Showing posts with label స్తోత్రాలు. Show all posts
Showing posts with label స్తోత్రాలు. Show all posts

Saturday, 16 December 2017

గోదా అమ్మవారి ప్రార్థన



గోదా అమ్మవారి ప్రార్థన

నీలాతుంగస్తనగిరితటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరులపై నిద్రించు కృష్ణుని, ఉపనిషత్తుల సారమైన పరతంత్రత పాఠం చెప్పుటకు నిద్రలేపినట్టిదీ, తాను ధరించి వదలిన పూలచెండులతో కృష్ణుని బలవంతముగ బంధించి సంతోషించునట్టిదీ అగు ఆ గోదాదేవి కి మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.

అన్నవయల్ పుదువై ఆణ్డాళరఙ్గఱ్క
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
పాడి క్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడికొడుత్తాళై చ్చొల్.


హంసలు తిరుగుతున్న పంటపొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళు శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అను పేరు గల ఈ పాశురములను మధురమగు గానముతో పాడి సమర్పించినది. ఇది వాఙ్గ్మాలిక. అట్లే పూమాలికను తాను ధరించి అర్పించినది. ఓ మనసా! ఆ ఆండాళును స్మరించుము.

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై
పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ
వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాతమ్
నాంగడవా వణ్ణమే నల్‍గు.


పూమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారుతీగా! పూర్వము జరిగిన ఆ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ములనుద్ధరింపజాలిన ఓ దివ్య కంకణధారిణీ! "వేంకటాచలపతికి నన్ను ప్రియురాలుగా సమకూర్చుము" అని నీవు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడ అతిక్రమింపజాలనట్లు అనుగ్రహించుము.

(తమిళ అనువాదము శ్రీ భాష్యం అప్పలాచార్యుల గ్రంథంనుండి)

Monday, 27 November 2017

అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము (1 - 5)



అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము
(1 - 5)

శ్రీ పార్వతీసుకుచకుఙ్కుమరాజమాన
వక్షస్థలాఞ్చితమమేయగుణప్రపఞ్చమ్ |
వన్దారుభక్తజనమఙ్గలదాయకం తం
వన్దే సదాశివమహం వరదమ్మహేశమ్ ||


శ్రీ పార్వతి వక్షస్థలమునందలి కుంకుమతో (పరస్పరాలింగనముద్వారా) శోభిల్లుతున్న వక్షస్థలము కలవాడూ, అనంతములైన గుణములు కలవాడూ , నమస్కరించు భక్తజనులకు శుభములను, వరములను ప్రసాదించువాడూ అగు మహైశ్వర్యములుగల సదాశివునకు నమస్కరించెదను.

నన్దన్నన్దనమిన్దిరాపతిమనోవన్ద్యం సుమన్దాకినీ
స్యన్దత్సున్దరశేఖరం ప్రభునుతమ్మన్దారపుష్పార్చితమ్ |
భాస్వన్తం సురయామినీచరనుతం భవ్యమ్మహో భావయే
హేరమ్బం హిమవత్సుతామతిమహానన్దావహం శ్రీవహమ్ ||


ఎల్లరనూ సంతోషింపచేయుకుమారుడూ  (లేదా ఎల్లరనూ సంతోషింపచేయు నందనవనమునే సంతోషింపచేయువాడూ), విష్ణువుచే మనస్సున నమస్కరింపబడువాడూ,  ఆకాశగంగను చిందించు సున్దరకేశపాశము గల వాడూ, మందారపుష్పములతో పూజింపబడువాడూ, రాజులచేత, దేవదానవులచేతనూ స్తుతింపబడువాడూ, గొప్ప తేజోమూర్తీ, పార్వతికి మహానన్దమును కలిగించువాడూ, జ్ఞానసూర్యుడై ప్రకాశించుచున్న వినాయకుడిని ధ్యానించుచున్నాను.

ఆలోక్య బాలకమచఞ్చలముచ్చలత్సు
కర్ణావిబోధితనిజాననలోకనం సః |
సామ్బస్స్వమౌలిసుభగాననపూత్కృతై స్త
మాలిఙ్గయన్నవతు మామలమాదరేణ ||


బాగుగా కదలుచున్న చెవులవలన తన ముఖము కనుబడకున్నా అచంచలుడైన వినాయకుని చూచి, ఆదరముతో తన శిరముపైనున్న గంగా తరంగములతో (అవియే చేతులుగా) ఆలింగనముచేసుకున్న శివుడు నన్ను రక్షించుగాక. ఇది చాలును.

కణ్ఠోత్పలం విమలకాయరుచిప్రవాహ
మర్థేన్దుకైరవమహం ప్రణమామి నిత్యమ్ |
హస్తామ్బుజం విమలభూతిపరాగరీతి
మీశహ్రదం చటులలోచనమీనజాలమ్ ||


దీక్షితులు శివుని ఒక మంచినీటి చెరువుతో పోల్చుచున్నారు. అతని కంఠం నల్ల కలువ. దేహకాంతి ప్రవాహము. శిరమునందలి అర్ధచంద్రుడు తెల్ల కలువ. చేతులు కమలములు(ఎర్రనివి). శరీరము నందలి తెల్లని విభూతి పూత పుప్పొడి. ఆయన కన్నులు చేపలు. కావున శివుడొక హ్రదమే అయి ఉన్నాడు. ఆయనకు ప్రతిదినమూ మ్రొక్కెదను.

రఙ్గత్తుఙ్గతరఙ్గసఙ్గతలసద్గఙ్గాఝరప్రస్ఫుర
ద్భస్మోద్ధూలితసర్వకాయమమలమ్మత్తేభకృత్యావృతమ్ |
ఆరూఢం వృషమద్భుతాకృతిమహం వీక్షే నితమ్బస్ఫుర
న్నీలాభ్రచ్ఛురితోరుశృఙ్గమహితం తం సన్తతమ్మానసే ||


భస్మోద్ధూళితమైన అయిన శివుని శరీరము ఉత్తుంగ తరంగముల గంగా ప్రవాహంచే ప్రకాశించుచున్నది.  అద్భుతాకారముగల వృషభమును అధిరోహించి, గజచర్మముచే చుట్టబడిన నితమ్బమూ, క్రిందిభాగమూ, నీలమేఘముచే ప్రకాశించు పర్వతమో అన్నట్లున్న ఆ శివుని ఎల్లప్పుడూ నా మనసున దర్శించుచున్నాను.




Wednesday, 6 September 2017

శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్



|| శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ ||

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే |
న చ వ్యోమభూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 ||

మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః |
న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2||

ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను.చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3||

నాకు ద్వేషము- అనురాగము లేవు. నాకు లోభము - మోహము లేవు. మదము లేదు. మాత్సర్యము లేదు. ధర్మము లేదు. అర్థము లేదు. కామము లేదు. మోక్షము లేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 4||

నాకు పుణ్యము లేదు పాపము లేదు. సుఖము లేదు. దుఃఖము లేదు. మంత్రము లేదు. తీర్థము లేదు. వేదములు లేవు. యజ్ఞములు లేవు. నేను భోజనము కాను. తినదగిన పదార్థము కాను. తినువాడను కాను. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 5||

నేను మృత్యువును కాదు. సందేహము లేదు. నాకు జాతిభేదము లేదు. నాకు తండ్రిలేడు, తల్లిలేదు, జన్మలేదు, బంధువులేడు, మిత్రుడు లేడు. గురువులేడు, శిష్యుడులేడు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేన్ద్రియాణామ్ |
సదా మే సమత్వం న ముక్తిర్న బన్ధః
చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 6||

నేను నిర్వికల్పుడను. ఆకారము లేనివాడను. అంతటావ్యాపించి ఉన్నాను. అన్ని ఇంద్రియములతో నాకు సంబంధములేదు. మోక్షములేదు. బంధములేదు. చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నిర్వాణషట్కం సమ్పూర్ణమ్ ||

Sunday, 3 September 2017

శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ


|| శంకరస్తోత్రాలు : ఏకశ్లోకీ ||

కిం జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే |
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే
కిం తత్రాహమతో భవాన్పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో ||


గురువు శిష్యుని ప్రశ్నించెను:
వత్సా!వస్తుప్రకాశకమగు జ్యోతి ఏదియని నీ అభిప్రాయము?
శిష్యుడు: పగలు సూర్యుడును, రాత్రి ప్రదీప చంద్రాదులును.
గురువు: అగుచో సూర్యప్రదీపాదులను గుర్తించు జ్యోతి ఏది?
శిష్యుడు: నేత్రము.
గురువు: కళ్ళుమూసుకొనినప్పుడు ఏది జ్యోతియగుచున్నది?
శిష్యుడు: బుద్ధి.
గురువు: ఈబుద్ధిని జూచునదేమి?
శిష్యుడు: నేను,(అనగా ఆత్మయే). కనుక తమరు మరియు నేను, ప్రభూ! ఆ పరంజ్యోతియే అని గుర్తించితిని.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ ఏకశ్లోకీ సమ్పూర్ణా ||

Saturday, 2 September 2017

శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్


|| శంకరస్తోత్రాలు : అనాత్మశ్రీవిగర్హణమ్ ||

లబ్ధా విద్యా రాజమాన్యా తతః కిం
ప్రాప్తా సమ్పత్ప్రాభవాఢ్యా తతః కిమ్ |
భుక్తా నారీ సున్దరాఙ్గీ తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 1||


రాజమాన్యతనుబొందించు విద్య లభించినది, ఫలమేమి? ప్రభుశక్తితో కూడిన సంపదను పొందినను ఫలమేమి? సుందరాంగియగురమణితో భోగమును అనుభవించినను ఫలమేమి?  ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. అట్టిచో ఇవి అన్నియును వ్యర్థములే!

