇలా తొమ్మిది రోజులు నిద్రాహారాలు లేక గడచినవి. ఆ రావియాకులలో ఆ శిష్యుడు వ్రాసికొన్న పాఠమే మహాభాష్యం. ఆ శిష్యుని పేరు చంద్రశర్మ. ఈ కథ పతంజలి విజయం అనే పుస్తకంలో చూపబడుతుంది. పతంజలియే తన శిష్యుడయిన గౌడునికి శాపవిమోచనం చేయడానికి చంద్రశర్మగా వచ్చినటులు ఆ గ్రంథంలో చదువుతాం. ఈ చంద్రశర్మయే తరువాతి ఆశ్రమమున శ్రీ శంకరులకు గురువుగా గోవింద భగత్పాదులను పేర అవతరించారు. గౌడులు గౌడ పాదాచార్యులవారు అనే ప్రసిద్ధి పొందారు.

చంద్రశర్మ వ్యాకరణం పూర్తిగా అయింది. గౌడులకు శాపనివృత్తి అయింది. 'నాకిక వైరాగ్యం శరణ్యం, ఆత్మను ధ్యానించాలి. దానిని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలి' అని గౌడపాదులు ఆలోచించి ఆలోచించి సమకాలికులలో అట్టివారు, జన్మతోనే జీవన్ముక్తలయినవారు ఎవరా అని తఱచిచూడగా శుక్లాచార్యులు అని అనుకొన్నారు. శుకులు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. యత్నమే లేదు. యజ్ఞాద్యనుష్టానాలు అంతకు ముందే లేవు. 'అంతా మనమే' అని భావించినవారు శుకులు. అనగా అన్నిటిలోనూ నేను ఉన్నానని అర్థం. అట్టి శుకాచార్యుల అనుగ్రహం పొందాలని గౌడసాదులనుకొన్నారు. శ్రీ శుకాచార్యులవారు హిమాలయములో బదిరాకశ్రమంలో ఉన్నారని తెలిసికొన్నారు. తెలిసికొని వారి కడకు వెళ్లారు. వారి దగ్గర సన్న్యాసం పుచ్చుకొన్నారు. అపుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు.
గౌడపాదులు శ్రీ శుకులవద్ద సన్యాసం స్వీకరించి ఆత్మ నిష్ఠయందున్నారు.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కుమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. ఇట్టి చికిత్స మన వైద్య శాస్త్రాలలో చెప్పబడ్డది. నేడు 'ఇంజెక్షనుల' ద్వారా అన్నసారాన్ని శరీరంలోకి ఎక్కించే విధానం ఉన్నది. కాని ఇది హింసతో కూడినది. శరీరమున సూదితో క్రొత్తగా నొక రంధ్రము చేయనిదే యిది సాధ్యం కాదు. కాని పై చికిత్స సులభమైనది. సహజమైనది. కేరళదేశంలో నేటికిని దీనిని పోలిన చికిత్స ఆచరణలో ఉన్నది.

మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు. అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు. కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజు కదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లీడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది. అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు. ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు.

కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది. ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/1.html
 

Saturday, 22 April 2017

పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది



పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది
(జగద్గురుబోధల నుండి)

@ శంకరవాణి

కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.

జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.

మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.

కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ప్రయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.

ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.

అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.

'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు. 

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/blog-post.html

Sunday, 4 December 2016

పరమాచార్యుల అమృతవాణి : స్కంద వైభవము



పరమాచార్యుల అమృతవాణి : స్కంద వైభవము
(జగద్గురుబోధల నుండి)

@ శంకరవాణి

సంస్కృతంలో నామలింగానుశాసనం చేసే గ్రంథం ఒకటి ఉన్నది. దాని పేరు అమరకోశం. అది సంస్కృత నిఘంటువు. సంస్కృతాన్ని ఇపుడు మృతభాష అని అంటున్నారు. కానీ మనవాళ్లంతా సంస్కృతాన్ని దేవభాష - అమరులభాష అనియే వ్వవహారించారు. ఆ సంస్కృతభాష యొక్క కోశమును అమరకోశముని పేరు. సంస్కృతభాషకు అమరభాష ఐన దాని వలన ఈపేరు దానికి రాలేదు. గ్రంథకర్తపేర అమరసింహుడు అగుటచేత ఆయన వ్రాసిన గ్రంథానికి అమరకోశమని పేరు వచ్చింది. అమరసింహుడు జైనుడు. అతడు ఆచార్యులవారితో వాదానికిదిగి ఓడిపోయాడు. ఆ అవమానం భరించలేక తాను వ్రాసిన గ్రంథములను తగులబెట్టడానికి పూనుకొన్నాడు. ఆచార్యులవారికి ఇది తెలియవచ్చి అతడు చేస్తున్న పనికి అడ్డుతగిలారు. కడపటకు మిగిలినది ఒక్క పుస్తకం. అదే అమరకోశం.

స్వామి అన్నపదం పొదుపుగా అన్నిదేవతలకూ అనువర్తించినా అది ప్రముఖంగా సుబ్రహ్మణ్యస్వామికే అనువర్తిస్తుంది. వెంకటరమణస్వామి, నృసింహస్వామి అని ప్రతి దేవతా విశేషమునకు స్వామి అన్నపదం చేర్చి చెప్పుతుంటాము. ఊరక స్వామి అని అంటే - అస్వామి అన్నపదం సుబ్రహ్మణ్యమునే సూచిస్తుంది - దీనికి ఆధారం కావాలంటే అమరకోశం చూడవచ్చును. అందులో - ''దేవసేనాపతిః శూరః స్వామీ గజముఖానుజః'' అని సుబ్రహ్మణ్యస్వామిని గూర్చి చెప్పిన పదములలో 'స్వామి' పదం వాడబడియున్నది.

స్వామిపదం సుబ్రహ్మణ్యమునే సూచిస్తుందని అనడానికి మరొక ఆధారంకూడా వున్నది.

తిరుపతిక్షేత్రం సుబ్రహ్మణ్యునికి సంబంధించినదని చెప్పుకోవటం మీరు వినేవుంటారు. వెంకటరమణుడు సుబ్రహ్మణ్యుడే అని విశ్వసించే వాళ్ళు వున్నారు. కాని నా అభిప్రాయంలో వెంకటరమణస్వామి సర్వదేవతాత్మకమైన పరమాత్మ అనియే. అయనే విష్ణువు. ఆయనే పరమేశ్వరుడు. అందుచేతనే అక్కడ బిల్వార్చన జరుగుతున్నది. అంబికయు ఆయనే. ఇప్పటికీ ఆయనకు అభిషేకము శుక్రవారమునాడే జరుగుచున్నది. శుక్రవారము అమ్మవారికి వినియుక్తమైన రోజు. వారికి చీరనే కట్టుచున్నారు. అంతా ఆయనే అని నా అభిప్రాయం. ఆయనను సుబ్రహ్మణ్యస్వామి అని అభిప్రాయపడేవారు చెప్పేకారణము, వారు కొండశిఖరమున ఉండటం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు సాధారణంగా కొండమీదనే వుంటాయి. ఉత్తరహిందూ స్థానీయులు ఏడుకొండలవానిని బాలాజీ, బాలాజీ అని వ్యవహరిస్తారు. బాలుడు, కుమారుడు అన్నపేళ్ళు శివశక్తులకు పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామినే సూచిస్తవి. తిరుపతిలో కుమారధార అనే ఒక తీర్థముకూడా ఉన్నది. ఆలయానికి ప్రక్కనేఉన్న తీర్థము పేరుకూడ - స్వామి పుష్కరిణి. స్వామి అనగా కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడే. సకలలోకములను, జీవులను, జడవస్తువులనూ తనసొత్తుగా (స్వం) కలవాడే స్వామి అయితే ఆపేరు విశేషముగా ఎందులకు సుబ్రహ్మణ్యుని పట్లనే వ్యవహరింపబడుచున్నది? వారి కంతగొప్పతన మెట్లావచ్చింది?

