శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (31 - 60)




శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (31 - 60)

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే న గిళితం నోద్గీర్ణమేవ త్వయా ॥ 31 ॥

ఓ పశుపతీ! నీ కుక్షిలోనూ వెలుపలా ఉన్న సకల చరాచరప్రాణులను రక్షించుటకొరకు, సకల దేవతలూ పారిపోవుచుండగా నిలుపుటకు భయంకరమైనదీ గొప్పఅగ్నిజ్వాలలతో నున్నదీ అగు కాలకూటవిషమును కంఠమున నుంచుకొన్నావు. మ్రింగలేదు, కక్కలేదు. నీ పరోపకారత్వమునకు ఈ ఒక్కటీ (నిదర్శనం) చాలదూ ?

జ్వాలోగ్రః సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్ ।
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ॥ 32 ॥

ఓ శంభో ! మహోగ్ర జ్వాలలతో, సమస్థదేవతలకు భయంకలిగించున్న ఆ విషం నీచే ఎలా చూడబడినది ? చేతిలో ఉంచబడ్డది. అదేమైనా మిగులపండిన నేరేడుపండా ? నాలుకయందు ఉంచబడ్డది. అదేమైనా మందుబిళ్ళా ? కంఠములో భరించబడ్డది. ఇదేమైనా ఇంద్రనీలమణి ఆభరణమా ? మహాత్మా! చెప్పవయ్యా!

నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ॥ 33॥

ఓ స్వామీ! అస్థిరులైన దేవతలను ప్రయాసకోర్చి సేవించిననూ ఏమి లభించును ? ఒక్కసారి చేయు నీ సేవకానీ, నమస్కారముకానీ, స్తోత్రముకానీ, పూజకానీ, స్మరణ కానీ, కథాశ్రవణముకానీ, దర్శనముకానీ మాబోటివారికి చాలవూ ? ఇంతకుమించి ముక్తి ఏముండును ? ఎక్కడనుండి కలుగును ? ఇంతకంటే కోరుకోవలసినది ఏమున్నది ?

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ-
ద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపఞ్చం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్దసాన్ద్రో భవాన్ ॥ 34॥

ఓ పశుపతీ! నీ సాహసమేమని చెప్పము ? నీ ధైర్యం ఎవరికి ఉన్నది ? నీవంటి స్థితి ఇతరులు ఎలా పొందెదరు ? దేవతలు పడిపోవుచుండగా, మునిగణము భయపడుచుండగా, ప్రపంచము లయమగుచుండగా, చూచుచూ, నిర్భయుడవై, ఆనందఘనుడవై ఒక్కడివే విహరించెదవు.

యోగక్షేమధురంధరస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాన్తరవ్యాపినః ।
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరఙ్గ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ॥ 35 ॥

యోగక్షేమములభారము వహించువాడవు, సకలశ్రేయస్సులనూ ఇచ్చువాడవు, ఇహపరమార్గములను ఉపదేశించువాడవు, బాహ్యమునందునా, లోపలా వ్యాపించినవాడవు, సర్వజ్ఞుడవు, దయాకరుడవు, నీ విషయమై నేను తెలుసుకొనవలసినది ఏమున్నది ? ఓ శంభో ! నీవే నాకు అత్యంత ఆత్మీయుడవని మనస్సున అనుదినమూ స్మరించుచున్నాను.


భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సామ్బ తవాఙ్ఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।
సత్వం మన్త్రముదీరయన్నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ॥ 36॥

సాంబశివా! భక్తుడనైన నేను నా మనోభీష్టమైన కళ్యాణము (శుభము, మంగళము) పొందుటకు, ఈ శరీరమనే గృహము శుద్ధి కొరకై నా మనస్సనే కలశమును భక్తి అనే దారముతో చుట్టి, సంతోషము అనే ఉదకముతో నింపి, ప్రసన్నమైన ఈ కలశమునందు నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమను నారికేళమును ఉంచి, శివమంత్రమును ఉచ్చరించుచూ పుణ్యాహవాచనము చేయుచున్నాను.
ఆమ్నాయామ్బుధిమాదరేణ సుమనస్సంఘాః సముద్యన్మనో
మన్థానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।
సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ॥ 37॥