కేయూరాద్యైర్భూషితో వా తతః కిం
కౌశేయాద్యైరావృతో వా తతః కిమ్ |
తృప్తో మృష్టాన్నాదినా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 2||


ఏవ్యక్తి ఆత్మసాక్షాత్కారమును పొందలేదో, అతడు కేయూరాది - అలంకారములవలన భూషితుడైనను, పట్టుపుట్టములను కట్టినను, మధురాన్నాదులవలన తృప్తినందినను ఫలమేమి?

దృష్టా నానా చారుదేశాస్తతః కిం
పుష్టాశ్చేష్టా బన్ధువర్గాస్తతః కిమ్ |
నష్టం దారిద్ర్యాదిదుఃఖం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 3||


మనోహరములగు పెక్కుదేశములను వీక్షించినాడు, ఇష్టులగు బంధువర్గమును పోషించినాడు, దారిద్ర్యమును నశింపచేసికొనినాడు. కాని, ఆత్మసాక్షాత్కారమునందలేదు , లాభమేమి?

స్నాతస్తీర్థే జహ్నుజాదౌ తతః కిం
దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతః కిమ్ |
జప్తా మన్త్రాః కోటిశో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 4||


ఎవనికి ఆత్మస్వరూపదర్శనము లభింపలేదో అతడు గంగాదితీర్థముల స్నానమొనర్చిన నేమి ఫలము? షోడశదానముల నొనర్చిన ఏమి ఫలము? కోటి మంత్రజపమొనర్చిన ఏమి ఫలము?

గోత్రం సమ్యగ్భూషితం వా తతః కిం
గాత్రం భస్మాచ్ఛాదితం వా తతః కిమ్ |
రుద్రాక్షాదిః సద్ధృతో వా తతః కిమ్
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 5||


గోత్రము(వంశము)అలంకృతమైనది. గాత్రము భస్మాచ్ఛాదితమైనది, రుద్రాక్షాదులు చక్కగ ధరింపబడినవి. కాని ఆత్మానుభవములేదు. వీని వలన కలుగు ఫలమేమి?

అన్నైర్విప్రాస్తర్పితా వా తతః కిం
యజ్ఞైర్దేవాస్తోషితా వా తతః కిమ్ |
కీర్త్యా వ్యాప్తాః సర్వలోకాస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 6||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు విప్రులను అన్నభోజనముతో సంతోషపెట్టగ కలుగు ఫలమేమి? యజ్ఞమున దేవతలను సంతోషపరచిన ఫలమేమి? కీర్తితో సర్వలోకములను వ్యాపింపచేసిన కలుగు ఫలమేమి?

కాయః క్లిష్టశ్చోపవాసైస్తతః కిం
లబ్ధాః పుత్రాః స్వీయపత్న్యాస్తతః కిమ్ |
ప్రాణాయామః సాధితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 7||


ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. ఉపవాసములొనర్చి, కాయక్లేశ మొనర్చిన లాభమేమి? స్వభార్యవలన పుత్రులను బడసిన లాభమేమి? ప్రాణాయామమును సాధించిన ఫలమేమి?

యుద్ధే శత్రుర్నిర్జితో వా తతః కిం
భూయో మిత్రైః పూరితో వా తతః కిమ్ |
యోగైః ప్రాప్తాః సిద్ధయో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 8||


ఆత్మసాక్షాత్కారమునందనివాడు యుద్ధమున శత్రువులను నిర్జించినను, మిత్రులతో నిండియున్నను, యోగసిద్ధులను పొందినను లాభమేమి?

అబ్ధిః పద్భ్యాం లఙ్ఘితో వా తతః కిం
వాయుః కుమ్భే స్థాపితో వా తతః కిమ్ |
మేరుః పాణావుద్ధృతో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 9||


సముద్రమును అడుగులతో దాటినను, వాయువును కుంభకప్రాణాయామమున నిల్పినను, మేరువును చేతితోనెత్తినను, ఆత్మసాక్షాత్కారము నందకుండిన లాభమేమి?

క్ష్వేలః పీతో దుగ్ధవద్వా తతః కిం
వహ్నిర్జగ్ధో లాజవద్వా తతః కిమ్ |
ప్రాప్తశ్చారః పక్షివత్ఖే తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 10||


విషమును పాలవలె త్రాగగలడు, నిప్పులను పేలాలవలె తినగలడు, పక్షివలె ఆకసమున తిరుగగలడు, కాని ఆత్మసాక్షాత్కారము నందలేదు, ఫలమేమి ?

బద్ధాః సమ్యక్పావకాద్యాస్తతః కిం
సాక్షాద్విద్ధా లోహవర్యాస్తతః కిమ్ |
లబ్ధో నిక్షేపోఽఞ్జనాద్యైస్తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 11||


అగ్న్యాదులను లోబరుచుకొనిననూ, సుదృఢలోహములను విరచిననూ, అంజనాదులవలన ధననిక్షేపములను పొందిననూ, ఆత్మసాక్షాత్కారమొనర్చుకొననియెడల లాభమేమి?

భూపేన్ద్రత్వం ప్రాప్తముర్వ్యాం తతః కిం
దేవేన్ద్రత్వం సమ్భృతం వా తతః కిమ్ |
ముణ్డీన్ద్రత్వం చోపలబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 12||


ఉర్వియందు రాజేంద్రత్వము లభించినది. లాభమేమి ?  స్వర్గమున దేవేంద్రత్వము లభించినది. లాభమేమి ? వనమున యతీంద్రత్వము లభించినది, లాభమేమి ? ఆత్మసాక్షాత్కారము లభింపకుండిన ?

మన్త్రైః సర్వః స్తమ్భితో వా తతః కిం
బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిమ్ |
కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 13||


మంత్రబలమున సమస్తమునూ స్తంభింపచేసిననూ, బాణముతో లక్ష్యమును భేదించిననూ, కాలజ్ఞానమును బడసిననూ, ఆత్మసాక్షాత్కారమొక్కటి లేకుండినచో మిగిలినవన్నియునూ వ్యర్థములు.

కామాతఙ్కః ఖణ్డితో వా తతః కిం
కోపావేశః కుణ్ఠితో వా తతః కిమ్ |
లోభాశ్లేషో వర్జితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 14||


కామావేశము ఖండింపబడినది. కోపావేశము కుంఠితమైనది. లోభపరిష్వంగము వర్జింపబడినది. అయిననూ ఆత్మసాక్షాత్కారము లభింపలేదు. లాభమేమి ?

మోహధ్వాన్తః పేషితో వా తతః కిం
జాతో భూమౌ నిర్మదో వా తతః కిమ్ |
మాత్సర్యార్తిర్మీలితా వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 15||


మోహాంధకారము నలుగగొట్టబడినది. పృథ్వియందు గర్వరహితుడేయైనాడు. మాత్సర్యపీడ ప్రశమితమైనది. అయిననూ ఆత్మదర్శనములభింపకుండిన వీనివలన లాభమేమి ?

ధాతుర్లోకః సాధితో వా తతః కిం
విష్ణోర్లోకో వీక్షితో వా తతః కిమ్ |
శంభోర్లోకః శాసితో వా తతః కిం
యేన స్వాత్మా నైవ సాక్షాత్కృతోఽభూత్ || 16||


బ్రహ్మలోకము సాధించిననూ, విష్ణులోకమును వీక్షించిననూ, శివలోకమును శాసించిననూ,  ఆత్మలోకమును సాక్షాత్తుగ చూడకుండిన లాభమేమి ?

యస్యేదం హృదయే సమ్యగనాత్మశ్రీవిగర్హణమ్ |
సదోదేతి స ఏవాత్మసాక్షాత్కారస్య భాజనమ్ || 17||


ఎవనిహృదయమున సంపూర్ణముగ ఈ రీతిగ ఎల్లప్పుడునూ అనాత్మవస్తుసౌందర్యనింద ఉదయించుచుండునో, అతడే ఆత్మసాక్షాత్కారమునకు అర్హుడు.

అన్యే తు మాయికజగద్భ్రాన్తివ్యామోహమోహితాః |
న తేషాం జాయతే క్వాపి స్వాత్మసాక్షాత్కృతిర్భువి || 18||


మిగిలినవారు, జగత్భ్రాంతివ్యామోహమోహితులు. వారికి జగత్తున ఎన్నడునూ ఆత్మసాక్షాత్కారము లభింపదు.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అనాత్మశ్రీవిగర్హణం సమ్పూర్ణమ్ ||

శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్



|| శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్ ||

చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 1||


చంచలములు - ఎర్రనివి - దయతో నిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగా ధరించినది, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచమునంతటినీ సంరక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగపువ్వు వంటి ముక్కు చివరన ముత్యమును అలంకరించుకున్నది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2||


కస్తూరీ తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము - వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షములద్వార వర్షించు కృపారసములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ |
రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 3||


మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులుకలది, బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామరరేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడా శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 4||


నక్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్య అయినది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చక్రములలోనుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితాత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గన్ధర్వకన్యాదృతామ్ |
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 5||


విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రమునందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమన్తభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 6||


అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీలతలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనపుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 7||


ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారియందు ప్రసన్నమైన హృదయము కలది, ఒడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 8||


కర్పూరము - అగరు - కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్నివిధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలమునందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలంకృతామ్ |
గఙ్గాగౌత్మగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 9||


స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశమునందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - గౌతమమహర్షి - గర్గుడు మొదలైన వారిచే స్తుతింపబడు పాదములు కలది, గోవు - గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం సమ్పూర్ణమ్ ||

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/09/blog-post_59.html
 

Friday, 1 September 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శ్రీ మహాగణాధిపతయే నమః



పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు.