ఆకాశం మేఘావృతమై, వరం కురియబోతుందనగా ఒక్కమెరుపు ఆకాశం ఈ అంచునుంచీ ఆ అంచువరకూ మెరుస్తుంది. ఆ క్షణంలో తిమిరం తిరోహితం అవుతుంది. కొన్ని లక్షలజనరేటర్లు ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తి ఆ ఒక్కక్షణంలో వెలిగిపోతుంది. ఆ విద్యుచ్ఛక్తి అంతకుముందు లేదా? లేని వస్తువు ఏలా వ్యక్తమౌతుంది? శాస్త్రజ్ఞులు విద్యుచ్ఛక్తి ఎల్లకాలమందునూ, సర్వత్రా వున్నదనీ అంటారు. కానీ అది మనకు వ్యక్తమవటంలేదు. నీటినుంచి పుట్టన ఆవిరి మేఘములుగా మారినపుడు, ఆశక్తి ధనధృవాంశగాను, (పాసిటివ్‌), ఋణధృవాంశగానూ, (నెగటివ్‌) ఉంటున్నది. ఆ మేఘములు గుమిగూడినపుడు వానిలో ఒక సంచలన మేర్పడి రెండు ధృవములూ చేరి, మెరపువలె మెరుస్తున్నవి. అవి విడిపోయినపుడు మెరుపు మాయమౌతున్నది. ఇది జడశక్తుల నుంచి పుట్టుతున్న విద్యుచ్ఛక్తి. ఈ జడశక్తులకు ఆధారముగా మరొకశక్తి యున్నది. అదియే చిచ్ఛక్తి, లేక జ్ఞానశక్తి . తన శక్తిని తెలుసుకొనక, సర్వవ్యాప్తమైన పరమవస్తువు మొదట ఉన్నది. అది ధనఋణాంశలుగా విభజన మౌతున్నది. వానిచే మనము శివము, శక్తి అని వ్యవహరిస్తున్నాము. ఇవి కుడిఎడమలుగా వున్నవి. ఈశ్వరుడు కుడిభాగమునందును, అంబిక ఎడమభాగమునందును నెలకొని యున్నారు.

వీరిద్దరు వేర్వేరుగా వున్న చాలదు. మేఘములున్న చాలదు. ఈ రెండుశక్తులూ కలసిననే మెరుపు పుట్టుచున్నది. శివశక్తులు ఇద్దరూ కలిసిననే జ్ఞానజ్యోతి ఏర్పడగలదు. అట్లేర్పడిన బాలుడే కుమారుడే సుబ్రహ్మణ్యుడు. అతడు శక్తిహస్తుడు. బ్రహ్మత్వము లోకానుగ్రహార్థము మూర్తీభవించినపుడు సుబ్రహ్మణ్యుడని విలసిల్లుతున్నాడు. స్వామి అను నామధేయము ఆయనకే. శివశక్తులు సంయోగమున పుట్టిన కృపామూర్తియే సుబ్రహ్మణ్యుడు.

మేఘములనుండి పుట్టిన తటిల్లేఖ బాహ్యతిమిరాన్ని మాత్రము పోగొట్టుతున్నది. శివశక్తులకు పుట్టిన జ్ఞానజ్యోతి స్కందుడు బాహ్యాంతరతిమిరములను రెంటినీ శాశ్వతముగా తనదివ్యశక్తిచేత పారద్రోలుతున్నాడు. విద్యుద్ఘాతమునకు, (పిడుగు పడినపుడు) మనిషి మరణిస్తున్నాడు. స్కందుని శక్తి అట్లాకాక అనుగ్రహదాయకమై మనకు అమరత్వాన్నీ అమృతత్వాన్నీ యిస్తున్నది. ఆ శక్తి తనవలెనే మనలను కూడా మార్చివేయుచున్నది. అరుణగిరినాథుడు అనే ఆయన ద్రావిడదేశములో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. ఆయన 'కందరనుభూతి' అనే ఒక గ్రంథాన్ని వ్రాశాడు. అందులో ఆయన అంటాడు; ''వేర్వేరుగా నున్న శివభక్తులేకమై ఒక దివ్యశక్తి నుత్పాదించి, ఆ శక్తి అనుగ్రహంచేత, ద్వైత భ్రమలోవున్న మనలను ఏకత్వంలోనికి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నది.' అని.

అరుణగిరి తానువ్రాసిన తిరుప్పుగళ్‌ అనే స్తోత్రగ్రంథములో ప్రతియొక్క స్తోత్రములోనూ చివర 'పెరుమాళే' అని ముగిస్తున్నారు. పెరుమాళ్‌ అనగా పురుషోత్తముడు. పెద్ద మనిషి. ఈ పదం విష్ణుపరమైనది. శివశక్తులకు పుట్టిన సుబ్రహ్మణ్యుని ఆయన వైష్ణవపరంగా కీర్తించుటకూడ అందముగానే వున్నది.

ద్రావిడభాషలో సుబ్రహ్మణ్యుడికి 'మరుగన్‌' అన్నఅభిధానమున్నది. మురుగన్‌, మరుగన్‌ అని వ్యవహారములో నున్నది. మురుగన్‌ అన్న పదానికి అందగాడని అర్థము. మరుమగన్‌ అనగా మేనల్లుడు. స్కందుడు విష్ణవుకు మేనల్లుడు. వళ్ళీ దేవసేన ఇరువురూ విష్ణువు కొమారైలే. అందుచేత సుబ్రహ్మణ్యుడు విష్ణువుకు మేనల్లుడుగానూ, అల్లుడుగానూ వున్నాడు. ఇట్లు శైవమునకూ వైష్ణమునకూ వివాహసంబంధముండట మనం గమనించాలి.

ఉత్తర దేశంలో మాత్రం సుబ్రహ్మణ్యుడు గృహస్థుడుగాకాక, సంతత బ్రహ్మచారిగనే వ్వవహరింప బడుతున్నాడు. కొన్నిచోట్ల ఆయన ఆలయములందు స్త్రీలకు ప్రవేశ బహిష్కరణకూడా కద్దు. అచ్చట వారికి కార్తికేయుడనే అభిధానమే ఎక్కువ.

శివుని లలాటనేత్రమునుంచీ ఆరు అగ్నిశిఖలుద్భవించినవి. అవి శరవణ స్తంబ సంవృతమైన ఒక కొలనులోని కరిగి షణ్ముఖమూర్తిగా పరిణమించినవి. అపుడు కృత్తికా కన్యలు ఆరుగురు వారికి స్తన్యమిచ్చిరి. ఆకాశమందున్న కృత్తికా నక్షత్రములను ఆరునక్షత్రములకు అధిదేవతలు వీరే. కృత్తికాకన్యలచే పెంచబడినందున ఆయనకు కార్తికేయుదన్న పేరుకల్లినది. ఉత్తరభాతములో సుబ్ర హ్మణ్యుని కార్తికేయుడనియు, కుమారుడనియు పిలుచుచున్నారు. అక్కడ సుబ్రహ్మణ్యమను అభిధానమునకు ప్రభావము తక్కువ. కాళిదాసువ్రాసిన గ్రంథమును కూడా ఆయన కుమారసంభవమనియే పేర్కొన్నాడు. ఈ కుమారసంభవ ప్రసక్తి మొదట వాల్మీకి రామాయణమందు వచ్చినది. బాలకాండమునందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కందోత్పత్తిని వివరిస్తున్న సందర్భములో -

''కుమార సంభవశ్చైవ ధన్యఃపుణ్యస్తథైవచ'' - అని వ్రాయబడినది. వాల్మీకికి సాధారణముగా రామాయణసర్గ పారాయణలకు ఫలశ్రుతి చెప్పువాడుక లేదు. కానీ కుమారస్వామి యుత్పత్తి కల ముప్ఫై ఏడవ సర్గము చివర (బాలకాండము)-

భక్తశ్చయః కార్తికేయే కాకుత్‌స్థ భుని మానవః|
ఆయుష్మాన్‌ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్‌||


రామా! భూమియం దేమనుష్యుడు కుమారస్వామి యందు భక్తి కల్గియుండునో అతడు దీర్ఘాయువై, పుత్రపౌత్రాదులతో యుండి అంతమున కుమారస్వామి లోకము నొందునని ఫలశ్రుతి చెప్పబడినది.

ఆదికవి ఐన వాల్మీకి బాలకాండమం దుపయోగించిన కుమారసంభవమనే పదద్వయమును మహాకవి కాళిదాసు మంగళవాక్యముగా గ్రహించి తన గ్రంథమునకు తద్వత్తుగా నామకరణం చేశాడు. కుమారస్వామి అన్నపేరు ననుసరించియే కౌమారమత మేర్పడియున్నది. షణ్మతములని వ్యవహారమందున్నది. గణపతిని ప్రధానముగా ఉంచుకొని చేయు ఉపాసన గాణాపత్యము సూర్యుని ప్రధానముగా ఉంచుకొని ఉపాసన సౌరము. అంబికను పరమతాత్పర్యముగా ఉంచుకొని చేయు ఉపాసన శాకము. శివోపాసన శైవము. విష్ణూపాసన వైష్ణవం. సుబ్రహ్మణ్యుడు పరమాత్మ అని ఉపాసన చేయడమే కౌమారం.