మంచిమనస్సుకలవారు (దేవతలు, పండితులు) సకలగుణసంపత్తిగల మనస్సును కవ్వముగా చేసి దృఢభక్తి అనే త్రాటితో కట్టి, వేదసముద్రమును ఆసక్తితో మథించుటద్వారా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులకు సమానమైనవాడూ (కోరినకోర్కెలు తీర్చువాడూ), బుద్ధిమంతులకు ప్రియమైన నిత్యానందమను అమృతస్వరూపుడూ, మోక్షలక్ష్మీస్వరూపుడూ, ఉమా సహితుడూ అయిన శివుని పొందుచున్నారు.

ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః ।
చేతః పుష్కరలక్షితో భవతి చేదానన్దపాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృమ్భతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38॥

కొండంత పూర్వపుణ్యము వలన దర్శనమగు అమృతస్వరూపుడు, ప్రసన్నుడు, మంగళమూర్తి, సద్గణములచే సేవించబడువాడు, లేడిని ధరించినవాడు, పూర్ణుడు, అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు, ఉమా సహితుడూ అయిన శివుడు మనోఆకాశములో అగుపించెనా, ఆనందసముద్రము ఉప్పొంగును. మంచిమనస్సుకలవారికి (సత్పురుషులకు) వృత్తి (ఆ ఆనందంలో రమించటం) అప్పుడు మొదలవుతుంది.

ధర్మో మే చతురఙ్ఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।
జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ॥ 39॥

మోక్షాధిపతి, సర్వపూజ్యుడు అగు రాజశ్రేష్ఠుడు (చంద్రశేఖరుడు) నా మనోకమలమనే నగరమునందుండగా, ధర్మము నాలుగు పాదములతోనూ బాగా నడుచుచున్నది. పాపము నశించుచున్నది. కామము, క్రోధము, మదము మొదలగునవి తొలగిపోతున్నవి. కాలము సుఖమయమవుతున్నది. జ్ఞానానందమనే గొప్ప ఔషధము బాగుగా ఫలించుచున్నది.
 

ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై-
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశిదివ్యామృతైః ।
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ॥ 40॥

భగవంతుడా, విశ్వేశ్వరా! బుద్ధి అను యంత్రముద్వారా, వాక్కులనే కుండలతో, కవిత్వములను పిల్లకాలువల వరసల గుండా, నా హృదయమను పొలములోకి తీసుకురాబడిన సదాశివుని చరిత్రమను అమృతసముద్రపు జలముల వల్ల భక్తి అనే పంట బాగుగా విస్తరిస్తోంది. ! నీ భక్తుడనైన నాకు కరువు వల్ల భయం ఎక్కడిది ?  


పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్రధ్యాననతిప్రదక్షిణసపర్యాలోకనాకర్ణనే ।
జిహ్వాచిత్తశిరోఙ్ఘ్రిహస్తనయనశ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ॥ 41 ॥


ఓ మృత్యుంజయుడా! పాపములు బోయి యిష్టార్థము సిద్ధించుటకు గాను పరమేశ్వరుని స్తుతింపుమని నాలుకయు, ధ్యానింపుమని మనస్సును , నమస్కరింపుమని శిరస్సును, ప్రదక్షిణము చేయుమని పాదములును, పూజింపుమని చేతులును, చూడుమని కన్నులును, కథలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞలేనిదే ఆ కోరికలు నేనెట్లు తీర్చగలను? నీవు నాకాజ్ఞయిచ్చి పలుమారట్లు చేయువిధముగా నన్ను అనుగ్రహింపుము. ఇందు మూగతనము, మతిలేనితనము, కుంటితనము, గ్రుడ్డితనము మొదలైన ప్రతిబంధకములు ఏమియూ రాకుండా చూడుము.