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥


తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.

ఈ భూమిలో అమ్మవారిని దక్షిణాన కన్యాకుమారినుండి, ఉత్తరాన కాశ్మీరంలో క్షీరభవానీ వరకూ వివిధరూపాలలో ఆరాధిస్తారు. కానీ శ్రీవిద్యాతంత్రంలో చెప్పబడిన లలితా త్రిపురసుందరి లక్షణములు, ఆయుధములు ఒక్క కాంచీపుర కామాక్షికి మాత్రమే ఉన్నాయి. భూమి అంతటినీ ఒక దేవత అనుకుంటే, ఆ భూదేవియొక్క నాభిస్థానము కాంచీపురము.

క్వణత్-కాంచీదామా - సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ.  అమ్మవారు నడుస్తూంటే కాలి అందెలేకాక వడ్డాణపు చిరుమువ్వలూ సవ్వడిచేస్తాయి. పరిక్షీణామధ్యే - అమ్మవారి నడుము చాలా సన్ననిది. పరిణతశరత్చన్ద్రవదనా - శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ.  శరత్కాలవాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. అమ్మవారి ముఖము, శరత్తులోని పున్నమిచంద్రుని వంటి కాంతి విరజిమ్ముతూ ఉంటుందని శంకరులు సూచిస్తున్నారు. అమ్మవారి వదనం అనుగ్రహం అనే వెన్నెల కురిపిస్తుంది.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - అమ్మవ్రారు తన చేతులలో విల్లు, అంబులు, పాశం, అంకుశములు ధరిస్తుంది. ఇవి శ్రీవిద్యాధిదేవత యొక్క ముఖ్య లక్షణాలు. ఈ దేవతను లలితా మహా త్రిపురసుందరి అని, కామేశ్వరి అను పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో విల్లు, అమ్ములు ఉంటాయి. విల్లమ్ములు మన్మథుని వలెనే చెరకువిల్లు, పుష్పబాణములు.

రాగము, ద్వేషము - వీటిగురించి లోతుగా ఆలోచిస్తే ప్రాపంచిక జీవనం అంతా కామక్రోధములనబడే ఈ రాగ ద్వేషములతో నిండి ఉందని తెలుసుకుంటాము. ఈ రెండూ అమ్మవారి మాయాలీలలో భాగాలు. ఆవిడ అనుగ్రహలీలలో అవి మాయమయిపోతాయి. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం వీటిని అదుపులో ఉంచగలం. రాగస్వరూపపాశాఢ్యా - కోరిక అను పాశము కలది. క్రోధాకారాంకుశోజ్జ్వలా - కోపము అను అంకుశముతో మెరియునది. ఈ రెండు పేర్లూ లలితా సహస్రంలో ఉన్నాయి.  అమ్మవారి పాశం కామము/కోరికకు సంకేతం. పాశములాగా కామము మనను కట్టేస్తుంది. అలాగే అంకుశం క్రోధమునకు సంకేతం. కోపము మనను చీల్చి రెచ్చగొడుతుంది. పాశాంకుశములు ఒక ఏనుగుని అదుపులో ఉంచినట్టు, కామక్రోధములను అదుపులో ఉంచుతాయి, అంటే ఈ కామక్రోధముల జన్మస్థానమైన మనస్సును అదుపులో ఉంచుతుంది.

మరోలా చెప్పాలంటే  అమ్మవారు మనపై వాత్సల్యంచూపి, ఆమె చేతిలో ఉన్న పాశంలో మనలను కట్టివేసి, మనను కట్టివేస్తున్న ఇతర పాశాలకు దూరంచేస్తుంది. మనకు బంధములు లేని బంధము ఇస్తుంది. అలాగే ఆమె తన కోపమును మన క్రోధముపై చూపి, తన అంకుశముతో మన క్రోధమును చీల్చి, అణచివేసి ప్రశాంతతనిస్తుంది.

మనం కోరికను అమ్మవారితో అనుబంధంగానూ, కోపమును మన కోపముపై కోపముగానూ మార్చుకుంటే అమ్మవారి పాశాంకుశాలు మనను బంధవిముక్తులను చేస్తాయి.

లలితా సహస్రంలో పాశాంకుశాల తరువాతి రెండు నామములు  అమ్మవారి చేతుల్లోని విల్లమ్ములపై ఉన్నాయి. మనోరూపేక్షుకోదండా - మనస్సురూపమైన చెరకువిల్లు ధరించునది, పంచతన్మాత్రసాయకా - అయిదు తన్మాత్రలకు సంకేతమైన బాణములు కలిగినదీ.

మన్మథుడిచేతిలో విల్లమ్ములు ఏంచేస్తాయో తెలిసినదే. అమ్మవారి చేతుల్లో అవి ఏంచేస్తాయి ? విల్లు మన మనస్సులను మోక్షమునందు కోరిక కలిగినవాటిలా చేస్తుంది. అయిదు బాణములూ కూడా అంతే. అవి మన ఇంద్రియాల శక్తులను అమ్మవారివైపు తిప్పి శుచిగా చేస్తాయి.  ఇవి మనలో అమ్మవారిని స్తుతించే పాటలను వినాలనీ, ఆమె పాదపద్మములను తాకాలనీ, ఆమె స్వరూపాన్ని చూడాలనీ, అమ్మవారి పాదప్రక్షాళన చేసిన జలం అనే అమృతపు రుచి చూడాలని, అమ్మవారి నిర్మాల్యపుష్పములను సేకరించి వాటి దివ్యసుగంధపరిమళములను ఆఘ్రూణించవలెననీ, ఇలాంటి కోరికలు కలిగేలా చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారి పుష్పబాణములు మన ఇంద్రియలౌల్యాలను నిర్మూలిస్తాయి. ఆమె చెరకువిల్లు మన మనస్సును లయంచేస్తుంది. అది జరిగినప్పుడు మనకు జ్ఞానము, మోక్షము లభిస్తాయి. మనకి ఇంకేంకావాలి ?

ఇలా పవిత్రమయిన అయిదు ఇంద్రియాలూ, మనస్సూ కలిపి ఆరు కరణములు. తుమ్మెద తన ఆరు చరణములతో పద్మముపై వ్రాలినట్లు మనము ఈ ఆరు కరణములనూ అమ్మవారి పాదపద్మములపై లయంచేయాలి.

అమ్మవారు జ్ఞాన సామ్రాజ్యపు మహారాజ్ఞి. తాను మోక్షప్రదాయిని అని సూచించడానికి ఆమె కామక్రోధాలు నాశనంచేసి జ్ఞానం కలిగించు ఆయుధాలైన పాశాంకుశాలు రెండు చేతులతో ధరించింది. తాను మనస్సును, ఇంద్రియాలను తొలగించివేస్తుందని సూచించుటకు ఆమె విల్లమ్ములు ధరించింది.

శంకరులు ఈ శ్లోకంలో మొదట అమ్మవారి రూపం - నాల్గుచేతులు, వడ్డాణము ధరించిన సన్నని నడుము, శరత్కాలపౌర్ణమినాటి జాబిల్లినిపోలిన మోము - వర్ణించారు. ఈ భౌతికరూపవర్ణన తరువాత శంకరులు అమ్మ తత్త్వపు సారాంశాన్ని చెప్పుతున్నారు - పురమథితురాహోపురుషికా -  త్రిపురాసురసంహారి యెక్క అహంకార స్వరూపము అనే అర్థం వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, శివుని యొక్క ’నేను’ అనే భావస్వరూపమే అమ్మవారు అని అర్థమవుతుంది. పరబ్రహ్మము యొక్క చిచ్ఛక్తి యే అమ్మవారు. జ్ఞానాంబ.

ఈ శ్లోకములో శంకరులు ఎంతో అందంగా వర్ణించిన అమ్మవారిని మన అంతర్నేత్రముతో చూడడము మన పని.

Thursday, 31 August 2017

శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్



|| శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్ ||

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చిన్తామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే || 1 ||


శ్రీవిద్యాస్వరూపిణివి, శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడుదానవు, శ్రీనాథుడు మొదలగు గురువుల(విష్ణు-బ్రహ్మ-మహేశ్వరులు)స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండుదానవు, లక్ష్మీ-సరస్వతీ-పార్వతులచే నమస్కరించబడు పాదపద్మములు కలదానవు, శివుని భార్యవు, మంగళస్వరూపిణివి, మధ్యాహ్నసమయమునందు మలయధ్వజ మహారాజుకు కుమార్తెగా అవతరించినదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌలివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే || 2 ||


శ్రీచక్రమునందుండు దానవు, స్థిరమైనదానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడుదానవు, దీనులకు వరములిచ్చెడిదానవు, భక్తులకు అభయమొసంగుదానవు, స్తనభారము కలదానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచే తెలియబడుదానవు, మెరుపు వంటి శరీరము కలదానవు, తల్లివి, అమృతముతో ఆర్ర్దమైన హృదయము కలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

కోటీరాఙ్గదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బహారాఞ్చితే |
శిఞ్జన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనామ్బికే || 3||


కిరీటము - కంకణములు - రత్నకుండలములు అలంకరించుకున్నదానవు, ధనుస్సు - బాణము పట్టుకున్నదానవు, చక్రవాక పక్షులవంటి రెండు స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్నదానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదములు కలదానవు, నా దారిద్ర్యమను సర్పమును సంహరించు గరుడపక్షివంటిదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశచాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే |
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునినుతే మాం పాహి మీనామ్బికే || 4 ||