'స్కందసాలోక్యతాం వ్రజేత్‌' అని వాల్మీకి ఫలశ్రుతి చెప్పారు. స్కందుడనే పేరుకూడా చాలప్రసిద్ధమైనది. స్కన్నమైనవాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఈ నామ విశేషాన్ని మనస్సులో వుంచుకొనే కృష్ణద్వైపాయన వ్యాసులవారు వ్రాసిన పురాణానికి స్కాందమని నామకరణం చేశారు. ద్రావిడభాషలో స్కందపదమునకు వికృతి కందుడు. కాంచీ నగరమున ఉండిన కచ్చియప్పశివాచార్యులనే ఒకరు కందపురాణమనే పుస్తకాన్ని వ్రాశాడు.

మాతృదేవోభవ, పితృదేవోభవ అనునవి వేదానుశాసనములు. శివశక్తులు మనకు మాతాపితలుగా నున్నారు. వారు వేర్వేరుగాకాక అర్థనారీశ్వర రూపములో కలసియున్నారు. ఈవ్యవస్థ మనకు పరమలాభదాయకమని మనము వారివద్దకు వెడుతున్నాం. ఇందులో చిక్కులుకూడ లేకపోలేదు. ఈ అమరిక సందేహాస్పదంగా కూడా ఉన్నది. కాళ్ళపైబడి వేడుకొంటామంటే ఎడమ కాలేమో అంబికది. కుడకాలు ఈశ్వరునిది. మనం ఆశ్రయించవలసినది అయ్య పాదమునా? అమ్మచరణమునా? అర్చన చేద్దామంటే ఒకరికి ఒక పుష్ఫం ఇష్టం; మరొకరికి వేరొకటి ఇష్టం. పైగా నిషేధ ద్రవ్యములు వేరే వున్నవాయెను. ఈ వంకపడవలసినవస్తువు అవంకపడితే ముప్పు. పోనీ ఈ పాదాశ్రయాంచాలు కటాక్షం వేడుకొందాం అంటే దానిలోనూ వామదక్షిణ నేత్రముల బెడదవున్నది.

పోనీ అర్థనారీశ్వరులకు అవిభాగమైనవస్తువు ఏదైనా వున్నదా? వారిమనసు అవిభజనీయముకదా? వారి మనస్సు ఏలావుంటుంది? అది ప్రేమప్రపూర్ణము. వారి మనస్సును మనం ఎరుగగలిగితే, మనమనస్సు శాఖామృగంవలె వివిధ దిశలకు పరిభ్రమించదు.

పరమేశ్వరుడు సత్‌, అంబిక చిత్‌ అనిచెప్పే శాస్త్రమువలన ప్రయోజనమేమి? మనలను ఉద్ధరించేది అది కాదు. వారి ప్రేమప్రపూర్ణమైన అనుగ్రహమే. ఈ పరిపూర్ణమైన ప్రేమ వారి కెందున్నది? స్కందునిపైవున్నది. ఆ స్కందుని మన మాశ్రయించామంటే?

స్కందుడు పరమభాస్వరమయిన రూపముకలవాడు. పరాక్రమశాలి. ఎవరికినీ సంహరించుటకు వీలుకాని శూరుడు. తారకుడనే అసురుని పరిమార్చిన మూర్తి. తండ్రియైన శివునికే ఉపదేశించిన జ్ఞానపండితుడు. అరవభాషలో తగప్పన్‌ అనగా తండ్రి. 'తగప్పన్‌స్వామి' అనికూడ వారికొక పేరు. దక్షిణదేశంలో స్వామిమల యనునదొక సుబ్రహ్మణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి ఈశ్వరునికి ఉపదేశం చేస్తున్నారు.

ఈశ్వరుడు కోరి తనకు మించిన పుత్రుణ్ణి కన్నాడు. తండ్రికి సాధారణంగా ఉండే అభిలాష ఏమంటే తాను సర్వోత్కృష్టుడుగా వుండవలెనని కానీ తన పుత్రుడు తనకన్న అధికంగా వుంటే మాత్రం తండ్రి సంతోషిస్తాడు. 'పుత్రాదిచ్ఛేత్‌ పరాజయం' పరాజయం కలిగితే పుత్రుని చేతుల్లోనే జరగాలి. పరమేశ్వరునికి కూడా ఈ లాంటి అభిలాషే వున్నట్లున్నది. తానే అంబికా సహాయుడై పుత్రరూపంలో వచ్చాడు. కానీ ఈ రూపంలో ఉన్న వీర్యమూ, జ్ఞానమూ, వర్చస్సూ మునుపు కంటే ఎన్నో రెట్లు అధికమై ప్రకాశించినవి.

సత్‌, చిత్‌ అను రెండుపదములున్నవి. సత్‌ అనగా ఉనికి. చిత్‌ అనగా అంబిక, చిదేక రసరూపిణి. ఈ సత్తు చిత్తులు రెండున్నూ ఏకముకాగా ఆనంద ముద్భవించింది. ఆ సచ్చిదానంద స్వరూపుడే సుబ్రహ్మణ్యము. శివమనే మంగళమూ, అంబిక అనే పరమ కారుణ్యమూ, కలసిన రూపే సుబ్రహ్మణ్యుడు. ఈ సచ్చిదానందమూర్తినే దక్షిణ దేశములో సోమాస్కందుడని శివాలయములలో ఉత్సవమూర్తిగా ఉంచి ఉత్సవములు నడుపుతున్నారు. ఉమ, స్కందుడు కలసిన శివమూర్తి సోమాస్కందుడు.

స్కాందము ఒకటిన్నరలక్ష శ్లోకముల గ్రంథము. స్కాందము కుమారోత్పత్తి చెప్పురామాయణము. కుమార సంభవము - ఇవన్నీ సంస్కృతభాషలో వ్రాయబడినవి. కుమారగుప్తుడని ఒక రాజు ఉండేవాడు. ఆర్యావర్తములోని రాజులు చాలమంది కుమారనామధారులే. ప్రస్తుతము పాకీస్థానమునకు వెళ్ళిపోయిన వాయవ్యభూభాగమున దొరికిన కుషానుల కాలమునాటి నాణములలో మయూర వాహనుడైన స్కందుని రూపమున్నది. కొందరు రాజలు సుబ్రహ్మణ్యుని, బ్రహ్మణ్య కుమారుడని వ్యవహరించి కులదైవముగా ఆరాధించేవారు. రాజులు తమ్ము బ్రహ్మణ్యులని చెప్పుకొనేవారు. సుబ్రహ్మణ్యపదములో 'సు' అనే అక్షరమును తొలిగిస్తే మిగిలేది బ్రహ్మణ్యమే కదా.

దక్షిణ దేశంలో వేదములను, సంస్కృతమునూ అభివృద్ధికి తెచ్చిన కంచి పల్లవరాజులు తమ్ములను శివభక్తులైన పరమమాహేశ్వరులుగానూ, విష్ణుభక్తిలో ఎనలేని పరమ భాగవతులుగాను చెప్పుకొనుటతో బాటు, స్కందోపాసన విశేషముగా చేసి పరమ బ్రహ్మణ్యులని వర్ణించుకొన్నారు. శాసనములలో వీనిని చూడనగును.

ఋగ్వేద పంచరుద్రములో ఈశ్వరుని స్తుతించు సందర్భమున 'కుమారునికి నమస్కరిస్తున్నపిత' - అని చెప్పుట ఒక విశేషము. ఛాందోగ్య ఉపనిషత్తులలో సనత్కుమారులను గూర్చి వచ్చుచున్నది. పాణిని వ్యాకరణము, దానిపై పతంజలి వ్రాసిన మహాభాష్యములోనూ స్కందునిగూర్చియు, విశాఖుని గూర్చియు విస్తార ప్రస్తావన కలదు. బోధాయన ధర్మ సూత్రములందు అనుదినము చేయు శివపూజయందు స్కందునికి కూడ ప్రాముఖ్యత ఇవ్వబడియున్నది. ఆపస్తంబ మహరి అనుదినము ఇవ్వవలసిన దేవబలులలో స్కందుని, అతని పారిషదులను చేర్చియున్నారు.

కౌమారము విశేషముగా ద్రావిడ దేశములో ప్రచారముననున్నది. మురగన్‌ తమకు సొంతదైవమని, అధిష్ఠాన దైవమని తమిళులు కీర్తిస్తుంటారు. ఆరుపడైవీడు అన్న ఆరుసుప్రసిద్ధ సుబ్రహ్మణ్యక్షేత్రములు డ్రావిడదేశమందే వున్నవి. సుబ్రహ్మణ్యుడు తమిళ్‌ దైవమని కీర్తింప బడుతున్నాడు. అగస్త్యులకు ద్రావిడవ్యాకరణము ఉపదేశించినది సుబ్రహ్మణ్యుడు. నత్కీరుడనే కవి 'తిరుమురుగాట్రుప్పడై' అనుగ్రంథం వ్రాశాడు. ఈ పుస్తకాన్ని పారాయణ చేసి ఎంతో మంది తమిళులు విశేషఫలమును పొందివున్నారు. కావళ్ళు ఎత్తటం, షష్టీవ్రతం, కృత్తికలు జరపటం తమిళనాడులో విశేషమైన ఉపాసనా విధానాలు. ఈ ఉపాసనాబలిమిచే ఇంచుమించు సుబ్రహ్మణ్యుని, తమిళులు తమిళునిగా మార్చేశారు!

