రామాయణప్రభ : సీతమ్మకు మహాసాధ్వి అనసూయ ఉపదేశం
(అయోధ్యకాండాతర్గతం)
అమ్మా! భర్త నగరమునందున్నను ఉండనిమ్ము. అడవిలోనైనను ఉండనిమ్ము. మంచివాడే కానిమ్ము, పాపాత్ముడేకానిమ్ము, భర్తని ప్రేమతో ఆదరించెడి స్త్రీ ఉత్తమలోకములను పొందును.చెడునడవడి కలవాడైనను, స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడైనను, ధనహీనుడైనను, ధర్మబద్ధమగు స్వభావము కల స్త్రీలకు భర్తయే పరదైవము. ఆలోచించి చూడగా భర్తకంటే గొప్ప బంధువు లేడని నేను భావించుచుందును. భర్తను ప్రేమించి ఆరాధించుటకంటే యోగ్యమగు తపస్సు వేరొకటి లేదు. సత్ప్రవర్తన లేని స్త్రీలు మంచి చెడులను గుర్తించలేరు. వారి కోరికలు తీర్చుకొనుటయే వారికి ప్రధానము. భర్తలను నియమించెడి వారలైయుందురు. పురుషులను కాంక్షించుచుందురు. అట్టివారు అపకీర్తిని పొందుదురు. ధర్మమునుండి దిగజారుదురు. చేయకూడని పనులను చేయుటకు అలవాటు పడిన అట్టి స్త్రీలు వినాశమునందుదురు. గుణవంతులైన స్త్రీలు ధర్మాచరణము చేసిన వారలై స్వర్గము నందు విహరింతురు. కావున నీవు భర్తకు సహధర్మచారిణివై అనుసరించి ఉండి కీర్తిని పొందుము. ధర్మమును ఆర్జించుకొనుము. పతివ్రతలు ఆచరించెడి మార్గమును అనుసరించి ఉత్తమ పతివ్రతవై ఉండుము. భర్త చేసెడి ధర్మములలో తోడు నీడగ ఉండి కీర్తిని , ధర్మమును పొందుము.