బ్రహ్మ - విష్ణు -మహేశ్వరులచే స్తుతింపబడుదానవు, బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివులను పంచప్రేతల ఆసనమును అధిష్ఠించినదానవు, పాశము - అంకుశము - ధనుస్సు - బాణము ధరించినదానవు, తలపై బాలచంద్రుని అలంకరించుకున్నదానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన కన్నులు కలదానవు, కోట్లాది బాలసూర్యుల వలే ప్రకాశించుచున్నదానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు, మునులచే ప్రార్థింపబడుదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

గన్ధర్వామరయక్షపన్నగనుతే గఙ్గాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే || 5 ||


గంధర్వులు, దేవతలు, యక్షులు మరియూ సర్పములచేత స్తుతించబడుదానవు. శివునిచే ఆలింగనము చేసికొనబడినదానవు. నిన్ను స్తుతించువారను రక్షించుదానవు. గరుడునిపై కూర్చున్నదానవు. కమలమునందు పుట్టినదానవు. నల్లనిదానవు. స్థిరమైనదానవు. ఆకాశమును అతిక్రమించినదానవు. దుష్టులనే కొయ్యలను తగులపెట్టు అగ్నిజ్వాలవు. కోట్లాదుసూర్యులవలె వెలుగొందుదానవు. మంత్రములచే ఆరాధించబడు దేవతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

నాదే నారదతుమ్బురాద్యవినుతే నాదాన్తనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనామ్బికే || 6 ||


నాదస్వరూపిణివి, నారదతుంబురాదులచే స్తుతించబడుదానవు, నాదముచివరనుండు అనునాదస్వరూపిణివి, నిత్యమైనదానవు, నల్లని లతవంటి శరీరముగలదానవు, సాటిలేనిదానవు, ధాన్యపుగింజ యొక్క మొన వలే సూక్ష్మమైనదానవు, మనోహరమైనదానవు, కామకళాస్వరూపిణివి, కదంబ (కడిమి చెట్ల) వనమునందుండుదానవు.  కామేశ్వరుని ఒడిలో కూర్చున్నదానవు. నా జ్ఞానస్వరూపిణివి, నా కోర్కెలుతీర్చు కల్పలతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే |
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనామ్బికే || 7||


వీణానాదము వినుచూ మూసిన అరమోడ్పుకన్నులుకలదానవు. కొంచెముగా జారిన కొప్పుగలదానవు. తాంబూలముచే ఎఱ్ఱనైన చిగురుటాకులవంటి పెదవికలదానవు. తాటంకములూ, హారములూ ధరించినదానవు. నల్లనిదానవు. చంద్రకళను శిరోభూషణంగా ధరించినదానవు. నొసటన కస్తూరీతిలకం ధరించినదానవు. పరిపూర్ణురాలవు. పూర్ణచంద్రునివలె అందమయిన ముఖముకలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరఞ్జనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనామ్బికే || 8 ||


శబ్దబ్రహ్మస్వరూపిణివి. చరాచరజగత్స్వరూపిణివి. జ్యోతిర్మయివి, వాఙ్గ్మయివి. నిత్యానందరూపిణివి, నిరంజనస్వరూపిణివి. ’తత్’, ’త్వం’ అను శబ్దములకు అర్థమయినదానవు. జ్ఞానమూర్తివి, తత్త్వములకి అతీతమైనదానవు. శ్రేష్ఠమైనవాటికంటే శ్రేష్ఠమైనదానవు. మాయాస్వరూపిణివి, లక్ష్మీస్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివస్వరూపురాలవూ అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీస్తోత్రం సంపూర్ణమ్ ||

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

 
శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు.

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాః
వసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥

అమ్మా! హిమాద్రితనయా! పార్వతీ! విల్లా, పూలవిల్లు. ఆ వింటికి తుమ్మెదలబారు నారి. అయిదే బాణములు, అవికూడా పుష్పబాణములు. మలయమారుత పవనము రథము, వసంతుడు సహాయకుడు. అయినప్పటికీ మన్మథుడొక్కడే, అమ్మా! నీ క్రీగంటి చూపు వల్ల చెప్పలేనంత కృపను పొంది, ఈ జగత్తంతటనూ జయించుచున్నాడు.

ఏమాత్రమూ బలం లేని ఆయుధములతో, శరీరమే లేని మన్మథుడు ప్రపంచమంతా జయిస్తున్నాడు. అతడికి అలాంటి శక్తి ఎవరు ఇస్తున్నారు ? అది అమ్మవారి క్రీగంటిచూపు. ఇదే ఈ శ్లోకముయొక్క సారాంశము.
మన్మథుడు ఒకప్పుడు అతిలోకసౌందర్యవంతుడు. తన సొంతశక్తిపై నమ్మకంతో అహంకరించి, ఈశ్వరునిచేతిలో భస్మమైనాడు. అమ్మవారు దయతో మరలా జీవితాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని ఈయలేదు. కేవలం తనభార్య రతీదేవికి మాత్రం కనపడే వరం ఇచ్చింది. అలాగే ఇటువంటి బలహీనమైన ఆయుధాలనూ ఇచ్చింది. వీటితో మన్మథుడు విజయం సాధించినా, అతడు వినయుడై ఆ విజయం తన స్వప్రతిభకాదనీ, అమ్మవారి కరుణ అనీ తలచుతునే ఉంటాడు. ఈశ్వరునిచేత తన శరీరమేకాక, గర్వముకూడా నశింపబడింది.

కాముని అమ్మవారు విజేతగా చేయటంతో మన కథ ఆగకూడదు. మనమూ కాముని గెలవాలి. ఈశ్వరుడు మన్మథుని దగ్ధంచేసినప్పుడు అమ్మవారు ఆయనలో ఉండి బలాన్నిచ్చినదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకూ కాముని గెలవటానికి ఆమె అనుగ్రహం కావాలి.

సగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనుగ్రహవర్షం కురిపించటము, మాయ యొక్క కృత్యము. దానికి ఒక్కక్షణము అమ్మవారి క్రీగంటిచూపు చాలు.

Wednesday, 30 August 2017

శంకరస్తోత్రాలు : మనీషాపంచకం




శంకరస్తోత్రాలు : మనీషాపంచకం
పరమాచార్యులవ్యాఖ్యానంతో

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతే
యా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥


జాగ్రదవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తి అవస్థలలో ఏ చైతన్యము స్పష్టంగా వెలుగొందునో, ఏది బ్రహ్మమొదలుకొని చీమ వరకు అన్ని శరీరములలో వ్యాపించి జగత్సాక్షిగానున్నదో అదే నేను. కనబడు పదార్థము కాను. అని దృఢమైన జ్ఞానము ఎవనికి కలదో అతడు చండాలుడో లేక బ్రాహ్మణుడో అయిననూ అతడే గురువని నా అభిప్రాయము.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్ ।
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 2॥


బ్రహ్మ నేనే. ఈ ప్రపంచమంతా చైతన్యముతో వ్యాపించియున్నది. ఇదంతా సత్త్వరజస్తమోగుణాత్మకమైన అజ్ఞానంద్వారా నాచే కల్పించబడినది. అని ఎవడి మతి సుఖతరమైన, నిత్యమైన మరియు నిర్మలమైన పరబ్రహ్మయందు దృఢంగా ఉండునో అతడు చండాలుడైననూ లేక బ్రాహ్మణుడైననూ నాకు గురువే అని నా అభిప్రాయము.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజశాన్తాత్మనా ।
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ 3॥


ఈ ప్రపంచమంతా నశించునదే అని గురు వాక్యముచే నిశ్చయించుకొని, నిత్యమైన బ్రహ్మగురించి నిరంతరం ఆలోచిస్తూ , ప్రశాంతచిత్తుడనై, చేసిన మరియు చేయబోవు పాపమును జ్ఞానరూపమైన అగ్నిలో దహించేనేను, నా శరీరమును ప్రారబ్ధమనుభవించుటకై సమర్పించితినని అనుకొనుచున్నాను.

యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యన్తః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాన్తి స్వతోఽచేతనాః ।
తాం భాస్యైః పిహితార్కమణ్డలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ 4॥


ఏదైతే మృగములచే నరులచే మరియు దేవతలచే "నేను" అని అంతఃకరణంలో స్పష్టంగా గ్రహించబడుచున్నదో, దేని కాంతిలో హృదయము, ఇంద్రియములు మరియు అంతఃకరణము అను అచేతనములు స్వయంగా భాసించుచున్నవో, సూర్యకాంతులచే ప్రకాశించు మేఘముల ద్వారా కప్పబడిన సూర్యమండలమువలే వెలుగొందు ఆ స్ఫూర్తిని ఎల్లప్పుడు భావించుచూ ప్రశాంత చిత్తుడైన యోగియే గురువని నా భావన.

యత్సౌఖ్యామ్బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః ।
యస్మిన్నిత్యసుఖామ్బుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేన్ద్రవన్దితపదో నూనం మనీషా మమ ॥ 5 ॥


ఏ సుఖసముద్రలేశమాత్రముననే ఇంద్రాదులు సంతోషించెదరో, ప్రశాంతమైన మనస్సులో ఎవనిని ఎల్లప్పుడు ధ్యానించుచూ మునులు ఆనందించెదరో, ఆ నిత్యసుఖసముద్రంలో మునిగిన బుద్ధి కలవాడు బ్రహ్మమే. బ్రహ్మవేత్తకాడు. దేవేంద్రుడు అతడి పాదములను నమస్కరించునని నా అభిప్రాయము.