ఈ కాలంలో ద్రావిడ దేశంలో తమిళ సంస్కృతి వేరు. వైదిక సంస్కృతి వేరు. అని చెప్పుటలో కొందరికి అభిరుచి. ఈ ఆర్యద్రావిడ వివాదం తెల్లవానిపుణ్యమా అని పరిశోధన అనే నెపంలో వచ్చిన అనర్థం. అది స్పర్థ తెచ్చి పెట్టడానికై ఉద్దేశించినది. ఆ వివాదం మనకు అక్కరలేదు. సుబ్రహ్మణ్యుని ఒక్క ద్రావిడ దేశమునకే పరిమితి చేయుటకు వీలులేదనే నేను ఇంత సేపు చెప్పినది నిరూపించుచున్నది. వైదికసంస్కృతిని నిలబెట్టడానికి ఏర్పడినదైవమే ఆయన అని చెప్పుటకు వారి నామధేయము సుబ్రహ్మణ్యమే చాలును.

వైదిక కర్మలలో ప్రధానమైనది హోమం. హోమమునకు అగ్ని అవసరం. దేవతావిశేషములలో అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడే. ఆకాశరూపమైన ఈశ్వరుని సాన్నిధ్యంలో అగ్నిశిఖగా తోచి, వాయువుతో కలసి గంగలో శరవణస్తంభమున (జలసంబంధమున) ఉద్భవించి భూమిని ఆధారముగాగల భూధరములలో (కొండశిఖరములలో) ఆలయములయందు విలసిల్లే పంచభూతస్వరూపి యైన పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడే. వారికి 'అగ్నిభూః' అని ఒక పేరున్నది. అమరకోశము సేవానీః అగ్నిభూః గుహః అని సుబ్రహ్మణ్యనామావళిని గ్రథనం చేసింది.

మనహృదయ కుహరములలో ఆత్మస్వరూపమున నెలకొన్న గుహుడే బయట అగ్నిస్వరూపియై ఉన్నాడు. వైదిక కర్మలు అగ్నిప్రధానములగుట చేతనూ అగ్నియే సుబ్రహ్మణ్యుడగుటచేతనూ, వైదిక రక్షణార్థము రెండు పర్యాయములు సుబ్రహ్మణ్యుడు అవతరించ వలసివచ్చినది. ఒక అవతరణ ఉత్తరభారతమున జరిగినది. రెండవది దక్షిణభారతమున జరిగినది.

దక్షిణభారతమున 'సంబంధమూర్తి' అనే పేరిట స్వామి అవతరించారు. ఈయన సమయాచార్యులలో నొకరు. వీరిని 'తిరుజ్ఞానసంబంధర్‌' అనికూడ పిలుచుటకద్దు. వీరు పుట్టినపుడు జైనమత ప్రాబల్యం దక్షిణాదిని ఉండేది. బ్రహ్మణ్యస్థాపనకోసమో, జైనమతమును ప్రతిఘటించుటకూ వీరు అవతరించినారనే చెప్పాలి.

ఉత్తరదేశమున బౌద్ధుల ఆధిక్యమును ప్రతిఘటించుటకు స్వామి 'కుమారిలభట్టు' అనే పేరిట జన్మించారు. భక్తి జ్ఞానము మొదలైన వానినెల్లా ఒక వంక ఉంచి, వైదికకర్మానుష్ఠానము చేతనే పరమశ్రేయస్సును పొందగలమని వీరు బోధించిరి.

బౌద్ధులను ప్రతిఘటించుటకు వారి మతతత్త్వములను సంపూర్ణముగా తెలుసుకొన్న కానీ వీలుకాదు. అందుచేత కుమారిలభట్టు ఒక బౌద్ధభిక్షువు వేషము వేసుకొని బౌద్ధ విహారమందు చేరి బౌద్ధమతగ్రంథ పరిశీలన అధ్యయనము చేయుటకు ప్రారంభించెను. రహస్యముగా ఎవరికీ తెలియక తాను చేయవలసిన నిత్యకర్మలను మాత్రము ఏలాగో ఆయన ఒక విధముగా అంతరంగమున పూర్తి చేయుచుండెను. ఇట్లు కొంతకాలములో బౌద్ధమత సిద్ధాంతములను పూర్తిగా ఆయన గ్రహించగల్గెను.

కానీ వీరి విషయము బౌద్ధులకు ఏదో ఒక విధముగా తెలిసిపోయినది. ఈయనను ప్రాణములతో వదలిన తమ మతమునకు ముప్పుకలుగునవి వారిని మట్టుపెట్టదలచిరి. ఈ విషయమున వారి మతమునందలి మౌళిక సత్యము - అహింసావాదము ఏ దేశములకు పోయెనో తెలియదు! కుమారిలభట్టును మేడమీదకు తీసుకొని వెళ్ళి, ఏదో అంతస్తునుండి వారు క్రిందకి త్రోసిరి.

క్రింద పడుతున్న కుమారిలభట్టు, వేదప్రమాణమే సత్యమైనచో, నాకు ఈ పతనమువలన ఏవిధమైన ఆపదయూ కలగరాదు' అని ప్రతిజ్ఞ చేసెను. ప్రతిజ్ఞ చేసిన రీతిగానే వారికి ఏ విధమైన గాయమూ కలుగక సురక్షితముగా క్రిందికి వచ్చిరి. కంటిలో మాత్రము ఒక చిన్నరాయి తగిలి నొప్పి చేసినది.

తనకు ఈ చిన్న గాయముకూడ తగిలియుండరాదని, కుమారిలభట్టుకు వేదముపై కోపము వచ్చినది! అపుడు అశరీరవాణి ఈవిధముగా పలికినది.

''నీవు వేదప్రమాణమే నిత్యమైనచో నాకు ఆపదకలుగరాదు' అని ప్రతిజ్ఞ చేసితివి. ఆ ప్రతిజ్ఞలో సంశయాంశమున్నది. నీకు ఆ సంశయములేక యుండిన వేదప్రమాణము నందు పరిపూర్ణమైన నమ్మిక ఉండి యుండిన ఈ చిన్నగాయము కూడ నీకు తగిలియుండదు.''

ఇట్లు బౌద్ధమతతత్త్వములను ఔపాసన పట్టిన కుమారిలభట్టు బౌద్ధుల సిద్ధాంతములను వాదములలో సులభముగా ఖండింపగల్గెను.

పిదపకాలమున, కుమారిలభట్టుకు తాను బౌద్ధులను వంచన చేసినామన్న విషయము గుర్తుకువచ్చెను. తాను కర్మిష్టికనుక చేసిన పాపమునకు తగిన ప్రాయశ్చిత్తము చేసికొనదలచి ఆయన తుషాగ్ని ప్రవేశము చేసెను. ఇట్లు అగ్ని స్వరూపుడైన సుబ్రహ్మణ్యావతారము కుమారిలభట్టు చివర తుషాగ్నిలో ప్రాణము వదలుట ఆ అవతార సమాప్తికి తగియేయున్నది. వారు ధర్మశాస్త్రము కొరకు శరీర త్యాగము చేసిరి.

జ్ఞానసంబంధుల వారికి పరహారేళ్ళ ప్రాయమురాగా బంధువులు వారికి పెళ్ళి చేయ నిశ్చయించారు. చిన్నతనమున పరమేశ్వరియే వారికి స్తన్యమొసగినది. వారు పరిపూర్ణమైన జ్ఞానులు. వారికి వివాహమెందుకు కానీ ఈశ్వర సంకల్పము తెలిసిన జ్ఞానసంబంధులు పెళ్ళికి ఒప్పుకొన్నారు.

తిరునల్లూరులో ఈకల్యాణము జరిగినది. పాణిగ్రహణమైనదో లేదో, బంధుసమేతంగా సంబంధులవారు ఆ ఊరిలోని శివాలయానికి వెళ్ళారు. ఆలయమంతయు జ్యోతితో నిండియుండెను.