గామ్భీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ-
స్తోమశ్చాప్తబలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।
విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే సదా
దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 ॥


మిగుల దుర్గమంబగు కైలాసపర్వతమున ప్రీతితో నివసించుచున్న ఓదేవా! నా మనస్సనే దుర్గములో నివసించుము. అది గాంభీర్యమనే లోతైన అగడ్త కలది, గట్టి ధైర్యమనే ప్రాకారము కలది, గుణములనే విశ్వసనీయమైన సైన్యము కలది, శరీరమునందున్న ఇంద్రియములనే ద్వారములు కలది, విద్య మరియు వస్తుసమృద్ధి అనే సమస్త సామగ్రితో నిండి దుర్గలక్షణసమగ్రంబై ఉన్నది. దుర్గప్రియుడవు కావున నీవిందు నివసించుము.

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనఃకాన్తారసీమాన్తరే ।
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ-
స్తాన్ హత్వా మృగయావినోదరుచితాలాభం చ సమ్ప్రాప్స్యసి ॥ 43 ॥

ఓ కైలాసవాసా! నీవు అటు ఇటు పోకుము నాయందే నివసించుము. ఆదికిరాతమూర్తీ! దేవా! నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగములున్నవి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొందువు.


కరలగ్నమృగః కరీన్ద్రభఙ్గో
ఘనశార్దూలవిఖణ్డనోఽస్తజన్తుః ।
గిరిశో విశదాకృతిశ్చ చేతః-
కుహరే పఞ్చముఖోస్తి మే కుతో భీః ॥ 44 ॥


సింహమునకు మృగములు చేతచిక్కుచుండును, అదేవిధంగా పరమేశ్వరుడు చేతితో లేడిని పట్టుకున్నాడు. అది వ్యాఘ్రముల ఖండించును, పరమేశ్వరుడు కూడా వ్యాఘ్రాసురుని ఖండించెను. అది గజమును సంహరిస్తుంది, పరమేశ్వరుడు గజాసురుని సంహరించెను. దాన్ని చూసి జంతువులన్నియూ కనబడకుండా పారిపోవును, పరమేశ్వరుని యందే జంతుజాలమంతయూ లయించును. ఇరువురికినీ పర్వతమే నివాసస్థలము, శరీరకాంతి తెలుపు, పంచముఖత్వము ఉభయులకూ ఉన్నది. అట్టి మహాదేవుడు సింహములాగా నాచిత్తకుహరమునందు నివసించియున్నాడు. కనుక నాకు భయమెక్కడిది?

 
ఛన్దఃశాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।
చేతఃపక్షిశిఖామణే త్యజ వృథాసంచారమన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ॥ 45 ॥


ఓ మనస్సనే పక్షిరాజమా! ఎందుకు అటూ ఇటూ తిరిగి వృధాగా శ్రమపడతావు? శంకరుని పాదపద్మములనే గూటిలో ఎల్లప్పుడూ విహరించుము. శాశ్వతమైన ఆ గూడు వేదములనే చెట్టుకొమ్మల చివర ఉన్న (వేదాంతము తెలిసిన) మంచి పక్షులచే (పండితులచే) ఆశ్రయించబడినది, సుఖమునిచ్చునది, దుఃఖమును పోగొట్టునది మరియూ అమృతసారం కల ఫలములతో శోభిల్లుచున్నది. అందువలన పరమేశ్వరుని పాదపద్మములవద్ద విహరించుము. 


ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవై-
రాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాఙ్ఘ్రిసౌధాన్తరే ॥ 46 ॥


పరమేశ్వరుని పాదపద్మములు ఒక భవంతిగానూ, ఆ భవంతిలో పరమహంసలు శాశ్వతవాసులై ఆ పాదపద్మములను సేవించుచున్నట్లుగానూ, మన మనస్సులనే హంసలుకూడా ఆ భవనములో‌ భక్తి భార్యతో కలిసి నివసించవలెననీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

పరమేశ్వరుని పాదపద్మములందలి నఖములు ధవళకాంతులీనుతున్నవి. (జటాజూటము నందలి) చంద్రునినుండి అమృతము స్రవించి ఆ పాదములను కడుగుచున్నది. ఆ పాదములు పద్మపువన్నె కలిగి మిక్కిలి అందముగానున్నవి. పరమహంసలు సమూహములుగా ఆ పాదములను సేవించుచున్నారు. ఓ మనస్సా! నీవునూ ఆ పరమేశ్వరుని పాదపద్మములను భక్తితో ఆశ్రయింపుము.

శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।
దీప్యన్తే గుణకోరకా జపవచఃపుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ॥ 47 ॥


సాధారణంగా వసంతకాలం రాగానే ఉద్యానవనములలో‌ ఎండుటాకులు రాలిపోతాయి. లతలు కొత్త చిగరులు ధరించి విస్తరిస్తాయి. మొగ్గలు తొడుగుతాయి. మొగ్గలు పూలై పూల సువాసనలు నలుదిశలా వ్యాపిస్తాయి. పూదేనె స్రవిస్తుంది. ఫలాలు పక్వానికి వస్తాయి.

శంకరులంటున్నారు - నా హృదయమనే ఉద్యానవనములో‌ శంభుని ధ్యానము అనే వసంతము రాగానే, పాపములనే ఎండుటాకులు రాలిపోతున్నాయి. భక్తిలతలు విలసిల్లుతున్నాయి. పుణ్యములనే చిగురుటాకులు మొలచినవి. గుణములనే మొగ్గలు తొడిగాయి. జప,తప పుష్పాలు పూచి సుసంస్కారాల సువాసనలు వెదజల్లుతున్నాయి. జ్ఞానానందమనే‌ మకరందం ప్రవహిస్తున్నది. సంవిత్తు (సమాధి, అనుభవం) అనే ఫలం వృద్ధి చెందుతున్నది.

నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తామ్బుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యానసరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ॥ 48 ॥


హంసలు తమ నివాసముగా ఎటువంటి సరస్సులు కోరుకుంటాయి ? ఆ సరస్సులలో‌ జలములు శాశ్వతంగా ఉండాలి. జలములు స్వచ్ఛమైనవిగా ఉండాలి. పద్మములతో‌ నిండి ఉండాలి. సువాసనలు వెదజల్లుతూ‌ఉండాలి. గొప్ప హంసలు ఆ సరోవరమును నివాసముగా పొంది ఉండాలి. శంకరులు మన మనస్సులను హంసలతో‌ పోల్చి, ఆ హంసలకు పై లక్షణములున్న ఒక గొప్ప సరస్సును ఆశ్రయించమని ఉపదేశిస్తున్నారు.

ఓ మానస హంస రాజమా! స్థిరమైన శంభుధ్యానమనే సరోవరమును చేరుము. అది శాశ్వతానందమనే జలముతో‌ నిండినది. దేవతల,మునులయొక్క మనోకమలాలకు ఆశ్రయమైనది. నిర్మలమైనది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతున్నది. పాపములు హరించునట్టిది. సుసంస్కారములనే పరిమళములు వెదజల్లునట్టిది. (ఇంత గొప్ప సరోవరము ఉండగా) ఎందుకని అల్పులను ఆశ్రయించటం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమ పడెదవు ?

ఆనన్దామృతపూరితా హరపదామ్భోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మసంవర్ధితా ॥ 49 ॥


ఒక లత బాగా పెరిగి ఫలించాలంటే మనం ఏమేమి చెయ్యవలసి ఉంటుంది ? మంచి పాదుచూసుకొని, అందులో‌ పుష్కలంగా జలం నింపాలి. లత పెరగటానికి ఆశ్రయంగా ఒక కొయ్య పాతాలి. లత విస్తరించటానికి ఒక పందిరి వెయ్యాలి. లతను ఏ కల్మషమూ ఆశ్రయించకుండా చూడాలి. ఆ లతను పోషించాలి. అప్పుడు అది ఫలాన్నిస్తుంది. శంకరులు శివభక్తిని ఒక లతగా పోల్చి, ఆ భక్తి ఎలా ఉండాలో, అది ఎలాంటి ఫలాన్నివ్వగలదో‌ ఉద్బోధిస్తున్నారు.