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మనీషాపఞ్చకం సమ్పూర్ణమ్ ॥

పరమాచార్యులవ్యాఖ్యానం : http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/7.html

 మనీషాపంచకం, అంతరార్థం

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

శంకరస్తోత్రాలు : కాశీపంచకము



॥ శంకరస్తోత్రాలు :  కాశీపఞ్చకమ్ ॥

మనోనివృత్తిః పరమోపశాన్తిః సా తీర్థవర్యా మణికర్ణికా చ ।
జ్ఞానప్రవాహా విమలాదిగఙ్గా సా కాశికాహం నిజబోధరూపా ॥ 1॥


మనస్సునకు చపలత్వమును నిరోధించి పరమ ప్రశాంతతను కలుగచేయు మణికర్ణికా ఘట్టము జ్ఞానప్రవాహరూపమైన నిర్మల గంగతో కలసి కాశీ పట్టణమునందు విరాజిల్లుచున్నది. ఆత్మజ్ఞానమును బోధించు ఆ కాశీ పట్టణము నేనే.

యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరాచరం భాతి మనోవిలాసమ్ ।
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా ॥ 2॥

ఈ చరాచర జగత్తంతయూ మనోవిలాసరూపమై ఇంద్రజాలమువలే కాశీ పట్టణమునందు కనిపించును. సచ్చిదానందమయము, పరమాత్మ స్వరూపము, ఆత్మజ్ఞాన బోధకము అగు ఆ కాశీ పట్టణము నేనే.

కోశేషు పఞ్చస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్ ।
సాక్షీ శివః సర్వగతోఽన్తరాత్మా సా కాశికాహం నిజబోధరూపా ॥ 3॥


అన్నమయము మొదలగు ఐదు కోశములందు విరాజిల్లు బుద్ధియే భవానీదేవి, ప్రతి శరీరమూ ఆమెకు నివాసము. అంతటా వ్యాపించిన సాక్షియగు శివుడు అంతరాత్మ. అట్టి ఆత్మజ్ఞానము బోధించు కాశీ పట్టణము నేనే.

కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా ।
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా ॥ 4 ॥


కాశీ పట్టణమునందు పరమాత్మ ప్రకాశించుచున్నాడని, కాశీ పట్టణము అన్నిటినీ ప్రకాశింపచేయుననీ తెలుసుకున్నవాడు కాశీ పట్టణమును పొందును.

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగఙ్గా ।
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః ।
విశ్వేశోఽయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోఽన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి ॥ 5 ॥


కాశీ క్షేత్రము శరీరము. త్రిభువన జననియైన జ్ఞానగంగ అంతటా వ్యాపించి ఉన్నది. భక్తి శ్రద్ధలే గయ. గురుచరణములు ధ్యానించుటే ప్రయాగ. సకలజనుల మనస్సాక్షియగు విశ్వేశ్వరుడే అంతరాత్మ. నాశరీరమునందే అన్నీ ఉండగా వేరే పుణ్యతీర్థమెందుకు?

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ కాశీపంచకమ్ సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : అద్వైత పంచకము

శంకరస్తోత్రాలు : అద్వైత పంచకము




॥ అద్వైతపఞ్చకమ్ ॥

నాహం దేహో నేన్ద్రియాణ్యన్తరఙ్గో
నాహఙ్కారః ప్రాణవర్గో న బుద్ధిః ।
దారాపత్యక్షేత్రవిత్తాదిదూరః
సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోఽహమ్ ॥ 1॥


నేను శరీరమును కాను. ఇంద్రియములు మరియు అంతరంగము కాను. అహంకారము కాను. ప్రాణసమూహము కాను. బుద్ధి కాను. భార్య, పిల్లలు, క్షేత్రము, ధనములకు దూరంగా ఉన్న సాక్షి, నిత్యుడు, ప్రత్యగాత్మ అగు శివుడను నేను.

రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జౌ యథాహిః
స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః ।
ఆప్తోక్త్యాఽహిభ్రాన్తినాశో స రజ్జు-
ర్జీవో నాహం దేశికోక్త్యా శివోఽహమ్ ॥ 2 ॥


తాడు అని తెలియనప్పుడు తాడును చూచి పాము అని అనుకొనునట్లుగా తన ఆత్మను గురించి తెలియనప్పుడు తననే జీవుడని అనుకొందురు. యథార్థము చెప్పువారి మాటలతో భ్రాంతి నశించి తాడు అని తెలిసినట్లుగా, ఆచార్యుని ఉపదేశంచే నేను జీవుడు కాను, శివుడను అని తెలియును.

ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యమ్
సత్యజ్ఞానానన్దరూపే విమోహాత్ ।
నిద్రామోహాత్స్వప్నవత్తన్న సత్యమ్
శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోఽహమ్ ॥ 3 ॥


అసత్యమైన ఈ విశ్వము సత్యజ్ఞానానందరూపుడైన ఆత్మయందు భ్రాంతి వలన కనబడుచున్నది. నిద్రలో మోహము వలన కనిపించు స్వప్నము వలే ప్రపంచము సత్యము కాదు. శుద్ధుడు, పూర్ణుడు, నిత్యుడు, ఒకడు అగు శివుడు నేనే.

నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో
దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః ।
కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం-
కారస్యైవ హ్యాత్మనో మే శివోఽహమ్ ॥ 4 ॥


నేను పుట్టలేదు. పెరగలేదు. నశించలేదు. ప్రకృతి వలన ఏర్పడు ధర్మములన్నీ ఈదేహమునకే. చిన్మయమైన ఆత్మనగు నాకు కర్తృత్వము మొదలైనవి లేవు. నేను శివుడను.

మత్తో నాన్యత్కిఞ్చిదత్రాస్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తు మాయోపక్లృప్తమ్ ।
ఆదర్శాన్తర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోఽహమ్ ॥ 5 ॥


నాకంటే వేరుగా ప్రపంచమేమీ లేదు. సత్యమైన బ్రహ్మ మాయచే ఆవరించబడి, బాహ్యవస్తువు అద్దములో కనబడుచున్నట్లుగా బ్రహ్మకంటే వేరుకాని నాయందు కనబడుచున్నది. కనుక శివుడను నేను.

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అద్వైతపంచకమ్ సమ్పూర్ణమ్ ॥

Tuesday, 29 August 2017

శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)




శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)

శ్రీ మహాగణాధిపతయే నమః

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1॥


అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

ఈ సృష్టిలోని ప్రతీ కదలికకూ అమ్మవారి శక్తి కారణమనీ, ఆమెకు నమస్కరించాలన్నా, స్తుతిచేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలనీ, ఆ అనుగ్రహం గతజన్మలపుణ్యఫలమనీ శంకరులు అంటున్నారు.

ఈ ప్రపంచమునకు పరమేశ్వరుని స్పందన ద్వారా కారణమవుతున్నది అమ్మవారు. జీవుడు ఈ మాయా ప్రపంచమునుండి విడివడి శివైక్యం చెందుటకుకూడా అమ్మవారే కారకురాలు. అట్టి శివైక్యం చెందుటకు అమ్మ కటాక్షంకోసం ప్రార్థించాలి. ఇది శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా మనకు చేసిన ఉపదేశం.



తనీయాంసం పాంసుం తవ చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ॥ 2॥

అమ్మా! నీ పాదపద్మమునుండి అతి చిన్న ధూళికణమును సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను సుందరముగా నిర్మించుచున్నాడు. విష్ణువు దానినే తన వేయితలలతో ఎలాగో (శ్రమతో) మ్రోయుచున్నాడు. హరుడు దానిని చక్కగా మెదిపి భస్మధారణ చేయుచున్నాడు.

పై శ్లోకముతో కలిపి చదివినప్పుడు - త్రిమూర్తులు అమ్మవారిని ఆరాధించి, తత్ఫలముగా అమ్మవారి కరుణతో సృష్టి, స్థితి, లయములను  నిర్వహించ సమర్థులవుతున్నారని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్రపాదధూళి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని ఎన్నోవిధాలుగా ప్రసాదిస్తుందని శంకరులు అంటున్నారు.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥

(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి - భవతీ)

సూర్యుడు చీకట్లు తొలగించి వెలుగునిచ్చినట్లు, అమ్మవారి పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను సారవంతంచేయునట్టి చైతన్యమనే పూలగుత్తులనుండి వచ్చు తేనె ప్రవాహము. దరిద్రులకు సకలసంపదలను ఇచ్చునట్టి చింతామణుల మాల. (హిరణ్యాక్షునిచేత సముద్రములో దాచబడిన భూమిని వెలికితీసినట్టుల) సంసారసాగరమున మునిగియున్నవారలను ఉద్ధరించునట్టి ఆదివరాహరూపములోని శ్రీ మహావిష్ణుని కోఱ.

లౌకికులకు ప్రజ్ఞ, సంపదలనూ, సాధకులకు జ్ఞానమోక్షములనూ అమ్మవారు అనుగ్రహిస్తుందని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్ర పాదపద్మములను శంకరులు స్తుతించుచున్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥


సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ! నీకన్నా ఇతరులైన దేవతలు తమ తమ చేతులతో అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరద, అభయ ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, కోరినదానికన్నను ఎక్కువగా ఫలములనిచ్చుటకు నీ పాదములే సమర్థములైనవి.