అక్కడ భక్తితో బాష్పాంచిత నేత్రులై శివునిపై ఒక పంచాక్షరీ పదికమును (ద్రావిడభాషలోని వృత్త విశేషము) పాడారు. పాటపాడుకుంటూ సహకుటుంబసమేతముగా బంధుమిత్రాదులతో పరమేశ్వరుని జ్యోతిలో లీనమైపోయారు. సుబ్రహ్మణ్యావతారమైన సంబంధులు జ్యోతిలో కలిసిపోవటం, అగ్ని అగ్నిగా మారిపోవటమే కదా!

బంధువులు,సంబంధులను, వివాహాబంధంలో ఇరికించాలని చూశారు. వారేమో వీరిని కలియగట్టుకొని అందరికీ బంధవిమోచన చేసి మోక్షలక్ష్మీ సంబంధం కలుగచేశారు!!

సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపి; తేజస్వి. కాని గంగాతనయుడగుటచేత అమృతమువలె చల్లదనము కలగజేసే గుణమూ వారివద్ద వున్నది. తిథులలో ఆరవది షష్టి. ఈయన షష్టీప్రియుడు. షడాననుడు; ఆరుముఖములు కలవాడు. ఈయన మంత్రము షడక్షరి. కామక్రోధలోభ మోహ మద మాద మాత్సర్యములనే అరిషడ్వర్గమును నాశనము చేయగల దిట్ట, సేనాని ఆయనే.

సుబ్రహ్మణ్యుని రెండు అవతారములను గూర్చి ముచ్ఛటించాము. ఇపుడు మూడో అవతారమును గూర్చి కొంత చెప్పుకొందాము. ఇది నిజానికి అవతారము కాదు. సుబ్రహ్మణ్యుడు అవతరించుటకు ముందు వారు ఎవరుగా ఉండిరో చెప్పే కథ ఇది. ఈ విషయం చాలా రోజుల వరకు నాకే తెలియకుండా ఉండినది. తరువాత తెలిసినది. ఎట్లా నాకు తెలిసినదీ చెప్పి, ఈ విషయం గూర్చి కొంత వివరిస్తాను.

వ్యాసాచార్యులవారు బ్రహ్మసూత్రాలను వ్రాసిరి. ఇది పరబ్రహ్మతత్వాన్ని విచారణ చేసే గ్రంథం. దీనిలో మూడవ అధ్యాయంలో మూడవపాదంలో ముప్ఫై రెండవ సూత్రం, 'ఒక అధికారముతో అవతరించిన వారికి, అధికారము ఉన్నంతవరకూ శరీరంలో వాసముంటుంది.' అని చెప్పుతున్నది. దానికి భాష్యంవ్రాస్తూ మన ఆచార్యులు, 'బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడుకూడ, తానే రుద్రునికి వరప్రదానము చేసి, దానికొఱకై స్కందుడుగ అవతరించాడు.' - అని దృష్టాంతముగా వివరించారు.

సనత్కుమారుడు పరమేశ్వరునికి వరమిచ్చిన కథ అంతవఱకు నేను ఏ పురాణములందునూ చూచినది లేదు. నన్ను కలుసుకొన్న పండితులను అనేకులను అడిగిచూచాను. వారికీ తెలియలేదు. అంజనేయస్వామియు వెదకి వెదకి, కట్టకడపట ఈ కార్యాన్ని అష్టాదశపురాణాలను సంక్లిప్తంగా అరవవచనంలో వ్రాసిన శ్రీవత్ససోమదేవశర్మకు అప్పగించారు.

శర్మగా నాకు భిక్షావందనం చేస్తూ, దానితోబాటు పెద్దబిక్షగా, ఈ డిస్కవరీని కూడ అందించారు. వారు ఈ విషయం వెదకి చూడగా త్రిపురారహస్యమనే గ్రంథంలో మహాత్మ్యకాండలో ముప్ఫైఏడవ అధ్యాయంలో ఈ కథ కనపడ్డదట. ఇక కథకు వస్తారు.

సనత్కుమారులు బ్రహ్మమానసపుత్రులు. పరమజ్ఞాని. శుక్రాచార్యుల వలె లోపల వెలుపల అనే భేదంలేక అంతా ఒకటే అన్న అద్వైతస్థితిలో ఉండేవారు. ఇటువంటివారికి విచిత్రంగా ఒక స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో దేవాసుర యుద్ధం జరిగింది. ఆయుద్ధంలో దేవసేనాపతిగా పాల్లొని సనత్కుమారులు అసురసంహారం చేశారు.

స్వప్నం నుంచి మేల్కోగానే వారికి ఆశ్యర్యం వేసింది. తండ్రి అయిన బ్రహ్మవద్దకు వెళ్ళి ఈవిషయం చెప్పి, ఈస్వప్నానికి అర్థమేమి? అని అడిగారు.

'నాయనా! నీవు పూర్వజన్మలో వేదాధ్యయనం చేశావు. దానిలో వచ్చే దేవాసుర యుద్ధమనే విషయం నీ మనస్సులో గాఢంగా నాటుకొన్నది. వైదిక యజ్ఞముల చేత తృప్తులై వరప్రదానం చేసే వాళ్ళు దేవతలు. వారిని జయించి స్వాధీనం చేయదలచేవాళ్ళు అసురులు. నీకు వేదమందున్న గాఢ అభిమానం చేత,' ఈ అసురులనందరినీ మనమే సంహారం చేయాలి' అని ఆవేశపడ్డావు. ఆ ఆలోచనయే ఈ జన్మలోనూ నిన్ను వెన్నంటి వచ్చింది. అదే స్వప్నంలో బహిర్గతమైనది.

నీకు ఏ ఆలోచన ఉన్నప్పటికీ అది వాస్తవముగా జరిగియే తీరుతుంది. అందుచేత నీవు ఒకరోజు యథ్యార్థముగా దేవాసుర యుద్ధములో దేవసేనాపతిగా పాల్గొంటావు. అసురసంహారం చేస్తావు. కాని ఈ జన్మలో - దేవతలా? అసురులా? సర్వం బ్రహ్మమయం' అన్న భావనలో నీవు ఉండే దాని వలన ఇంకొక జన్మనెత్తి ఈ కార్యాన్ని చేయబోతావు' అని బ్రహ్మ బదులు చెప్పారు.

వాక్కు, మనస్సు, శరీరము - ఈమూడూ ఒకని సత్యములో ప్రతిష్ఠ ఐనచో, అతనికి అతని ఉద్దేశములేకనే, ఒక గొప్పశక్తి సిద్ధిస్తుంది. అనగా వాళ్లు సత్యాన్నే చెప్పనక్కరలేదు. వారు చెప్పినది సత్యమౌతుంది. పొరపాటుగానో, ఇచ్చలేకయో వారు ఒకటి చెప్పినా అది వాస్తవిక మౌతుంది.

పరమ సత్యప్రతిష్ఠితుడైన సనత్కుమారులు కలకనిననూ అది కల్లకాక నిజమై తీరాలి.

సనత్కుమారులు ఆత్మారాములు. పరబ్రహ్మము తనలోనే అనుభవిస్తూ కూరుచున్న పరమజ్ఞానులు. ప్రపంచమే ఒక స్వప్నమని భావించే పరమవిరాగులు. అందుచేత వారు తమస్వప్నాన్ని గూర్చి విచారించక అలాగే ఉండిపోయారు.

కానీ సనత్కుమారుల స్వప్నంలో వచ్చిన విషయం అసత్యం కాకూడదే అన్న విచారం పరమేశ్వరునికి - మహాసంసారికి - పట్టుకొన్నది! అందుచేత సనత్కుమారులు తనకోసం తనదర్శనార్థం తపస్సు చేయకపోయినా స్వయంగా సనత్కుమారులను వెదుక్కుంటూ పార్వతీసమేతులై సనత్కుమారుల ఆశ్రమానికివచ్చారు.

సనత్కుమారులస్థితి అద్వైతస్థితి. వారికి చెట్టూ చేమ, గుట్టా రాయి అంతా ఒకటిగానే ఉంది. అంతా బ్రహ్మమయం వారి దృష్టిలో బ్రహ్మంలో ఉచ్చనీచములు లేవు. గరిస్ఠ కనిష్ఠములు లేవు. అందుచేత పరమేశ్వరుడు వచ్చినా వారికి భేదమేమీ తెలియలేదు. వారినీ బ్రహ్మమే అని అనుకొన్నారు. పరమేశ్వరునికి పూజాదికములు అర్పించాలన్న భావం కూడా తోచలేదు. వారు కూర్చున్నది కూర్చున్నట్లే ఉన్నారు.

పార్వతీపరమేశ్వరులు సుదీర్ఘకాలం సనత్కుమారుల ముందు నిలచున్నారు. ప్రయోజనమేమీ కన్పించలేదు. వారు అలాగే అచలంగా ఉన్నారు. దీనిని చూడగానే ఆ ఆదిదంపతులకు ఆనందం కలిగింది. ఇట్టి పరమజ్ఞాని అయిన పిల్లవాడిని చూడగానే వారికి పరమసంతోషం కల్గింది. అయినప్పటికీ, పరమేశ్వరుడు దొంగకోపం తెచ్చుకొని.

