Friday 25 November 2016

పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం




పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి


"పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే! నమస్తే జగదేక మాతః" అని శ్యామలా దండకం. ఈ చెరకు వింటి యొక్కయూ పుష్పబాణాలయొక్కయూ సూక్ష్మతత్త్వం లలితాసహస్రంలో "మనోరూపేక్షుకోదండాపంచ తన్మాత్ర సాయకా" అని చెప్పబడ్డది.

చెరకు తీపి. మనస్సున్నూ తీపే. లోకంలోని జనులందరి సమష్టి మనస్సూ ఆమె చేతిలో వున్న చెరకు విల్లు. చెవి, మేనూ, కన్నూ, నాలుకా, ముక్కూ, అనుభవించే విషయాలే తన్మాత్రలు. ఆ తన్మాత్రలనే, పూవుటమ్ములుగా తనచేతిలో పెట్టుకొన్నది. మన కామ నిరోధానికి మనో నిరోధానికి ఆమె కారణం అవుతూంది. ఆమె అనుగ్రహం మాత్రం వుండాలి. మూకకవి తరచు దీనిని గూర్చి ''మీ కటాక్షం శివునే మోహపెడుతోంది, కాని జనుల మోహాన్ని మాత్రం శిధిలం చేస్తుంది.'' అని చెపుతూ వుంటాడు.

కేవలం జ్ఞానమయుడైన ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపజేసే శివకామసుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహ నివృత్తి చేస్తోంది. ఇదే ఆమె విశేషం. మూకకవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం వుంటేనే మనకు చిత్తంలో అవికారం సమదృష్టీ. నిర్మోహస్థితీ కలుగుతుంది.

ఆమె అనుగ్రహం వుంటే ఎంత కామం కలిగించే వస్తువులైనా మనలను చలింప చేయలేవు. ఎట్టి విభూతియైనా లోభపెట్టలేదు. అరిషడ్వర్గములు అంతరించి చిత్తశుద్ధి కలగాలంటే దేవిని ధ్యానించాలి. "అమ్మా దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా వుండేటట్లు నాచిత్తాన్ని పరిశుద్ధంచెయ్యి" అని నిత్యమూ వేడుకోవాలి. ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది. అదియే ఆమె చరణారవిందాలు ఆశ్రయించినందువల్ల కలిగే ఫలం. మనస్సులో లోపమున్నదంటే చిత్తశుద్ధి లేదన్నమాట.

ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం. చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూపధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి. శంకరుల సౌందర్య లహరీ ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయీబవలూ జగన్మాతృ స్మరణముచే దోషనివృత్తి చేసికొని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూనిణికి అర్పించడమే.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/11/blog-post_52.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.