'వాంఛాసమధికం' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము.
---------
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


http://jagadguru-vaibhavam.blogspot.in/2017/08/1-5.html

Monday, 28 August 2017

శంకరస్తోత్రాలు : సాధనపంచకము (ఉపదేశ పంచకము)




|| సాధనపంచకము (ఉపదేశపంచకము) ||

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్ ।
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసన్ధీయతా-
మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥ 1॥


ప్రతిదినమూ వేదాధ్యయనమొనర్పుము ; అందు చెప్పబడిన కర్మలను ఆచరింపుము . ఈకర్మాచరణమే ఈశ్వరపూజయగుగాక ! కామ్యకర్మములను త్యజింపుము. పాపములను పోగొట్టుకొనుము. సంసారసుఖమున గల [అనిత్యత్వాది] దోషములను అనుసంధానింపుము. ఆత్మ-జ్ఞానేచ్ఛను పెంపొందించుకొనుము. శీఘ్రమే గృహమునుండి వెలువడుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ ।
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ ॥ 2॥


సజ్జనులతో కలిసిమెలిసి ఉండుము. భగవంతునియందు దృఢభక్తిని కలిగి యుండుము. శాంత్యాదిగుణముల ఉపార్జింపుము. కామ్యకర్మములను వర్జింపుము. సద్-విద్వాంసులను ఉపాసింపుము. వారి పాదుకలను ప్రతి దినమునూ సేవింపుము. బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షరబ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థింపుము.శ్రుతిశిరస్సులగు ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్ధీయతామ్ ।
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహమ్మతిరుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ ॥ 3॥


తత్త్వమస్యాది -వాక్యముల అర్థమును విచారింపుము. వేదాంత పక్షమును ఆశ్రయింపుము. కుతర్కమును వీడుము. శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినమూ భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని పరిత్యజింపుము. పెద్దలతో వాదులాడకుము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సన్తుష్యతామ్ ।
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతా-
మౌదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ ॥ 4 ॥


ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స యొనర్పుము; భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరములగు భోజనపదార్థములను యాచింపక , విధివశమున లభించినదానితో తృప్తిని బొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ మొనర్పకుము. ఔదాసీన్యమును వహింపుము. లోకులయెడల నిష్ఠురుడవు కాదగదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ ।
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ ॥ 5॥


ఏకాంతప్రదేశమున సుఖముగా కూర్చుండుము. పరబ్రహ్మమున చిత్తమును సమాధానమొనర్పుము. ఈజగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు , అది విలీనమైనట్లు పరిగణింపుము. పూర్వకర్మములను క్షయమొనర్పుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మములయందు ఆసక్తుడవు కాకుండుము. ప్రారబ్ధ భోగమును అనుభవించుచు , బ్రహ్మమున నెలకొనియుండుము.

యః శ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతా ముపేత్య
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తి ముపయాతి చితిప్రసాదాత్ || 6 ||


ఏ మానవుడు అనుదినము ఈ శ్లోకపంచకమును పఠించుచు , స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో , అతడు శీఘ్రముగనే సంసార-దావానల-తీవ్ర-ఘోర-తాపమును  చైతన్యస్వరూపుడగు ఈశ్వరుని ప్రసాదమున బోగొట్టుకొనును.

॥ ఇతి పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం సాధనపఞ్చకం సంపూర్ణం॥

Monday, 21 November 2016

శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ : 86 - 100


శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (86 - 100)

పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥


శంకరులు, పూజాద్రవ్యములున్ననూ పూజచేయుట కష్టమే‌ అని అంటున్నారు. దిగంతాలు వ్యాపించియున్న స్థాణుస్వరూపమును భావన ఎటుల చేసేది ?

ఉమాపతీ ! పూజాద్రవ్యములన్నియూ విశేషముగా సమకూర్చబడినవి. కానీ పూజ ఎట్లు చేయుదును ? దుర్లభమైన హంస వరాహ రూపములు నేను పొందలేను. కాబట్టి నాకు నీ‌ శిరస్సు, పాదపద్మములు తెలియవు. ప్రభో! ఆ రూపములు ధరించిన బ్రహ్మ, విష్ణువుల చేతనే యదార్థము తెలిసికొనబడలేదు. (వారూ‌ తెలిసుకొనలేకపోయారు). నేనెంత ?
జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదామ్బుజభక్తిమేవ దేహి ॥ 87 ॥


శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి యెద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక భక్తిమాత్రమే కోరదగిన వస్తువు అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

యదా కృతాంభోనిధిసేతుబన్ధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః ।
భవాని తే లఙ్ఘితపద్మసంభవః
తదా శివార్చాస్తవభావనక్షమః ॥ 88 ॥


శివార్చన, స్తుతి, ధ్యానము సాధారణవిషయములు కావని శంకరులు ఉగ్గడిస్తున్నారు.

ఓ‌ శివా! ఎప్పుడు నేను - సముద్రమునకు సేతువుగట్టినవాడనూ (శ్రీరాముని వంటి వాడను), అఱచేతితో‌ పర్వతరాజమును అణచినవాడను (అగస్త్యుడు వింధ్యాచలమును అణచెను, అటువంటివాడను), బ్రహ్మనుమించినవాడనూ అవుతానో‌ అపుడు నేను నిను పూజించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు సమర్థుడనవుతాను.
నతిభిర్నుతిభిస్త్వమీశపూజా-
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥


శంకరులు శివుడు భోళాశంకరుడని, భక్తసులభుడని ఈ శ్లోకములో‌ చూపుతున్నారు.

ఈశ్వరా! నీవు నమస్కారములచేతనూ, స్తుతిచేతనూ, పూజావిధులచేతనూ, ధ్యాన సమాధులచేతనూ సంతోషించుటలేదు. నీకు (పూజ)‌ధనుస్సుతోనా , రోకలితోనా, రాళ్లతోనా ?‌ నీకు ఏది ప్రీతియో‌ చెప్పుము, అటులనే చేసెదను.

అర్జునుడు ధనుస్సుతోనూ, రాళ్లతోనూ‌ ఇతర రీతులనవలంబించి శివునితో‌ పోరాడెను. కానీ‌ శివుడు ప్రసన్నుడాయెను, పాశుపతము ఉపదేశించెను. శివభక్తులు (నాయనార్లు) శివుని రోకటితోనూ, రాళ్లతోనూ కొట్టితిరనీ, వారిని శివుడనుగ్రహించెననీ‌ గాధ.

సాధారణ (బాహ్య పటాటోపాల) సాత్వికపూజా విధానములు భక్తి పండనిచో శివుని మెప్పించలేవు. భక్తి పండిన చోట శివుడు సర్వదా ప్రసన్నుడనీ‌ శంకరుల ఉపదేశము.

వచసా చరితం వదామి శంభో-
రహముద్యోగవిధాసు తేఽప్రసక్తః ।
మనసా కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥


శంభో! నేను శాస్త్రవిధిన నిన్ను పూజించుట తెలియనివాడను. నోటితో నీ చరిత్ర పలుకుతాను. మనస్సులో ఈశ్వరుని స్వరూపము ధ్యానించుతాను. సదాశివుని శిరస్సుతో‌ నమస్కరించుతాను.

త్రికరణశుద్ధిగా శివుని సేవించుట ముఖ్యమని శంకరుల ఉపదేశము.

ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీ-
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌళే  ॥ 91 ॥


చంద్రశేఖరా! నీ‌ అనుగ్రహము వలన అనాదిగా నా హృదయమందున్న అజ్ఞానము నాశనమాయెను. హృద్యమైన (అందమైన, మనోహరమైన) జ్ఞానము హృదయమున ఉన్నది. అనుదినమూ శ్రీకరమూ, మోక్షప్రదమూ అగు నీ‌ పాదపద్మములను నేను మనస్సున ధ్యానించుచున్నాను.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, మనస్సుద్వారా చేయవలసిన శివపాదపద్మ ధ్యానము ఉపదేశిస్తున్నారు.

దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి ।
సారం త్వదీయచరితం నితరాం పిబన్తం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః  ॥92 ॥

గౌరీనాథా! పాపములు, చెడు అక్షరములతో‌ కూడినవి, దౌర్భాగ్యము-దుఃఖము-దురహంకారము కలవీ అగు చెడు వాక్కులు తొలగిపోయినవి (విడచిపెట్టితిని). వేదసారమైన నీ‌ చరిత్రమును నిత్యమూ పానము చేయుచున్న నన్ను ఈ జన్మలో‌ నీ‌ కటాక్షములతో ఉద్ధరింపుము.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, వాక్కుద్వారా చేయవలసిన శివకథా పఠనము ఉపదేశిస్తున్నారు.

సోమకలాధరమౌళౌ
కోమలఘనకన్ధరే మహామహసి ।
స్వామిని గిరిజానాథే
మామకహృదయం నిరన్తరం రమతామ్  ॥93 ॥


శివుని సాకారధ్యానం శంకరులు ఉపదేశిస్తున్నారు.

శిరస్సున చంద్రకళ ధరించినవాడూ, కోమలమైన నల్లమబ్బువంటి కంఠము కలవాడూ, గొప్ప తేజోరూపుడూ, ప్రభువూ అగు గిరిజానాథునియందు నా హృదయము ఎల్లప్పుడూ రమించుగాక.

సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి  ॥ 94 ॥


శివుని గురించి పలికెడి నాలుకయే‌ నాలుక. శివుని దర్శించు కన్నులే‌ కన్నులు. శివుని అర్చించు కరములే‌ కరములు. శివుని ఎల్లప్పుడూ‌ స్మరించువాడే కృతకృత్యుడు (ధన్యుడు).

ప్రహ్లాదుడు "కమలాక్షునర్చించు కరములు కరములు" అన్నటులే. త్యాగరాజులవారు "ఎన్నగ మనసుకు రాని" అన్నటులే. భగవత్ప్రసాదిత శరీరమూ, ఇంద్రియములచే భగవత్సంబంధిత కార్యములు చేయించుటయే వాటికి కృతకృత్యత.