''జ్ఞాని అన్న అహంకారమేకదా నీకు? మేము జగన్మాతా జగత్పితలం వచ్చివుంటే నీవు అమర్యాదచేస్తున్నావే? నేను నీకు శాపమిస్తే ఏమిచేస్తావు?'' అని ప్రశ్నించారు.

సనత్కుమారులు భయపడలేదు. అలక్ష్యంగా 'మీరు కోపించి శాపమిస్తే ఇవ్వండి దానికేమి? అది ఆత్మను ఏ విధంగానూ బాధించదు' అని బదులిచ్చారు.

అహా ఎట్టి ఉత్తమ ఆత్మజ్ఞాని? అని ఈశ్వరుడు ఆశ్చర్యపడి మరొకింత పరిశీలింపదలచి, 'నాయనా! నీ జ్ఞానమునకు మేము మెచ్చినాము. నీకు వరమేమికావలెనో కోరుకో' అని అడిగాడు.

''పరమేశ్వరా నీవు వరము. శాపము అనే పదప్రయోగం చేసేదానివల్ల వీనికంతా ఏదో వేర్వేరు ఆర్థాలున్నట్లు నీవు తలుస్తున్నట్లు తెలుస్తున్నది. అట్లైతేసరి. నీకు ఏదైనా వరం కావలసి ఉంటే కోరుకో అవరాన్ని నేనే యిస్తాను.''

సనత్కుమారులు చెప్పినది విని పరమేశ్వరునికి సంతోషం వేసింది. సర్వలోక మహేశ్వరుడైన ఆయన చాల వినయంతో తన్ను కొంచపరుచుకొని, వరదానం అడిగారు. సనత్కుమారుల స్వప్నం సత్యం కావటానికి ఈ వరమే దారియని ఈవిధంగా అడిగారు.

''నాయనా! నీవు పరమజ్ఞానిగ బ్రహ్మకు పుత్రుడవై పుట్టినావు. బ్రహ్మకు కల్గిన భాగ్యం నాకూ కలిగేటట్లు వరాన్ని ఈయి. మరొక జన్మలో నీవు నాకు పుత్రుడివిగా జన్మించవలె. ఇదే నా కోరిక.'' అని పరమేశ్వరుడు అడుగగా, 'ఆహా అట్లాగే నీకు పుత్రుడిగా జన్మిస్తాను', అని సనత్కుమారులు వరమిచ్చారు.

మనం కూడా జ్ఞానం కలిగేంత వరకే, 'మరోజన్మ మనకు వద్దు' అని ఏడుస్తూ ఉంటాం. జ్ఞానం ఏర్పడినదంటే ఇదంతా మాయమౌతుంది. వట్టి ఆనందసాగరమే మిగులుతుంది. ఇది కావాలి, అది వద్దు అన్న భావం సమూలంగా పోతుంది.

సనత్కుమారులు పరమేశ్వరుణ్ణి చూచి నీకు పుత్రుడిగా జన్మిస్తాను - అని అన్నారుకానీ, పార్వతిని చూచి అనలేదు. దీనిని గూర్చి సనత్కుమారులు యోచించారు. దీనిలోనూ వారికొక ధర్మం తోచింది. తన్ను వరమడిగినది పరమేశ్వరుడు కాని పార్వతి కాదు. పైగా 'అడుగనిది ఇవ్వకూడదు' అని శాస్త్రం చెబుతుంది. అందుచేత పరమేశ్వరునికి పుత్రుడిగా జన్మించాలే కానీ పార్వతికి కాదు. అని నిశ్చయించారు. ఈ విషయం సనత్కుమారులు బయటకి చెప్పాగానే, పార్వతికి తాను ఏమరి పోయిన విషయం గుర్తుకొచ్చి దుఃఖం వేసింది. ఆమె సర్వలోకజనని - ఆబ్రహ్మకీటజనని. వాస్తవమే. జ్ఞానాంబిక ఐన ఆమెకు ఈవిషయం తెలుసు. కాని సనత్కుమారులవంటి ఉత్తమజ్ఞాని' మరొక జన్మ ఎత్తుతున్నపుడు తన సంబంధం లేకుండా పుట్టుతానంటే, ఆమెకు మనస్సు ఓర్వలేదు. ఇటువంటి జ్ఞాని తనకున్ను ఆత్మజుడుగా పుట్టవలెనని ఆమెకు ఆశకలిగింది.

సనత్కుమారులు శాస్త్రం చెప్పి తర్కం చేసిన విధంగానే ఆమె కూడా తర్కం చేయనారంభించింది.

శాస్త్రములు పత్నీపతులకు అభేదమే చెప్పినవి. భర్త చేసే ప్రార్థన, భార్యను ఉద్దేశించే. అందుచేత నేను ప్రత్యేకంగా నిన్ను వరం కోరుకోవలసిన అవసరం లేదు. ఆయన అడిగారు. నీవు ఒప్పుకొన్నావు అందుచేత నాకు కూడ నీవు పుత్రుడిగా జన్మించవలసినది అని తన హక్కును (గఠష) నిలబెట్టుకోడానికి ఆజ్ఞానశక్తి ప్రయత్నించింది.

సనత్కుమారులు యోచించి ఇలా అన్నారు. 'అమ్మా' నీవు చెప్పేదేమో వాస్తవమే. అయినప్పటికీ నాకు ఈశ్వరునికి పుట్టటంలో వుండే తృప్తి మీ ఇరువురి సంబంధం వల్ల కలిగే జన్మలో లేదు. అంతా పరబ్రహ్మమని నాకు తెలిసినా, మీరు పెద్దజ్ఞాని అని నాకు బిరుదు (టైటిల్‌) ఇచ్చినా, గర్భవాసం చేసి, అధోముఖంగా జన్మించాలన్న విషయం గుర్తుకువచ్చినపుడు అదినాకు హేయంగానే ఉన్నది. బ్రహ్మజ్ఞానికి ఇలా ఉండరాదు. వాస్తవమే. కానీ నాకు అంతపరిపక్వత లేనట్లున్నది. నీవు కొంచెం పెద్ద మనసుచేసి ఈవిషయంలో బలవంతం చేయకుండా ఉంటే నేను సంతోషిస్తాను.

కానీ అంబికకు మనసు రాలేదు.

కొంచెం యోచనచేసి వాళ్ళు రాజీకి కు వచ్చారు.

పూర్వం భస్మాసురుడు తపస్సుచేయగా అతనికి పరమేశ్వరుడు చేయిపెట్టితే కాలిపోయే వరమిచ్చాడు. ఆ వరాన్ని పరిశీలించడానికి ఆ అసురుడు ఈశ్వరుని నెత్తిమీదనే చేయిపెట్టవలెనని చూడగా ఈశ్వరుడు పరుగెత్తవలసివచ్చింది. ఆ సమయంలో అంబిక సర్వజ్ఞ ఐనప్పటికీ, సాధారణ స్త్రీవలె భయపడి పరమేశ్వరుడు అదృశ్యంకాగానే, నీరైపోయింది. ఆనీటితో ఒక తటాకం ఏర్పడింది. అదే శరవణ తటాకం.

భస్మాసురుని సంహారానంతరం పరమేశ్వరుడు మళ్ళా కనపడగా, ఆమెకూడ తన స్వస్వరూపాన్ని గ్రహించింది. కానీ ఆ తటాకాన్ని అలాగే వుంచి దానిని ప్రేమతో చూచుకొంటూ ఉన్నది. ఆ శరవణతటాకం అంబిక దేహమే. ఆ విషయం ఆమెకు ఇప్పుడు జ్ఞప్తి కొచ్చింది.

సనత్కుమారుడు ఈశ్వరునికి జ్యోతిరూపంలో జనించగానే, జ్యోతిని శరవణతటాకంలో భరించి సుబ్రహ్మణ్య స్వరూపిగా వెలికివచ్చుటకు వాళ్ళు ఒడంబడిక చేసుకొన్నారు.

ఈశ్వరుని త్రినేత్రమునుండి అగ్నిశిఖ రూపములో సనత్కుమారులు ఉద్భవించారు. ఆ అగ్నిశిఖను గంగ మొదట ధరించింది. కానీ ఆ తేజస్సును ఆమె భరించలేక, శరవణతటాకంలో వదిలింది. అంతటితో సుబ్రహ్మణ్యుడు తొలుత గాంగేయుడై తర్వాత శరవణభవు డయ్యాడు. ఈనామమే శరవణభవ -అను షడక్షరి ఐనది. సుబ్రహ్మణ్యుడికి ఎన్నో పేళ్ళున్నవి. కానీ అన్నిటిలోనూ మంత్రరాజము-'శరవణభవ' అను షడక్షరియే. శరవణమనగా అంబిక, ఆ ఇచ్ఛాశక్తి కోరుకొన్నట్లే పరమేశ్వరునికి సనత్కుమారులు పుత్రుడై జన్మించినా, పేరు రూపమూ రెండూ ఆమెతో సంబంధం కలవి ఐనవి.

