వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత
వైశాఖమాసములో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందువలన వైశాఖమాసమునందు చలివేంద్రములు కట్టించి ,దాహముగొన్నవారికి దాహము తీర్చిన యెడల సమస్తపాపములూ నశించును.
దప్పిక తీర్చుటకు జలంగానీ , ఎండకు గొడుగునుగానీ , పాదములకు పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రనుగానీ దానమిచ్చినచో అట్టివారికి సమస్తపాపములూ నశించును.
వైశాఖమాసము ఆరంభము కాగానే ఒక బీదబ్రాహ్మణునకు కలశమునిండా జలంపోసి దానంచేసి నమస్కరించినయెడల అన్ని దానములకన్నా ఈ దానం వలన మిక్కిలి ఫలము పొందినవాడగును.
ఈ మాసములో ఒక బ్రాహ్మణునకు గొడుగును దానము చేసినచో విష్ణుమూర్తి సంతసించి సకలైశ్వర్యములూ ఇచ్చును.
కాలిజోళ్ళు ఎవరు దానమిచ్చెదరో అట్టి పుణ్యాత్ముడు తన అవసానకాలమున యమకింకరులు తనను తీసుకుని పోవుటకు వచ్చినపుడు ఆ యమకింకరులను నిర్భయంగా తరిమికొట్టి విష్ణుసాయుజ్యమును పొందవచ్చును.
ఉత్తమ బ్రాహ్మణునకు జలపాత్ర , విసనకర్ర , గొడుగు , కాలిజోళ్ళు దానమివ్వవలెను.
అన్ని దానములకంటే అన్నదానము గొప్పది. ఎండలో అలసి వచ్చిన విప్రునకు తనశక్తికొలదీ స్వల్పమైననూ భోజనము పెట్టినచో కోటిదానములు చేసిన పుణ్యఫలం కలుగును.