అతిమృదులౌ మమ చరణా-
వతికఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా వేశః  ॥ 95 ॥


పార్వతీపతీ! " నాపాదములు అతి కోమలములు, నీ‌ మనస్సు అతి కఠినము" అనే సంశయమును విడిచిపెట్టు. శివా! అలా అయితే, పర్వతమందు ఎట్లు సంచరించినావు ?
పర్వతమందు సంచరించు నీ పాదములు నా మనస్సు కఠినమైననూ అందు సంచరించగలవు కాబట్టి శీఘ్రమే‌ నా మనస్సు నందు నీ‌ పాదపద్మములను ఉంచమని శంకరుల ప్రార్థన.

ధైర్యాఙ్కుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృఙ్ఖలయా ।
పురహర చరణాలానే
హృదయమదేభం బధాన చిద్యన్త్రైః ॥ 96 ॥


మదపుటేనుగును అదుపులోకి ఎలా తెచ్చుకుంటాము ?‌ అంకుశంతో  కదలకుండా చెయ్యాలి. గొలుసుతో‌ బలంగా లాగి, పనిముట్ల సహాయముతో, గట్టి స్థంభానికి కట్టి వేయాలి. మనస్సు మదించిన ఏనుగు వంటిది. దానిని అదుపులోకి తెచ్చుకుని కట్టివేయుట ఎట్లు ? శంకరుల ఉపదేశం -

భగవద్వాక్యములు, శాస్త్రవాక్యముల వలన వచ్చిన ధైర్యము అను అంకుశము వలన కదలకుండా చేయబడిన మనస్సు అనే‌ యేనుగును - భక్తి అనే గొలుసుచేత బలముగా లాగి - ఈ‌శ్వరలీలావిశేషముల పరిజ్ఞానములు అను పనిముట్లతో‌ - త్రిపురాసురసంహారి పాదములనే స్తంభమునకు - కట్టివేయుము.

ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనః కరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ॥ 97 ॥


భక్తితో మనస్సును బంధించమని శంకరులు మరలా ఉపదేశిస్తున్నారు.

మనస్సనే‌ ఈ‌ బలిష్ఠమైన మదపుటేనుగు అడ్డులేక అంతటనూ తిరుగుతున్నది. దృఢమైన ఈ యేనుగును భక్తి త్రాటితో యుక్తిగా బంధించి బ్రహ్మపదమును (పరమేశ్వరుని పాదమును) చేర్చుము.

సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ॥ 98 ॥

శంకరులు తమ కవితాకన్యకను శివునికి అర్పిస్తున్నారు.

గౌరీవల్లభా! కల్యాణి అయిన నా కవితాకన్యకను నీవు స్వీకరింపుము. ఈమె సర్వాలంకారములు కలది, సరళమైన పదములు కలది, మంచి నడవడిక కలది, మంచి వర్ణము కలది, బుద్ధిమంతులచే పొగడబడునది, సరసగుణములున్నది, సులక్షణములు కలది, ప్రకాశించు ఆభరణములు కలది, వినయము కలది, స్పష్టమైన అర్థరేఖ కలది.

ఈ శుభ కన్యకా లక్షణములు, శంకరుల కవితాకన్యకకూ‌ వర్తించునట్లు కావ్యాలంకారం.

ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోఽసి పురతః ॥ 99 ॥


పరమశివా! కరుణాసముద్రుడా! ఇది నీకు తగునా ? నీ‌ పాదపద్మములు, శిరస్సు చూచుటకై హరి, బ్రహ్మలు జంతురూపములు ధరించి భూమిలోనూ‌ ఆకసములోనూ సంచరించి శ్రమచెందిరి. ప్రభూ! శంభో! నాకు ఎలా అగుపించెదవో చెప్పుము.

శివుడు భక్తపరాధీనుడు కాబట్టి విష్ణుబ్రహ్మలకూ కన్పడని తన స్వరూపం భక్తులకు దర్శనము చేయునని ఉపదేశం.

స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరిఞ్చాదయః
స్తుత్యానాం గణనాప్రసఙ్గసమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ-
ద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః ॥ 100 ॥


శంభో! స్తోత్రము చాలు. నేనబద్ధము చెప్పను. బ్రహ్మాదిదేవతలు, స్తుతించతగినవారిని లెక్కించునప్పుడు నీవు అగ్రగణ్యుడవని తెలిసికొనుచున్నారు. మహాత్మ్యములో గొప్పవారిని గూర్చి విచారించునప్పుడు , వారు తుచ్ఛధాన్యపుపొట్టు రాశి వలె ఎగురబట్టబడుతున్నారు. నీ భక్తులు నిన్ను సర్వోన్నత ఫలముగా తెలుసుకొనుచున్నారు.

Thursday, 17 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 - 85



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 - 85

కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।
కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్స ముక్తః ఖలు ॥ 81 ॥


శంకరులు జీవన్ముక్తులు అనగా ఎవ్వరో‌ చెప్పుచున్నారు.

ఉమామహేశ్వరా! కొంచెము సేపు నీ‌ పాదపద్మములను పూజించుటలోనూ, కొంచెము సేపు నీకు నమస్కారములు చేయుటలోనూ, కొంచెము సేపు నీ‌ధ్యానము లోనూ, సమాధిలోనూ, కొంచెము సేపు నీ‌ కథలను వినుటలోనూ, కొంచెము సేపు నీ‌ దర్శనములలోనూ, కొంచెము సేపు నిన్ను స్తుతించుటలోనూ, ఈ‌ విధముగా సంతోషముగా నీకు మనస్సర్పించిన స్థితిని చేరినవాడు జీవన్ముక్తుడు.

శంకరులు ఈ శ్లోకముద్వారా మనస్సును బాహ్యవిషయములపై నిలుపక నిరంతర భగద్విషయ నిమగ్నము అవవలెనని ఉపదేశిస్తున్నారు. కేవలం ఒకే విషయముపై మనస్సు నిశ్చలముగా ఉండుట దుస్సాధ్యము కాబట్టి, జపధ్యానాది బహువిధ భగవత్సంబంధ కర్మలను ఆచరించవలెనని ఉపదేశిస్తున్నారు.

ఉమామహేశ అనే సంబోధన ద్వారా ఇరువురినీ‌ సేవించాలని సూచితము.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదఙ్గవహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదాన్యోఽధికః ॥ 82 ॥


పార్వతీ‌పతీ! హరి (త్రిపురాసురసంహారమున) నీకు బాణము అయినాడు. వృషభరూపములో‌ నీకు వాహనము అయినాడు. నారాయణియై అర్థశరీరముతో‌ నీకు భార్య అయినాడు. నీ‌ పాద దర్శనమునకై వృషభరూపము దాల్చినాడు. నీకు మిత్రుడు అయినాడు. నీ తాండవవేళ మృదంగము వాయించువాడు అయినాడు. నీ పాదములయందు తన నేత్రమును సమర్పించినాడు (శివుని సహస్రకమలపూజలో‌ ఒక కమలము తక్కువ అవగా, విష్ణువు తన కంటినే పూవుగా సమర్పించినాడని పురాణగాధ). నీ‌ శరీరమందు ఒక భాగముగానే‌ వర్తించినాడు. అందుచేతనే పూజ్యులచేతకూడా పూజింపబడినవాడు అయినాడు. కానిచో, వానికంటే శ్రేష్ఠుడు ఎవరున్నాడు ?
శివుని అమితముగా సేవించుట చేతనే విష్ణువుకు సర్వపూజ్యత్వం లభించిందని భావం.

జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృతరూపం సామ్బమీశం భజన్తే
య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభన్తే ॥ 83 ॥


జనన మరణములు కల దేవతలను పూజించుటచే‌ కొంచెము కూడ సుఖము కలుగదు. ఈ‌ విషయములో‌ సందేహము లేదు. పుట్టుట, గిట్టుట లేనివాడూ, అమ్మవారితో కలసి ఉన్నవాడు అయిన పరమేశ్వరుని ఎవ్వరు ఈ‌ లోకముననే పూజించెదరో వారు ధన్యులు, మోక్షమును పొందెదరు.


శివ తవ పరిచర్యాసన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకలభువనబన్ధో సచ్చిదానన్దసిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ॥ 84 ॥


శివా! సకల లోక బంధువా! సచ్చిదానంద సముద్రుడా! భవా! గౌరీదేవితో‌ కలసి నీవు దయతో నా హృదయగృహంలో ఎప్పటికీ నివసింపుము. మీకు సపర్యలు చేయుటకై గుణవంతురాలగు నా బుద్ధి కన్యను ఇచ్చెదను.

శివ (మంగళము, సౌభాగ్యము), భవ (ఉత్పాదకత్వం), సకలభువనబంధు, సచ్చిదానందసింధు, సదయ - ఈ‌ శబ్దములతో‌ శంకరులు తమ బుద్ధి కన్య యొక్క వరుని (శివుని) గుణములను చూపుతున్నారు.


జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ॥ 85 ॥

శివుడు క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషమును నేరేడుపండువలే తినినవాడు. ఆ మథనంలో‌ ఉద్భవించిన చంద్రుని శిరముపై పువ్వువలె ధరించినవాడు. పాతాళలోకమునందుండు సర్పములు ఆయనకు భూషణములు. అడవిఏనుగు చర్మము ఆయన ధరించే వస్త్రము. శివునికి తగిన పరిచర్యలు పూజలో తాము చేయలేమని శంకరులంటున్నారు.

చంద్రశేఖరా! నీకు ఆహారము, పుష్పము, ఆభరణము, వస్త్రములతో‌ కూడిన పూజను నేను ఏ విధముగా చేయగలను ? నేను సముద్రమథనము చేయుటకు సమర్థుడను కాను. కాబట్టి కాలకూటవిషము ఆహారముగానూ, చంద్రుని కుసుమముగానూ‌ ఈయలేను. పాతాళమును భేదించలేను. కాబట్టి సర్పములు ఆభరణముగా తేలేను. అడవిలో‌ మృగములను వేటాడుటకు బోయవాడను కాదు. కాబట్టి గజచర్మము ఆభరణముగా సమర్పించలేను. ఏమి చేయను ?