సనత్కుమారులే స్కందుడని ఛాందోగ్యోపనిషత్తు స్పష్టముగా తెలుపుతున్నది.

నారదులు సనత్కుమారుల వద్దకు జ్ఞానోపదేశమునకై వస్తారు.

'సకలవేదములు,ఇతిహాసములు, పురాణములు, శాస్త్రములు, దేవవిద్య, బ్రహ్మవిద్య, భూతవిద్య, నక్షత్రవిద్య, మొదలైనవన్నీ ఒక్కటీ బాకీలేక అధ్యయనం చేశాను, కానీ ఇవన్నీ బయటి విషయాలను గూర్చి తెలుపుతున్నవే కానీ, తన్ను తాను తెలుసుకొనే విషయాన్ని తెలపటం లేదు.

ఆత్మను తెలుసుకోని కారణంగా నేను దుఃఖంలో ఉన్నాను. మీరొకరే, నన్ను ఈ దుఃఖసాగరం నుంచి తరింపచేయగలరు.' అని నారదులవారు సనత్కుమారులను ప్రార్థిస్తారు.

''ఆత్మను మనం వెదుకుకొని పోనవసరం లేదు. క్రిందా, పైనా, ముందూ, వెనుకా, కుడిప్రక్కా, ఎడమప్రక్కా, అంతా సర్వమూ ఆత్మయే. దానిని ఒకడు ధ్యానించి ధ్యానించి, ఆ ఆత్మగానే పరిణమిస్తే, ఆ ఆత్మతత్త్వంలోనే ఎప్పుడూ విహరిస్తూ ఆనందంగా ఉంటాడు. స్వారాజ్యం అంటే అదే. ఆస్థితియే స్వరాట్‌ - నిజమైన చక్రవర్తి స్థితి. ఈ ఉత్తమస్థితి లభించాలంటే మొదట ఆహార శుద్ధి అవసరం. పిదప క్రమేణ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనస్సు శుద్ధికాగానే, ధ్యాననిష్ఠ ఏర్పడుతుంది. అపుడు ఆటంకములన్నీ, తొలగి, ఆత్మస్వరూపంగానే ఒకడు నిలచిపోతాడు-'' అని సనత్కుమారులు నారదులకు బోధించారు.

ఈ విషయాన్ని చెబుతూ ఛాందోగ్యం ఈ విధంగా భగవాన్‌ సనత్కుమారులు నారదులకు ఉత్తమ స్థితిని బోధించారు. వారికే స్కందుడనిపేరు' - ''భగవాన్‌ సనత్కుమారస్తగ్‌ం స్కందఇత్యాచక్షతే, తగ్‌ం స్కంద ఇత్యాచక్షతే'' అని రెండుపర్యాయములు ఉద్ఘాటించినది.

అవస్థ అనగా స్థితి, ఛాందోగ్య అవస్థా - జెండావస్థగా మారింది. ఇది పార్సీ వాళ్ళ మత గ్రంథం. పార్సీ మతంలో అగ్నికి ప్రాధాన్య మెక్కువ. సౌరాష్ట్ర దేశం నుంచి వెళ్ళిన ఒకాయన దానిని స్థాపించారు. వారిని సౌరాష్ట్ర అనుటకు బదులు 'జరాతుష్ట్ర' అని వ్యవహరించారు. సౌరమనగా సూర్యసంబంధము కలది. సూర్యుడు, అగ్ని, గాయత్రి - ఈ మూడున్ను శంభుని విశేషరూపములని ''కో బ్రాహ్మణౖరుపాస్యో? గాయత్య్రర్కాగ్ని గోచరః శంభుః అని శంభుని విశేషరూపములని ఆచార్యపాదులు ప్రశ్నోత్తర రత్నమాలికతో విశదీకరించారు. తిరువణ్ణామలైలో అగ్ని స్వరూపముగానే ఈశ్వరుడున్నాడు. శివాగ్నియే సుబ్రహ్మణ్యుడు.

మలయాళదేశంలో దీపములో అమ్మవారిని ఆవాహనమునకు 'భగవతిసేవ' అని ఉపాసిస్తారు. జ్వలిస్తున్న జ్ఞానాగ్నికి ప్రతీకమైన వేలాయుధమును (సుబ్రహ్మణ్యుని చేతనున్న శక్త్యాయుధము) 'శక్తి శక్తి' అని అంటున్నాము.

వేదకర్మలు అగ్నిప్రధానములు. 'అగ్ని' అన్న పదంతోనే వేదం ప్రారంభమౌతుంది. అగ్ని కార్యమే ఔపాసన అనునది. ఉపాసనకు ఆశ్రయమైనది ఔపాసన. ఉపాసన అనగానే అగ్నికార్యమే స్ఫురిస్తుంది. ఔపాసన నాలుగు వర్ణములవారికీ ఉన్నది.

అగ్ని కార్యరూపమైన ఔపాసన, సుబ్రహ్మణ్యుడు అధిదేవత యగుటచేత, వారిని వదలిపెట్టి తక్కిన ఐదుగురినీ, పంచాయతన పూజలో - అనగా గణపతి, సూర్యుడు, మహావిష్ణువు, అంబిక, ఈశ్వరుడు - అనే ఐదుదేవతావిశేషములు - ఆరాధిస్తున్నాము. అందుచేత సుబ్రహ్మణ్యుని ఆరాధనా సంచాయతనపూజా కలసి షణ్మతసాధన ఔతున్నది. కానీ ఈ కాలములో అగ్నికార్యం క్రమంగా లోపించి మూర్తి పూజ జాస్తి ఐనది.

ద్రావిడదేశమున సుబ్రహ్మణ్య సంబంధమైన స్తోత్రములకు పురాణములకు, క్షేత్రములకు వ్యాప్తి ఎక్కువ. ఆయన సకలలోక వశీకరణమూర్తి. పంచాయతన పూజలో మనము సుబ్రహ్మణ్యుని కూడా కలుపుకోవటం ఒక ఉత్తమమైన కార్యము.

ఆచార్యులవారు తిరుచ్చెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యమూర్తిని ఉద్దేశించి ఒక ''భుజంగ ప్రయాతస్తోత్రం'' వ్రాశారు. అందులో ఒక శ్లోకంలో భావం ఉంది.

'నేను సముద్రతీరంలో ఉంటూ సంసార సముద్రంలో చిక్కుకొన్న భక్తులను తరింపచేస్తున్నాను. - ఈ సముద్రంలో అలలు ఉత్తుంగముగా లేచి ఎట్లా మరల లయమందుతున్నవో అదేవిధంగా నా భక్తుల ఆపత్తులను, విపత్తులనూ నేను హరిస్తున్నాను' అన్నట్లు సుబ్రహ్మణ్యమూర్తి ఈ తిరుచ్చెందూరులో తిష్ఠవేసి యున్నాడు.' అనే భావం గల శ్లోకములు ఆచార్యపాదులు వ్రాశారు.

యదా సన్నిధానం గతా మానవా మే
భవాంభోధిపారం గతా స్తే తదైవ||
ఇతి వ్యంజయ న్సింధుతీరే య ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రమ్‌ ||


యథాబ్ధే స్తరంగా లయం యాంతి భంగా
స్తధైవాపదః సన్నిధౌ సేవతాం యే ||
ఇతీ వోర్మిపంక్తీ ర్నృణాం దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం ||


'కడలిలో అలలు లేస్తున్నవి. మళ్ళా అందే లయిస్తున్నవి. జగత్తులోని సకల జీవరాసులూ పరమశక్తిమంతుడైన పరాశక్తి పుత్రునియందే జనించి లయించుచున్నవి. అన్న తత్త్వబోధ తిరుచ్చెందూరు స్వామి చేస్తున్నట్లు కనిపించును.

నారదునికి జ్ఞానోపదేశము చేసిన సనత్కుమారులు ఈశ్వరునికి పుత్రుడై పుట్టి ఆయనకే ప్రణవోపదేశం చేశారు. ఈశ్వరాంశలో పుట్టిన ఆచార్యపాదులున్నూ ఈసుబ్రహ్మణ్య భుజంగస్తోత్రంలో - గుహాదేవ మన్వన్నజానే న జానే ' అని పలికి,

అహం చాతి బాలో భవాన్లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ -


అని ప్రార్థిస్తున్నారు.

