పరమాచార్యుల స్మృతులు : వీ ఐ పీ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
ఒకరోజు అయిదేళ్ళ చిన్నపిల్ల వాళ్ళ అమ్మానాన్నలతో దర్శనానికి వచ్చింది. చేతిలో చిన్న పుస్తకం పట్టుకుని తిన్నగా వెళ్ళి శ్రీవారి ఒళ్ళో కూర్చుంది. అమ్మానాన్నలు ఆ పిల్లని వెనక్కి రమ్మని ఎంతో బ్రతిమాలారు. అమ్మాయి వినలేదు. శ్రీవారు లేశమాత్రమయినా విసుగు చెందలేదు, కోప్పడలేదు.
"ఇది ఆటోగ్రాఫ్ పుస్తకం", అంది ఆ అమ్మాయి, "ఇందులో నీ పేరు వ్రాయి!" అంటూ మళ్ళీ మళ్ళీ అడిగింది.
"చేతిలో పెన్ను పట్టుకుని చాలాకాలం అయ్యింది, నేను వ్రాయడం బొత్తిగా మర్చిపోయాను. నేను పేరు వ్రాయను" అన్నారు శ్రీవారు.
అమ్మాయి మొంకిపట్టు పట్టింది. శ్రీవారు మఠం కార్యనిర్వహణాధికారిని పిలిపించి, వారితో ఆ పుస్తకం మీద మఠం ముద్ర వేయమనీ, "నారాయణస్మృతి" అని చేతితో వ్రాయమనీ ఆదేశించారు. శ్రీవారి శ్రీముఖాలపై అలా ఉంటుంది.
ఆ అమ్మాయి దాంతో సంతృప్తి చెంది, తలిదండ్రులతో బయల్దేరింది.
వాళ్ళు మఠం దాటకముందే శ్రీవారు ఆ అమ్మాయిని వెనక్కి పిలిపించారు. కార్యనిర్వహణాధికారితో ఇలా అన్నారు.
"కార్యాలయంలో వీ ఐ పీలూ, మంత్రులూ, కలెక్టర్లూ ఇక్కడకు వచ్చినప్పుడు వారు సందేశం వ్రాసే పెద్దపుస్తకం ఉంది. ఈ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి ఆ పుస్తకంలో తన పేరు వ్రాయించు. ఈ అమ్మాయి కూడా వీ ఐ పీ నే. చిన్నపిల్లలు దైవాంశసంభూతులు".
ఆ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి సందర్శకుల పుస్తకంలో తన పేరు వ్రాయించారు.
No comments:
Post a Comment