Thursday 31 August 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

 
శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు.

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాః
వసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥

అమ్మా! హిమాద్రితనయా! పార్వతీ! విల్లా, పూలవిల్లు. ఆ వింటికి తుమ్మెదలబారు నారి. అయిదే బాణములు, అవికూడా పుష్పబాణములు. మలయమారుత పవనము రథము, వసంతుడు సహాయకుడు. అయినప్పటికీ మన్మథుడొక్కడే, అమ్మా! నీ క్రీగంటి చూపు వల్ల చెప్పలేనంత కృపను పొంది, ఈ జగత్తంతటనూ జయించుచున్నాడు.

ఏమాత్రమూ బలం లేని ఆయుధములతో, శరీరమే లేని మన్మథుడు ప్రపంచమంతా జయిస్తున్నాడు. అతడికి అలాంటి శక్తి ఎవరు ఇస్తున్నారు ? అది అమ్మవారి క్రీగంటిచూపు. ఇదే ఈ శ్లోకముయొక్క సారాంశము.
మన్మథుడు ఒకప్పుడు అతిలోకసౌందర్యవంతుడు. తన సొంతశక్తిపై నమ్మకంతో అహంకరించి, ఈశ్వరునిచేతిలో భస్మమైనాడు. అమ్మవారు దయతో మరలా జీవితాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని ఈయలేదు. కేవలం తనభార్య రతీదేవికి మాత్రం కనపడే వరం ఇచ్చింది. అలాగే ఇటువంటి బలహీనమైన ఆయుధాలనూ ఇచ్చింది. వీటితో మన్మథుడు విజయం సాధించినా, అతడు వినయుడై ఆ విజయం తన స్వప్రతిభకాదనీ, అమ్మవారి కరుణ అనీ తలచుతునే ఉంటాడు. ఈశ్వరునిచేత తన శరీరమేకాక, గర్వముకూడా నశింపబడింది.

కాముని అమ్మవారు విజేతగా చేయటంతో మన కథ ఆగకూడదు. మనమూ కాముని గెలవాలి. ఈశ్వరుడు మన్మథుని దగ్ధంచేసినప్పుడు అమ్మవారు ఆయనలో ఉండి బలాన్నిచ్చినదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకూ కాముని గెలవటానికి ఆమె అనుగ్రహం కావాలి.

సగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనుగ్రహవర్షం కురిపించటము, మాయ యొక్క కృత్యము. దానికి ఒక్కక్షణము అమ్మవారి క్రీగంటిచూపు చాలు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.