Tuesday 19 July 2016

పరమాచార్యుల అమృతవాణి : గోవింద భగవత్పాదాచార్యులు : శంకరాచార్యుల గురుపరంపర



పరమాచార్యుల అమృతవాణి : గోవింద భగవత్పాదాచార్యులు
శంకరాచార్యుల గురుపరంపర
(జగద్గురుబోధలనుండి)

శ్రీ శంకరాచార్య గురు పరంపరలో ఈ గోవింద భగవత్‌ పాదాచార్యులవారి స్తుతి ఒకటి ఉన్నది.

హరి తల్ప హరాంఘ్రి నూపురక్ష్మా ధర సౌమిత్రి బలా త్రి పుత్త్రజన్మా|
జయతా దు ప రే వ మాత్త ధామా జయ గోవిందముని స్స చంద్ర నామా||


గోవిందముని అనగా గోవింద భగవత్‌ పాదులు. 'చంద్రనామా' అనునది పూర్వాశ్రమంలో చంద్రశర్మ అనే పేరు. వారు ఆదిశేషుని అవతారం. హరికి తల్పముగా పరమశివునకు నూపురముగానూ ఉండెడి సత్తా కలవారు. పైగా భూమిని తల మీద మోస్తూ ఉంటారు. క్షమ అనే పదమునుండి క్ష్మా అనే పదం వచ్చింది. క్షమ అంటే ఓరిమి. భూమికి ఓర్మి ఎక్కువ. దానిని ఎంతయినా తవ్వు, ఏమైన చెయ్‌ అది ఏమీ అనకుండా సహిస్తుంది. దానిని మోసేవారికి ఇంకా ఎంత ఎక్కువ ఓర్మి ఉండాలో ఆలోచించండి. ఆయననే సౌమిత్రి, అంటే లక్ష్మణుడు, బలరాముడు, అత్రి పుత్రుడైన పతంజలీ, ఆయనయే చంద్రశర్మ.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కూమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు.

అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు.

కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజకదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లోడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది.

అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు.

ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు. కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది.

ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

గోవింద దేశిక ముపాస్య చిరాయ భక్త్యా
తస్మిన్‌ స్థితే నిజమహిమ్ని విదేహముక్త్యా
అద్వైతభాష్య ముపకల్ప్య దిశోవిజత్య
కాంచీపురే స్థితి మవాప సశంకరార్యః


చేయవలసిన పనులన్నీ చేసిన మీదట శంకరాచార్యులవారు కంచిలోనే నివశించి నట్లు పతంజలి చరిత్ర చెపుతోంది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.