భావనామాత్రసంతుష్టాయై నమోనమః - సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః...

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 76 - 80


శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 76 - 80

భక్తిర్మహేశపదపుష్కరమావసన్తీ
కాదమ్బినీవ కురుతే పరితోషవర్షమ్ ।
సమ్పూరితో భవతి యస్య మనస్తటాక-
స్తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాఽన్యత్ ॥ 76 ॥


ఎవరి జన్మ సఫలము ? శంకరులేంచెబుతున్నారో‌ చూడండి.

భక్తి మేఘము పరమేశ్వరుని చరణాకాశమును ఆశ్రయించి ఆనందవర్షము కురిపించుచున్నది. (ఆ వర్షానికి)‌ ఎవ్వని మనో‌తటాకము (మనస్సనే చెరువు)‌ నిండిపోతుందో‌ వాని జన్మము అనే‌ పైరు మొత్తము సఫలము. ఇతర జన్మములు సఫలములు కావు.

భగవంతుని పాదములపై భక్తి చేతనే ఆనందప్రాప్తి తద్వారా జన్మ సాఫల్యమూ‌ సాధ్యమని శంకరుల ఉపదేశము.


బుద్ధిఃస్థిరా భవితుమీశ్వరపాదపద్మ-
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరన్తీ ।
సద్భావనాస్మరణదర్శనకీర్తనాది
సంమోహితేవ శివమన్త్రజపేన విన్తే ॥ 77 ॥


శంకరులు భగవద్భక్తుల లక్షణములు వివరిస్తున్నారు.

పరమేశ్వరా! నా బుద్ధి నీ‌ పాదపద్మమందు ఆసక్తి ఉన్నదై , భర్త యెడబాటు కలిగిన భార్యవలే , స్థిమిత పడుటకు సదా ధ్యానము చేయుచూ, శివమంత్రజపముతో‌ మోహముపొందినదై (బాహ్య ప్రపంచమునకు చెందిన విషయముల) భావన, స్మరణ, చూపు, సంభాషణ పొందుటలేదు.

భక్తి పారవశ్యమువలన భగవంతుని విడివడి ఉండలేకుండుట. భగవద్విరహము. భగవంతునిపై పిచ్చి ప్రేమ.


సదుపచారవిధిష్వనుబోధితాం
సవినయాం సహృదయం సదుపాశ్రితామ్ ।
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ ॥ 78 ॥


ప్రభూ! పూజావిధానములయందు బాగుగా శిక్షణ పొందినదీ, వినయ సంపన్నురాలూ, మంచి మనస్సును ఆశ్రయించి ఉన్నదీ అయిన నా బుద్ధిని నూతన వధువువలె, సద్గుణములను ఉపదేశించి ఉద్ధరింపుము.

నిత్యం యోగిమనః సరోజదలసఞ్చారక్షమస్త్వత్క్రమః
శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షఃకవాటక్షతిః ।
అత్యన్తం మృదులం త్వదఙ్ఘ్రియుగలం హా మే మనశ్చిన్తయ-
త్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే ॥ 79 ॥


శంకరులు శంభుని పాదస్పర్శకై ప్రార్థిస్తున్నారు.

శంభో! నీ‌ పద విన్యాసము అనునిత్యమూ యోగుల మనస్సులనే‌ తామరపూల రేకుల యందు సంచరించునది. ఆ పాదముతో‌ కఠోరమైన వాకిలి వంటి యముని వక్షము ఎలా తన్నబడినది ? అయ్యో! అత్యంత మృదులైన నీ‌ పాదయుగళము గూర్చి నా మనస్సు చింతించుచున్నది. నీ‌ పాదయుగళమును ఈ‌ నేత్రములకు కనుపించునట్లు చేయుము. నేను చేతితో నొప్పి పోవునట్లు ఒత్తెదను.


ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి మ-
ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః ।
నోచేద్దివ్యగృహాన్తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ॥ 80 ॥


శంభో! "ఈ మనుష్యుడు జన్మించెదడు. వీని మనస్సు కఠినము, అందు నేను సంచరించవలెను" అని భావించి, నా మనస్సున ఉండి నన్ను రక్షించుటకొరకై నీవు నీ‌ సుతిమెత్తని పాదములు (కఠినమైన)‌ కొండపై ఉంచుట ముందుగానే అభ్యసించినావు. అటు కానిచో‌ దివ్య భవనములు, పూపాన్పులు, యజ్ఞవేదికలు ఎన్నో‌ ఉండగా, శిలలపై నీకు తాండవము ఎందుకు ?


Tuesday, 15 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75

ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప
యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః
సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥ 71 ॥


రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.

భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.

ధ్యానాఞ్జనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వరనామమన్త్రైః ।
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి
యే పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః ॥ 72 ॥


భూగర్భములో‌ కొన్ని నిధులు దాగి ఉంటాయి. ఆ నిధులను కొన్ని శక్తులు ఆశ్రయించి ఉంటాయి. సర్పములు వాటిని చుట్టుకొని ఉంటాయి. అలాంటి నిధులను అంజనము (ఒకానొక కాటుక) ద్వారా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొంటారు. ఆ నిధిని ఆశ్రయించి ఉండు శక్తులకు బలులు సమర్పించుట ద్వారా ప్రసన్నం చేసుకొని, అచ్చోట భూమిని త్రవ్వి ఆ నిధిని పొందుతారు.

శంకరులు శివపాదపద్మమే‌ భక్తులు పొందదగిన నిధి అంటూ అది పొందు విధానం ఉపదేశిస్తున్నారు.

శివా! నీ ధ్యానమనే అంజనముతో‌ బాగుగా చూచి, నీ నామములు, మంత్రములనే ఉత్తమబలులతో‌ అజ్ఞానమనే భూమిని భేదించి, దేవతలచే‌ ఆశ్రయించబడునదీ, సర్పాభరణము కలదీ‌ అయిన నీ‌ పాదపద్మమును ఈ‌జన్మలో పొందుతున్నవారు కృతార్థులు.

భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ-
భూదార ఏవ కిమతః సుమతే లభస్వ ।
కేదారమాకలితముక్తిమహౌషధీనాం
పాదారవిన్దభజనం పరమేశ్వరస్య ॥ 73 ॥


విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి,భూదేవి భార్యలుగా కలవాడు. అలాంటి విష్ణువు ఏమి కోరుకుంటాడు ?‌ విష్ణువు కూడా సేవించు శివ పాదపద్మములను మనలనూ సేవించమని శంకరులు ఉపదేశిస్తున్నారు.

శ్రీ మహాలక్ష్మి,భూదేవి దేవేరులైన విష్ణువే ఏమి కోరి వరాహరూపము ధరించెను ? (ఈశ్వర పాదారవింద దర్శనాపేక్షచే). కాబట్టి, ఓ బుద్ధిమంతుడా, నీవునూ (వివిధములు గా చెప్పబడే) మోక్షములు అనే ఓషధులు పండు పొలము అయిన పరమేశ్వర పాదారవిందముల సేవను పొందుము.

జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

ఆశాపాశక్లేశదుర్వాసనాది-
భేదోద్యుక్తైర్దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ॥ 74 ॥


నా మనస్సులో‌ పరమేశ్వరపాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకరులు కోరుతూ, అపుడేమగునో‌ అన్యాపదేశంగా చెప్పుతున్నారు.

నా మనస్సు నందు ఆశాపాశములూ, క్లేశములూ, దుర్వాసనలూ (చెడు సంస్కారములు)‌ ఉన్నాయి. సాంబసదాశివుని పాదారవిన్దము నా మనస్సు యొక్క ఈ‌లక్షణాలు పోగొట్టి, దివ్యములూ, విస్తారములూ‌ అయిన పరిమళముల(సుసంస్కారములు) చేత నిండినదానిగా చేయుగాక.

పద్మములు సుగంధములు వెదజల్లి, చెడు వాసనలు దూరం చేయునట్లు, పరమేశ్వరుని పాదపద్మములు చెడు సంస్కారములను దూరం చేయునని భావము.

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - ఇవి పంచక్లేశములు.

కల్యాణినాం సరసచిత్రగతిం సవేగం
సర్వేఙ్గితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్ ।
చేతస్తురఙ్గమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ॥75 ॥


శంకరులు మనస్సును ఉత్తమాశ్వముతో‌ పోలుస్తూ, సమస్తలోకములకూ‌ ప్రభువైన పరమేశ్వరుడను వృషభవాహనము బదులు ఈ‌ అశ్వమును యెక్కి సంచరింపమంటున్నారు. భక్తి నిండియున్న మనస్సుకూ‌ ఉత్తమాశ్వమునకూ‌ పోలిక ఎలా చెప్పారో చూడండి. చెప్పబడిన ప్రతీ లక్షణమూ అశ్వమునకూ, భక్తిపూరిత మనస్సునకూ‌ వర్తిస్తుంది.

వృషభవాహనుడా! మన్మధుని శత్రువా! జగదాధీశుడా! కల్యాణ లక్షణములు కలదీ, యజమానుడియందు అనురాగముకలిగి చిత్ర గతులలో‌ పోగలదీ, మిగుల వేగముకలదీ, అందరి అభిప్రాయము తెలిసికొనగలదీ, దోషములు లేనట్టిదీ, స్థిరలక్షణములు కలిగినదీ‌ అయిన నా మనస్సనే అశ్వమునెక్కి సంచరింపుము.

సదా నా మనస్సునందు ఉండమని భావము.







ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.