వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత - 2
వైశాఖమాసమునందు సద్బ్రాహ్మణునకు శయ్యాదానమును ఇచ్చినచో దానమిచ్చినమనుజుడు స్వర్గనివాసియగును .
శరీరారోగ్యమునకుసౌఖ్యాలు ముఖ్యకారణములు కాబట్టి ఆకలిగొన్నవానికి భోజనమిడి, మెత్తని శయ్యనమర్చి విసనకఱ్ఱ చేతికిచ్చినచో అట్టి మానవునకు జరామరణములు కలుగవు.
బ్రాహ్మణ శ్రేష్ఠునకు శయ్యతోపాటు తలగడదిండు కూడా దానం చేయవలెను.
శయ్యనిదానమివ్వలేనివారు చాపనైనా దానమియ్యవలెను, దీనివలన అకాలమృత్యుభయం తొలగిపోవును.
బ్రాహ్మణునకు పలుచనివస్త్రదానముకూడ అతిప్రధానమైనది, అటుల వస్త్రదానం చేసినచో దీర్ఘాయువు కలవాడగును.
పోకచెక్కలుగాని, సుగంధద్రవ్యములుగాని , కొబ్బరికాయ లేక అరటిపండ్లుగాని దానంచేసిన యెడల ఏడుజన్మలవరకు బ్రాహ్మణుడుగ జన్మించుటయేగాక వేదశాస్త్రపారంగతుడై రాణించును.
వైశాఖమాసము ప్రారంభముకాగానే మల్లెపూలతో చేసినదండగాని , మొగలి లేక బొగడప్వ్వులతో నిర్మించిన దండనుగానీ విప్రుని మెడలోవేసినగాని చేతిమణికట్టుకు కట్టినచో విష్ణుమూర్తి తనను పూజించునటులే భావించి, అతనికి సర్వసంపదలు సమకూర్చును.
వైశాఖమాసంలో చల్లనినీడ నిచ్చునటువంటి చలివేంద్రములు కట్టుట రాజమార్గమునకిరుప్రక్కల చెట్లనునాటుట , జలములేనిచోట్ల తటాకములు త్రవ్వించుట, బావులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఏమానవుడుచేయునో అట్టి వానికి సంతానము లేనియడల సత్పుత్ర సంతానము, ఐశ్వర్యములేని యెడల అష్టైశ్వర్యములు కలుగును.
వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో యుండగా విప్రోత్తమునకు తమలపాకులు, పోకచెక్కలు, కర్పూరము, సుగంధద్రవ్యములు దానమిచ్చినయెడల తనకు, తనవంశీయులకూ శరీరారోగ్యము కలుగును. దప్పికతోనున్న బ్రాహ్మణునకు పెరుగుగాని, ఉప్పునిమ్మరసం కలిపిన మజ్జిగకాని సంతోషముగానివ్వవలెను. ఇది సకలపాపహరము, పూర్ణాయుర్దాయకరము, జన్మాంతమున విష్ణులోకప్రాప్తికి హేతువు,
తాపోపశమనమునకై విప్రునకు పండు, పానకము, బెల్లముకలిపిన దోసపండు, చెరకుముక్కలు, చక్కెరకలిపిన మామిడిపండ్లరసం, వడపప్పు, పనసతొనలు దానమిచ్చినవాడు తన పాపములనుండి విముక్తుడై గొప్ప పుణ్యశీలుడై చక్రవర్తివలె భోగముననుభవించును.