నా భక్తిలత శివునిపై ప్రేమ అనే జలముతో పూరింపబడినది, హరుని పాదములనే పాదునుండి పుట్టినది, స్థిరత్వమనే‌ గుంజను పట్టుకున్నది. శాఖోపశాఖలుగా విస్తరించి, మనస్సనే ఎత్తైన పందిరిని ఆక్రమించినది. నిష్కల్మషమైనది. పుణ్యకర్మలతో‌ చక్కగా వృద్ధిపొందినది. అలాంటి నా భక్తిలత నిత్యము (శాశ్వతము) అయిన అభీష్టఫలము ఇచ్చునది అగుగాక.


సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం ॥ 50 ॥


శంకరులు తాను శ్రీశైలేశుని సేవిస్తున్నానని చెబుతూ, ఆ శ్రీశైలేశుడు ఎలాంటివాడో వర్ణిస్తున్నారు.

సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో‌భ్రమరాంబాదేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.

శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పుతున్నారు (పరమాచార్యుల అమృతవాణిలో ...)

ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అందలిస్వామి మల్లికార్జునుడు. మద్దిచెట్టును మల్లెతీగ అల్లుకొన్న విధంగా మల్లికార్జునస్వామి ఉన్నాడట. ఈశ్వరుడు స్థాణువు స్థాణువైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నది అర్జునవృక్షం లేదా మద్దిచెట్టు. భ్రమరాంబికయే మల్లెతీవ. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే.

శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వెలసి ఉన్నాడు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు. శ్రుతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తులలో వాసం చేస్తున్నాడు. భ్రమరాంబికా యుక్తుడై, ఆనందమూర్తియై, ముముక్షు హృదయవాటికలలో పరవశుడై తాండవం చేస్తున్నాడు. అట్టి శివాలింగినమైనమల్లికార్జునమహాలింగమూర్తినిసేవిస్తున్నాను - అని భగవత్పాదులవారు అంటున్నారు.

ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది. సంధ్యారంభంలో తాండవంచేసే పరశివుని జటాజూటం విప్పుకొన్నట్లే మల్లెలూ, సాయంతసమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈశ్వరునికి శ్రుతిశిరస్థానాలు వాసమైతే, మల్లెలు నారీశిరస్థానాలను ఆక్రమించుకొంటున్నవి. భ్రమరాంబిక ఈశ్వరాన్వేషణం చేస్తే, భ్రమరములు మల్లెలను అన్వేషిస్తున్నవి. ఈశ్వరునికున్న సద్వాసన మల్లెలకున్నూ కద్దు. భోగీంద్రుడు అనగా సర్పం-శంకరునికి ఆభరణం. భోగీంద్రులకు మల్లెలు అలంకారాలు. ఈశ్వరుడు సుమనస్కులలో-దేవతలలోపూజ్యుడు. సుమనస్సులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేషస్థానం. ఈశ్వరుడు గుణావిష్కృతుడు, అనగా శుద్ధసత్త్వ గుణము కలవాడు. మల్లెలూ గుణావిష్కృతములై అనగా దారములో గ్రువ్వబడి, అందాన్నీ సౌరభాన్నీ వెదజల్లుతూ ఉంటై. ఈశ్వరుడే ఒక్క పెద్ద బొండుమల్లె! 


భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహా(ఽ)సితవపుః పఞ్చేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనో(ఽ)వనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు: ॥ 51 ॥


శంకరులు శ్రీశైలేశుడైన శివుడు ఒక గండుతుమ్మెద అని చెబుతూ, ఆ తుమ్మెదను తన మనస్సు అనే పద్మములో‌ విహరించమని పిలుస్తున్నారు. శివునికి తుమ్మెద లక్షణాలను శంకరులు ఎలా ఆపాదించారో చూడండి.
గండుతుమ్మెద భృంగి (ఆడుతుమ్మెద) ఇచ్ఛానుసారముగా నాట్యముచేయునది. గజముయొక్క మదజలము గ్రహించునది. మాధవమాసము వలన (వసంతములోని వైశాఖము) ఆనందము పొందునది. ఝంకారనాదము కలిగినది. అసితవపుః - మహా నల్లని శరీరం కలది. మన్మధుడిచే తనకుసహాయముగా (తుమ్మెదలు మన్మధుని వింటినారి) నిశ్చయించబడినది. పూదోటలయందు ఆసక్తి ఉన్నది.

