Monday 24 April 2017

పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి



పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

అద్వైతం సర్వాన్నీ సమ్మతిస్తుంది. ఆ అద్వైతస్థితిని పొందాలంటే వేదాలు చెప్పినట్లు కర్మానుష్ఠానాలు చెయ్యాలి. కర్మాచరణంలో మనం ఎంత శ్రద్ధా విశ్వాసాలు చూపిస్తామో అద్వైతస్థితి అంతగా సన్నిహితం అవుతుంది. కర్మానుస్ఠానానికి భేదస్థితి అవసరం. దానివల్లనే అభేదస్థితి చేకూరుతుంది.

'అదేమిటి? భేదాన్ని పాటిస్తూ కర్మాచరణం చేసిన వానికి భేదస్థితే లభిస్తుంది కాని అభేదస్థితి లేక అద్వైతం ఎలా లభిస్తాయి? అద్వైతం ప్రాపించాలంటే ఉన్న నియమాలు నిబంధనలు అన్నీ తొలగాలి- ఈ నియమాలన్నీ ఎందుకు? ఇవన్నీ అద్వైతస్థితికి అభేదస్థితికి బాధకాలు కావా?' అని కొందఱు తలుస్తూ ఉంటారు.

కాని మనం చాలా పెద్దబంధంలో చిక్కి ఉన్నాము. కామక్రోధాలకు వశులమై మనము సంపాదించిన పాపాలమూట చాలా పెద్దిది. దాని నెలా వదల్చుకోగలం? అన్నది ముందు ఆలోచించాలి. వర్ణాశ్రమధర్మాలు అనే వేరొక బంధంలో చిక్కుకొంటే కామక్రోధాల బంధం సడలుతుంది. పాపాచరణానికి తావుండదు. క్రమంగా మానవుడు నిస్త్రైగుణ్యస్థితికి చేరుకొంటాడు. ఆ స్థితికి చేరుకొన్న వానికి విధి నిషేధాలు లేవు.

'నిస్త్రైగుణ్య పథి విచరతాం కోవిధిః కోనిషేదః'

కాగా త్రిగుణాలకు (సత్వరజస్తమోగుణాలు) కట్టుబడి ఉన్నంతవరకు వర్ణాశ్రమధర్మాలకట్టు తప్పనిదే. ఆ కట్టులేక పోయిననాడు ఈ కట్టు ఉండదు. దానికొరకే యీ అనుష్ఠానాలన్నీ ఆచరించడం.

దేహంలోని బాధను తొలగించుకొనడానికి ఆముదం త్రాగుతూ ఉన్నాం. ఆముదం త్రాగడం బాధగాని సుఖం కాదు కదా! అంటే ఒక బాధను తొలగించుకొనటానికి వేరొక బాధను ఆహ్వానిస్తున్నాం. అలాగే త్రైగుణ్యమైన బంధాన్ని వదల్చుకొనడంకోసం వర్ణాశ్రమధర్మాల బంధంలో చిక్కుకోవాలి. ఈ బంధాన్ని మనం ఎంతగా బిగిస్తే ఆ బంధం అంతగా సడలుతుంది. పూర్తిగా సడలిన మీదట రెండుబంధాలు తొలగుతాయి.

ఇలా కర్మానుష్ఠానాలు చేస్తూ క్రమంగా అద్వైతాన్ని పొందాలని ఆచార్యువారు చెప్పేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/blog-post_24.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.