పరమాత్మ సాక్షాత్కార సిద్ధికై నాలుగు మార్గములున్నవి; జ్ఞానము; భక్తి, యోగము, కర్మ అనునవి. శరీరము, మనస్సు - వీనికన్నిటికీ ఆత్మయే ఆధారము. అట్టి ఆత్మనుగూర్చి మనము చింతన చేస్తూ వచ్చినామంటే తానుగా ఒక ఫ్లాష్‌ (ఎశెఠ) వలె ఆత్మద్యోతన మౌతుంది. జ్ఞాన మనగా ఇదే. ఆ స్థితిలో తెలుసుకొనే జీవాత్మకున్నూ, తెలియబడే పరమాత్మకున్నూ భేదమేలేదు. అదొక శాంత సముద్రమువలె అణగి పోయిన ఆనందస్థితి.

కొందరికి పరమాత్మతో ఇట్లు అభేదంగా ఐక్యం కావటం రుచించదు. కొంచెం వేరుపాటుతో ఉండి భగవంతునితో సరససల్లాపము లాడటంలో వారికి అభిరుచి. ఈ తరగతికి చేరినవారు భక్తి మార్గం అవలంబిస్తారు. భక్తిద్వారా పరమాత్మ అనుగ్రహలాభం వారికి కల్గుతుంది. వీరు చేసే భక్తీ, ఆ భక్తికి ప్రతిఫలంగా స్వామి చూపే కరుణా - ప్రేమ అనే నాణానికి ఉన్న రెండుముఖాలు, ఒకటి జ్ఞానమార్గము. రెండవది ప్రేమ లేక భక్తిమార్గం.

మనస్సను అధిగమించినట్లైతే జ్ఞానము. మనస్సును భక్తితో నింపి దాని సహాయంతో సాక్షాత్కరం పొందటమే భక్తి మార్గం. ఇదే విధంగా శరీరంతో కర్మలను చేయవలెను. ఈ కర్మలను మనకోసంకాక ఈశ్వరార్పణ బుద్ధితో నిస్సంగత్వంతో చేస్తే దానిని కర్మమార్గమని అంటారు. దానిలో ఒక ఆనందం ఉంది.

మనస్సును నిలుపుటకు శక్తి లేనిదానివలన మనము ఆత్మను ఎరుగలేకున్నాము. మనస్సు ఒక్క క్షణమైననూ నిలువక ఎపుడూ భ్రమిస్తూనే వుంటుంది. కానీ మనము శ్వాసను నిలిపినామంటే, శ్వాస నిలిపినంతసేపూచ మనస్సూ నిలుస్తుంది. మనలో ప్రాణ మొకటి ఉన్నది. ఈ ప్రాణమును కొన్ని విధానములలో మనము నియమన మొనర్చిన, ప్రాణాధారమైన పరమాత్మ శక్తి స్వాధీన మగును. ఈ విధానమునకు యోగ మార్గమని పేరు.

ప్రాణశక్తి శరీరములో మూలాధార మనెడుచోట, సర్పరూపములో నున్నది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది సుప్తపన్నగము. దానిని తట్టి లేపుటకే యోగసాధనలన్నీ. సుబ్రహ్మణ్యుడు యోగస్వరూపి. ఆయనను సర్పాకారములో పూజించుటమూ కద్దు. ముత్తుస్వామి దీక్షితులు 'వాసుకి తక్షకాది సర్పస్వరూప ధారణాయ' అని శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే' అను కృతిలో వారిని సంబోధిస్తారు. నాగప్రతిష్ఠ, షష్ఠీవ్రతం ఇవన్నీ సర్పస్వరూపంలో మనం సుబ్రహ్మణ్యుని ఉద్దేశించి చేసే ఆరాధనలే.

పరమేశ్వరుడు ఒక పచ్చని చెట్టువలె ఉన్నడనుకొందాం. అప్పుడు అంబిక ఆయనకు పరివేష్టించిన పచ్చని లతవలె వుంటుంది. అట్లాకాక పరమేశ్వరుడు స్థాణువువలె ఎండిన వృక్షమువలె వున్నాడనుకొందాం. అప్పుడు అంబికయూ ఎండిన తీగవలె, అపర్ణయై ఆయనకు పరివేష్టించియే వుంటుంది. అమ్మవారికి అపర్ణ అనునదొకపేరు. పార్వతిగా ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి పతిగావరించి, భర్తృలాభం కోసం ఆమె తపస్సు చేసినపుడు ఆకులను కూడా ఆమె ఆహారముగా స్వీకరించని కారణంగా ఆమెకు అపర్ణ అనుపేరు సిద్ధించిందని కొందరంటారు. నావరకు నాకు, స్థాణువును పరివేష్టించి అపర్ణయై (ఆకులు లేక) ఉన్న లతావిశేషమే అంబిక అని తోస్తుంది. ఈశ్వరుడు అంబిక ఉన్నచోట సోమాస్కందుల వలె సుబ్రహ్మణ్యుడు కూడ వారిమధ్య ఉండవలెను కదా!

ఈశ్వరుడు స్థాణువుగనూ, అంబిక అపర్ణగానూ వున్నప్పుడు స్కందుడు ఎలా వున్నాడు! ఆయన 'విశాఖ' రూపంలో ఉన్నాడని నాకు తోస్తుంది. శాఖ అనగా కొమ్మ వేదములలో పలుశాఖలున్నవి. ఒక పదమునకు 'వి' అను అక్షరము చేర్చినపుడు వివిధములైన అర్థములు వచ్చును. జయమనుపదమున్నది. విజయమనగా విశేషమైన జయమని అర్థము. 'వి' అను అక్షరమును వ్యతిరేకార్థము కూడ ఉన్నది. ధవ అనగా భర్త కలది. విధవ అనగా భర్తలేనిది. ఈ అర్థములో విశాఖ అనగా శాఖలులేనివాడు అని అర్థము. ఈశ్వరుడు స్థాణువుగనూ, అంబిక అపర్ణగానూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యుడు విశాఖుడై - శాఖలు లేని చిన్న మొలకవలె ఉన్నాడు. అది పరమ వైరాగ్యమైన స్థితి. అందులకే సుబ్రహ్మణ్యుడు జ్ఞానిగానూ, భిక్షకుడు గానూ, వ్యుప్తకేశుడుగనూ దండాయుధ పాణిగాను దర్శనమిస్తున్నాడు. వారే వల్లీ దేవసేనా సమేత కల్యాణసుబ్రహ్మణ్య స్వామిగానూ విలసిల్లుతున్నారు.

పామరులనుండి దేవతల వఱకూ, అనుగ్రహం చేసే దేవతామూర్తి ఆయనే. ఆటవిక స్త్రీ అయిన వల్లీ ఆయనకు ఒక భార్య. దేవరాజైన ఇంద్రుని కుమరై దేవసేన మరొక భార్య ఆయన దేవసేనలకు కూడ పతి.

మద్రాసులో తేనాంపేట అని ఒక చోటున్నది. అక్కడ సుబ్రహ్మణ్యుని ఆలయంలో కుంభాభిషేకం జరిగినపుడు - ఈ తేనాంపేట, దేవనాయకన్‌ పేట అనే పేరుకు అపభ్రంశమేమో అన్న యోచన నాకు కలిగింది.

సుబ్రహ్మణ్యుని లీలావిలాసాలను ఇంతవరకూ వర్ణించాము. అటువంటి సుబ్రహ్మణ్యశ్వరుని మనమందరమూ భక్తితో కొలచిన ఇహపరములకు లోటుండదు. తులామాసంలో చేసే షష్టీవ్రతం విశేషం. తులామాసంలో వచ్చే ఈ షష్టీ వారి సమత్వానికి - (తుల - త్రాసు) చిహ్నం. వారు ఎప్పుడూ జ్ఞాననిష్ఠలో ఉన్నప్పటికీ లోకానుగ్రహార్థం అసురసంహారం చేసి భక్తులను రక్షించుట వారికి పరిపాటి. బహిశ్శత్రువులతో బాటు అంతఃశ్శత్రువులనూ పరిమార్చి మనలను జ్ఞానులుగా మార్చే జ్ఞానశిఖరజ్యోతి ఆయన. హృదయమనే దీపంలో భక్తి అనే వత్తిని వేసి, అనురాగమనే ఘృతముతో నింపి వెలిగిస్తే ఆయన అనుగ్రహం మనపై ప్రసరించి ఆ జ్ఞానజ్యోతిలో మనంకూడ ఐక్యం కాగలం.

జయానందభూమ జయాపారధామన్‌
జయామోఘకీర్తే జయానందమూర్తే|
జయానందసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తి దానేశ సూనో||

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/12/blog-post_29.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.