శివుడు భృంగి ఇచ్ఛానుసారముగా తాండవము చేయువాడు. గజాసురుని పీచమణచినవాడు. నారాయణుని వలన (మోహినీరూపములో) ఆనందమునొందినవాడు. ప్రణవనాదయుతుడు. సితవపుః - మహా తెల్లని శరీరం కలవాడు. మన్మధుడిచే తనలక్ష్యముగా నిశ్చయించబడినవాడు. సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి కలవాడు.

ఆ శ్రీశైలేశుడు, భ్రమరాంబా పతి, పరమేశ్వరుడు అయిన గండుతుమ్మెద నా మనస్సనే కమలములో‌ విహరించుగాక!


కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనఃసంసేవ్యమిచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్తమయూరమద్రినిలయం చఞ్చజ్జటామణ్డలం
శంభో వాఞ్ఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 ॥


శంకరులు శంభుడిని ఒక నీలి మేఘముతో‌ పోలుస్తూ, తన మనస్సనే చాతక పక్షి ఆ శంభుడనే‌ మేఘమును ఎప్పుడూ‌ కోరుకుంటున్నది అంటున్నారు.

నీలకంఠుడా ! కారుణ్యామృతవర్షము కురిపించువాడవూ, గ్రీష్మమనే గొప్ప ఆపదను పోగొట్టగలవాడవూ, సజ్జనులచేత (దేవతలచేత) విద్య అనే పంట పండుటకై ప్రార్థించబడువాడవూ, ఇష్టం వచ్చిన రూపము ధరించుచున్నవాడవూ, భక్తులనే మయూరములను నర్తింపజేయుచున్నవాడవూ, కొండపైనున్న వాడవూ, శోభించు జటాజూటము కలవాడవూ‌ అయిన ఓ శంభో ! (జలధరమైన మేఘము వంటి)‌ నిన్ను నా మనస్సనే‌ చాతకపక్షి ఎప్పుడూ‌ కోరుకుంటున్నది.



ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-
ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥


ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో‌ విహరించుటయందు అనురాగము కలదీ‌ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.

వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో‌ అనుగ్రహించువాడూ, పార్వతీ‌వల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.

 
సన్ధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక-
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చఞ్చలా ।
భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వలతాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ॥ 54 ॥


శివుడు మయూరమని చెప్పిన శంకరులు, ఆ మయూరనాట్యము జరుగు పరిస్థితులు ఏవో చెప్పుతున్నారు. ఇది శివుని ప్రదోషతాండవ చిత్రణము.

సంధ్యా సమయమే శరదాగమనము (శరదృతువు). ఆనకమనే వాయిద్యమును విష్ణుమూర్తి తన కరములతో‌ మ్రోగించగా వచ్చిన ధ్వనులే మేఘగర్జనలు. దేవతల దృష్టి పరంపరలే మెరుపులు. భక్తుల ఆనందాశ్రువుల ధారలే వృష్టి. పార్వతీదేవియే‌ ఆడునెమలి. ఇలా మహోజ్వలంగా నాట్యము చేయు (శివుడనే ) నెమలిని సేవించుచున్నాను.


ఆద్యాయామితతేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్దమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిలయోగిభిః సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 55 ॥

ఆదిదేవుడూ, జ్యోతిస్వరూపుడూ, వేదవాక్యములచేత తెలియబడేవాడూ, పొందదగినవాడూ, చిదానందమయమైన ఆత్మస్వరూపుడూ, ముల్లోకాలనూ‌ రక్షించువాడూ, సమస్త యోగులచేతనూ‌ ధ్యానింపదగువాడూ, సురగణములచేత కీర్తింపబడేవాడూ, మాయాశక్తియుతుడూ, చక్కని తాండవముచేయుచూ‌ ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే‌ నమస్కారము.





నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీశ్రేయసే
సత్యాయాదికుటుమ్బినే మునిమనః ప్రత్యక్షచిన్మూర్తయే ।
మాయాసృష్టజగత్త్రయాయ సకలామ్నాయాన్తసంచారిణే
సాయంతాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 56 ॥


నిత్యుడునూ, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడూ (సత్త్వ-రజ-స్తమో గుణములు కలవాడూ), త్రిపురాసురులను  (స్థూల సూక్ష్మ కారణ దేహములను) జయించినవాడూ, కాత్యాయనీమనోహరుడూ, సత్యస్వరూపుడూ (కాలాతీతుడూ), ప్రప్రథమ సంసారీ, మునిమనస్సులకు గోచరమగు చిత్స్వరూపుడూ, ముల్లోకములనూ మాయచే సృజించినవాడూ, వేదాన్తవేద్యుడూ, ప్రదోషతాండవముతో ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే నమస్కారము.

నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో ।
మజ్జన్మాన్తరపుణ్యపాకబలతస్త్వం శర్వ సర్వాన్తర-
స్తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షనీయోఽస్మ్యహమ్ ॥ 57 ॥


ప్రభూ! ప్రతిదినమూ, నా పొట్ట పోషించుకొనుటకు వ్యర్థముగా ధనాశతో‌ అందరివద్దకూ‌ తిరుగుతున్నాను. నిను సేవించుట తెలియకున్నాను. సర్వాంతర్యామివైన నీవు నా పూర్వజన్మల పుణ్యము ఫలించిన కారణముగానే నాయందు ఉన్నావు. ఓ‌ పశుపతీ! (ప్రపంచమునను పాలించేవాడా!)‌, ఓ‌ శర్వుడా! (పాపధ్వంసకుడా!) ఈ కారణముచేతనైనా నేను నీచే రక్షింపదగువాడను.

ఏకో వారిజబాన్ధవః క్షితినభో వ్యాప్తం తమోమణ్డలం
భిత్వా లోచనగోచరోఽపి భవతి త్వం కోటిసూర్యప్రభః ।
వేద్యః కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమ-
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ॥ 58 ॥


ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు వ్యాపించిన చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ‌ నాకు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ‌ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము.

హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలామ్బుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా ।
చేతో వాఞ్ఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ॥ 59 ॥


ఓ‌ పశుపతీ! హంస తామరకొలనును ఎలా కోరుకుంటుందో, చాతక పక్షి నల్లమబ్బును ఎలా కోరుకుంటుందో, చక్రవాకము సూర్యుని ఎలా కోరుకుంటుందో, చకోరపక్షి చంద్రుని ఎలా కోరుకుంటుందో, ప్రభూ! గౌరీ రమణా! అలాగ  నా మనసు జ్ఞానమార్గముచే వెదుకబడునదీ, మోక్షసుఖమునిచ్చునదీ అయిన నీ‌ పాదారవిందయుగళమును వాంఛించుచున్నది.

రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్ ।
దీపం సన్తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదామ్భోరుహమ్ ॥ 60॥


ఓ మనసా! నీటిలో‌ కొట్టుకుపోవువాడు ఒడ్డును ఎలా చేరుకుంటాడో, మార్గాయాసముతో‌ బాటసారి చెట్టునీడను ఎలా చేరుకుంటాడో, వర్షముచే భయపడువాడు గట్టి ఇంటిని ఎలా చేరుకుంటాడో, (ఆకొన్న) అతిథి గృహస్థును ఎలా చేరుకుంటాడో, దీనుడు ధార్మికుడైన ప్రభువును ఎలా చేరుకుంటాడో, చీకటిలో‌ చిక్కుకున్నవాడు దీపమును ఎలా చేరుకుంటాడో, చలిలో వణకువాడు అగ్నిని ఎలా చేరుకుంటాడో, అలాగ నీవునూ‌ సమస్తభయములనూ పోగొట్టి సుఖమునిచ్చు శంభుని పాదపద్మమును ఆశ్రయించుము.

  

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.